కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • re అధ్యా. 24 పేజీలు 155-160
  • తీపి-చేదు కలిసిన సమాచారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తీపి-చేదు కలిసిన సమాచారం
  • ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏడు ఉరుములు
  • పరిశుద్ధ మర్మము ముగింపు
  • విప్పబడిన గ్రంథం
  • ఈనాటి చిన్న పుస్తకము
  • ప్రకటన మరియు మీరు
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • “ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడు?”
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • దేవుని పరిశుద్ధ మర్మము—దాని మహిమగల ముగింపు!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • యెహోవా పరలోక సింహాసనపు మహిమా ప్రభావము
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
re అధ్యా. 24 పేజీలు 155-160

అధ్యాయం 24

తీపి-చేదు కలిసిన సమాచారం

దర్శనము 6—ప్రకటన 10:1–11:19

అంశం: చిన్నపుస్తకము యొక్క దర్శనము; దేవాలయపు అనుభవాలు; ఏడవబూర ఊదడము

నెరవేర్పుకాలం: యేసు 1914 లో సింహాసనాసీనుడైనప్పటినుండి మహాశ్రమలవరకు

1, 2. (ఎ) రెండోశ్రమ వల్లకల్గిన ఫలితమేమిటి, అదెప్పుడు పూర్తవుతుందని చెప్పవచ్చు? (బి) పరలోకంనుండి ఎవరు దిగివస్తుండగా యోహాను యిప్పుడు చూశాడు?

రెండవ శ్రమ వినాశకరమైంది. అది క్రైస్తవమత సామ్రాజ్యాన్ని దాని నాయకులను, అంటే ఆత్మీయంగా మృతులని బహిర్గతంచేయబడిన “మనుష్యులలో మూడవభాగమును” తెగులుతో మొత్తింది. (ప్రకటన 9:15) మూడవ శ్రమ ఏం తెస్తుందోనని యోహాను బహుశ ఆశ్చర్యపడి ఉంటాడు. అయితే ఆగండి! రెండో శ్రమ యింకా అయిపోలేదు—మనం ప్రకటన 11:14 నందున్న విషయానికి చేరేంతవరకు అయిపోదు. దానికంటే ముందు, తానే స్వయంగా భాగంవహించిన సంఘటనలను యోహాను చూడవలసియుంది. అది అమోఘమైన దృశ్యంతో ఆరంభమౌతుంది:

2 “బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్ర ధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్ని స్తంభములవలెను ఉండెను.”—ప్రకటన 10:1.

3. (ఎ) “బలిష్ఠుడైన దూత” ఎవరు? (బి) ఆయన శిరస్సు మీదనున్న ఇంద్రధనుస్సు ప్రాముఖ్యత ఏమిటి?

3 ఈ “బలిష్ఠుడైన దూత” ఎవరు? అది స్పష్టంగా మరో స్థానంలోవున్న మహిమనొందిన యేసుక్రీస్తే. ఆయన అదృశ్యమైన మేఘాలను ధరించుకున్నాడు, యిది యోహాను యింతకుముందు యేసును గూర్చి చెప్పినదాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది: “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతినేత్రము ఆయననుచూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు.” (ప్రకటన 1:7; మత్తయి 17:2-5 పోల్చండి.) ఆయన శిరస్సుమీదనున్న ఇంద్రధనుస్సు, యోహాను తన దర్శనంలో చూచిన యెహోవా సింహాసనము, దానిచుట్టున్న “మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సును” జ్ఞాపకం చేస్తుంది. (ప్రకటన 4:3; యెహెజ్కేలు 1:28 పోల్చండి.) ఆ ఇంద్రధనుస్సు దేవుని సింహాసనము చుట్టున్న ప్రశాంతతను సూచించింది. అదేమాదిరి, దేవదూత శిరస్సుమీదనున్న ఇంద్రధనుస్సు ఆయన ప్రత్యేక శాంతిదూతయని, యెహోవా ప్రవచించిన “సమాధానకర్తయగు అధిపతి” యని గుర్తిస్తుంది.—యెషయా 9:6, 7.

4. (ఎ) బలిష్ఠుడైన దూత ముఖం “సూర్యుని వలె” (బి) దూత పాదాలు “అగ్ని స్తంభములవలె,” ఉండడం దేనిని సూచిస్తున్నాయి?

4 ఆ బలిష్ఠుడైన దూత ముఖం “సూర్యుని” వలెవుంది. అంతకుముందు, యేసు దేవాలయములో ఉన్నట్లు చూచిన దర్శనంలో యోహాను యేసు ముఖము “మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె” కనబడిన విషయం గమనించాడు. (ప్రకటన 1:16) యేసు, “నీతిసూర్యుని” వలె యెహోవా నామమునకు భయపడువారి ప్రయోజనార్థం తనరెక్కలలో ఆరోగ్యంతో ప్రకాశిస్తుంటాడు. (మలాకీ 4:2) ఈ దూత ముఖమేకాదు పాదములుకూడ “అగ్ని స్తంభములవలె” మహిమతో మెరుస్తున్నాయి. యెహోవా ఆయనకు “పరలోకమందును భూలోకమందును . . . సర్వాధికారము” యివ్వడమే ఆయనకున్న స్థిరమైన స్థానము.—మత్తయి 28:18; ప్రకటన 1:14, 15.

5. బలిష్ఠుడైన దూత చేతిలో యోహాను ఏం చూశాడు?

5 యోహానింకా యిలా గమనిస్తున్నాడు: “ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమిమీదను మోపెను.” (ప్రకటన 10:2) మరొక గ్రంథమా? అవును, అయితే యిప్పుడిది ముద్రింపబడలేదు. యోహానుతోపాటు మనం త్వరలో గగుర్పాటు కల్గించే విప్పబడు వివరాలను చూడవచ్చును. అయినా, మొదట మనకు రానైయున్న వాటినిగూర్చిన సన్నివేశం యివ్వబడింది.

6. (ఎ) యేసు పాదాలు భూమిమీదను, సముద్రంమీదను ఉండడమెందుకు తగియున్నది? (బి) కీర్తన 8:5-8 ఎప్పుడు సంపూర్తిగా నెరవేరింది?

6 మనం మరల యేసునుగూర్చిన వర్ణన దగ్గరికి వెళ్దాం. ఆయన అగ్నివంటి పాదములు భూమి మీద సముద్రము మీద ఉన్నాయి, వాటిపై యిప్పుడాయన సంపూర్ణాధికారం కల్గివున్నాడు. ఇది ప్రవచనార్థక కీర్తనలో చెప్పబడినలాగే ఉన్నది: “దేవునికంటె వానిని [యేసును] కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు. నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు. గొఱ్ఱెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవిమృగములను ఆకాశపక్షులను సముద్రమత్స్యములను సముద్రమార్గములో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు [యెహోవా] ఉంచియున్నావు.” (కీర్తన 8:5-8; హెబ్రీయులు 2:5-9 కూడ చూడండి.) యేసు దేవునిరాజ్యానికి రాజైనప్పుడు, అంత్యకాలం ఆరంభమైనప్పుడు అనగా 1914 లో యీ కీర్తన పూర్తిగా నెరవేరింది. ఆ విధంగా, యోహాను యిక్కడ చూసేదంతా ఆ సంవత్సరంనుండి వర్తిస్తుంది.—కీర్తన 110:1-6; అపొస్తలుల కార్యములు 2:34-36; దానియేలు 12:4.

ఏడు ఉరుములు

7. బలిష్ఠుడైన దూత ఎలా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, ఆయన కేక ప్రాముఖ్యతేమిటి?

7 బలిష్ఠుడైన ఈ దూతనుగూర్చి యోహాను ఆలోచనను ఆ దూతే స్వయంగా భంగపర్చాడు: “సింహము గర్జించునట్లు గొప్పశబ్దముతో [ఆ దూత] ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.” (ప్రకటన 10:3) అటువంటి శబ్దం యోహాను అవధానాన్ని మళ్లించి, యేసు నిజంగా “యూదా కొదమసింహము” అని స్థిరపరుస్తుంది. (ప్రకటన 5:5) యెహోవాకూడ కొన్నిసార్లు “గర్జించి”నట్లు యోహానుకు తెలుసు. యెహోవా ప్రవచనార్థకంగా గర్జించడమనేది ఆత్మీయ ఇశ్రాయేలీయులు మరల సమకూర్చబడే పనినిగూర్చి, మరియు నాశనకరమగు “యెహోవా దినము” వస్తుందని ప్రకటిస్తుంది. (హోషేయ 11:10; యోవేలు 3:14, 16; ఆమోసు 1:2; 3:7, 8) గనుక, స్పష్టంగా యీ బలిష్ఠుడైన దూత చేసిన సింహంవంటి గర్జన భూమికి, సముద్రానికి అటువంటి గొప్పసంఘటనలు జరుగుతాయని ముందుగా సూచిస్తుంది. ఆ ఏడు ఉరుములు మాట్లాడాలనే అవసరతను చూపిస్తుంది.

8. ‘ఏడు ఉరుములు’ ఏమిటి?

8 ఇంతకుమునుపు యెహోవా సింహాసనము నుండివచ్చిన ఉరుములను యోహాను విన్నాడు. (ప్రకటన 4:5) దావీదు కాలంలో, నిజమైన ఉరుమును కొన్నిసార్లు “యెహోవా స్వరము” అని అభివర్ణించేవారు. (కీర్తన 29:3) యేసు భూపరిచర్య కాలంలో యెహోవా తన నామమును మహిమ పరచుకొనడానికి తన సంకల్పాన్ని బహిరంగంగా ప్రకటించినప్పుడు అది అనేకులకు ఉరుమువలెనే ఉండెను. (యోహాను 12:28, 29) కావున, ‘ఆ ఏడు ఉరుముల స్వరములు’ తన సంకల్పాన్ని తెలియజేసే యెహోవా స్వంత మాటలని మనమొక నిర్ణయానికి రావడం సమంజసమే. “ఏడు” ఉరుములు అనే సంఖ్య వాస్తవంగా యోహాను విన్నదేదో అది సంపూర్ణంగా విన్నాడని తెల్పుతుంది.

9. పరలోకంనుండి వచ్చిన స్వరం ఏమని ఆజ్ఞాపించింది?

9 అయితే వినండి! మరో స్వరం వినబడుతుంది. అది యోహానును ఆశ్చర్యపర్చే ఆజ్ఞను జారీచేస్తుంది: “ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా—ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము; వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.” (ప్రకటన 10:4) ప్రచురణ విషయంలో యెహోవా సంకల్పం ఏమిటో ఆయన బయల్పర్చాడు. యోహాను తరగతి యీనాడు ఆశతో ఎదురు చూస్తున్నట్లే, యోహాను కూడ ఆ ఉరుముల వర్తమానాల్ని విని వాటిని వ్రాయాలని ఆదుర్దా కల్గియుండి ఉంటాడు. అటువంటి వర్తమానాలు యెహోవా నియమిత కాలంలో మాత్రమే బయల్పరచ బడతాయి.—లూకా 12:42: దానియేలు 12:8, 9 కూడ చూడండి.

పరిశుద్ధ మర్మము ముగింపు

10. బలిష్ఠుడైన దూత ఎవరిమీద ఒట్టుపెడతాడు, మరియు ఏ ప్రకటన చేస్తాడు?

10 ఈ మధ్యలో యెహోవా యోహానుకు మరోపని అప్పగించాడు. ఆ ఏడు ఉరుములు పలికిన తర్వాత, బలిష్ఠుడైన దూత మరల యిలా మాట్లాడుతున్నాడు: “మరియు సముద్రము మీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి—పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని—ఇక ఆలస్యముండదని చెప్పెను.” (ప్రకటన 10:5, 6) ఆ బలిష్ఠుడైన దూత ఎవరిమీద ఒట్టుపెట్టుకున్నాడు? మహిమనొందిన యేసు తనమీదగాక భూమ్యాకాశములను సృజించిన అమర్త్యుడు, సమస్తానికి అధిపతియైన యెహోవా మీదనే ఒట్టుపెట్టుకున్నాడు. (యెషయా 45:12, 18) దేవుని పక్షంగా యిక ఆలస్యం జరగదని ఈ ప్రమాణంతో ఆ దూత యోహానుకు అభయమిస్తున్నాడు.

11, 12. (ఎ) “ఇక ఆలస్యముండదు” అంటే అర్థమేమిటి? (బి) ఏది సమాప్తమౌతుంది?

11 ఇక్కడ “ఆలస్యం” అని అనువదించబడిన గ్రీకుపదం క్రోనోస్‌, అంటే అక్షరార్థంగా “సమయం” అని అర్థం. అందుకే కొందరు యీ ప్రకటనను యిలా అనువదించాలని అనుకున్నారు: మనకు తెలిసినట్టు సమయం గతిస్తుంది గనుక “ఇక సమయం లేదు,” అన్నట్లు వారి అర్థం. అయితే ఇక్కడ క్రోనోస్‌ అనేపదం కచ్చితమైన ఉపపదం లేకుండ ఉపయోగించబడింది. గనుక అది సాధారణ సమయమని అర్థంకాదు, గానీ, “ఒక సమయం” లేక “ఒక దీర్ఘకాలం” అని అర్థం. మరోమాటలో చెప్పాలంటే, యెహోవా వైపునుండి యిక ఎటువంటి కాలయాపన ఉండదు. క్రోనోస్‌ నుండి తీసుకోబడిన ఒక గ్రీకు క్రియాపదం హెబ్రీయులు 10:37 నందు కూడ ఉపయోగించ బడింది, అక్కడ పౌలు హబక్కూకు 2:3, 4లను, “వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును,” అని ఎత్తి వ్రాస్తున్నాడు.

12 “ఇక ఆలస్యముండదు”—ఈ మాటలు వృద్ధులౌతున్న యోహాను తరగతికి యీనాడు ఎలా ఉన్నాయ్‌! ఏ విషయంలో ఇక ఆలస్యముండదు? యోహాను మనకిలా చెబుతున్నాడు: “యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.” (ప్రకటన 10:7) ఆయన పరిశుద్ధ మర్మము గొప్ప విజయోత్సాహంతో దాని మహిమాన్విత ముగింపుకు తెచ్చే యెహోవా సమయమిదే!

13. దేవుని పరిశుద్ధ మర్మము ఏమై యున్నది?

13 పరిశుద్ధ మర్మమంటే ఏమిటి? అందులో ఏదెను తోటలో మొదట వాగ్దానం చేయబడిన సంతానం యిమిడివుంది, అది ప్రథమంగా, యేసుక్రీస్తని రుజువైంది. (ఆదికాండము 3:15; 1 తిమోతి 3:16) అందులో ఆ సంతానాన్ని తెచ్చే స్త్రీని గుర్తించడం కూడవుంది. (యెషయా 54:1; గలతీయులు 4:26-28) ఇంకా, అందులో ఆ సంతానములోని రెండో స్థానంలోవుండే సభ్యులున్నారు, ఆ సంతానం పాలించే రాజ్యమున్నది. (లూకా 8:10; ఎఫెసీయులు 3:3-9; కొలొస్సయులు 1:26, 27; 2:2; ప్రకటన 1:5, 6) అంత్యకాలంలో సాటిలేని యీ పరలోక రాజ్యాన్ని గూర్చిన సువార్త భూమియంతట ప్రకటింపబడాలి.—మత్తయి 24:14.

14. మూడవ శ్రమ ఎందుకు దేవుని రాజ్యంతో ముడిపెట్టబడింది?

14 నిశ్చయంగా, ఇది అత్యుత్తమ సువార్త. అయిననూ, ప్రకటన 11:14, 15 నందు, మూడవ శ్రమ యీ రాజ్యంతో ముడిపెట్టబడింది. ఎందుకు? సాతాను లోకాన్ని కోరుకునేవారికి, దేవుని పరిశుద్ధ మర్మము సమాప్తమైందని ప్రకటించడం—అంటే దేవుని మెస్సీయ రాజ్యం వచ్చిందనే సువార్త—శ్రమకల్గించే వార్తే. (2 కొరింథీయులు 2:16 పోల్చండి.) వారెంతో ప్రియంగా ప్రేమించే లోకవిధానానికి నాశనం సమీపించిందని అర్థం. అటువంటి అశుభసూచకమగు తుపాను హెచ్చరికలు కల్గియున్న ఆ ఉరుముల స్వరములు, యెహోవా ఉగ్రతదినము సమీపమయ్యేకొలది యింకా బిగ్గరగాను స్పష్టంగాను వినబడుతున్నవి.—జెఫన్యా 1:14-18.

విప్పబడిన గ్రంథం

15. పరలోకమునుండి వచ్చిన స్వరం, బలిష్ఠుడైనదూత యోహానుకు ఏమని చెబుతున్నారు, మరి యోహానుపై దాని ప్రభావమేమిటి?

15 ఈ ఏడవ బూర ఊదబడుటకును, దేవుని పరిశుద్ధ మర్మం సమాప్తమగుటకు వేచిచూస్తున్న యోహానుకు మరోపని అప్పగించబడింది: “అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు—నీవు వెళ్లి సముద్రము మీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్లి—ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన—దాని తీసికొని తినివేయుము, అది నీకడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నానోటికి తేనెవలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడువారు—నీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారిని గూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.”—ప్రకటన 10:8-11.

16. (ఎ) యెహెజ్కేలు ఎలా యోహానువంటి అనుభవాన్ని పొందాడు? (బి) ఆ చిన్నపుస్తకమెందుకు యోహానుకు తియ్యగా ఉండెను, కాని జీర్ణించుకోవడాని కెందుకది చేదుగా ఉండెను?

16 యోహాను అనుభవం, ప్రవక్తయైన యెహెజ్కేలు బబులోను దేశంలో బందీగానున్నప్పుడు ఆయన పొందినలాంటిదే. ఆయన కూడ తననోటికి తియ్యగా ఉండే గ్రంథాన్ని తినాలని ఆజ్ఞాపించబడ్డాడు. అయితే దానితో ఆయన కడుపునిండినప్పుడు ఆయన తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు జనాంగానికి చేదైన విషయాలను చెప్పవలసివచ్చింది. (యెహెజ్కేలు 2:8–3:15) మహిమనొందిన యేసుక్రీస్తు యోహానుకిస్తున్న విప్పబడినగ్రంథం అలాగే దైవసందేశమే. యోహాను “ప్రజలనుగూర్చియు, జనములను గూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారిని గూర్చియు అనేకమంది రాజులను గూర్చియు” ప్రకటించ వలసియున్నది. ఈ గ్రంథాన్ని తినాలంటే అది తియ్యగానేవుంది, ఎందుకంటే అది దైవికమూలం నుండి వచ్చింది. (కీర్తన 119:103; యిర్మీయా 15:15, 16 పోల్చండి.) అయితే ఆయనదాన్ని జీర్ణించుకోలేడు కారణమేమంటే—యెహెజ్కేలు మాదిరే—తిరుగుబాటు మానవులకది చేదుసంగతులను ప్రవచిస్తుంది.—కీర్తన 145:20.

17. (ఎ) “మరల” ప్రవచించాలని యోహానుకు చెప్పినదెవరు, దానర్థమేమిటి? (బి) యోహాను చూచిన యీ దర్శనమెప్పుడు నెరవేరనైయుండెను?

17 మరల ప్రవచింపవలెనని యోహాను చెప్పేది నిశ్చయంగా యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తే. యోహాను పత్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పటికిని, అంతవరకు ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సమాచారం ద్వారా ఆయన ప్రజలు, జనములు, ఆ యా భాషలు మాటలాడువారు, రాజులను గూర్చి అప్పటికే ప్రవచించాడు. “మరల” అనే మాటకు ప్రకటనలోని మిగిలిన సమాచారమును వ్రాసి, ప్రచురించాలని అర్థం. అయితే జ్ఞాపకముంచుకోండి, యోహాను యిక్కడ ప్రవచనార్థక దర్శనంలో నిజంగా పాల్గొంటున్నాడు. ఆయన వ్రాసేదంతా నిజానికి, బలిష్ఠుడైన దూత భూమి, సముద్రము మీద తన పాదము మోపినప్పుడు అంటే 1914 తర్వాత నెరవేరనైయున్న ప్రవచనమే. మరి, యినాడు యోహాను తరగతికి, యీ నాటకీయ దృష్టాంతం యొక్క భావమేమిటి?

ఈనాటి చిన్న పుస్తకము

18. ప్రభువు దినారంభంలో, యోహాను తరగతి ప్రకటన గ్రంథం యెడల ఎటువంటి ఆసక్తిని కనబరచారు?

18 యోహాను చూచేది, ప్రభువుదినపు ప్రారంభంలో యోహాను తరగతివారు పొందే అనుభవాన్నే సూచిస్తుంది. ఏడు ఉరుముల భావంతోపాటు యెహోవా సంకల్పాలను వారు గ్రహించడం అప్పుడు అసంపూర్తిగానే ఉండెను. అయిననూ, ప్రకటన విషయంలో వారికి ఎంతో శ్రద్ధ ఉండేది, మరి చార్లస్‌ టేజ్‌ రస్సల్‌ తన జీవితకాలంలో అందులోని అనేక భాగాలపై వ్యాఖ్యానం వ్రాశాడు. ఆయన 1916 లో మరణించిన అనంతరం ఆయన వ్రాసిన అనేక పుస్తకాలను సేకరించి ది ఫినిష్డ్‌ మిస్టరీ అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురింపబడింది. అయిననూ, కొంతకాలానికి యీ పుస్తకం ప్రకటన గ్రంథానికి అసంతృప్తికరమైన వివరణయని రుజువైంది. క్రీస్తు సహోదరులలో శేషించబడినవారు, ఆ ప్రేరేపణ సమాచారం యొక్క సరియైన గ్రహింపుకొరకు, దర్శనాలు నెరవేరుట కారంభించేవరకు, దీర్ఘకాలం వేచియుండ వలసివచ్చింది.

19. (ఎ) ఏడు ఉరుముల స్వరములు పూర్తిగా ప్రచురింపబడక ముందే యెహోవా దేవుడు యోహాను తరగతిని ఎలా ఉపయోగించుకుంటున్నాడు? (బి) యోహాను తరగతికి ఎప్పుడు విప్పబడిన చిన్నపుస్తకం యివ్వబడింది, వారికి దీని అర్థమేమిటి?

19 అయినా, యోహానువలె, ఆ ఏడు ఉరుముల స్వరములు పూర్తిగా ప్రచురింపబడక ముందే, వారు యెహోవాచే ఉపయోగించబడ్డారు. వారు 1914కంటే 40 ఏండ్లు ముందే ఎంతో ఆసక్తితో ప్రకటించారు, మరియు మొదటి ప్రపంచయుద్ధ కాలంలో వారు సేవలో చురుకుగా ఉండడానికి పోరాడారు. ప్రభువు వచ్చినప్పుడు, తనయింటివారికి తగినవేళ ఆహారాన్ని పంచిపెడుతున్నట్లుగా వారు రుజువుచేసుకున్నారు. (మత్తయి 24:45-47) ఆ విధంగా, 1919 లో, వారికే ఆ చిన్నపుస్తకం యివ్వబడింది—అంటే, మానవులకు ప్రకటించడానికి విప్పబడిన సమాచార మివ్వబడింది. యెహెజ్కేలువలె, నిజానికి దేవున్ని సేవించకుండానే ఆయనను సేవిస్తున్నామని చెప్పుకునే భ్రష్టమైన సంస్థ—క్రైస్తవమత సామ్రాజ్యం—కొరకు వారియొద్ద సమాచారమున్నది. యోహానువలె వారు “ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆయా భాషలు మాటలాడువారిని గూర్చియు, అనేకమంది రాజులను గూర్చియు” యింకా కొంత ప్రకటించ వలసియుండెను.

20. యోహాను ఆ పుస్తకాన్ని తినడమంటే అర్థమేమిటి?

20 యోహాను ఆ పుస్తకాన్ని తినడమంటే యేసు సహోదరులు యీ పనిచేయడానికి అంగీకరించారని సూచిస్తుంది. అది వారిలో ఒకభాగమైంది, అంటే దేవుని ప్రేరేపిత వాక్యంలోని యీభాగాన్ని జీర్ణింపచేసుకొని, దానినుండి పోషకపదార్థములు పొందుచున్నారు. అయితే వారు ప్రకటించవలసిన సమాచారంలో, మానవులలో అనేకులకు మింగుడుపడని యెహోవా తీర్పులు ఉండెను. వాస్తవానికి, ప్రకటన 8వ అధ్యాయంలో ప్రవచింపబడిన తెగుళ్లు అందులో ఉండెను. అయితే యీ యథార్థ క్రైస్తవులు ఆ తీర్పులనుగూర్చి తెలిసికోవడానికి, వాటిని ప్రకటించడానికి యెహోవా వారిని మరల ఉపయోగించు కుంటున్నాడని గ్రహించడానికి అది తియ్యగా వుండెను.—కీర్తన 19:9, 10.

21. (ఎ) ఆ చిన్నపుస్తకంలోని సమాచారం గొప్పసమూహానికి కూడ ఎలా తియ్యగా ఉంది? (బి) మేకలాంటివారికి ఆ సువారైందుకు దుర్వార్తవుతుంది?

21 తగినకాలంలో, యిది క్రైస్తవమత సామ్రాజ్యంలో జరిగే అసహ్యకరమైన వాటిని చూచి దుఃఖించేవారికి అనగా, “ప్రతి జనములో నుండియు ప్రతివంశములో నుండియు, ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చిన . . . గొప్పసమూహము”నకు కూడ యీ సమాచారం తియ్యగానుండెను. (ప్రకటన 7:9; యెహెజ్కేలు 9:4) వీరుకూడ గొఱ్ఱెలాంటి క్రైస్తవులకొరకు యెహోవా చేసే అద్భుతమైన ఏర్పాట్లను వివరించడానికి తియ్యని, కృపగల మాటలనుపయోగిస్తూ, సువార్తను ఉత్సాహపూరితంగా ప్రకటిస్తున్నారు. (కీర్తన 37:11, 29; కొలొస్సయులు 4:6) అయితే, మేకలాంటి మనుష్యులకు యిది దుర్వార్తయే. ఎందుకు? వారు నమ్ముకునే విధానం—బహుశ వారికి కొంత తాత్కాలిక తృప్తిని తెచ్చియున్న విధానం—పోవాలి. సువార్త వారికి నాశనాన్నే ప్రకటిస్తుంది.—మత్తయి 25:31-34, 41, 46; ద్వితీయోపదేశకాండము 28:15; 2 కొరింథీయులు 2:15, 16 పోల్చండి.

[160వ పేజీలోని చిత్రం]

యోహాను తరగతివారు, వారి సహవాసులు మానవులందరికి తీపి-చేదు సమాచారాన్ని ప్రకటిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి