“అది నా తప్పు కాదు”
‘నన్ను క్షమించండి. అది నా తప్పే. పూర్తిగా నేనే బాధ్యున్ని!’ అని ఎవరైనా అనడం నేడు మీరు ఎంత తరచుగా వింటారు? అటువంటి నిర్మలమైన నిజాయితీ ఇక అరుదుగా వినిపిస్తుంది. నిజానికి, అనేక సందర్భాలలో తప్పు ఒప్పుకున్నప్పటికీ నిందను వేరొకరి మీదకు లేక తప్పు చేసిన వ్యక్తి ఏమాత్రం అదుపు చేయలేనివని చెప్పుకునే దుర్బల పరిస్థితుల మీదకు నెట్టివేయడానికి ప్రతి ప్రయత్నం చేయబడుతుంది.
కొంతమంది చివరికి తమ జన్యువులవైపు నిందాత్మకంగా వేలెత్తి చూపుతారు! కానీ అది సమంజసమేనా? ఎక్స్ప్లోడింగ్ ద జీన్ మిథ్ అనే పుస్తకం జన్యు పరిశోధనలోని కొన్ని విషయాల లక్ష్యాలను, ప్రభావాలను ప్రశ్నిస్తుంది. ఆస్ట్రేలియా విలేఖరి బిల్ డీన్ ఆ పుస్తకం సమీక్షలో ఆలోచించదగ్గ ఈ ముగింపును అందించాడు: “ఇటీవలనే సాంఘిక నియతివాదులు, ఎవరినీ కూడా వారి చర్యలకు జవాబుదారులను చేయకూడదనే తమ తత్వానికి తిరుగులేని ప్రమాణాన్ని సాధించారని నమ్మడం మొదలుపెట్టినట్లు కనబడుతుంది: ‘ఆయన ఆమె మెడను కోయకుండా ఉండలేకపోయాడు, యువరానర్—అది ఆయన జన్యువులలో ఉంది.’”
నిజంగా అంత క్రొత్త వైఖరేమీ కాదు
“నేను-కాదు” అనే తరం అని ఒక రచయిత పిలిచిన విధంగా ఈ తరం త్వరితగతిన అభివృద్ధి చెందుతుండగా, ఈ వైఖరి విస్తరిస్తున్నట్లు అన్పించవచ్చు. అయితే, “నిజానికి నిందించాల్సింది నన్ను కాదు” అనే సాకుతో నిందను ఇతరుల మీదికి నెట్టివేయడం మానవుని ఆది నుండే ఉనికిలో ఉంది అని నమోదిత చరిత్ర వెల్లడిస్తుంది. నిందను నెట్టివేయడంలో దేవుడు నిషేధించిన పండును తినడం అనే తమ మొదటి పాపం తరువాత ఆదాము హవ్వల ప్రతిచర్య గొప్ప ఉదాహరణ. అక్కడ జరిగిన సంభాషణను ఆదికాండములోని వృత్తాంతం దేవుడు మొదట మాట్లాడినట్లు చెబుతూ ఇలా నివేదిస్తుంది: “నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? . . . అందుకు ఆదాము—నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో—నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ—సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.”—ఆదికాండము 3:11-13.
అప్పటి నుండి మానవులు వివిధ రకాల నమ్మకాలను ప్రవేశపెట్టి, తమ చర్యలను గూర్చిన నిజమైన జవాబుదారీతనం నుండి విముక్తులను చేయగలిగే విలక్షణమైన సాకుల కొరకు వెదికారు. వీటిలో విధియందు ప్రాచీనుల నమ్మకం గమనార్హమైనది. కర్మయందు యథార్థమైన నమ్మకముంచిన ఒక బౌద్ధ స్త్రీ ఇలా అంది: “నాకేమాత్రం తెలియని దేనితో అయితే నేను పుట్టానో దాని వలన బాధలను అనుభవించడం నాకు సమంజసమనిపించలేదు అని నేను అనుకున్నాను. అది నా ప్రారబ్ధం అని దాన్ని నేను అంగీకరించవలసిందే.” జాన్ కల్విన్చే బోధించబడిన పూర్వనిర్ణీతం అనే సిద్ధాంతంచే పోషించబడిన క్రైస్తవమత సామ్రాజ్యంలో కూడా విధియందు నమ్మకం సర్వ సాధారణం. విషాదంలో ఉన్న బంధువులకు ఒక నిర్దిష్ట ప్రమాదం జరగడం దేవుని చిత్తం అని మతగురువులు తరచూ చెబుతారు. అప్పుడు కూడా, తమ జీవితాల్లో ఏ పొరపాటు జరిగినప్పటికీ కొంతమంది సదుద్దేశంగల క్రైస్తవులు సాతానును నిందిస్తారు.
చట్టబద్ధంగాను, సాంఘికంగాను ఆమోదించబడిన జవాబుదారీతనం లేని ప్రవర్తనను మనం ఇప్పుడు చూడడం ప్రారంభిస్తున్నాం. వ్యక్తి యొక్క పెరుగుతున్న హక్కులు, తరుగుతున్న బాధ్యతల యుగంలో మనం జీవిస్తున్నాము.
అనైతికత నుండి హత్య వరకూ ఉండే ప్రవర్తనలకు పట్టపగ్గాలు లేకుండా చేయగలదని కొంతమంది భావించే ఆరోపిత శాస్త్రీయ సాక్ష్యాన్ని మానవ ప్రవర్తనపై జరిపిన పరిశోధన అందించింది. ఆ వ్యక్తి మీదకు తప్ప వేరే దేనిమీదకైనా లేక ఎవరిమీదకైనా నిందను నెట్టివేయాలనే సమాజపు ఉత్సుకతకు ఇది ప్రతిబింబము.
మనకు ఇటువంటి ప్రశ్నలకు జవాబులు కావాలి: వాస్తవానికి విజ్ఞానశాస్త్రం కనుగొన్నది ఏమిటి? మానవ ప్రవర్తన కేవలం మన జన్యువుల ఆధారంగానే నిర్ధారించబడుతుందా? లేక అంతర్గత మరియు బాహ్య శక్తులు రెండూ మన ప్రవర్తనను నియంత్రిస్తాయా? సాక్ష్యాధారం నిజంగా ఏమి చూపుతుంది?