క్రొత్త తలంపుల నెందుకంగీకరించవలెను?
దట్టమైన పొగమంచు మెల్లగా విడిపోతుండగా, సస్క్వెహన్నా అనుపేరుగల యుద్ధనౌక పైభాగమునుండి అమెరికా నౌకాదళాధిపతియైన మాత్యూ సి. పెర్రి ఫుజి అను పర్వతమును చూచెను. ఆయన జపానును చూడాలని కోరుకొనుచు ఏడునెలలకంటే ఎక్కువకాలము సముద్రయానము చేసి ఎట్టకేలకు 1853 జూలై 8వ తారీఖున దానినిచేరెను. ఆ దేశమునకు చెందిన ప్రతి నివేదికను ఆ నౌకాదళాధిపతి చదివెను. ఎందుకు? ఎందుకనగా తాను ‘ఈ ఒంటరి రాజ్యమును ప్రపంచమునకు తెఱచుటకై ఆశించెను.
ఒంటరిగా వేరైనదా, నిజమే! జపాను దేశము 200 సంవత్సరములకు పూర్వము చైనా, కొరియా, హాలెండ్ దేశాలతో తప్ప మిగతా దేశాలతో వ్యాపార మరియు సాంస్క్రతిక సంబంధాలను తెగతెంపులు చేసుకొన్నది. అప్పుడు ఆ దేశము నిశ్చలమైన ప్రశాంతతలో కూర్చుండెను. ఆస్థితిలో అది, తాను నమ్మిన భావములకు వ్యతిరేకముగా నున్న క్రొత్తతలంపులను వినకుండా తిరస్కరించు అనేక వ్యక్తులవలె ఉన్నది. కొన్నిసార్లు ఇదికొంత ఆదరణ కల్గించవచ్చును. ఎందుకనగా క్రొత్తతలంపులు తొందరగా ఇమడవు. మరియు అవి ఇంకా భయపెట్టనూ వచ్చు. కానీ ఆ భావన జ్ఞానయుక్తమైనదేనా? సరే, జపాను దేశపు వేరుగానుండు విధాననిర్ణయ ఫలితములను ఆలోచింతము.
జపాను ఏకాంత వాసమునకు దారితీసినదేమి?
జపాను కారణములేకుండా ఏకాంతముగా నుండలేదు. 1549లో జెస్యూట్ మిషనరియైన ఫ్రాన్సిస్ గ్జేవియర్ తన మతవ్యాప్తికై జపానుకు వచ్చెను. అతి కొద్దికాలంలోనే, రోమన్కాథెలిక్ విశ్వాసము ఆదేశములో ప్రాముఖ్యతవహించెను. నాటి పరిపాలకులు బౌద్ధులమత తిరుగుబాటును మరియు కాథొలిక్కుల ప్రాబల్యమును చూచిరి. కావున, బహిష్కరణ అంత ఖచ్చితముగా అమలు జరుపక పోయినప్పటికిని కాథెలిసిజమ్ బహిష్కరింపబడెను.
జపానును “దైవిక రాజ్యముగా” పేర్కొంటున్న దాని పరిపాలకులకు, తమవ్యవస్థకు భంగము వాటిల్లజేయు “క్రైస్తవ” మతమును అనుమతించు ఉద్దేశ్యములేదు. అయితే ఎందుకు వారు కాథొలిసిజమ్ను గట్టిగా బహిష్కరించలేకపోయిరి? ఎందుకనగా కాథొలిక్ మిషనరీలు పోర్చుగల్లువారి వ్యాపార నౌకలు మీద వచ్చుచున్నారు మరియు జపాను ప్రభుత్వము లాభాలకొరకు ఆశిస్తూ ఆ నౌకలు తమకొరకే వచ్చుచున్నవని భావించేవారు. ఏమైనప్పటికిని, పాలకుల వ్యాపార ఆశలకంటే కాథొలిక్కుల ప్రాబల్యము పెరిగిపోతుందనే భయము ఎక్కువ ఆయెను. తత్ఫలితముగా వారు విదేశి వ్యాపారము మీద, వలస వచ్చువారిమీద మరియు “క్రైస్తవుల” మీద గట్టినిఘా ఏర్పాటులు గల ఉత్తర్వులు జారీచేసిరి.
హింసింపబడుతూ కష్టములననుభవించుచున్న “క్రైస్తవులు” స్థానిక సామంత ప్రభువుపై తిరుగుబాటుచేసినప్పుడు, అదివారి చివరి నివాస కాలమాయెను. ఈ ఉధృతము కాథొలిక్ ప్రత్యక్షప్రచార ఫలితముగా వచ్చినదని గుర్తించిన కేంద్రీయ షోగున్ ప్రభుత్వము పోర్చుగీసువారిని తరిమివేసి జపాను దేశస్థులను విదేశములకు వెళ్లకుండా నిషేధించెను. ఈ శాసనము 1639లో వచ్చినపుడు జపాను దేశ ఏకాంతవాసము నిజమాయెను.
జపానుతో వర్తకసంబంధములకు అనుమతింపబడిన ఒకే ఒక ప్రాశ్చాత్తులు డచ్ దేశస్థులు వారును నాగసాకి నౌకాశ్రయము లోనున్న డెజీమా అను చిరుద్వీపమునకే పరిమితము చేయబడినారు. గత 200 సంవత్సరములుగా పాశ్చాత్యనాగరికత డెజీమాద్వారా జపానులో ప్రవేశించినది. ప్రతిసంవత్సరము “డచ్ నివేదిక” లో బయటప్రపంచములో జరిగే విషయాలను ఆ చిరుద్వీప వ్యాపార అధికారి ప్రభుత్వమునకు తెలియజేసేవారు. అయితే షోగున్ రాజ్యము మాత్రము ఈ నివేదికలను ఎవరు చూడకుండా కట్టుదిట్టము చేసినది. కావున 1853లో నౌకాధళాధిపతి పెర్రి వారితలుపు తట్టేంతవరకు జపానీయులు ఏకాంత వాసముచేసిరి.
ఏకాంతము యొక్క అంతము
పెర్రియొక్క నల్లని నౌకాసమూహము ఎడో ఖాతమున కొచ్చినప్పుడు, అవి వదలిన పొగ దట్టమైనందున స్థానిక జాలరులు వాటిని కదలుచున్న అగ్నిపర్వతములని తలంచిరి. ఎడో (ఇప్పుడు టోక్యో) పౌరులు బహుగా భయపడి, అనేకులు తమ వస్తువులతో సహా పట్టణము విడిచి పారిపోయిరి. ఈ నిష్క్రమణ ఎంతగొప్పదంటే ప్రభుత్వము ప్రజలను శాంతిపరచుటకు అధికార ప్రకటనచేయవలసి వచ్చెను.
నౌకాధిపతి పెర్రి అదుపులోనున్న పొగ ఓడలే కాకుండా, అతను తెచ్చిన బహుమతులుకూడా ఈ ఒంటరి జనమును ఆశ్చర్యపరచెను. తంతిద్వారా ఒక గృహమునుండి మరొక గృహమునకు సమాచారమును పంపుటను ప్రదర్శించినప్పుడు వారు దిగ్భ్రమచెందిరి. పెర్రి నేతృత్వముక్రింద సమకూర్చబడిన “నేరేటివ్ ఆఫ్ ది ఎక్స్పిడిషన్ ఆఫ్ యాన్ అమెరికన్ స్క్వాడ్రన్ టుది చైనాసీస్ అండ్ జపాన్” తెల్పునదేమనగా జపాను అధికారులు కేవలము “ఆరుసంవత్సరముల బాలుని కూడ మోయలేని చిరుబండ్లపై దూకుటను నివారింపలేకపోయిరి మంచిహోదాగల చైనా అధికారిసహితముదాని కప్పుకు అంటుకొనగా “అతని వదులైన వస్త్రములు గాలిలో తేలియాడేవి.”
తదుపరి సంవత్సరము పెర్రి తాను రెండవసారి దర్శించినప్పుడు ఎట్టకేలకు జపాను తలుపులు పూర్తిగా తెఱువబడుటకు త్రిప్పబడినవి. ఒత్తిడికి తట్టుకొనలేక ప్రభుత్వమే తమదేశమును తెఱచినది. మొండి వేర్పాటువాదులు జపాను యొక్క ఒంటరితనమును కాపాడవలెననే ఉద్దేశ్యముతో విద్రోహచర్యలకు పాల్పడి, ప్రభుత్వముయొక్క ముఖ్యమంత్రిని హత్యచేసి, విదేశీయులపై దాడిచేసిరి. కొంతమంది వేర్పాటు ప్రభువులు విదేశీయులపై కాల్పులు జరిపిరి. ఏమైనా, వారి దురాగతాలు క్రమేణ అణగిపోయినవి. మరియు ప్రభుత్వమును టోకు గావాషోగునేట్ నుంచి చక్రవర్తి స్వీకరించెను.
పెర్రి జపానుకు మార్గమేర్పరచే సమయానికే పాశ్చాత్య దేశాలు పారిశ్రామిక విప్లవములో మునిగిపోయెను. ఈ విషయములో జపాను తన ఒంటరితనమువలన బాగా వెనుకబడిపోయెను. పారిశ్రామిక దేశాలు ఆవిరిశక్తిని కనుగొనినవి. 1830వ దశాబ్దములో ఆవిరియంత్రములు, ఆవిరిశక్తితో నడచే మరయంత్రములు సామాన్యముగా వాడుకలోనున్నవి. జపానుదేశ ఏకాంతవాస విధానము పారిశ్రామిక రంగములో బహుగా వెనుకబడేటట్లు చేసింది. జపాను బృందము మొదటగా ఐరోపాకు వెళ్లినపుడు ఇదివారికి బోధపడింది. 1862లో లండన్లో జరిగిన వస్తుప్రదర్శనశాలయందు జపానువారి కాగితము మరియు కర్రతో చేసిన వస్తువులు “పురాతన వస్తువులు అమ్ముదుకాణములో ఉంచబడుటను” చూచి ఆ బృందములోని సభ్యుడొకరు వాపోయెను.
ఐరోపా మరియు సంయుక్త రాష్ట్రములను సందర్శించిన జపాను బృందము తమదేశమునకు పరిశ్రమలు ఆధునిక యంత్రములు మరియు నూతనతలంపులు అవసరమని గుర్తించిరి. పెర్రి మొదటి సందర్శనము తరవాత 64 సంవత్సరములకు ఆయన నౌకాదళములో జీవించియున్న చివరి నావికుడు జపానును సందర్శించి, “కేవలము 60 సంవత్సరములలో జపాను సాధించిన అభివృద్ధి నన్ను ఆశ్చర్యపరచుచున్నదని” చెప్పెను.
కావున జపాను దేశపు ఏకాంతవాస విధాననిర్ణయము దాని అభివృద్ధిని పరిమితముచేసినది. క్రొత్త తలంపులను అనుమతించుట అనేక విధములుగా ఆదేశమునకు ప్రయోజనకరమైనదని రుజువుపరచబడెను. ఏమైనను, నేటికిని జపానులో కొంతమంది వ్రేలెత్తి ‘ఒంటరి మనసు’ గల వ్యక్తులను చూపి ఆ సమస్య పరిష్కరింపబడవలెనని చెప్పుచున్నారు. నిజమే, క్రొత్తతలంపులను నిరోధించు విధానముపై విజయము సాధించుట ఒక్క ఆధునిక జపానీయులకే కాదు కాని మానవజాతి అంతటికి కూడా ఒక సవాలైయున్నది. మీ విషయమేమి? మరియు ఒంటరి మనస్సుపై మీవ్యక్తిగత అభిప్రాయమేమి? 1850వ దశాబ్దములో జపాను చేసినట్టు మీరును క్రొత్త తలంపులకు మీ మనస్సులను తెఱచి ప్రయోజనము పొందగలరా? (w89 1⁄15)