4 మీ సందేహాలను తీర్చుకోండి
‘అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?’—మత్తయి 14:31.
ఆటంకం: యేసు శిష్యులు కూడా కొన్నిసార్లు సందేహపడ్డారు. (మత్తయి 14:30; లూకా 24:36-39; యోహాను 20:24, 25) నిజానికి, బైబిలు అవిశ్వాసాన్ని ‘సుళువుగా చిక్కులబెట్టు పాపం’ అని వర్ణిస్తోంది. (హెబ్రీయులు 12:1) “విశ్వాసము అందరికి లేదు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 థెస్సలొనీకయులు 3:2) అందరూ విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. కానీ, చాలామంది దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించరు. అయితే, ఎవరైనా అలా ప్రయత్నిస్తే దేవుడు వారి ప్రయత్నాలను తప్పక ఆశీర్వదిస్తాడు.
దాన్నెలా అధిగమించవచ్చు? మీరు సందేహపడేలా చేసే అంశాలేమిటో గుర్తించండి. ఉదాహరణకు, శిష్యుడైన తోమా దేవుడు యేసును తిరిగి బ్రతికించాడనే విషయాన్ని సందేహించాడు. యేసు ఇతర శిష్యులు తాము ఆయనను చూశామని చెప్పినా, ఆయన నమ్మకుండా రుజువు చూస్తేనే నమ్ముతానన్నాడు. అప్పుడేమి జరిగింది? ఆయన బలమైన విశ్వాసం కలిగివుండడానికి కావాల్సిన రుజువును యేసు చూపించాడు.—యోహాను 20:24-29.
మన సందేహాలు తీరడానికి కావాల్సిన రుజువులను యెహోవా దేవుడు బైబిలు ద్వారా ఇస్తాడు. ఉదాహరణకు, మనుషులను పట్టిపీడిస్తున్న యుద్ధాలు, దౌర్జన్యం, బాధలు వంటివాటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుడే బాధ్యుడని నిందిస్తూ చాలామంది ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. అయితే, దీని గురించి బైబిలు ఏమి చెప్తోంది?
దేవుడు పరిపాలించడానికి మానవ ప్రభుత్వాలను ఉపయోగించుకోడు. సాతాను అనే అదృశ్య ప్రాణిని “ఈ లోకాధికారి” అని యేసు పిలిచాడు. (యోహాను 14:30) సాతాను తనకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నిటిపైన అధికారం ఇస్తానని చెప్తూ, ‘ఈ అధికారాన్ని, ఈ రాజ్యముల మహిమను నీకిస్తాను; అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వారికిస్తాను’ అని యేసుతో అన్నాడు. సాతానుకు అలాంటి అధికారం ఉందనే విషయాన్ని యేసు కాదనలేదు గానీ ఆయనిలా అన్నాడు: ‘నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవించాలని వ్రాయబడివుంది.’ (లూకా 4:5-8) లోకంలోవున్న బాధలకు సాతాను, మానవ ప్రభుత్వాలే కారణంగానీ దేవుడు కాదు.—ప్రకటన 12:9, 12.
యెహోవా దేవుడు త్వరలోనే బాధ కలిగించేవాటన్నిటినీ తీసేస్తాడు. మనుషులను పరిపాలించడానికి దేవుడు ఇప్పటికే ఒక రాజ్యాన్ని లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దానికి తన కుమారుడైన యేసుక్రీస్తును రాజుగా నియమించాడు. (మత్తయి 6:9, 10; 1 కొరింథీయులు 15:20-28) బైబిలు ప్రవచనం నెరవేర్పుగా, ఆ రాజ్యం గురించిన సువార్త నేడు భూవ్యాప్తంగా ప్రకటించబడుతోంది. (మత్తయి 24:14) త్వరలోనే ఆ రాజ్యం దాని వ్యతిరేకులను, మానవులకు బాధ కలిగించేవాటన్నిటినీ లేకుండా చేస్తుంది.—దానియేలు 2:44; మత్తయి 25:31-33, 46; ప్రకటన 21:3, 4.
ప్రతిఫలం ఏమిటి? సందేహపడేవాళ్లు గాలికి కొట్టుకుపోయే అలల్లా ఉంటారు. అలాంటి వాళ్లు ‘మనుష్యుల మాయోపాయములచేత కల్పింపబడిన ప్రతీ ఉపదేశాన్ని’ నమ్ముతారు. (ఎఫెసీయులు 4:14; 2 పేతురు 2:1) మరోవైపు, తమ ప్రశ్నలకు సరైన జవాబులను తెలుసుకునేవాళ్లు ‘విశ్వాసంలో నిలకడగా ఉంటారు.’—1 కొరింథీయులు 16:13.
ఈ పత్రికను ప్రచురిస్తున్న యెహోవాసాక్షులమైన మేము, విశ్వాసాన్ని పెంపొందించుకోకుండా ఆటంకపర్చే ప్రశ్నలకు తగిన జవాబులు తెలుసుకునేందుకు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని సంప్రదించి మేము బోధించేవాటిని స్వయంగా పరిశోధించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరలా చేస్తే దేవునిపై మీకున్న విశ్వాసం మరింత బలపడుతుంది. (w09 5/1)
మరింత వివరణ కోసం, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?a అనే పుస్తకంలోని “దేవుని రాజ్యం అంటే ఏమిటి?” అనే 8వ అధ్యాయాన్ని, “దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?” అనే 11వ అధ్యాయాన్ని చూడండి.
[అధస్సూచి]
a యెహోవాసాక్షులు ప్రచురించారు.
[9వ పేజీలోని చిత్రం]
తమ ప్రశ్నలకు సరైన జవాబులను తెలుసుకునే వాళ్ల విశ్వాసానికి బలమైన ఆధారం ఉంటుంది