ప్రపంచ పరిశీలన
రేడియోయాక్టివ్ రత్నాలు
బ్యాంకాక్లోని వర్తకునికి అమ్మబడిన రత్నాల రాళ్లు రేడియో ధార్మికతగలవని తెలియడంతో అంతర్జాతీయ వ్యాపారం అప్రమత్తమైంది. సాహాబుద్దీన్ నిజాముద్దీన్ అనే అనుభవజ్ఞుడైన రత్నాల డీలర్ ఒక లావాదేవీ లాభసాటిదేనా కాదా అన్నది ఒక్క చూపులోనే చెప్పగలడు కనుక, ఒక ఇండోనేషియా వ్యాపారి ఆయనకు 50 క్యాట్స్-ఐ రత్నాలను సాధారణ ధర కన్నా తక్కువ ధరకు అమ్మజూపినప్పుడు ఆయన వెంటనే పొందడానికి ఆతురత చూపించాడు. “ప్రతి ఒక్కటి ఎంతో ఖరీదైన చాక్లెట్ రంగులో ఉండి, ఇంద్రధనుస్సు వర్ణాల కాంతితో రెండు భాగాలుగా విభజించబడి, పిల్లి కనుపాప చీలికను పోలి ఉంటుంది” అని ఏషియావీక్ నివేదిస్తుంది. అయితే, ఆ రత్నపు ఆకర్షణ మరో మూలం నుండి వచ్చినట్లు తేలింది. వాటి వర్ణానికి ఆకర్షణీయతను పెంచేందుకూ, ఆ విధంగా, వాటి ధరను పెంచేందుకూ, వాటిని రేడియేషన్కు గురి చేశారు. హాంగ్కాంగ్లో మరో ఆభరణ మార్కెట్లో కనుగొనబడిన మరో రాయికి ఏష్యన్ రేడియేషన్ సురక్షిత పరిమితి కన్నా 25 రెట్లు ఎక్కువ రేడియోధార్మికత ఉన్నట్లు నమోదైంది. “ఇప్పటిదాకా, ఆ సమస్య కేవలం క్యాట్స్-ఐ పసుపుపచ్చ మరతకంలోనే కనుగొనబడింది” అని ఆ పత్రిక చెబుతుంది.
చదివే అలవాట్లు
బ్రెజీలియన్లు సంవత్సరానికి సగటున కేవలం 2.3 పుస్తకాలను మాత్రమే చదువుతారని జర్నల్ డా టార్డే నివేదిస్తుంది. బ్రెజీల్లోని అధిక సంఖ్యాకులకు స్కూలు వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత, పుస్తకాలతో ఇక ఏ మాత్రం సంబంధం లేకుండా పోతుంది. “అసలు సమస్య ఏంటంటే, బ్రెజీల్లో చదవబడుతున్న 60 శాతం పుస్తకాలూ” స్కూల్లో పిల్లలు “తప్పనిసరిగా చదవవలసి వచ్చే పుస్తకాలేనని” ఓట్టావియానో డీ ఫియోర్లోని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సెక్రటరీ అంటున్నాడు. “మిగతా 40 శాతంలో, మతసంబంధమైన గూఢమైన పుస్తకాలు, లైంగికతను గురించిన పుస్తకాలు లేదా స్వయం సహాయక పుస్తకాలే ఎక్కువ” అని వార్తా పత్రిక చెబుతుంది. చదివే అలవాట్లను గురించి, డీ ఫయర్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెలిబుచ్చుతున్నాడు: “పిల్లలు ఇంట్లోనూ, స్కూల్లోను ఏకమై టీ.వీ. చుట్టూ గుమిగూడుతారు. కుటుంబంలో చదువరులు లేనట్లయతే, వాళ్ళకు కూడా చదివే ప్రేరణ లభించదు.” ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “టీ.వీ. విషయమే చెబితే, చదవాలన్న ప్రేరణనివ్వడమన్నది ముఖ్య చానళ్ళకు బొత్తిగా పట్టదు.”
ట్రాఫిక్లో సంవత్సరాలు తరబడి
ఇటలీలోని ముఖ్య నగరాల్లోని నివాసులు ఇంటి నుండి పని స్థలానికి లేదా స్కూలుకు మరియు తిరిగి ఇంటికి చేరుకునేందుకు చాలా సమయం ప్రయాణం చేస్తారు. ఎంత సమయం? లేగామ్బ్యాన్టే అనే ఇటలీ పర్యావరణ అసోసియేషన్ ప్రకారం, నేపిల్స్లోని పౌరులు ప్రతిరోజు 140 నిమిషాలు ప్రయాణం చేస్తారు. నేపిల్స్ నివాసి సగటు ఆయుష్షు 74 సంవత్సరాలు అయితే, అతడు తన జీవితంలో 7.2 సంవత్సరాలను ట్రాఫిక్లో నష్టపోతాడు. ప్రతిరోజు ప్రయాణంలో 135 నిమిషాలు గడిపే రోమ్ పౌరుడు ట్రాఫిక్లో 6.9 సంవత్సరాలను నష్టపోతాడు. మిగతా నగరాల్లో కూడా పరిస్థితి అంతే విషమంగా ఉంది. బెలొగానాలోని ప్రజలు 5.9 సంవత్సరాలను కోల్పోతారు. మలాన్లోని ప్రజలు 5.3 సంవత్సరాలు కోల్పోతారు అని లా రిపబ్లికా నివేదిస్తుంది.
పేదరికమూ, పర్యావరణమూ
ఆర్థిక పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ, రోజుకు రెండు కన్నా తక్కువ డాలర్లతో బ్రతుకుతున్నారు. పేదరికం అధికమవ్వడమే కాక, అధోగతికి జారుతోంది కూడా అని యూ.ఎన్. నివేదిక చెబుతోంది. నేడు వందకోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు 20, 30, లేదా 40 సంవత్సరాల క్రితం కన్నా తక్కువే సంపాదిస్తున్నారు. “పేదరికం వల్ల ప్రకృతి వనరులను అతి త్వరగా దోచుకోవడం జరుగుతుంది కనుక, అది దీర్ఘకాలిక ప్రకృతి కాపుదలా ప్రయత్నాలను నీరుకారుస్తుంది,” అలా అది పర్యావరణ వినాశనానికి దోహదం చేస్తుంది అని యునెస్కో సోర్సెస్ పత్రిక చెబుతుంది. “ప్రస్తుత వినాశనరేటు అలాగే కొనసాగితే, కరీబియన్లోని అడవులు 50 ఏళ్ళలోపే పూర్తిగా అంతరించిపోవచ్చు. . . . జాతీయ స్థాయిలో చూస్తే, పరిస్థితి మరింత విషమంగా ఉంది: ఫిలిప్పీన్స్లోని అడవులు 30 సంవత్సరాల్లో అంతరిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని అడవులు 16 సంవత్సరాల్లోను, లెబనాన్లోని అడవులు 15 సంవత్సరాల్లోను అంతరిస్తాయి.”
లంచం ఆపే ప్రయత్నం
చైనాలో దీనిని హ్వేలూ అనీ; కెన్యాలో కీటూ కీడున్గో అనీ అంటారు. మెక్సికోలో యూనా ముర్డీడా అనే పదాన్ని ఉపయోగిస్తారు; రష్యాలో స్యట్కా అనీ; మధ్య ప్రాచ్యంలో బక్షీష్ అనీ పిలుస్తారు. అనేక దేశాల్లో, లంచం అనేది జీవితంలో భాగమై పోయింది. కొన్నిసార్లు వ్యాపారం చేసేందుకు, కొన్ని వస్తువులను పొందేందుకు, లేదా న్యాయం పొందేందుకు కూడా అదే ఒక్కగానొక్క మార్గం. అయితే, ఇటీవల, అంతర్జాతీయ లావాదేవీల్లో లంచగొండితనాన్ని రూపుమామే సంకల్పంతో కూడిన ఒక ఒప్పందంలో 34 దేశాలు సంతకం చేశాయి. అందులో అర్జెన్టీనా, చిలీ, బల్గేరియా, బ్రెజీల్, మరియు స్లోవేకియాల సభ్యులతోపాటు ఆర్థిక సహకార అభివృద్ధి వ్యవస్థ యొక్క 29 మంది సభ్యులు ఉన్నారు. ప్రపంచ అత్యున్నత ఆర్థిక సంస్థలు—ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి—కూడా అధికారుల లంచగొండితనానికి అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. 69 దేశాల్లోని 40 శాతం వ్యాపారాల్లో లంచం ఇవ్వబడుతుందని ప్రపంచ బ్యాంక్ సర్వే తెలియజేసిన తర్వాత ఈ చర్యలు తీసుకోబడ్డాయి. అవినీతిని అలక్ష్యం చేస్తున్న దేశాలకు నిధులను ఆపివేయడానికి ఈ రెండు వ్యవస్థలు ఇప్పుడు అనుమతినిస్తున్నాయి.