పాఠకుల ప్రశ్నలు
పునరుత్థానుడైన యేసు వారికి ప్రత్యక్షమైన తర్వాత కూడ కొంతమంది అపొస్తలులు యింకా చాలాకాలం వరకు ఆ విషయాన్ని సందేహిస్తునే వున్నారని మత్తయి 28:17 భావమా?
కాదు, మత్తయి 28:16, 17ను బట్టి మనమా నిర్ణయానికి రానవసరము లేదు. అక్కడ మనమిలా చదువుదుము: “పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.”
అంతకుముందే, “తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలుపొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని” శిష్యులు గ్రహించునట్లు సహాయము చేయుటకు యేసు ప్రయత్నించాడు. (మత్తయి 16:21) అయితే, ఆయన బంధింపబడి, చంపబడుటతో శిష్యులు నిరుత్సాహంతో కంగారుపడ్డారు. ఆయన పునరుత్థానము ఒక ఆశ్చర్యకార్యమైనట్లు కన్పించింది. మరియు ఆయన మానవ రూపంలో వారికి కనబడ్డప్పుడు, మొదట కొందరు “సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడిరి.” (లూకా 24:36-41) అయితే ఆయన పునరుత్థానము తర్వాత ప్రత్యక్షమైన సందర్భాలు, ఆయన సన్నిహిత అనుచరులు తన పునరుత్థాన వాస్తవాన్ని అంగీకరించుటకు వారికి సహాయం చేసింది; అపొస్తలుడైన తోమా సహితము యేసు లేచెనని దృఢంగా విశ్వసించాడు.—యోహాను 20:24-29.
ఆ తర్వాత ఆ పదకొండుమంది నమ్మకమైన అపొస్తలులు “గలిలయకు . . . వెళ్లిరి.” (మత్తయి 28:16; యోహాను 21:1) వారక్కడ ఉండగా, యేసు “ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను.” (1 కొరింథీయులు 15:6) ఈ సందర్భాన్ని పురస్కరించుకొని “కొందరు సందేహించిరి” అని మత్తయి 28:17 ప్రస్తావిస్తున్నది. కాబట్టి ఇంకను అలాంటి సందేహము గలవారు బహుశ ఆ ఐదువందల మందిలో ఉండవచ్చు.
దీనిపై వాచ్టవర్ సొసైటి మొదటి అధ్యక్షుడగు సి. టి. రస్సెల్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యానమును గమనించండి:
“అలా సందేహించిన వారు ఆ పదకొండు మందిలో ఒకరని మనము కారణసహితముగా ఊహించలేము, ఎందుకంటే వారు పూర్తిగా సంతృప్తిపరచబడిరి, పూర్ణముగా ఒప్పింపజేయబడిరి. అలా నమ్మినట్లు వారింతకుముందు స్వయంగా వ్యక్తపరచారు. కాబట్టి, అలా సందేహించిన వారు ముందుగా నిర్ణయించుకొని ఆ ప్రదేశానికి వచ్చిన ఆ ‘ఐదువందల సహోదరులలోని’ వారై ఉండవచ్చునని మనమనుకోవచ్చు. ఆయన పునరుత్థానమైన దగ్గరనుండి వారాయనను కలుసుకోలేదు, మరియు వారు అపొస్తలులకంటెను, యేసు అప్పటికే కలుసుకొనిన ఇతర సన్నిహిత స్నేహితులకంటెను విశ్వాసమందు బలహీనులైన వారై యుండవచ్చునని మనము కారణయుక్తముగా ఊహించవచ్చును. ‘కొందరు సందేహించిరి’ అను మాట సువార్తికుల చరిత్ర నిష్కాపట్యతను రుజువుచేస్తుంది. ఆలాగే ప్రభువు అనుచరులు దేనినంటే దానిని ఊరకనే నమ్మేవారు కాదని, యివ్వబడిన రుజువులను నిశితంగా తరచి చూసేవారని కూడా అది మనకు చూపిస్తున్నది. మరియు విశ్వాసులైన వారు ఆ తర్వాత ప్రదర్శించిన ఆసక్తి, శక్తి, స్వయం త్యాగ స్ఫూర్తి మన ప్రభువు పునరుత్థానాన్ని గూర్చి వారికి కలిగిన ఒప్పుదలకు కావల్సినంత రుజువునిస్తున్నది గనుకనే, వారితోపాటు మనం కూడ ఆయనయందు విశ్వాసం కలిగి యుండుటకు అదొక కీలక అంశమని గుర్తింతుము. క్రీస్తు మృతులలోనుండి లేపబడనట్లయిన మన విశ్వాసం వ్యర్థం మరియు మనమింకా మన పాపములోనే ఉంటాము.—1 కొరిం. 15:17.”—జయన్స్ వాచ్టవర్ అండ్ హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్స్ ప్రెజెన్స్, మే 1, 1901, పుట 152.
ఈ విషయాన్ని మత్తయి ప్రస్తావించిన విధానం బైబిలు యొక్క నమ్మకత్వానికి, చిత్తశుద్ధికి రుజువునిస్తున్నట్లు మనం గమనించవచ్చును. ఓ వ్యక్తి ఒకవేళ ఓ కల్పిత కథను వ్రాస్తున్నట్లయిన, తను వ్రాసే కథ నమ్మశక్యంగా కన్పించే విధంగా వివరాలు వ్రాస్తాడు; విడిచి పెట్టబడిన వివరాలు లేదా కన్పించే ఖాళీలు తన కల్పనపై సందేహాన్ని కల్గిస్తాయని అతడు భావిస్తాడు. మరి మత్తయి విషయమేమి?
‘కొందరు సందేహించిరి’ అని తాను వ్రాసిన మాటకు వివరణ యిచ్చే బాధ్యత తనకున్నదని ఆయన భావించలేదు. మార్కు, లూకా, యోహాను దీనిని గూర్చి ఏమి చెప్పుటలేదు కాబట్టి ఒక్క మత్తయి వ్రాసిన మాటను మాత్రమే తీసుకుంటే అది 11 మంది అపొస్తలులలో కొందరికి అన్వయించునట్లు కన్పిస్తుంది. కాని, ఏలాంటి వివరణ లేకుండా మత్తయి కేవలం ఒక క్లుప్త వ్యాఖ్యానమునే వ్రాసాడు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయుల పుస్తకం వ్రాసాడు. ఆయన 1 కొరింథీయులు 15:6లో యిచ్చిన వివరాల ప్రకారం చూస్తే, అలా సందేహించిన వారు అపొస్తలులు కాదుగాని, అప్పటికి యింకా యేసు ప్రత్యక్షం కాని గలిలయలోని శిష్యులని మనమొక నిర్ణయానికి రావచ్చును. ఆ విధంగా, మత్తయి వ్రాసిన వ్యాఖ్యానమగు “కొందరు సందేహించిరి” నిజమని అన్పిస్తున్నది; ప్రతి వివరాన్ని కడవరకు వివరించడానికి ప్రయత్నించకుండా నిజ వృత్తాంతాన్ని చిత్తశుద్ధితో వ్రాసిన రచయితను అది సరిగా సూచిస్తున్నది.