రాజీపడే తలంపే లేదు!
యేసుక్రీస్తు తొలి అనుచరులకు యెహోవా హస్తము తోడుగా ఉండెను. (అపొస్తలుల కార్యములు 11:21) దేవుని సహాయంతో, వారు రాజీపడకుండా సరైన మార్గాన్ని అనుసరించారు. వ్యతిరేకతను, తీవ్ర హింసను కూడా వారనుభవించారన్నది జగమెరిగిన చారిత్రక వాస్తవం.
క్రీస్తు తొలి విశ్వాసులైన అనుచరుల యథార్థత సుప్రసిద్ధ వాస్తవమైంది. వారి జీవితాలను పణంగా పెట్టవలసి వచ్చినప్పటికీ, వారు తమ విశ్వాసమందు రాజీపడుటకు నిరాకరించారు. కాని వారు ఎందుకంత క్రూరంగా వ్యవహరించబడ్డారు?
నిర్హేతుకముగా ద్వేషింపబడ్డారు
యేసువలె, నిజ క్రైస్తవులు లోకము యొక్క అభిలాషలు, నమ్మకాలలో భాగం వహించలేదు. (1 యోహాను 4:4-6) అంతేకాకుండా, క్రైస్తవత్వము యొక్క పెరుగుదల “ఎంతో ఉదృతంగా ఉండింది, దాని సఫలత ఎంత పేర్కొనదగినదంటే, [రోము యొక్క రాజవంశ అధికారంతో] సంఘర్షణ అనివార్యమైయుండింది” అని చరిత్రకారుడైన ఎడ్మాన్ డె ప్రెసాన్జా తెలియజేస్తున్నాడు.
యేసు ఒకసారి ఇలా చెబుతూ, ఒక ప్రవచనార్థక కీర్తనను తనకు అన్వయించుకున్నాడు: “నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి.” (యోహాను 15:25; కీర్తన 69:4) తన శిష్యులకిది చెప్పటానికి ముందే, ఆయనిలా హెచ్చరించాడు: “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు . . . లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు;” (యోహాను 15:20) ఆయన అడుగుజాడలలో నడవడం సుళువుకాదు. అందుకు ఒక కారణమేమంటే, యూదా మతనాయకులు యూదులైన యేసు శిష్యులను యూదామతపు మతభ్రష్టులుగా పరిగణిస్తారు. అయితే, యేసు అనుచరులు ఆయన గురించి ఇక మాట్లాడకూడదని ఖండితముగా ఆజ్ఞాపించబడినప్పుడు, వారు సమ్మతించుటకు నిరాకరించి తమ విశ్వాసమందు రాజీపడలేదు.—అపొస్తలుల కార్యములు 4:17-20; 5:27-32.
సా.శ. 33 పెంతెకొస్తు తరువాత అనతికాలంలోనే యూదా న్యాయసభలో ఇచ్చిన సాక్ష్యంలో, శిష్యుడైన స్తెఫెను “మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకు”చున్నాడని నిందించబడ్డాడు. నేరారోపణలు ఎంత దౌర్జన్య పూరితంగా వుండెనంటే, అతడు మరణించే వరకు రాళ్లతో కొట్టబడ్డాడు. ఫలితంగా, “యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.” (అపొస్తలుల కార్యములు 6:11, 13; 8:1) అనేకులు బంధించబడ్డారు.
యూదులు యేసు అనుచరులను “అపరిమితమైన ద్వేషంతో” వెంటాడారు అని క్రిస్టియానిటీ అండ్ ది రోమన్ అంపైర్ అనే పుస్తకం చెబుతుంది. అంతెందుకు, క్రైస్తవులను కాపాడుటకు తరచు రోమా సామ్రాజ్యం చర్య తీసుకోవలసివచ్చేది! ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలును చంపాలనే యూదుల ఎత్తుగడ నుండి రోమా సైనికులు ఆయనను రక్షించారు. (అపొస్తలుల కార్యములు 21:26-36) అయినా, క్రైస్తవులకు రోమన్లకు మధ్య సంబంధం అసౌక్యమైనదిగానే నిలిచియుండింది.
రోము హింసను ఉధృతం చేయుట
స్తెఫెను మరణించిన దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత, రోము పరిపాలకుడైన హేరోదు అగ్రిప్ప I యూదుల అభిమానాన్ని పొందడానికి అపొస్తలుడైన యాకోబును చంపించాడు. (అపొస్తలుల కార్యములు 12:1-3) ఆ సమయానికి, క్రీస్తు నందలి నమ్మకం రోముకు వ్యాపించింది. (అపొస్తలుల కార్యములు 2:10) సా.శ. 64లో ఆ పట్టణపు చాలాభాగం అగ్ని చేత నాశనం చేయబడింది. ఆ దహనకాండకు తనే బాధ్యుడన్న పుకార్లను అణచివేసే ప్రయత్నంలో నీరో ఆ అనర్థానికి క్రైస్తవులే కారణమని నిందించిన తరువాత, వారు మహాభయంకరంగా హింసించబడ్డారు. మహోన్నతమైన రీతిలో దాన్ని తిరిగి నిర్మించి, తన పేరుమీద నీరోపోలీస్ అనే పేరు పెట్టాలనే సాకుతో ఆయన దాన్ని కాల్చివేసాడా? లేక అతని పట్టపురాణి అయిన యూదా మతప్రవిష్టురాలు పొపియెకు క్రైస్తవుల యెడలగల వైరాన్నిబట్టి వారిని నిందించే ఆయన నిర్ణయం ప్రభావితం చేయబడిందా? పరిశోధకులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు, కాని దాని ప్రభావం భయానకంగా ఉండింది.
రోమా చరిత్రకారుడైన టాసిటస్ ఇలా చెబుతున్నాడు: “మరణానికి అపహాస్యం తోడయ్యేది; మృగాల చర్మాలతో చుట్టబడిన [క్రైస్తవులను] కుక్కలు ముక్కలు ముక్కలుగా చీల్చేసేవి; వారు శిలువలకు మేకులతో కొట్టబడేవారు; చీకటిపడినప్పుడు దీపాలుగా ఉపయోగపడేలా వారు కాల్చబడేవారు,” రాచరిక తోటలను ప్రకాశింపజేయటానికి మానవ కాగడాలుగా వారు ఉపయోగించబడేవారు. క్రైస్తవులకు స్నేహితుడుకాని టాసిటస్ ఇంకా ఇలా అన్నాడు: “హెచ్చరికతో కూడిన శిక్షకు పాత్రులైన నేరస్థులుగా వారు ఎంచబడి, మానవత్వాన్ని మంటగలుపుతూ ప్రజల సంక్షేమం కొరకు కాకుండా, ఒకవ్యక్తి అనగా నీరో క్రూరత్వానికి బలిచేయబడ్డారు.”
సుస్పష్టమైన వ్యత్యాసాలు
రోము నాశనాన్ని గురించి క్రైస్తవులను నిందించాలనే నీరో సంకల్పానికి అది తగినదే అయినా అతను వారిని ఎన్నడూ నిషేధించలేదు, లేక రాష్ట్రంలో ఒక మతంగా ఉండకుండా క్రైస్తవత్వాన్ని నిలిపివేయలేదు. మరి రోమన్లు ఎందుకు హింసను కొనసాగించారు? ఎందుకంటే, “చిన్న క్రైస్తవ సమాజాలు, తమ దైవభక్తితో, సభ్యతతో సౌఖ్యాలను కోరే అన్యమత ప్రపంచాన్ని ఇబ్బందిపెట్టేవి,” అని చరిత్రకారుడైన విల్ డ్యూరాంట్ చెబుతున్నాడు. క్రైస్తవత్వానికి, రక్తాన్ని చిందించే రోమన్ల కౄరమైన పోటీలకు వున్న వ్యత్యాసం కనిపెట్టలేనంత గొప్పదేం కాదు. క్రైస్తవుల బెడద వదిలించుకొని, అలా తమ స్వంత అంతరాత్మలను శాంతపరచుకొనే అవకాశాన్ని రోమన్లు జారవిడుచుకొనేవారు కాదు.
ప్రపంచ ఆధిపత్యంగా రోము జయించ సాధ్యం కానిదిగా ఉండేది. రోమన్లు తమ సైనిక శౌర్యానికి ఒక కారణం తాము అన్ని దేవతలను ఆరాధించడమని నమ్మేవారు. క్రైస్తవుల ఏకదేవుని యందలి నమ్మకం యొక్క విశిష్టతను, చక్రవర్తి ఆరాధనతో సహా వారు ఇతర దేవుళ్లను నిరాకరించడాన్ని అర్ధం చేసుకోవటం వారికి కష్టమైపోయింది. సామ్రాజ్యపు పునాదులనే బలహీనపరిచే ప్రభావంగా క్రైస్తవత్వం వుందని రోమన్లు పరిగణించడంలో ఆశ్చర్యంలేదు.
సాక్ష్యమిచ్చినందుకు ఫలితం
సా.శ. మొదటి శతాబ్దాంతానికి, అపొస్తలుడైన యోహాను “దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును” పత్మాసు ద్వీపానికి బందీగా కొనిపోబడ్డాడు. (ప్రకటన 1:9) దీనికి రోమా చక్రవర్తియైన దొమిత్యన్ బాధ్యుడని తలంచారు. యేసు అనుచరులపై వత్తిడి తేబడినప్పటికీ, శతాబ్దాంతానికి క్రైస్తవత్వం రోమా సామ్రాజ్యమంతటా వ్యాప్తి చెందింది. ఇదెలా సాధ్యమయింది? క్రైస్తవత్వం “దాని పరిచర్యతో బలపర్చబడింది” అని ఎ హిస్టరీ అఫ్ ది ఎర్లీ చర్చ్ తెలియజేస్తుంది. యోహాను వలెనే, తొలి క్రైస్తవులు హింసించబడినప్పటికీ, వారు తమ విశ్వాసమందు రాజీపడలేదు గాని, దేవున్ని గూర్చి మాట్లాడటానికి, యేసును గూర్చి సాక్ష్యమివ్వటానికి ఆసక్తిగా పట్టుదలతో ప్రయత్నించారు.—అపొస్తలుల కార్యములు 20:20, 21; 2 తిమోతి 4:2.
చక్రవర్తియైన ట్రాజాన్ ప్లినీని బెతనియకు (ఇప్పుడు వాయవ్య టర్కీ) గవర్నరుగా నియమించబడిన రెండేండ్ల తరువాత, సా.శ. 112 నాటికి క్రైస్తవులను హింసించడం ఒక క్రొత్త మలుపు తిరిగింది. అక్కడి మునుపటి పరిపాలన మాంద్యంగా వుండడంవల్ల అస్తవ్యస్థత ఏర్పడింది. ఆలయాలు దాదాపు నిర్మానుష్యంగా ఉండేవి, బలి అర్పించే జంతువుల కొరకైన గడ్డి విక్రయం చెప్పుకోదగినంతగా పడిపోయింది. క్రైస్తవ ఆరాధనలో జంతు బలులు, విగ్రహాలు రెండూ వుండేవి కావు గనుక దాని సరళత్వాన్ని వ్యాపారులు నిందించారు.
అన్య ఆరాధనను పునఃస్ధాపించటానికి ప్లినీ కష్టపడి పనిచేశాడు, అయితే క్రైస్తవులు, చక్రవర్తి విగ్రహాల యెదుట ద్రాక్షారసం, ధూపం అర్పించడాన్ని నిరాకరించడానికి తమ జీవితాలనే వెలగా చెల్లించారు. చివరకు, క్రైస్తవులు “శ్రేష్ఠమైన నైతిక విలువలు గలవారు, కాని పురాతన మత సాంప్రదాయానికి వివరించలేనంతటి వ్యతిరేకులు,” అని రోమా అధికారులు అంగీకరించారని ప్రొఫెసరు హెన్రీ చాడ్విక్ చెబుతున్నాడు. క్రైస్తవునిగా వుండడం మరణశిక్ష విధించబడేంతటి అపరాధంగా పరిగణించ బడిననూ, యేసు నిజ అనుచరులకు రాజీపడే తలంపే లేదు.
“అన్య కుటుంబాల్లో ఆయా సభ్యులు మతమార్పిడి చేసుకొన్నందుకు పీడించబడి” నందున కూడా ద్వేషం ఉత్పన్నమయ్యిందని ప్రొఫెసరు డబ్ల్యూ. ఎం. రామ్సే చెబుతున్నాడు. “అన్య దేవతలను గుర్తించుటపై ఆధారపడిన సర్వ సామాన్యమైన సామాజిక ఆచారాన్ని ఒక పొరుగువాడు అనుసరించలేక పోవడంతో సాంఘిక జీవనం కష్టభరితమై పోయిందని” డా. జె. డబ్ల్యూ. సి. వాండ్ తెలియజేస్తున్నాడు. మానవజాతి ద్వేషకులుగా లేక నాస్తికులని పరిగణించబడేవారిగా అనేకులు తొలి క్రైస్తవులను దృష్టించారంటే దానిలో ఆశ్చర్యం లేదు.
అభివృద్ధి గొప్ప హింసను తెస్తుంది
బహుశ అపొస్తలుడైన యోహానుచే బోధించబడిన పాలికార్ప్, స్ముర్న (ఇప్పుడు ఎజ్మీర్) పట్టణంలో గౌరవనీయుడైన ఒక సంఘపెద్ద అయ్యాడు. సా.శ. 155లో ఆయన తన విశ్వాసం కొరకు మ్రాను మీద దహించబడ్డాడు. రోమా సామ్రాజ్యపు గవర్నరయిన స్టేటియస్ క్వాడ్రాటస్ జనసమూహాలను పోగుచేశాడు. తమ దేవుళ్ల ఆరాధనను నిరుత్సాహపరచినందుకు 86 సంవత్సరాల పాలికార్ప్ను హీనంగా చూసే వ్యతిరేకులైన అన్యులతో ఆ స్టేడియం నిండిపోయింది, మతమౌఢ్యులైన యూదులు మహా విశ్రాంతి దినాన తాము చేయవలసియున్ననూ ఇష్టపూర్వకంగా ఆయనను దహించడానికి కట్టెలు పోగుచేశారు.
తరువాత, రోమా సామ్రాజ్యమంతటా ఉన్న క్రైస్తవులపైకి హింస వెల్లువలా ముంచుకొచ్చింది. చక్రవర్తియైన మార్కస్ యురెలియస్ అధికారం క్రింద, వారి రక్తం ఏరులై పారింది. వారు రోమా పౌరులైతే, వారు కత్తిచేత మరణించారు; కాకపోతే, ఆంఫి థియేటర్లలో క్రూరమృగాలచే చంపబడేవారు. వారి అపరాధం? కేవలం తమ విశ్వాసమందు రాజీపడుటకు లేక తమ విశ్వాసాన్ని విడిచిపెట్టుటకు నిరాకరించే క్రైస్తవులుగా ఉండడమే.
లుగ్డునమ్ రోమా కాలనీ నుండి అభివృద్ధి చెందిన ఆధునిక ఫ్రెంచి పట్టణమైన ల్యాన్స్, ఒక కీలక పరిపాలనా కేంద్రం మరియు రోముకు, రైను నదికి మధ్యనున్న ఏకైక సైనిక శిబిరం. సా.శ. 177 నాటికి, అన్య ప్రజానీకం కోపంతో దండెత్తేంత పటిష్టమైన క్రైస్తవ సమాజం దానిలో ఏర్పడింది. బహిరంగ స్థలాలనుండి క్రైస్తవులు మినహాయింప బడినప్పుడు ఇది మొదలయ్యింది. అల్లరిమూక కలహం రేపినప్పుడు, చెలరేగిన హింస ఎంత ఎక్కువగా ఉండిందంటే, క్రైస్తవులు ఇల్లు వదిలి బయటికి రావడానికి భయపడేవారు. క్రైస్తవులను వెతికిపట్టుకుని చంపేయమని రోమా అధిపతి ఆదేశించాడు.
ప్రతిఫలం
యేసు అపొస్తలులు మరణించడం, నిరోధించే వారి ప్రభావం తగ్గిపోవడంతో క్రైస్తవులని చెప్పుకునేవారిలోనే మతభ్రష్టత్వం పెరగడం మొదలయింది. (2 థెస్సలొనీకయులు 2:7) సా.శ. నాలుగవ శతాబ్దాంతానికి, మతభ్రష్ట క్రైస్తవత్వం రాష్ట్ర మతం అయింది. యేసు, ఆయన తొలి శిష్యులు ఎన్నడూ చేయని విధంగా, అప్పటికి అది కలుషితమైపోయి లోకంతో గుర్తించబడటానికి, రాజీపడటానికి సిద్ధమైంది. (యోహాను 17:16) అయితే అంతకుముందే క్రైస్తవ విశ్వాస చరిత్రతో కూడిన బైబిలు గ్రంథసంకలనము పూర్తయింది.
తొలి క్రైస్తవులలో వేలాది మంది అనుభవించిన వేదన, మరణం వ్యర్థమయ్యిందా? లేదు! తమ విశ్వాసమందు రాజీపడాలనే తలంపేలేకుండా వారు ‘మరణమువరకు నమ్మకముగా ఉండి, జీవకిరీటాన్ని పొందారు’. (ప్రకటన 2:10) యెహోవా సేవకులు ఇంకను హింసను అనుభవిస్తూనే ఉన్నారు, కాని తొలి తోటి విశ్వాసుల విశ్వాసము, యథార్థత వారికి గొప్ప ప్రోత్సాహాన్నిచ్చే మూలంగా ఉంది. అందుకే, ఆధునిక-దిన క్రైస్తవులు కూడా రాజీపడే తలంపునే రానివ్వరు.
[8, 9వ పేజీలోని చిత్రాలు]
నీరో
రోమా రాజరిక నమూనా
కైసరు ఆరాధనకు సమర్పించబడిన బలిపీఠము
[క్రెడిట్ లైను]
Nero: Courtesy of The British Museum
Museo della Civiltà Romana, Roma
[10వ పేజీలోని చిత్రం]
మార్కస్ యురేలియస్
[క్రెడిట్ లైను]
The Bettmann Archive