ప్రపంచ పరిశీలన
సెల్యులర్ ఫోన్ విపత్తు
సెల్యులర్ ఫోన్ల నుండి వెలువడే రేడియో తరంగాలు ఆసుపత్రి వైద్య పరికరాలకు తీవ్ర సమస్యలు కలిగించగలవని జపాన్లో ఇటీవల నిర్వహించబడిన ఒక అధ్యయనం ధృవీకరించింది. “ఒక పరీక్షలో, 45 సెంటీమీటర్ల దూరంలో ఒక సెల్యులర్ ఫోన్ను ఉపయోగించినప్పుడు ఒక హార్ట్-లంగ్ పరికరం ఆగిపోయింది” అని అసాహి ఈవినింగ్ న్యూస్ తెలియజేస్తుంది. లిక్విడ్ ట్రాన్స్ఫూషన్ పంపులు, క్యాన్సర్ను ఎదుర్కొనే మందులను సరఫరా చేసే పంపులు వంటి పరికరాలకు 75 సెంటీమీటర్ల దూరంలో సెల్యులర్ ఫోన్ను ఉపయోగించినప్పుడు, వాటి అలారమ్లు మ్రోగాయని కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఎక్సరే మెషీన్లు, స్వరకంపన మాపకాలు కూడా ప్రభావితమయ్యాయి. ఈ ఆవిష్కరణల దృష్ట్యా, ఆపరేషన్లు చేసే గదుల్లోకి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలోకి సెల్యులర్ ఫోన్లను తీసుకు వెళ్లవద్దని తపాలా మరియు టెలికమ్యూనికేషన్ల శాఖ సిఫారసు చేస్తోంది. ఒక సర్వే ప్రకారం, టోక్యోలోని దాదాపు 25 వైద్య సంస్థలు సెల్యులర్ ఫోన్ల వాడకాన్ని ఇప్పటికే క్రమబద్ధం చేశాయి, వాటిలో 12 సంస్థలు సెల్యులర్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి.
సాధారణ పెరుగుదల జరిగేలా చూడడం
ఒక బాలుని పెరుగుదల కేవలం వంశపారంపర్యం మూలంగానే కాకుండా ఇతర విషయాలనుబట్టి కూడా ప్రభావితం చేయబడుతుందని, జొర్నల్ డో బ్రేసిల్ నందలి ఒక నివేదిక తెలియజేస్తుంది. “మంచి పోషకాహారం మూలంగా సరైన పెరుగుదల తప్పకుండా ఉంటుంది” అని చెబుతూ, మధ్య తరగతి కుటుంబాల మధ్య కుపోషణ సర్వసాధారణమని ఆ వార్తాపత్రిక జత చేస్తోంది. “పెరుగుదలకు మరో ప్రాథమిక కారకం క్రమమైన వ్యాయామం” అని ఎండోక్రైనాలజీ ప్రొఫెసరైన అమెల్యో గోడీ మాటోస్ తెలియజేశాడు. “బిడ్డ నిద్రిస్తున్నప్పుడే పెరుగుదల హార్మోను విడుదలౌతుంది గనుక గంటలకొలది విశ్రాంతిదాయకమైన నిద్ర కూడా తప్పనిసరి” అని ఆయన చెప్పాడు. అలాగే భావోద్రేకపరమైన సమస్యలు బిడ్డ ఎదుగుదలను తగ్గించవచ్చు. ఎండోక్రైనాలజిస్ట్ వాల్మిర్ కోటెన్యూ ప్రకారం, “గంటల తరబడి ఏకధాటిగా టీవీ చూడడం, ప్రాముఖ్యంగా దౌర్జన్యపూరితమైన సినిమాలు చూడడం బిడ్డ నిద్రకు హానికరం కాగలదు, ఆరోగ్యకరమైన ఎదుగుదలను అది ఆటంకపరచవచ్చు.”
ఆశావాదం ఆరోగ్యకరమైనది కాగలదు
నిరాశావాదం మానసిక మరియు శారీరక అనారోగ్యాన్ని పెంచుతుంది, అయితే ఆశావాదం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది అనే నమ్మకాన్ని ఫిన్లాండ్లో ఇటీవల నిర్వహించబడిన ఒక అధ్యయనం ధృవీకరించింది. 42 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సుగల దాదాపు 2,500 మంది పురుషులను 4 నుండి 10 సంవత్సరాల కాలంపాటు గమనించడం జరిగింది. సైన్స్ న్యూస్ అనే పత్రిక ప్రకారం, “తక్కువ లేక అసలు నిరాశాభావం లేనట్లు నివేదించబడిన వారికంటే ఒక మోస్తరు నుండి అధిక నిరాశాభావం ఉన్న” పురుషులు “రెండు నుండి మూడు రెట్లు మరణించారని . . . రెండవ వర్గానికి చెందిన గుంపుకు క్యాన్సర్ కూడా సోకిందని, మరింత తరచుగా గుండెపోటుకు గురయ్యారని” శాస్త్రవేత్తలు నివేదించారు.
నన్లు కరాటే నేర్చుకుంటున్నారు
స్త్రీలపై జరుగుతున్న అత్యధిక దౌర్జన్యాన్నిబట్టి, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాధవరంలోగల సెయింట్ ఆన్నీస్ ప్రొవిన్సియేట్లో ఉండే కొంతమంది నన్లు కరాటే శిక్షణ పొందనారంభించారు. తాను కరాటే ఉపదేశకునిగా 24 సంవత్సరాలు శిక్షణ ఇచ్చిన ఇతర స్త్రీలందరిలోకి నన్లు ఎంతో బాగా నేర్చుకున్నారని అఖిల భారత ఇష్షిన్ర్యూ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడైన షీహాన్ హుస్సేయిని చెబుతున్నాడు. ‘దానికి కారణం, వారికున్న అంతర్గతమైన శక్తి మరియు క్రమశిక్షణ అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను’ అని ఆయన చెబుతున్నాడు. నన్లు ఉపయోగించడానికి నేర్పబడిన ఒక పరికరం సేన్ కో అని పిలువబడుతుంది. అది క్రీస్తు శిలువ మీద ఉన్న బొమ్మలా మలచబడి ఉంటుంది, “ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా దౌర్జన్యం చేసే వ్యక్తిని చంపడం కూడా సాధ్యమౌతుందని” హుస్సేయిని అంటున్నాడు.
పై విలువ
చాలామంది పాఠశాలలో నేర్చుకున్నట్లుగా పై అంటే ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు దాని వ్యాసముల నిష్పత్తి. పై యొక్క ఇంచుమించు విలువ అయిన 3.14159 వరకు ఎంతోమంది సంతృప్తికరంగా గుణించగలిగారు, కాని పై కచ్చితమైన సంఖ్య కాదు గనుక, పై యొక్క దశాంశానికి అంతం లేదు. 18వ శతాబ్దంలో, 100 దశాంశాల స్థానమంత కచ్చితమైన విలువ వరకు కనుగొనడం జరిగింది, 1973లో ఇద్దరు ఫ్రెంచి గణిత శాస్త్రవేత్తలు పది లక్షల దశాంశ స్థానాల వరకు సాధించగలిగారు. ఇప్పుడు, జపాన్నందలి టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన యాసుమాసా కానాడా కంప్యూటర్ ద్వారా 600 కోట్ల కంటే ఎక్కువ దశాంశాల విలువ వరకు గుణించగలిగాడు. “మనకు తెలిసిన విశ్వ వృత్తం యొక్క చుట్టుకొలతను గుణించడానికి కేవలం 39 దశాంశ స్థానాలు చాలునని, అయితే దానిలో హైడ్రోజన్ అణువు యొక్క వ్యాసార్థమంత తేడా ఉంటుంది” అని లండన్కు చెందిన ది టైమ్స్ తెలియజేస్తుంది గనుక ఆ సంఖ్యకు ఊహించదగిన ఉపయోగమేమి లేదు. “పై ఉంది గనుక” దానిని గుణించడం తనకు ఇష్టమని ప్రొఫెసర్ కానాడా చెబుతున్నాడు. కాని ఆయన ఫలితాన్ని వల్లించడానికి ప్రయత్నించకండి. “ఎక్కడా ఆపకుండా, ఒక క్షణానికి ఒక అంకెను లెక్కిస్తే దానికి దాదాపు 200 సంవత్సరాలు పడుతుంది” అని ది టైమ్స్ తెలియజేస్తుంది.
గేదె మశూచికం భారతదేశానికి వ్యాపించడం
‘మశూచికాన్ని కలిగించే వైరస్ గ్రూపుకే చెందిన వైరస్’ ద్వారా కలిగే గేదె మశూచికం పశ్చిమ భారతదేశానికి చెందిన బీడ్ జిల్లాలో ఉన్నట్లు కనుగొనబడిందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిస్తోంది. ఈ వ్యాధి మశూచికంకంటే హానికరమైనది కాకపోయినప్పటికీ, శాస్త్రవేత్తలు దాని వ్యాప్తి గురించి ఆందోళన చెందుతున్నారు. “ఆ వైరస్ను ఎంతో జాగ్రత్తగా గమనించాలి. అదెంత గంభీరమైనదో మనం చెప్పలేము” అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన డైరెక్టర్ డా. కల్యాణ్ బెనర్జీ చెబుతున్నాడు. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాపిస్తుందేమోనని ఎక్కువ ఆందోళనగా ఉంది. గేదె మశూచికం మనుష్యులకు సోకితే తీవ్ర జ్వరం, శోషరస గ్రంథుల్లో వాపు, శరీరంపై అత్యధికంగా మచ్చలు, సాధారణ బలహీనత కలుగుతాయి.