మనలను మృతులు చూడగలరా?
ఓ స్త్రీ తన భర్తను హత్యచేస్తుంది. ఏడు సంవత్సరాల తర్వాత ఆమె ఒక కలగని దాని వల్ల ఎంతో భయపడి, చనిపోయిన తన భర్త కోపానికి అది చిహ్నమని నమ్ముతుంది. అతని “ఆత్మను” శాంతింపజేసేందుకు అతని సమాధి మీద మద్యార్పణలను పోసేందుకు తన కూతురిని ఆమె పంపుతుంది.
ఆ అర్పణ అతన్ని చంపిన తన తల్లిది కనుక, తన తండ్రి ఆత్మతో ఏమని చెప్పాలో ఆ కూతురికి తెలియలేదు. చాటునుండి తన తమ్ముడు యిదంతా గమనిస్తాడు. ఆ అబ్బాయి ముందుకు వచ్చి, అతనూ అతని అక్క యిద్దరూ కలిసి తమ తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు సహాయపడమని తమ తండ్రికి ప్రార్థిస్తారు.
ఈ ఘట్టం 2,400 సంవత్సరాల క్రితం రాయబడిన ది లిబేషన్ బేరర్స్ అనే గ్రీకు నాటకంలోనిది. ప్రపంచంలోని కొన్ని భాగాల్లో, ప్రత్యేకంగా ఆఫ్రికాలో యిలాంటి అర్పణలు నేడు కూడా సమాధి వద్ద అర్పించబడుతున్నాయి.
ఉదాహరణకు, నైజీరియాలో నివసించే ఇబే అనుభవాన్ని పరిశీలించండి. మరణం వల్ల ముగ్గురు పిల్లలను కోల్పోయినప్పుడు, ఒక పారంపర్య స్థానిక మంత్రగాడు అతను సమీపిస్తాడు. మరణాలకు కారణం లేకపోలేదని ఇబేతో అతడు చెబుతాడు. ఆ కారణమేంటంటే, మరణించిన ఇబే తండ్రి తన అంత్యక్రియలు సరిగా జరిపించనందుకు ఆగ్రహించాడనేదే.
స్థానిక మంత్రగాని సలహా ప్రకారం, ఇబే ఓ మేకను అర్పించి, జిన్ ద్రాక్షారసాల అర్పణను తన తండ్రి సమాధిపైన పోస్తాడు. క్షమాపణను అర్థిస్తూ తన ప్రేమను ధృవపరుస్తూ ఒక ఆశీర్వాదాన్ని అర్థిస్తూ తన తండ్రి ఆత్మకు ఆయన ప్రార్థిస్తాడు.
తన తండ్రి తనను చూడగలడు, తాను చెప్పేది వినగలడనే విషయంలో ఇబేకి అసలు ఏ సందేహం లేదు. తన తండ్రి జీవం లేనివాడని నమ్మడంలేదు, అయితే మరణించినప్పుడు దృశ్యమైన లోకంనుండి అదృశ్యమైన లోకంలోకి ఆయన “తరలి” వెళ్లాడని ఇబే నమ్ముతున్నాడు. తన తండ్రి, రక్తమాంసాల లోకంనుండి పితరుల నివాసస్థానమైన ఆత్మలుండే లోకానికి వెళ్లాడని ఇబే నమ్ముతున్నాడు.
ఇబే యిలా సమర్థించుకున్నాడు: ‘నాన్నగారు ఈ లోకంలో లేకపోయినప్పటికీ, ఆయనకు నేనింకా జ్ఞాపకమున్నాను అంతేకాదు నా బాగోగుల్లో ఆయనకు శ్రద్ధ ఉంది. అంతేకాకుండ, ఆయన యిప్పుడు మరిన్ని శక్తులుగల ఒక ఆత్మ గనుక, భూమ్మీద ఓ మానవునిగా ఉన్నప్పటికంటే నాకు సహాయపడేందుకు యిప్పుడు మరింత శ్రేష్ఠమైన స్థానంలో ఉన్నాడు. అదేకాక, దేవుడు కూడా ఆత్మే గనుక, నా పక్షంగా ఆయన దేవునితో నేరుగా మాట్లాడగలడు. నాన్నగారు యిప్పుడు కోపంగా ఉండవచ్చుగానీ, నేను ఆయనకు సరైన గౌరవాన్ని చూపిస్తే, ఆయన నన్ను క్షమించి ఆశీర్వదిస్తారు.’
ఆఫ్రికా నందు, మృతులు భూమ్మీద జీవించే వారిని చూస్తారనీ అలాగే వారి జీవితాలపై ప్రభావం కల్గివుంటారనే నమ్మకం, పారంపర్య మతాన్ని అవలంభించే వారిలో విస్తృతంగా కనిపిస్తుంది. అది నామకార్థ క్రైస్తవుల్లో కూడా స్పష్టమౌతోంది. ఉదాహరణకు, చర్చిలో వివాహం చేసుకున్న తర్వాత, ఒక మహిళ తన తలిదండ్రుల యింటికి వెళ్లి పారంపర్య ఆశీర్వాదాన్ని పొందడం అసహజమేంకాదు. అక్కడ తమ పితరులకు ప్రార్థనలు చేసి, వారికి మద్యార్పణలను పోస్తారు. దీన్ని చేయడంలో విఫలమైనవారి వివాహానికి ముప్పు వాటిల్లుతుందని అనేక మంది ప్రజలు విశ్వసిస్తారు.
పితరులు లేక పితరుల ఆత్మలు, భూమ్మీద ఉన్న తమ కుటుంబ రక్షణ, శ్రేయస్సు విషయాల్లో శ్రద్ధ వహిస్తారని తలస్తున్నారు. ఈ ఆలోచన దృష్ట్యా, వారు మంచి పంటను పండింపజేయగల, తమ శ్రేయస్సుకు దోహదపడగలరని, మరియు ప్రజలను ముప్పు నుండి కాపాడగల శక్తివంతమైన సహాయకులు. మానవుని పక్షంగా వారు మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే వారిని పట్టించుకోకపోయినా లేక వారికి కోపం తెప్పించినా వారు నాశనాన్ని అంటే అనారోగ్యం, పేదరికం, మరణాన్ని సహితం తేగలరు. తత్ఫలితంగా, అర్పణలూ ఆచారకర్మల ద్వారా మృతులతో మంచి సంబంధాన్ని కాపాడుకునేందుకు ప్రజలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
మృతులు జీవించి ఉన్నవారి జీవితాల్లో చురుకైన పాత్రను వహిస్తారని మీరు నమ్ముతున్నారా? మీ ప్రియమైన వ్యక్తి సమాధి ప్రక్కన నిలుచుని, మీరు మాట్లాడేవాటిని అతను లేక ఆమె వింటారేమోననే భావనతో వారితో కొంత మాట్లాడుతున్నట్లు మీరు కనుగొన్నారా? సరే, మృతులు మనం చెప్పేవాటిని వింటున్నారా చూస్తున్నారా అన్నది, మరణించినప్పుడు ఏమి సంభవిస్తుందన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాము.