పాపరహిత లోకము—ఎలా సాధ్యము?
శీతాకాలంలో, ఒక రోజు ఉదయం వేకువ ఘడియల్లో సహాయం కొరకు చేయబడిన ఆర్తనాదాలు టోక్యో పరిసరాల ప్రశాంతతను పాడుచేశాయి. తన వెంటపడి పదేపదే కత్తితో పొడుస్తుంటే వార్తాపత్రికలందించే ఒక స్త్రీ నిస్సహాయంగా కేకలు వేస్తుండగా ఒక డజనుమంది ఐదు, పది నిమిషాలపాటు విన్నారు. కనీసం ఒక్క వ్యక్తికూడ బయట ఏమి జరుగుతుందో పట్టించుకోలేదు. ఎక్కువ రక్తం పోవడంతో ఆమె మరణించింది. “ఆమె అరవడాన్ని విన్నవెంటనే వీరిలో ఏ ఒక్కరైనా ఆ సంఘటనను గూర్చి పోలీసులకు రిపోర్టు యిచ్చివుంటే, ఆమె ప్రాణాలు దక్కివుండేవని” ఒక పరిశోధకుడు అన్నాడు.
చనిపోతున్న ఆ స్త్రీ వేసిన కేకలు విన్నవారు ఆమెను పట్టించుకోకపోవడం తప్ప ఇంకేమి చేయలేదు, తమయందు ఏ దోషము లేదని వారు సరిగా చెప్పగలరా? “హత్యనుగూర్చి తెలిసిన తర్వాత ఆ రోజు అంటే శుక్రవారమంతా నా అంతరాత్మ నన్ను బాధిస్తూనేవుంది” అని ఆమె అర్తనాదాలు విన్న ఒక వ్యక్తి అన్నాడు. ఇది మనలను ఆశ్చర్యపరుస్తుంది, నిజంగా పాపమంటే ఏమిటి?
పాపమంటే ఏమిటి?
పాపమంటే ఏమిటో ఎరిగిన అంతరాత్మను సూచిస్తూ, సాహిత్య విమర్శకుడు మరియు జపాన్, టోక్యోలో హోసే విశ్వవిద్యాలయంలో గౌరవాచార్యుడైన హీడియో ఒడాగిరి యిలా చెప్పినట్లు ఆసాహి షెంబున్ అనే వార్తాపత్రిక వ్రాసింది: “పిల్లవానిలో వుండే స్వార్థం, ఈర్ష్య, వెన్నుపోటు పొడవడం వంటి తెలిసిచేసే పాపాలు స్పష్టంగా నాకు జ్ఞాపకమున్నాయి, వాటిని నేను మర్చిపోలేను. నేను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడే అవి నా మనస్సున నాటుకున్నాయి, అవి నన్నింకా బాధిస్తునే ఉన్నాయి.” నీవెప్పుడైనా అలా భావించావా? నీకు తప్పని తెలిసిన దానిని నీవుచేస్తే నిన్ను గద్దించు అంతరంగం నీకున్నదా? బహుశ నేరమేమి చేసియుండక పోవచ్చు, అయితే కలతపర్చే భావాలు మెదలాడి, నీ మనస్సును కృంగదీస్తాయి. నీ మనస్సాక్షి పనిచేయడమంటే ఇదే, ఈ క్రింది వాక్యాలలో బైబిలు దీనిని ఈ విధంగా సూచిస్తుంది: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకుతామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్లు చూపుచున్నారు.” (రోమీయులు 2:14, 15) అవును, వ్యభిచారము, దొంగతనము, అబద్ధమువంటి క్రియలచే స్వాభావికముగా అనేకమంది ప్రజలు కలతచెందుదురు. వారి మనస్సాక్షియే వారి పాపానికి సాక్షి.
అయితే, అంతరాత్మ ప్రబోధాన్ని తదేకంగా అలక్ష్యంచేస్తే, అది ఇంకెంత మాత్రము సురక్షితమైన మార్గదర్శిగా పనిచేయదు. అది మొద్దుబారిపోయి, కల్మషమైనదగును. (తీతు 1:15) చెడు విషయమైన సున్నిత స్వభావము అంతరించిపోతుంది. నిజానికి, పాపం విషయంలో ఈనాడు అనేకమంది ప్రజల మనస్సాక్షి చచ్చిపోయింది.
పాపాన్ని ఎంచేది మనస్సాక్షి ఒక్కటేనా, లేక ఏది పాపమో ఏది కాదో నిర్ణయించుటకు ఖచ్చితమైన కట్టడగా పనిచేసేది మరేదైనా ఉన్నదా? మూడు వేలకంటె ఎక్కువ సంవత్సరాల క్రితమే దేవుడు తానేర్పరచుకున్న ప్రజలకు ఒక ధర్మశాస్త్రాన్నిచ్చాడు, మరియు ఈ ధర్మశాస్రము ద్వారా పాపము “పాపమన్నట్టుగా గుర్తింపబడెను.” (రోమీయులు 7:13, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్) అంతకుముందు ఎంతోకొంత అంగీకృతంగావున్న ప్రవర్తన సహితం, ఇప్పుడు పాపమని బయల్పరచబడింది. దేవుడు ఏర్పరచుకొనిన ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపులని అందుమూలంగా వారు దండనకు పాత్రులని వెల్లడయ్యింది.
మన మనస్సాక్షి మనం గుర్తెరుగునట్లు చేసేవి మరియు మోషే ధర్మశాస్త్రము ప్రత్యేకించి పేర్కొనిన, ఈ పాపాలు ఏమిటి? బైబిలు పరిభాషలో, పాపమనగా సృష్టికర్త నియమాలను అతిక్రమించుట అని అర్థం. ఆయన వ్యక్తిత్వానికి, కట్టడలకు, మార్గాలకు, చిత్తానికి పొందికలేని దేదైనను పాపమే. తన నియమాల నతిక్రమించు సృష్టమేదైనను సదాకాలము కొనసాగుటకు ఆయన అనుమతించడు. కావున మొదటి శతాబ్దములోని ధర్మశాస్త్ర నిపుణుడొకాయన హెబ్రీ క్రైస్తవులను యిలా హెచ్చరించాడు: “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.” (హెబ్రీయులు 3:12) అవును, సృష్టికర్తయందు విశ్వాసముంచకపోవడం పెద్ద పాపం. ఆ విధంగా, ఇది పాపమని సాధారణంగా పరిగణించే దానికి పాపమంటే ఏమిటో బైబిలు వివరించేదానికి చాలా తారతమ్యముంది. బైబిలు ఎంత విశదంగా తెల్పుతుందంటే: “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.”—రోమీయులు 3:23.
పాపముయొక్క ఆరంభము
అంటే మానవుడు పాపిగా సృష్టించబడ్డాడని దాని భావమా? కాదు, మానవ జీవానికి మూలకారకుడగు యెహోవా దేవుడు, మొదటి మానవున్ని పరిపూర్ణ ప్రాణిగా చేశాడు. (ఆదికాండము 1:26, 27; ద్వితీయోపదేశకాండము 32:4) అయితే, ఆ మొదటి మానవ దంపతులు నిషేధింపబడిన “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష” ఫలమును తిన్నప్పుడు, దేవుడు వారియెదుట ఉంచిన ఒకే ఒక నిషేధాన్ని ధిక్కరించి, ఆజ్ఞను అతిక్రమించారు. (ఆదికాండము 2:17) పరిపూర్ణముగా సృష్టింపబడినను, తమ తండ్రికి పూర్తిగా లోబడే ఆజ్ఞను అతిక్రమించిన పాపులుగా వారు మరణదండన పొందారు.
నేటి పాపమునకు ఈ ప్రాచీనకాల చరిత్రకు ఏమి సంబంధము? బైబిలిలా వివరిస్తున్నది: “ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఎవరూ మినహాయింపబడకుండ మనమందరము వారసత్వముగా పాపులము; కావున, మనము మరణదండన క్రింద ఉన్నాము.—ప్రసంగి 7:20.
పాపమును తుడిచివేయుటకు మానవుని ప్రయత్నాలు
ఆదాము తన సంతానమునకు ఆ పాపాన్ని సంక్రమింపజేసాడు, ఆలాగే ఆయన దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షిని కూడ అందజేసాడు. పాపము వ్యాకులత కల్గించవచ్చు. ముందు ప్రస్తావించబడినట్లు, అలాంటి భావాల ప్రభావాన్ని తగ్గించుటకు మానవులు వివిధ ఉపాయాల్ని ప్రయోగించారు. అయితే అవి నిజంగా సఫలీకృతమౌతున్నాయా?
కట్టడలను మార్చుట ద్వారా లేదా పాపమున్నదనే సంగతినే నిరాకరించుట ద్వారా తూర్పు, పశ్చిమ దేశాల ప్రజలు, పాపము యొక్క ప్రభావముతో వ్యవహరించుటకు ప్రయత్నించారు. (1 తిమోతి 4:1, 2) మానవుని పాపపు స్థితిని జ్వరంతో బాధపడుతున్న ఒక రోగికి పోల్చవచ్చును. పాపాన్ని, రోగసూచనలిచ్చే రోగక్రిములతోను, కలతచెందిన మనస్సాక్షిని జ్వరంతోను పోల్చవచ్చును. థర్మామీటరు విరగ్గొడితే జ్వరం ఎక్కువున్న రోగి పరిస్థితి మారదు. క్రైస్తవమత సామ్రాజ్యంలో అనేకమంది చేసినట్లుగా, నైతిక కట్టడలను లెక్కచేయకపోతే, ఒకని స్వంత మనస్సాక్షి ప్రబోధాన్ని అలక్ష్యం చేస్తే, పాపం లేకుండా చేయడానికి అది ఏ విధంగాను సహాయపడదు.
తన జ్వరం తగ్గడానికి ఒక వ్యక్తి ఐస్బ్యాగ్ను ఉపయోగించవచ్చును. దీనిని షింటో శుద్ధీకరణ ఆచారాలు జరిగించడం ద్వారా మనస్సాక్షికి కలిగే లిప్తకాల బాధనుండి విముక్తులగుటకు ప్రయత్నించుటతో పోల్చవచ్చును. ఐస్బ్యాగ్ తాత్కాలికముగా ఆ రోగి జ్వరాన్ని తగ్గించవచ్చును, కాని అది జ్వరానికి గల కారణాన్ని తొలగించదు. యిర్మీయా కాలంలోని ఇశ్రాయేలీయులను బాగుచేయుటకు అప్పటి యాజకులు, ప్రవక్తలు ఈ విధంగానే ప్రయత్నించారు. పైకి “అంతా బాగానేవుంది, అంతా బాగానేవుంది” అని చెప్పుచు, వారా ప్రజల ఆత్మీయ, నైతిక గాయాలను కేవలం “కొద్దిగానే” మాన్పగల్గారు. (యిర్మీయా 6:14; 8:11, ఏన్ అమెరికన్ ట్రాన్స్లేషన్) కేవలం మతాచారాలు జరిగిస్తూ, “అంతా బాగానేవుంది” అని వల్లించుట దేవుని ప్రజల నైతిక పతనాన్ని బాగుచేయలేదు, శుద్ధీకరణ ఆచారాలు ఈనాటి ప్రజల నీతిసూత్రాల్ని మార్చలేవు.
జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి జ్వరం మాత్రలు తీసుకోవడం ద్వారా అతని జ్వరం తగ్గవచ్చు, కాని అతని శరీరంలో రోగక్రిములు ఇంకా అలానే వుంటాయి. విద్య ద్వారా చెడుతో కన్ఫ్యూషన్ వ్యవహరించే విధానంకూడా అంతే. చెడునుండి వైదొలగుటకు అది ప్రజలకు పైకి సహాయం చేయవచ్చు, కాని లీ ని ఆచరించుట పాప ప్రవర్తనను అణచివేస్తుంది, అంతేగాని దుష్ప్రవర్తనకు కారణమయ్యే పుట్టుకతో వచ్చిన అంతరంగ స్వభావాన్ని అది ఒక వ్యక్తిలోనుండి తొలగించలేదు.—ఆదికాండము 8:21.
ఒకనిలో నుండి పాప స్వభావాలను తొలగించుటకు నిర్వాణమందు ప్రవేశించుటను బోధించే బౌద్ధమతం విషయమేమి? నిర్వాణపు స్థితి అనగా అది “ఆరిపోవునట్లు” చేస్తుందని, వర్ణనాతీతమైనదని, సమస్త మోహమును, కోరికలను అణగార్చుననే అర్థం చెప్పబడింది. అది ఒకవ్యక్తి ఉనికి అంతం కావడమని కొందరు చెప్తారు. అది నీకు ఉపశమనం కలగాలంటే నీవు మరణించాలని జ్వరంతో బాధపడుతున్న రోగితో అన్నట్లు లేదా? అంతేకాకుండ, నిర్వాణము పొందడం చాలా కష్టమని, అసాధ్యమని పరిగణించబడుతుంది. చెదరిన మనస్సాక్షిగల వ్యక్తికి ఈ బోధ సహాయకరంగా ఉన్నట్లు కన్పిస్తుందా?
పాపమునుండి విడుదల
జీవితాన్ని గూర్చిన, పాపపు స్వభావాలను గూర్చిన మానవ తత్వాలు, మహా అయితే ఒక వ్యక్తి మనస్సాక్షిని మాత్రమే శాంతింపజేస్తాయి. పాపపు స్థితిని అవి తీసివేయవు. (1 తిమోతి 6:20) ఈ పరిస్థితిని మార్చునదేదైనా కలదా? ప్రాచ్యానికి సమీపమందు వ్రాయబడిన ప్రాచీన పుస్తకమగు బైబిలునందు, పాపమునుండి విడుదలకు కావలసిన కీలకమును మనము కనుగొంటాము. “మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును . . . మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమియొక్క మంచి పదార్థములను అనుభవింతురు.” (యెషయా 1:18, 19) ఇక్కడ యెహోవా ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్నాడు, వారాయన ప్రజలైనను, ఆయనయెడల యథార్థతచూపే విషయంలో వారు తప్పిపోయారు. అయితే, అదే సూత్రము యావత్ మానవజాతికి అన్వయించును. సృష్టికర్త మాటలు వినుటకు ఇష్టాన్ని చూపుట ఒకని పాపములు పరిశుభ్రపరచబడి, తుడిచివేయబడుటకు కీలకమై యుండగలదు.
మానవజాతి పాపాలను తుడిచివేయుటను గూర్చి దేవుని వాక్యము మనకేమి చెప్పుచున్నది? ఒక మనుష్యుని ద్వారా మానవులంతా పాపులైనట్లే, దేవునికి పరిపూర్ణ విధేయత చూపు మరొక మనుష్యుని ద్వారా, విధేయతగల మానవజాతి వారి దుఃఖకరస్థితి నుండి విడిపింపబడునని బైబిలు చెప్పుచున్నది. (రోమీయులు 5:18, 19) ఎలా? “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమీయులు 5:8) ఆదాము పాపము చేయకముందు మొదట ఎట్లుండెనో అదేరీతిలో అతనికి సరిసమాన పరిపూర్ణతగల్గి, పాపములేని మనుష్యునిగా జన్మించిన యేసుక్రీస్తు మానవజాతి పాపాలను తీసివేయగల స్థితిలో ఉండెను. (యెషయా 53:12; యోహాను 1:14; 1 పేతురు 2:24) ఒక నేరస్థునివలె హింసాకొయ్యపై చంపబడుటద్వారా, యేసు మానవజాతిని పాపపు దాస్యము నుండి, మరణమునుండి విడిపించెను. పౌలు రోమాలోనున్న క్రైస్తవులకు ఇలా వివరించాడు: “మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. . . . పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలును.”—రోమీయులు 5:6, 21.
క్రీస్తు మానవజాతి అంతటి కొరకు చనిపోయి, ఆదాము తల్లక్రిందులు చేసిన పరిస్థితిని యధాస్థితికి తెచ్చుటయే “విమోచన క్రయధన” ఏర్పాటని పిలువబడింది. (మత్తయి 20:28) దీనిని జ్వరానికి కారణమైన రోగక్రిములపై పనిచేసే మందుతో పోల్చవచ్చును. యేసు విమోచన క్రయధన విలువను మానవజాతికి అన్వయించుట వలన పాపం మూలంగా మానవజాతికి కలిగిన రోగగ్రస్త పరిస్థితిని—మరణాన్ని సహితం—నయం చేయవచ్చును. ఈ నివారణా విధానం బైబిలులోని చివరి పుస్తకమందు అలంకారార్థంగా యిలా వర్ణింపబడింది: “ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.” (ప్రకటన 22:2) యావత్ మానవజాతి స్వస్థతకొరకు జీవమునిచ్చు ఆకులుగల వృక్షములు ఇరువైపుల కలిగి జీవజలముతో ప్రవహించు అట్టి అలంకారార్థ నదిని ఒక్కసారి ఊహించుము! దైవప్రేరేపితమగు ఈ చిహ్నములు, యేసు విమోచన క్రయధన బలి ఆధారముగా మానవజాతిని పరిపూర్ణతకు పునరుద్ధరించు దేవుని ఏర్పాటును సూచిస్తున్నవి.
ప్రకటన గ్రంథమందలి ప్రవచనార్థక దర్శనములు త్వరలో నిజమౌతాయి. (ప్రకటన 22:6, 7) ఆ పిమ్మట, యేసు విమోచన క్రయధన బలి విలువను మానవజాతికి పూర్తిగా అన్వయించుటతో, యథార్థహృదయం గల వారందరు పరిపూర్ణులుగా చేయబడి, “నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదురు.” (రోమీయులు 8:21) ఈ మహిమగల స్వాతంత్ర్యము సమీపమైనదని బైబిలు ప్రవచనముల నెరవేర్పు సూచిస్తున్నది. (ప్రకటన 6:1-8) త్వరలోనే దేవుడు ఈ భూమిని దుష్టత్వము నుండి విడుదల చేయును, మరియు పరదైసు భూమిపై మానవులు నిత్యజీవము ననుభవిస్తారు. (యోహాను 3:16) అది నిజంగా పాపం లేని లోకమై యుంటుంది.
[7వ పేజీలోని చిత్రం]
యేసు అర్పించిన విమోచన క్రయధన బలి, ఈ విధంగా కుటుంబాలు నిత్యమూ సంతోషించునట్లు చేస్తుంది