మానవజాతి కంతటికి సువార్త
“అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకును, అనగా ప్రతిజనమునకును, ప్రతి వంశమునకును, ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును, ప్రకటించునట్లు నిత్యసువార్తను తీసుకొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.” (ప్రకటన 14:6) ఈ మాటలతో వృద్ధుడైన అపొస్తలుడగు యోహాను మన దినములలో నెరవేర్చబడు తన ప్రవచనార్థక దృశ్యమును వివరించెను. నేడు పెరుగుతున్న నేరములు, వాతావరణ కలుషితము, దౌర్జన్యపూరిత హింస, యుద్ధము మరియు వ్యాప్తిచెందిన ఆర్థక అస్థిరతతో కూడిన ఈ యుగములో ఒక సువార్త కలదనుట ఎంత విశ్రాంతిదాయకము! అయితే దేవదూత ప్రకటించవలసిన అవసరమున్న ఆ సువార్త ఏమిటి? ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడువారికిని, మరియు ప్రతి ప్రజకును, ప్రకటించవలసినంతగా సంతోషము కలిగించు ఆవార్త ఏమైయుండగలదు?
మనము వెనుకకు వెళ్లి మరొక సంఘటనలో దేవదూత వ్యక్తిగతముగా సువార్తను ప్రకటించుటను ఆలోచించినట్లయితే మనము దీనికి సమాధానము చెప్పగలము. ఇది సా.శ.పూ. మొదటి శతాబ్దము పూర్తవుచుండగా యోహాను తనదర్శనము చూడక ముందు దాదాపు వంద సంవత్సరములకు జరిగెను. బెత్లేహేమునకు దగ్గరనున్న పొలములలో కాపరులు తమమందను కాచుకొనుచుండగా వారికి ఒక దేవదూత అగుపడి యేసు జన్మమును గురించి ప్రకటించుచు ఇట్లనెను “ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.”—లూకా 2:10, 11.
యేసు జననము నిజముగా “మహాసంతోషకరమైన వర్తమానమై” యుండెను. ఆయన వాగ్ధానము చేయబడిన క్రీస్తుగాను రక్షకునిగాను, ఎదిగి నీతి హృదయముగల విశ్వాసులు జీవించునట్లు తన పరిపూర్ణ మానవజీవితమును అర్పించెను. అంతకంటె ఎక్కువగా, ఆయన దేవుని రాజ్యమునకు రాజై, “సమాధానకర్తగా” తనపాలనలో చివరకు మానవజాతికంతటికిని న్యాయము మరియు సమాధానము తేనైయున్నాడు. (యెషయా 9:6; లూకా 1:33) నిజముగా ఆయన జననమును గూర్చిన సువార్త దేవదూతచే ప్రకటించబడవలసినదైయుండెను!
రాజైన యేసు
మొదటి శతాబ్దములోనికి వెళ్లినట్లయితే, యేసు తనను గురించి చెప్పబడిన అనేక దేవుని సంకల్పములను నెరవేర్చెను. అయితే అప్పటికి ఆయన దేవుని రాజ్యమునకు రాజుగా సింహాసనమునధిష్టించలేదు. ఈ పత్రిక తరచుగా సూచించినట్లుగా, 1914 వరకు అది జరుగలేదు. ప్రవచన నెరవేర్పు స్పష్టముగా సూచించిన రీతిగా ఆ సంవత్సరములో దేవునిరాజ్యము పరలోకములో స్థాపించబడెను. (ప్రకటన 12:10, 12) 1914లో మొదటి ప్రపంచయుద్ధం ఒక దుర్వార్తగా యున్నప్పటికిని,—దేవుని రాజ్యపుట్టుక ఒక శుభవార్తయై యుండెను. ఆ కారణముచే తానే యేసు మనకాలముకొరకు యిలా ప్రవచించెను. “ఈ రాజ్యసువార్త సకలజనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14
యేసు ప్రవచనము నెరవేరినదా? దీనికి ప్రత్యుత్తరము,అవును! మరియు యోహాను ప్రవచనార్థక దర్శనముకూడా నెరవేరింది. నిజమే, యోహాను చూచిన అదృశ్యమైన దూతను మనము చూడలేము. కానీ, దూతయొక్క వర్తమానమును, “ప్రతిజనమునకును, ప్రతివంశమునకును, ఆయా భాషలు మాట్లాడువారికిని, ప్రతిప్రజకును” ప్రకటించుచున్న యెహోవాసాక్షులు స్పష్టముగా కనిపించుచున్నారు. 212 భూభాగములలోను, ద్వీపములలోను, వీరికేక వినిపించుచున్నది. మరియు లక్షలకొలదిగా ప్రజలు దీనికి స్పందించుచున్నారు. వీటిలోకొన్ని అనుభవములు, దేవునిరాజ్యము వారికెట్లు శుభవర్తమానముగానుండెనో తెలుపుచున్నవి. (w90 1/1)