పాఠకుల ప్రశ్నలు
నవంబరు 1, 1995 “కావలికోట” మత్తయి 24:34 నందు మనం చదివే “ఈ తరమును” గురించి యేసు చెప్పిన విషయంపై కేంద్రీకరించింది. 1914లో దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడిందనే విషయంలో ఏదైనా సందేహం ఉందని దీని అర్థమా?
కావలికోట నందలి ఆ చర్చలో, 1914ను గూర్చిన మన ప్రాథమిక బోధలో మార్పేమీ ప్రస్తావించబడలేదు. తన రాజ్యాధికార ప్రత్యక్షతను తెలియజేసే సూచనను యేసు అందజేశాడు. 1914 నుండీ ఈ సూచన నెరవేరుతోందని చెప్పడానికి మనకు తగినంత సాక్ష్యాధారం ఉంది. యుద్ధములు, కరువులు, తెగుళ్లు, భూకంపాలను గురించిన వాస్తవాలు మరియు ఇతర సాక్ష్యాధారాలు, 1914 నుండి దేవుని రాజ్యానికి రాజుగా యేసు చురుగా ఉన్నాడనే విషయాన్ని ధృవపర్చుతున్నాయి. అప్పటినుండి మనం ఈ విధానాంతంలో ఉన్నామనే విషయాన్ని ఇది సూచిస్తుంది.
మరి కావలికోట స్పష్టం చేసిందేమిటి? మత్తయి 24:34 నందు “తరము” అనే పదాన్ని యేసు ఏ భావంలో ఉపయోగించాడన్నది కీలకమైన విషయం. ఆ వాక్యభాగం ఇలా చదవబడుతుంది: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” యేసు “తరము” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఆయన కాలంలోనూ మన కాలంలోనూ ఆయన ఉద్దేశమేమై ఉంది?
యేసు “తరము” అనే పదాన్ని, యూదా నాయకులు లేక యథార్థవంతులైన తన శిష్యుల వంటి ఒక చిన్న గుంపుకు లేక ప్రత్యేకమైన గుంపుకు సంబంధించి ఉపయోగించలేదని అనేక లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. బదులుగా, తనను నిరాకరించిన యూదా ప్రజలను నిందిస్తూ ఆయన “తరమును” ఉపయోగించాడు. అయితే, సంతోషకరంగా, ఆ యా వ్యక్తులు అపొస్తలుడైన పేతురు పెంతెకొస్తు దినాన కోరిన దానిని చేయవచ్చు అంటే పశ్చాత్తాపపడి, “మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ” పొందవచ్చు.—అపొస్తలుల కార్యములు 2:40.
స్పష్టంగా, పేతురు ఏదైనా ఒక నిర్ణీత వయస్సు లేక కాల పరిమితి గురించి కచ్చితంగా చెప్పడం లేదు, అంతేగాక ఆయన “తరము”ను ఏదైనా తేదీతో జత చేయడం లేదు. యేసు జన్మించిన సంవత్సరంలోనే లేక సా.శ. 29లోనే జన్మించిన తరము నుండి ప్రజలు రక్షించబడాలని ఆయన చెప్పలేదు. పేతురు ఆ కాలంలోని అవిశ్వాసులైన యూదుల గురించి అంటే యేసు బోధను వినగలిగి, ఆయన చేసిన అద్భుతాలను చూసి లేక వాటి గురించి విని, ఆయనను మెస్సీయగా అంగీకరించని వారి గురించి మాట్లాడుతుండెను, బహుశా వారిలో కొందరు మరీ చిన్నవారై ఉండవచ్చు, ఇతరులు పెద్దవారై ఉండవచ్చు.
ఓలీవ కొండమీద తనతోపాటు ముగ్గురు ఇతర అపొస్తలులు ఉన్నప్పుడు “తరము” అనే పదాన్ని యేసు ఉపయోగించడాన్ని పేతురు అలాగే అర్థం చేసుకున్నాడని స్పష్టమౌతుంది. యేసు యొక్క ప్రవచనార్థక వ్యాఖ్యానం ప్రకారం, ఆ కాలంనాటి యూదులు అంటే ప్రాథమికంగా, యేసు సమకాలీనులు యూదా విధానాంతం సమీపంలో ఉందని తెలియజేసే యుద్ధాలనూ, భూకంపాలనూ, కరువులనూ, ఇతర సాక్ష్యాధారాలనూ అనుభవించబోతున్నారు లేక వినబోతున్నారు. వాస్తవానికి, సా.శ. 70లో అంతం రాకముందే ఆ తరము గతించిపోలేదు.—మత్తయి 24:3-14, 34.
అయితే, యేసు మాటలను మనం ఎల్లప్పుడూ అదే భావంలో తీసుకోలేదని మనం అంగీకరించవలసిందే. అంతం ఎప్పుడు వస్తుందనే తేదీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలనే కోరిక అపరిపూర్ణ మానవులకు ఉంటుంది. “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” అని అడుగుతూ అపొస్తలులు కూడా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారని గుర్తు తెచ్చుకోండి. (ఇటాలిక్కులు మావి.)—అపొస్తలుల కార్యములు 1:6.
అలాంటి యథార్థ ఉద్దేశాలతోనే, ఆధునిక కాలాల్లోని దేవుని సేవకులు, “తరము”ను గురించి యేసు చెప్పినదాని నుండి, 1914 నుండి లెక్కించి కొంత నిర్దిష్టమైన కాల విభజన పొందాలని ప్రయత్నించారు. ఉదాహరణకు, ఇలా తర్కించడం జరిగింది: ఒక తరము, మొదటి ప్రపంచ యుద్ధం మరియు ఇతర పర్యవసానాల ప్రాముఖ్యతను గ్రహించగలిగేంత వయస్సు కలిగివున్న ప్రజలతో కూడినదై 70 లేక 80 సంవత్సరాల కాలనిడివి కలిగి ఉండగలదు; దాన్నిబట్టి అంతం ఎంత సమీపంలో ఉందో మనం కొంతమేరకు లెక్కించవచ్చు.
అయితే అలాంటి ఆలోచనావిధానం ఎంత మంచిదైనప్పటికీ, అది యేసు ఇచ్చిన ఉపదేశంతో పొందిక కలిగి ఉందా? యేసు ఇలా చెప్పాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. . . . ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగానుండుడి.”—మత్తయి 24:36-42.
కాబట్టి “ఈ తరము”ను గురించిన, కావలికోటలోని ఇటీవలి సమాచారం 1914లో జరిగిన దాని గురించిన మన అవగాహనను మార్చలేదు. కాని యేసు “తరము” అనే పదాన్ని ఉపయోగించడం యొక్క స్పష్టమైన అవగాహనను అది మనకిస్తుంది, 1914 నుండి లెక్కించి మనం అంతానికి ఎంత సమీపంలో ఉన్నామనేది లెక్కించడానికి ఆయన ఉపయోగించిన పదం ఆధారం కాదని తెలుసుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది.