పట్టభద్రులౌతున్న దేవుని వాక్య విద్యార్థులు
యెహోవాసాక్షులు మొదటి శతాబ్దపు క్రైస్తవులను అనుకరిస్తూ, తమ ఇంటింటి ప్రకటనా పని విషయంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందారు. వాచ్టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 102వ తరగతి స్నాతకోత్సవ కార్యక్రమంలోని తొలి పలుకుల్లో ఈ పనిపైన దృష్టి కేంద్రీకరించబడింది.
1997, మార్చి 1న యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన అల్బర్ట్ ష్రోడర్ లె పాన్ అనే ఒక ఫ్రెంచి పత్రికలో ఇటీవల వచ్చిన ఒక శీర్షిక వైపు ప్రేక్షకుల అవధానాన్ని మళ్లించాడు. ఇటలీలో ఇంటింటి ప్రకటనా పనిని ప్రారంభించాలన్న రోమన్ కాథలిక్ల పథకం గురించి అది తెలియజేసింది. “తమ రాయబారులు సువార్తను ఇంటింటా ‘అందిస్తుండగా’ వారు నిపుణులను [సాక్షులను] ఎదుర్కొంటారు గనుక [వాటికన్ మిషనరీలు] యెహోవాసాక్షుల ప్రాంతంలోకి పోటీగా వెళ్తుండగా వట్టి చేతులతో వెళ్లకుండేలా, వాటికన్ చివరికి సెయింట్ మార్కు సువార్త పుస్తకం యొక్క పది లక్షల కాపీలను ముద్రించేంత వరకూ వెళ్లింది.”
దేవుని వాక్యాన్ని విస్తృతపర్చడంలో యేసుయొక్క నిపుణమైన ప్రకటనా పద్ధతులను అనుకరించినవారిలో ఈ 48 మంది పట్టభద్రులున్నారు. వారు ఎనిమిది దేశాలనుండి న్యూయార్క్లోని పాటర్సన్లోవున్న వాచ్టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్కు వచ్చారు. తమ ఐదు నెలల పాఠశాల పర్యంతం వారు బైబిలును ఈ చివరనుండి ఆ చివరవరకూ పఠించారు. వారి కోర్సులో దేవుని సంస్థ యొక్క చరిత్రా, మిషనరీ జీవితంలోని ఆచరణయోగ్యమైన అంశాలూ, దేవుని ఆత్మ ఫలాలూ వంటివి కూడా ఉన్నాయి. ఇదంతా ఒకే ఒక్క లక్ష్యంతో—వారిని పంపుతున్న 17 దేశాల్లో వారి విదేశీ మిషనరీ సేవలో వారిని సిద్ధపర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. వారు పట్టభద్రులౌతుండగా ఆ సందర్భంలో 5,015 మంది అంతర్జాతీయ ప్రేక్షకులు ఆనందాన్ని పంచుకున్నారు. ఈ గిలియడ్ విద్యార్థులు చివరిగా ఎటువంటి ఆచరణయోగ్యమైన సలహాలను పొందారు?
క్రొత్త మిషనరీలకు సమయోచితమైన ప్రోత్సాహం
చైర్మన్ తొలిపలుకుల తర్వాత, పరిపాలక సభ యొక్క పర్సనల్ కమిటీలో ఒక సహాయకుడైన రాల్ఫ్ వాల్స్ క్రొత్త మిషనరీలకు ఆచరణయోగ్యమైన సలహాతో కూడిన మొదటి క్లుప్త ప్రసంగాన్నిచ్చారు. ఆయన ముఖ్యాంశం “ప్రేమించడానికి గుర్తుంచుకోండి.” లోకం మరింత ఎక్కువగా ప్రేమారహితంగా మారుతుందని 2 తిమోతి 3వ అధ్యాయంలో బైబిలు ముందే చెప్పిందని చూపించాడు. 1 కొరింథీయులు 13:1-7లో కనుగొనబడే ప్రేమ యొక్క వర్ణనకు అనుగుణ్యంగా క్రొత్త మిషనరీలకు ఆయన ఈ సమయోచితమైన జ్ఞాపికను అందించాడు: “మిషనరీలుగా మీరు మీ గంటల కోటాను మించిపోతూ ఉండవచ్చు. మీ గిలియడ్ శిక్షణనుండి మీరు జ్ఞానభాండాగారాన్ని తీసుకుపోతుండవచ్చు. లేక మన బ్రాంచి నియామకాల్లో మనం అత్యుత్సాహంతో ఎక్స్ట్రా సమయం పనిచేస్తుండవచ్చు. కానీ మనం ప్రేమించడానికి మర్చిపోయినట్లైతే మన ప్రయత్నాలన్నీ, త్యాగాలన్నీ ఎందుకూ పనికిరానివవుతాయి.”
కార్యక్రమంలో తర్వాత, పరిపాలక సభకు చెందిన కారీ బార్బర్ ఉన్నారు, ఆయన “యెహోవా మనల్ని విజయానికి నడిపిస్తున్నాడు” అన్న విషయాన్ని చర్చించాడు. హింసలు ఉన్నప్పటికీ, మొదటి ప్రపంచ యుద్ధానంతరం విశ్వసనీయులైన తన సేవకులు తన రాజ్య సువార్తను ప్రకటించడంలో చిన్న ప్రారంభాలు మొదలుకొని విజయాన్ని పొందేలా యెహోవా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడే వీరు యెహోవాసాక్షులనే పేరును 1931లో స్వీకరించారు. ఇది క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క పాదరీ వర్గాన్ని కలవరపర్చింది. “ఆ పవిత్ర నామాన్ని తెలుసుకునే అవకాశాన్ని సాధ్యమైనంత మందికి అందించే మహిమాన్వితమైన పనిలో గొప్ప భాగం కల్గివుండే గొప్ప ఆధిక్యత 102వ గిలియడ్ తరగతిలో శిక్షణ పొందిన మిషనరీలకు ఇప్పుడు ఉంది” అన్నారు సహోదరుడు బార్బర్. 1943లో 54 దేశాల్లో మాత్రమే జరుగుతూవున్న దేవుని వాక్య ప్రకటనా పని నేడు 233 దేశాలవరకూ విస్తరించేందుకు సహాయపడిన గిలియడ్ స్కూలులో శిక్షణ పొందిన 7,131 మంది మిషనరీలతో కూడిన పొడవైన పట్టికలో ఈ మిషనరీలు చేరారు.
తర్వాత ప్రసంగీకుడు లాయిడ్ బారీ, ఈయన కూడా పరిపాలక సభ సభ్యుడే. ఆయన గిలియడ్ యొక్క 11వ తరగతిలో పట్టభద్రుడై జపాన్లో 25 సంవత్సరాలకు పైగా మిషనరీగా సేవచేశాడు. “వీటిలో నిలుకడగా ఉండండి” అన్న ముఖ్యాంశంగల తన ప్రసంగంతో ప్రోత్సాహాన్ని అందించాడు. “సహించడంలోనే మీ ఆనందంలో చాలామట్టుకు ఇమిడివుంటుంది” అని ఆయన విద్యార్థులకు చెప్పాడు. మిషనరీ పనిలోనూ లేక దైవపరిపాలనా నియామకం దేనిలోనైనాసరే సహించడంద్వారా ఎటువంటి ప్రతిఫలాలు వస్తాయి? “అన్నింటికీ మించి, మన సహనం యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది . . . పరీక్ష వచ్చినప్పుడు యథార్థతను కాపాడుకోవడంలో గొప్ప సంతృప్తిని పొందవచ్చు . . . మిషనరీ సేవను మీ జీవిత సంకల్పంగా చేసుకోండి . . . మీ ప్రతిఫలం ఏమంటే హృదయాన్ని సంతోషపర్చే ‘భళా’ అన్న మాటే.” (మత్తయి 25:21; సామెతలు 27:11) తన భాగాన్ని ముగిస్తూ, సహోదరుడు బారీ మిషనరీ సేవనే తమ జీవితంగా చేసుకునేందుకు నిశ్చయించుకుని “వీటిలో నిలుకడగా ఉండండి” అని క్రొత్త మిషనరీలకు హృదయపూర్వకంగా సిఫారసు చేశాడు.—1 తిమోతి 4:16.
“మీరు ఏమి చూస్తారు?” అన్న ప్రశ్నను కార్ల్ ఆడమ్స్ వేశారు, ఈయన చాలా గిలియడ్ తరగతుల్లో ఉపదేశించడంలో భాగం వహించారు. క్రొత్త మిషనరీలు తమ నియామకాల్లో ఏమి చూస్తారనేది వారి భౌతిక నేత్రాలపైన మాత్రమే కాదుగానీ వారి మనో నేత్రాలపై కూడా ఆధారపడివుంటుందని ఆయన స్పష్టపర్చారు. (ఎఫెసీయులు 1:18) ఇశ్రాయేలీయులైన వేగులవారు వాగ్దత్త దేశాన్ని పరీక్షించినప్పుడు వారు చూసినదానిని బట్టి ఇది స్పష్టీకరించబడింది. 12 మంది వేగులవారూ ఒక భౌతిక దృష్టికోణం నుండి ఆవే విషయాల్ని చూశారు, కానీ ఇద్దరు మాత్రమే వాగ్దత్త దేశాన్ని దేవుని దృష్టికోణం నుండి చూశారు. మిషనరీలు కూడా విషయాల్ని విభిన్నమైన మార్గాల్లో చూడవచ్చు. వారు సేవ చేయబోయే కొన్ని దేశాల్లో బీదరికాన్నీ, బాధలనూ, నైరాశ్యాన్నీ చూడవచ్చు. కానీ వారు ప్రతికూలంగా ప్రతిస్పందించి ఆ దేశాన్ని విడిచిపెట్టకూడదు. సహోదరుడు ఆడమ్స్ ఇటీవలి తరగతిలోని ఒక మిషనరీ ఇలా చెప్పిందని చెప్పారు: “ఈ అనుభవాలు నేనిక్కడ ఉండి తీరాల్సిందేనని తెలుసుకునేలా చేశాయి. ఈ ప్రజలకు భవిష్యత్తు కొరకైన నిరీక్షణ అవసరం. వారి జీవితాల్ని మెరుగుపర్చాలని నేననుకుంటున్నాను.” వారు నియమించబడిన ప్రాంతాలను యెహోవా తన భూవ్యాప్త పరదైసుగా చేయాలని నిర్ణయించుకున్న ప్రాంతాలుగానూ, అక్కడి ప్రజలను నూతన లోక సమాజ భావి సభ్యులుగానూ చూడమని క్రొత్త మిషనరీలను ప్రోత్సహిస్తూ సహోదరుడు ఆడమ్స్ ముగించారు.
కార్యక్రమంలోని ఈ భాగంలో చివరి ప్రసంగాన్ని గిలియడ్ ఉపదేశకునిగా అవ్వడానికి ముందు ఎన్నో సంవత్సరాలు మిషనరీ సేవచేసిన వాలస్ లివరన్స్ ఇచ్చారు. “దేవుని అద్భుత కార్యాల ఎడల అంతర్దృష్టితో పనిచేయండి” అన్నది ఆయన ముఖ్యాంశం. అంతర్దృష్టితో పనిచేయడంలో వివేకంతోనూ, వివేచనతోనూ, సుబుద్ధితోనూ పనిచేయడం ఇమిడివుంది. ఇశ్రాయేలు రాజైన సౌలు ఈ విధంగా పనిచేయడంలో విఫలుడయ్యాడు.—1 సమూయేలు 13:9-13; 15:1-22.
అంతర్దృష్టితో పనిచేయడానికి ఒక మార్గం ఏమంటే ఒక క్రొత్త భాషను నేర్చుకోవడమూ, ప్రజలను తెలుసుకోవడమూ ఇమిడివున్న ఒక క్రొత్త జీవిత విధానానికి అలవాటుపడడమనే సవాలును స్వీకరించడం. యెహోషువ, కాలేబులు దేవుడు తమకు నియమించిన దేశాన్ని జయిస్తుండగా వారు బలపర్చబడినట్లే, మిషనరీలు సవాళ్లను ఎదుర్కొనడంలోనూ, అడ్డంకుల్ని అధిగమించడంలోనూ పొందే అనుభవాలు ఆత్మీయంగా వారిని బలపర్చగలవు.
ఇంటర్వ్యూలు
తర్వాతి కార్యక్రమంలో ఇంటర్వ్యూల పరంపర ఉంది. హరాల్డ్ జాక్సన్ గిలియడ్ స్కూలుకు రిజిష్ట్రారూ, దీర్ఘకాలంగా దానిలో ఉపదేశకుడూ అయిన యులీసిజ్ గ్లాస్ను ఇంటర్వ్యూ చేశారు, ఆయనకిప్పుడు 85 ఏళ్లు. సేవలో ఉన్న చాలామంది మిషనరీలు ఇప్పటికీ ఆయన ఎన్నో సంవత్సరాలు విశ్వసనీయంగా బోధించడాన్నీ, శిక్షణనివ్వడాన్నీ బాగా జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత, గిలియడ్ స్కూల్ సిబ్బందిలో చేరకమునుపు ఆఫ్రికాలో విదేశీ సేవలో ఎన్నో సంవత్సరాలు గడిపిన గిలియడ్ ఉపదేశకుడు మార్క్ న్యూమర్ వచ్చారు. ఆయన ఐదు నెలల శిక్షణా కాలంలో విద్యార్థుల పరిచర్యను గురించి వారిని ఇంటర్వ్యూ చేశారు. వారి అనుభవాలు ఆ స్థానిక ప్రాంతంలోని ప్రజలు దేవుని వాక్యంలో ఆసక్తిని కల్గివున్నారని స్పష్టంగా చూపించాయి.
తర్వాత రాబర్ట్ సిరాన్కో, చార్ల్స్ మాల్హన్లు అవే వసతుల్లో బ్రాంచి సిబ్బంది కొరకైన మరొక స్కూలులో శిక్షణపొందుతున్న అనుభవజ్ఞులైనవారితో మాట్లాడారు. పట్టభద్రులౌతున్న విద్యార్థులకు వారిచ్చిన సలహాలో వినయంగా ఉండవల్సిన అవసరతా, సంఘ ఐక్యతకు దోహదపడాల్సిన అవసరతా ఉన్నాయి. వారు మిషనరీపనిలో ఏమి జరుగుతుందన్న దానిగురించి ముందే అభిప్రాయాల్ని ఏర్పర్చుకోకూడదనీ, దానికి బదులుగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఇష్టపడాలనీ పట్టభద్రులకు సూచించారు. ఈ సలహాను అన్వయించుకోవడం క్రొత్త మిషనరీలు దేవుని వాక్య బోధకులుగా తమ నియామకాల్ని పూర్తిచేయడానికి నిస్సందేహంగా సహాయపడుతుంది.
చివరిగా, పరిపాలక సభ సభ్యుడైన థీయోడర్ జారజ్ “ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తున్నారు?” అన్న విషయంపై ప్రేక్షకులతో చర్చించారు. క్రైస్తవులుగా మనం ఆత్మ ఫలాల్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఇతర ప్రజలపై మనం మంచి ప్రభావం చూపగలమని ఆయన వివరించారు. “ఆరోగ్యకరమైన రీతిలోనూ, ఆత్మీయమైన రీతిలోనూ ప్రజలను ప్రభావితం చేశారనే ప్రశంసనీయమైన రికార్డును యెహోవా సంస్థచే పంపబడిన మిషనరీలు సంపాదించుకున్నారు” అని ఆయన చెప్పాడు. మిషనరీల మంచి ఉదాహరణ ఫలితంగా దేవున్ని సేవించడంలో సహాయం పొందిన వ్యక్తుల వ్యాఖ్యానాలను కొన్నింటిని ఆయన ఉల్లేఖించారు. “యెహోవా ప్రజలు సంపాదించిన ఖ్యాతిని నిలుపుకుంటూ, మీ విదేశీ నియామకంలో అర్హులైనవారిని కనుగొనేందుకు వారి తలుపులను తట్టడంలో కొనసాగండి . . . అంతేగాక, మీ నీతియుక్తమైన, పవిత్రమైన ప్రవర్తనద్వారా ఈ లోకాత్మను నిరోధించండి, యెహోవాకు స్తుతినీ, ఘనతనూ తెచ్చే రీతిలో ప్రజలపై మంచి ప్రభావాన్ని చూపండి” అని ఆయన ముగించారు.
కార్యక్రమాన్ని ముగిస్తూ, చైర్మన్ స్థానికుల అభినందనలనూ, దూరానున్నవారి అభినందనలనూ పంచుకున్నారు. తర్వాత డిప్లొమాలను అందిస్తూ, వారి మిషనరీ నియామకాలను ప్రకటించారు. దానితర్వాత, పట్టభద్రుల్లో ఒకరు పూర్తి తరగతి తరపున, తాము పొందిన ఉపదేశం నిమిత్తం కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ తీర్మానాన్ని చదివి వినిపించాడు. స్పష్టంగా, 102వ తరగతి స్నాతకోత్సవ కార్యక్రమం హాజరైన వారందరూ దేవుని వాక్యాన్ని ప్రచురించడంలో ముందుకు సాగిపోయేందుకు దృఢ నిశ్చయం చేసుకునేలా చేసింది.
[31వ పేజీలోని చిత్రం]
వాచ్టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 102వ తరగతిలో పట్టభద్రులైన విద్యార్థులు
ఈ క్రిందనున్న లిస్టులో, వరుసలు ముందునుండి వెనుకకు లెక్కించబడ్డాయి, పేర్లు ఒక్కొక్క వరుసలో ఎడమవైపు నుండి కుడివైపుకి ఇవ్వబడ్డాయి.
(1) డఫ్ఫీ, సి.; అలెక్సిస్, డి.; హార్ఫ్, ఆర్.; లీ, జె.; కోరీ, వి.; నోర్టమ్, టి.; మోరా, ఎన్.; జార్నెట్, ఎఫ్. (2) యూప్విక్, ఎల్.; సింగ్, కే.; హార్ట్, బి.; కర్కోరియన్, ఎమ్.; లీ, ఎస్.; రాస్టల్, ఎస్.; జ్యూలన్, కె.; కోలట్, కె. (3) సింగ్, డి.; పిట్లూ, జే.; పిట్లూ, ఎఫ్.; బోకొక్, ఎన్.; టోర్మ, సి.; మస్లో, ఏ.; రిచర్డ్సన్, సి.; నోర్టమ్, డి. (4) హార్ఫ్, జే.; జార్నెట్, కే.; బార్బర్, ఏ.; లోబెర్టో, జే.; లోబెర్టో, ఆర్.; మస్లో, ఎమ్.; మోరా, ఆర్.; హార్ట్, ఎమ్. (5) టోర్మ, ఎస్.; రాస్టల్, ఏ.; డాయజ్, ఆర్.; డాయజ్, హెచ్.; వైజర్, ఎమ్.; వైజర్, జే.; కర్కోరియన్, జీ.; జ్యూలన్, ఏ. (6) అలెక్సిస్, ఆర్.; బార్బర్, డి.; యూప్విక్, హెచ్.; డఫ్ఫీ, సి.; కోలట్, టి.; రిచర్డ్సన్, ఎమ్.; బోకొక్, ఎస్.; కోరీ, జీ.