మానవుని యుద్ధాల్లో మతం పాత్ర
“ఏదోక రకమైన మతం లేకుండా ప్రజలు ఎన్నడూ ఉండలేదు” అని ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా (1970 ఎడిషన్) అంటోంది. అయితే, విల్, ఎరిల్ డ్యురాంట్ అనే చరిత్రకారులు యిలా వ్రాశారు: “చరిత్ర స్థిరాంకములలో యుద్ధం ఒకటి.” యుద్ధం, మతం, అనే ఈ రెండు స్థిరాంకాలు ఏ విధంగానైనా ముడిపడి వున్నాయా?
వాస్తవానికి, చరిత్రంతటిలో, యుద్ధం మతం విడదీయరానివిగా నిలిచాయి. చరిత్రలోని ప్రప్రధమ ప్రపంచ ఆధిపత్యంలో ఒకటైన ఐగుప్తును గూర్చి ఏన్షియంట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో లైనెల్ కేసయన్ యిలా వివరించాడు: “ప్రతి యుద్ధంలో కల్గిన విజయానికి దేవతలకు ధనరాసులు చెల్లించేవారు; అదికాక, అధిక ధనార్జనా వాంఛతో విదేశాలను జయించాలని ఫరోలవలె మతగురువులు కూడ ఆశపడ్డారు.”
అదే విధంగా, మరో తొలి ప్రపంచ ఆధిపత్యమైన అస్సిరియా గూర్చి మత నాయకుడైన డబ్ల్యు. బి. రైట్ యిలా అన్నాడు: “యుద్ధం చేయడమే ఆ దేశం పని. మరి మతగురువులు నిరంతరం యుద్ధాన్ని ప్రేరేపించేవారు. యుద్ధానంతరం కొల్లగొట్టిన సొమ్ముతోనే ముఖ్యంగా వారు పోషించబడ్డారు.”
“క్రూరమైన ఐరోపా” అని తను వర్ణించిన దాన్ని గూర్చి జెరాల్డ్ సైమన్స్ యిలా వ్రాశాడు: “వారి సమాజం చాలా సామాన్యంగా వుండేది. వారు ఒక ప్రత్యేకమైన పనికొరకు సంస్థీకరించబడ్డారు, అదేమంటే యుద్ధం రేపడం.” మతం కూడా దానిలో పాలుపంచుకొంది. “దయ్యాలకు సంబంధించిన ఖడ్గములు లేదా దేవుని ప్రతినిధుల్లా పనిచేసే ఖడ్గాలను గూర్చి ఎన్నో గాథలు చెప్తున్నవి,” అని సైమన్ పేర్కొన్నాడు.
అయినా, ఎంతో గొప్పగా సంస్కారవంతమైందనుకున్న రోమా సామ్రాజ్యంలో పరిస్థితి కూడా అలాగే వుండేది. “రోమీయులు యుద్ధ మనస్సుతో పెరిగారు,” అని ఇంపీరియల్ రోమ్ అనే పుస్తకంలో మోసెస్ హడెస్ వివరించాడు. తమ దేవుళ్ల చిహ్నాలున్న ధ్వజములను వారు యుద్ధ భూమికి తీసుకెళ్లేవారు. “అక్కడ శత్రు సైన్య పంక్తిలోకి ధ్వజాన్ని విసరమని ఒక సైన్యాధికారి ఆదేశించడం సహజమే. దాడిచేయడానికి గల తన సైనికుల ఆసక్తిని యింకాస్త రేకెత్తించడానికి, ఈ భూమిపై వున్న వాటిలో అతి పవిత్రమైనదని వారు అనుకున్న ఆ ధ్వజాన్ని తిరిగి పొందాలని వారిని ఉత్తేజపరిచేవాడు.”
యుద్ధము, నామకార్ధ క్రైస్తవులు
ప్రపంచ రంగస్థలంపై క్రైస్తవ మతసామ్రాజ్య ప్రత్యక్షత, పరిస్థితిని మార్చలేదు. వాస్తవానికి, యాన్ ఫ్రీమాన్టెల్ ఏజ్ ఆఫ్ ఫేయిత్ అనే పుస్తకంలో యిలా వ్రాసింది: “ఇంతవరకు మానవులు చేసిన సమస్త యుద్ధాల్లో, విశ్వాసంకొరకు చేసిన యుద్ధాలలో పోరాడినంత ఆసక్తిగా మరే యుద్ధాలలోను పోరాడలేదు. ఈ ‘పవిత్ర యుద్ధా’ల్లో, మధ్యయుగంలో జరిగిన క్రైస్తవ ధర్మయుద్ధాలంత రక్తసిక్తమైనవి, దీర్ఘమైనవి వేరే లేవు.”
విచిత్ర మేమంటే, ఈనాటికీ స్వల్ప మార్పే వచ్చింది. “మతానికై కొట్టుకోవడం, మరణించడం, ఉధృతంగా పట్టుదలతో కొనసాగుతూనే వుంది” అని టైమ్ పత్రిక నివేదించింది. “నిరర్ధకమైన శాశ్వత చలనం లేనట్లు అల్స్టర్ దేశ ప్రొటస్టెంట్లు, రోమన్ కాథోలిక్కులు ఒకరి నొకరు చంపుకోవడంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మత, రాజకీయ, సమాజిక వివాదాల్లో వచ్చే మార్పులను అరబ్బులు ఇశ్రాయేలీయులు ఉద్రిక్తతతో వీక్షిస్తున్నారు.” అంతే కాకుండా, యుగోస్లావియా, ఆసియా దేశాలలో జాతి మత వైషమ్యాలు దారుణమైన రక్తపాతానికి కారణమయ్యాయి.
నమ్మశక్యం కాని విధంగా, నామకార్థ క్రైస్తవులు కొందరు తమ విశ్వాసానికి చెందిన వారి మీదనే యుద్ధానికి వెళ్తుంటారు. ఆ విధంగా, యుద్ధభూమిలో కాథోలిక్కులే కాథోలిక్కులను చంపుకుంటారు. కాథోలిక్ చరిత్రకారుడైన ఇ. ఐ. వాట్కిన్ బాహాటంగా యిలా ఒప్పుకున్నాడు: “దీన్ని ఒప్పుకోవడం చాలా బాధాకరమైనప్పటికీ, తమ ప్రభుత్వం చేసిన ప్రతి యుద్ధానికి బిషప్పులు తమ మద్దతును ఎడతెగక అందించారనే చారిత్రాత్మక సత్యాన్ని కాదనలేము లేదా దగా, మోసం పేరుతో దాన్ని త్రోసిపుచ్చలేము. ఒక్క యుద్ధమైనా అనుచితమని మతగురువులు ఖండించినట్లు నాకింతవరకూ తెలియదు. . . . అధికారిక సిద్ధాంతమేమైనప్పటికీ, ఆచరణలోకొస్తే మాత్రం ‘ఎప్పుడైనా నా దేశమే సరైంది’ అనే ధోరణినే అనేక కాథోలిక్ బిషప్పులు పాటించారు.”
అయినప్పటికీ, అది కేవలం కాథోలిక్ల సూక్తే కాదు. కెనడా, వాంకోవర్ పట్టణపు సన్ అనే పత్రిక సంపాదకీయం యిలా పేర్కొంది: “ఈ జాతీయ విచ్ఛిన్నకర శక్తులనుండి ప్రొటెస్టెంటు సిద్ధాంతం ఏ విధంగా కూడా తప్పించుకోలేదు. చర్చి జెండాను అనుసరించడమే పేరు గాంచిన ప్రతి మతం యొక్క బలహీనత కావచ్చు. . . . దేవుడు ఏ పక్షం వహించలేదు అని చెప్పుకొనే యుద్ధమేదైనా జరిగిందా?”
ఒక్కటైనా లేదు అన్నది స్పష్టం! ప్రొటెస్టెంటు మత నాయకుడైన హారీ ఎమర్సన్ ఫోస్డిక్ యిలా అన్నాడు: “మా చర్చీలల్లో కూడా మేము యుద్ధ ధ్వజాలను ఎగరేశాము. . . . మా నోట ఒక ప్రక్కనుండి సమాధానమునకు అధిపతిని కొనియాడాము, మరో ప్రక్కనుండి యుద్ధాన్ని మహిమపరిచాము.” అంతేకాక, క్రైస్తవులు “తమతోటి క్రైస్తవులపై యుద్ధం రేపడానికి” ఎన్నడూ కూడా “పాపభీతులు కాలేదని” కమ్యూనిష్టు వాడైన మైక్ రోయికొ అన్నాడు. “ఒకవేళ వారు అలాంటి భావనను కలిగి వుండివుంటే, ఐరోపాలో రేగిన అతి ఉదృత యుద్ధాలు జరగక పోయేవి” అని ఆయన వర్ణించాడు. వీటిలో గమనార్హమైనదేమంటే, జర్మనీలో ప్రొటెస్టెంట్లు, కాథోలిక్కుల మధ్య జరిగిన ముప్పై ఏళ్ల యుద్ధమే
ఈ వాస్తవాలన్నీ చాలా స్పష్టంగా వున్నాయి. మతం ఒక మద్దతుదారిణిగా పనిచేసింది, అంతేకాక కొన్నిసార్లు అదే యుద్ధాలను రేపడానికి కీలక పాత్రను వహించింది. ఆ విధంగా, అనేకులు ఈ ప్రశ్నలను పర్యాలోచించారు: యుద్ధ సమయంలో దేవుడు ఒకరి పక్షం వహిస్తాడా? దేశాలు పోరాడుకుంటున్నప్పుడు దేవుడు ఒకరి పక్షం వహిస్తాడా? యుద్ధమే లేని కాలం వస్తుందా?
[3వ పేజీలోని చిత్రం]
రోమా సైనికులు, శత్రు సైన్యపంక్తుల్లోకి వారి దేవుని చిహ్నమున్న ధ్వజములను విసిరేవారు