“కడపటి శత్రువు” ఓడించబడును!
మీరు బాల్యంలో వున్నపుడు, చీకటంటే భయపడి యుండవచ్చు. భయానక కథలు, కొన్ని కల్పిత కథలు కూడా మీలో వ్యాకులతను నింపియుండవచ్చు. మీరు నిద్రపోవాలని ప్రయత్నిస్తుండగా మీ తల్లిగాని తండ్రిగాని ఒక దీపం వెలిగించిపెట్టినప్పుడు అది ఎంత ధైర్యానిచ్చియుండవచ్చు!
అలాగే మరణం అనేకమందిని భయపెడుతుంది. అయినా, అది అలా భయపెట్టనవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే నిజంగా మరణమంటే ఏమిటి అనేదాన్ని బట్టి.
మీ శత్రువును తెలుసుకోండి
ప్రాచీన ఇశ్రాయేలీయుల జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా ప్రకటించాడు: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) మీ స్వంత బైబిలునందే కనుగొనబడిన ఈ దైవ ప్రేరిత ఆలోచన ప్రకారం, మరణం కేవలం జీవానికి వ్యతిరేకమైనది. మృతులు స్మారకములో ఉండరు.
మరణాన్ని ఉపమానరీతిగా సూచిస్తూ, క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” మరణాన్ని కలుగజేసే ఆ ముల్లేమిటి? “మరణపు ముల్లు పాపము” అని పౌలు చెబుతున్నాడు. (1 కొరింథీయులు 15:55, 56; హోషేయ 13:14) అయితే, ఈ మరణపు ముల్లుకు మూలమేమిటి? లేఖనాల్లో మరోచోట పౌలు ఇలా చెబుతున్నాడు: “ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ‘ఆదాము నందు అందరు మృతి పొందుచున్నారు’ అని చెప్పినప్పుడు ఆ “మనుష్యుని” గుర్తించుటను గూర్చి అపొస్తలుడు సందేహాన్ని మిగల్చలేదు. (1 కొరింథీయులు 15:22) అవును, మన పూర్వీకుడైన ఆదాము అవిధేయత మూలంగా, మనమందరము మరణపు ముల్లుకు గురౌతున్నాము.—ఆదికాండము 3:1-19.
మంచి ఆరోగ్యం, ఆహ్లాదకరమైన పరిసరాల్లో, ప్రేమగల కుటుంబంతోవున్న మనమెవరం మరణించటానికి ఎన్నుకోము. అయినా, బైబిలు చూపునట్లుగా, ‘కాలము, అనుకోని సంఘటనలు’ మన జీవాన్ని దోచుకోవచ్చు. (ప్రసంగి 9:11) వాస్తవానికి, రేపు మన జీవితానికి ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. (యాకోబు 4:14) ఒకటి మాత్రం నిశ్చయం—మనమందరం పాపాన్ని, మరణాన్ని వారసత్వంగా పొందాము. అందుకే, మరణం మనల్ని ఒక శత్రువులా వెంటాడుతుంది, దెబ్బ కొడుతుంది.
ప్రియులైనవారి మరణాన్ని తాళుకొనుట
విశేషంగా, ప్రియమైనవానికి మరణం సంభవిస్తే నిజంగా అది శత్రువే. అనారోగ్యంతోనున్న భార్య, చివరిదశలో వున్నందున మరణాన్ని గురించి ఆలోచిస్తూ తన భర్తతో ఇలా అన్నది: “అది మీకు దుర్భరంగా వుంటుంది.” ఆమె ఎందుకలా అనగలిగింది? ఎందుకంటే, “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు [మానవజాతి యొక్క సామాన్య సమాధి] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 9:10) మరణించినవారు ఇక బాధననుభవించరు. కాని దుఃఖభారం జీవించివున్న బంధువులు, స్నేహితులపై పడుతుంది. అలాంటి బాధను తొలగించుటకు ఏమైనా చేయవచ్చా?
దేవుని వాక్యమగు బైబిలు పుటలలో, ఓదార్పునిచ్చే మాటలు అనేకమున్నాయి. ఉదాహరణకు, కీర్తనలను చదవడం, ధ్యానించడం ఊరట పొందుటకు నిజంగా తోడ్పడుతుంది. “ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు” అనే యిలాంటి మాటలు నిజంగా ఓదార్పు నిస్తాయి.—కీర్తన 68:19.
ఓదార్పు పొందదగు మరో మూలం క్రైస్తవ సంఘము. సా.శ. మొదటి శతాబ్దంలో, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను [ఆమె భౌతిక అవసరతలు తీర్చు] పిల్లలుగాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారి యెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది. అరువది ఏండ్లకంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై, సత్క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.” (1 తిమోతి 5:3, 4, 9, 10) అలాగే యెహోవాసాక్షులు ఈనాడు అలాంటి తోటి విశ్వాసులకు సహాయం చేసి, ఓదార్పునిస్తారు.
మరణమందు తమవారిని కోల్పోయిన వారు తరచు చేసుకోవాల్సిన గొప్ప సర్దుబాటు భావోద్రేకమైనది. రెండేండ్ల క్రితం భార్య మరణించిన ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “నేను నా భార్యనెంతగానో ప్రేమించాను, ఇది నా జీవితంలో అత్యంత దుఃఖకరమైన సంఘటన, దాన్ని సహించడం నాకు చాలా కష్టమనిపిస్తుంది.” కొంతకాలం వివాహజీవితాన్ని గడిపిన ఏ వ్యక్తయినా మానవ సంబంధాలలోని అత్యంత సన్నిహిత సంబంధాన్ని తన జీవితంలో అనుభవించి ఉంటారు. జతలో ఒకరు మరణించినప్పుడు, జీవించియున్న సహవాసి సహజంగానే ఎంతో కోల్పోయినట్లు భావిస్తారు. వారు ఎవరినుండి సహాయాన్ని పొందవచ్చు?
అలాంటి పరిస్థితుల్లో, క్రైస్తవ సహవాసులు క్షేమాభివృద్ధిని కలుగజేయగలరు. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును,” అని ఒక జ్ఞానయుక్తమైన సామెత చెబుతుంది. (సామెతలు 17:17) నిజమైన మద్దతునిచ్చే సహవాసుల సహాయం తమ జతను కోల్పోయినవారికి అవసరమవుతుంది. వివేకంగల స్నేహితులు బాధపడేవారిని మాట్లాడమని ప్రోత్సహిస్తారు, అలా చేయడం ద్వారా కన్నీళ్లు వచ్చునప్పటికీ ప్రోత్సహిస్తారు. తమ జతను కోల్పోయి, ఆ బాధను, హృదయవేదనను ముందే అనుభవించిన ఒక క్రైస్తవ వ్యక్తి దయాపూర్వక సహాయాన్నివ్వవచ్చు. “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి,” అని బైబిలు ఉపదేశిస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:14) కాని విధవరాండ్రు, భార్యలను కోల్పోయిన భర్తలు తమ వివాహజత లేని లోటును అనుభవిస్తారని గుర్తుంచుకోండి. గనుక, అందరూ మంచి ప్రవర్తనను కాపాడుకొనుటకు అనుకూలించే పరిస్థితులలో మాత్రమే బాధితులు ఇతరుల యందు నమ్మిక యుంచాలి.—1 పేతురు 2:12.
మరణం కలిగించే బాధకు శ్రేష్ఠమైన విరుగుడు ఇతరులకు సహాయం చేయడంలో నిమగ్నమై ఉండడమే, కాని తమకే సహాయం అవసరమని నమ్మేవారికి నిజంగా ఇది ఒక సవాలే! ఇటువంటి పరిస్థితుల్లోనే నిస్వార్థత ఒక కీలక పాత్ర వహిస్తుంది. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పాడు గనుక, నిస్వార్థంగా ఇతరులకు పనులు చేయడం దుఃఖాన్ని, వేదనను పోగొట్టుకోవడానికి సహాయం చేస్తుంది.—అపొస్తలుల కార్యములు 20:35.
మరణంపై విజయం సాధించుట
తేనెటీగ కాటు చాలా బాధాకరంగా, ప్రాణాంతకంగా కూడా వుండవచ్చు. సాధారణంగా, మీ శరీరంలో ఉండిపోయిన తేనెటీగ ముల్లును తీసివేయటం ఉపశమనం పొందడానికి సహాయపడవచ్చు. కాని మరణం కలుగజేసే కాటు నుండి ఉపశమనం పొందడానికి ఏ ఉత్తరాపేక్షలున్నాయి?
మరణాన్ని కలుగజేసే ముల్లు పాపమని వివరించిన తరువాత, “మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక” అని పౌలు నొక్కి చెప్పాడు. (1 కొరింథీయులు 15:57) మరణాన్ని జయించడం, క్రీస్తుతో ఎలా ముడిపడివుంది? “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని” యేసు తనను గూర్చి తాను చెప్పినప్పుడు దీనిని చూపించాడు. (మత్తయి 20:28) అవును, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు, ఆయన ద్వారా యెహోవా ఏర్పాటు చేసిన విమోచనబలి యందు విశ్వాసముంచువారిని, ఆదాము నుండి వారసత్వంగా వస్తున్న మరణము శాశ్వతంగా నిర్మూలము చేయదు.—యోహాను 3:16.
“దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” అని యేసు పలికిన మాటలు నిజంగా ధైర్యాన్నిస్తాయి.—యోహాను 5:28, 29.
శతాబ్దాల క్రితం, దేవుని ప్రవక్తయైన యెషయా ఇలా ప్రవచించాడు: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన [యెహోవా దేవుడు] మ్రింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.” (యెషయా 25:8) మళ్లీ, ప్రకటన 21:4 నందు బైబిలు ఈ అద్భుతమైన ఉత్తరాపేక్షను అందిస్తున్నది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” మరణమందు నిద్రిస్తున్న వారికొరకున్న ఈ నిరీక్షణచేత బలపరచబడి, మరణమందు తమ వారిని కోల్పోయిన వారు “నిరీక్షణలేని యితరులవలె . . . దుఃఖపడ” నవసరం లేదు.—1 థెస్సలొనీకయులు 4:13.
బైబిలునందు వెల్లడిపరచబడినట్లు, మానవజాతి కొరకు దేవుని యొద్ద ఏమి ఉన్నదో దృష్టీకరించుటకు ప్రయత్నించండి. త్వరలో రానైయున్న “మహా శ్రమలు” అంటే ప్రస్తుత దుష్ట విధానానికి నాశనమని భావం. (ప్రకటన 7:14) అబద్ధమతాన్ని పాటిస్తున్నవారందరు నాశనం చేయబడతారు. కరువు, యుద్ధాన్ని కలిగించే పేరాశగల రాజకీయ, వ్యాపార సంస్థలు గతిస్తాయి. అనేకమంది మానవుల మరణానికి కారణమైన అపవాదియగు సాతానును యేసుక్రీస్తు అగాధంలో బంధిస్తాడు. అప్పుడు క్రీస్తు తన విమోచనా బలి విలువను మానవజాతికి అన్వయించే తన వెయ్యేండ్ల పరిపాలనను ప్రారంభిస్తాడు. నిరీక్షించిన పునరుత్థానమందు మృతులు తిరిగి వస్తారు, మానవజాతి శత్రువైన మరణాన్ని గురించి ఉన్న మూఢనమ్మకాలు ఇక ఏమాత్రము ఉనికిలో లేకుండా పోయేంత ప్రకాశవంతంగా దేవుని వాక్యం నుండి వెలుగు ప్రకాశిస్తుంది. అప్పుడు సజీవంగా వున్నవారందరికీ, దేవుని మార్గాలను తెలుసుకుని, ఆయన నైతిక కట్టడలకు బద్దులైయుండే అవకాశముంటుంది.—సామెతలు 4:18; అపొస్తలుల కార్యములు 24:15; హెబ్రీయులు 2:14, 15; ప్రకటన 18:4-8; 19:19-21; 20:1-3.
‘క్రీస్తు తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము, అప్పుడు అంతము వచ్చును’ అని పౌలు చెబుతున్నాడు. (1 కొరింథీయులు 15:24-26) ఆదాము పాపము ద్వారా వచ్చే ప్రతి విధమైన వైకల్యత పోతుంది. చివరి పరీక్ష జరుగుతుంది, దేవుని ప్రేమించేవారు విశ్వాస్యత గలవారై దానిలో కృతార్థులౌతారు. (ప్రకటన 20:4-10) పరిపూర్ణతకు తేబడిన విధేయులైన మానవులు, కేవలం 70 లేక 110 సంవత్సరాలు కాదుగాని నిరంతరం జీవిస్తారు. దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా అందిస్తున్న ఎంత చక్కటి దీవెన!—రోమీయులు 6:23.
కాబట్టి, మీరెంత కాలం జీవించగలరు? మీ ఆయుష్కాలము శాశ్వతంగా పొడిగించబడగలదు. మీరు ఈ లోక “అంత్యకాలములో” జీవిస్తుండగా మీరు, మరణించనవసరమే లేదు. (దానియేలు 12:4; యోహాను 11:25, 26; 17:3) మీరు దైవ చిత్తాన్ని చేస్తే, దేవుని వాగ్దాన నూతన లోకంలోనికి జీవంతో ప్రవేశించగలరు.—2 పేతురు 3:13.
మీరు వయస్సులో పెద్దవారైతే, మరణించే సాధ్యతను గూర్చి మీరు వాస్తవరూపంగా పరిశీలించాల్సిన అవసరత ఉంది. కచ్చితంగా, పునరుత్థాన నిరీక్షణ ఆనందాన్ని తెస్తుంది. ఆ నూతన విధానంలో కుటుంబ జీవితాన్ని యెహోవా ఎలా ఏర్పాటు చేస్తాడు అని మీరనుకోవచ్చు. తన యెడల నిరంతరం విశ్వాసంగా వుండేవారి నిత్య సంతోషాన్ని గూర్చి యెహోవా చూసుకుంటాడు గనుక ఆ విషయాలు మిమ్మల్ని కలతపరచ నివ్వకండి.
సాతాను యొక్క దుష్ట విధానపు ఈ అపాయకరమైన “అంత్యదినాలు” వాటి ముగింపుకు వస్తుండగా, నేడు యెహోవాను సేవించగల ఆధిక్యతను మరణాన్ని గూర్చిన భయం మీ నుండి దోచుకోవడాన్ని అనుమతించకండి. (2 తిమోతి 3:1) మీకు ప్రియమైన వారిని మీరు మరణమందు పోగొట్టుకుంటే, మరణపు పట్టు తాత్కాలికమైనదేనని మిమ్మును మీరు ఓదార్చుకొనండి. (ప్రకటన 20:13, 14) పునరుత్థాన నిరీక్షణయందు విశ్వాసముంచండి. అప్పుడు, మీరు మహాశ్రమలను తప్పించుకొనైనా, లేదా పునరుత్థానం ద్వారానైనా నూతన లోకంలోకి ప్రవేశిస్తే, కడపటి శత్రువైన మరణం నిర్మూలించ బడుతుందన్న ప్రేరేపిత వాగ్దానాన్నిబట్టి ధైర్యంగా వుండండి.—ప్రకటన 7:9, 14.
[5వ పేజీలోని చిత్రం]
మంచి క్రైస్తవ సహవాసులు, మరణమందు తమవారిని కోల్పోయినవారిని ఆత్మీయంగా ప్రోత్సహించవచ్చు
[7వ పేజీలోని చిత్రం]
ఇతరులకు సహాయం చేయడంలో నిమగ్నమైయుండడం, ప్రియమైన వారిని మరణమందు కోల్పోవడం వలన కల్గేబాధను తగ్గిస్తుంది