వారు యెహోవా చిత్తాన్ని చేశారు
ధైర్యంగా మాట్లాడిన చిన్నది
ఇశ్రాయేలువారికి, సిరియావారికి మధ్య గల సంబంధాలు సా.శ.పూ. పదవ శతాబ్దంలో తెగిపోయాయి. పోరాటాలు జరగడం ఎంత సాధారణంగా ఉండేవంటే మూడు సంవత్సరాలు బలాత్కారం లేకుండా గడిచిపోయినప్పుడు, అది చరిత్రపుటల్లో లిఖించదగ్గ విషయమైంది.—1 రాజులు 22:1.
ఆ కాలాల్లో ముఖ్యంగా సిరియా బందిపోటు దళాలు భీతిగొలిపేవిగా ఉండేవి, వాటిలో కొన్ని వందలాది మంది సైనికులు ఇమిడివున్నవే. ఈ యుద్ధయోధులు ఇశ్రాయేలీయులను కొల్లగొట్టి దోచుకుని అనేకులను, పిల్లలను కూడా చెరపట్టి బానిసలుగా తీసుకు వెళ్ళేవారు.
ఒకసారి దోపిడీలో “ఒక చిన్నదాని”ని దైవభయం గల ఆమె కుటుంబం నుండి నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళారు. (2 రాజులు 5:2) ఆమెను సిరియాకు తీసుకు వెళ్ళారు, సూర్యచంద్ర నక్షత్రాలను మొక్కలను వృక్షాలను రాళ్ళను కూడా ఆరాధించేవారైన, ఆమెకు భయంకరులుగా కనిపించిన ఆ అపరిచితుల మధ్య ఆమె జీవించవలసి వచ్చింది. అద్వితీయ సత్య దేవుడైన యెహోవాను ఆరాధించిన ఆమె కుటుంబానికి, స్నేహితులకు వాళ్ళు ఎంత భిన్నమైనవారో! అయితే, ఈ అపరిచిత వాతావరణంలో కూడా, ఈ చిన్నది యెహోవా ఆరాధన విషయంలో విశిష్టమైన ధైర్యాన్ని ప్రదర్శించింది. దాని ఫలితంగా, సిరియా రాజు క్రింద సేవిస్తున్న ప్రముఖ అధికారి జీవితాన్ని ఆమె మార్చివేసింది. ఎలాగో మనం చూద్దాం.
మాట్లాడే ధైర్యం
ఈ బైబిలు వృత్తాంతంలో ఈ చిన్నదాని పేరు పేర్కొనబడలేదు. బెన్హదదు II అనే రాజు పరిపాలన క్రింద నయమాను అనే ధైర్యవంతుడైన సైన్యాధిపతి భార్యకు ఆమె సేవకురాలయ్యింది. (2 రాజులు 5:1) నయమాను ఎంతో ఉన్నతంగా ఎంచబడినప్పటికీ, అతనికి అసహ్యమైన కుష్ఠవ్యాధి ఉండేది.
బహుశ ఆ చిన్నదాని గౌరవప్రదమైన ప్రవర్తన నయమాను భార్య ఆ చిన్నదాన్ని నమ్మేందుకు పురికొలిపి ఉండవచ్చు. ‘ఇశ్రాయేలులో కుష్ఠరోగులకు ఏమి చేస్తారు?’ అని ఆ స్త్రీ ఆ చిన్నదానిని అడిగివుండవచ్చు. “షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని” ధైర్యంగా చెప్పడానికి ఇశ్రాయేలీయురాలైన ఈ పరిచారకురాలు సిగ్గుపడలేదు.—2 రాజులు 5:3.
ఈ చిన్నదాని మాటలు పిల్లల కథగా నిర్లక్ష్యం చేయబడలేదు. దానికి భిన్నంగా, బెన్హదదు రాజుకు ఆ మాటలు తెలియజేయబడ్డాయి, ఈ ప్రవక్తను కనుగొనేందుకు ఆయన నయమానును, మరితరులను 100 మైళ్ళ దూరంలోవున్న సమరయకు పంపాడు.—2 రాజులు 5:4, 5.
నయమాను స్వస్థత పొందడం
నయమాను మరియు అతని మనుష్యులు ఇశ్రాయేలు రాజైన యెహోరాము దగ్గరికి బెన్హదదు వ్రాసిన పరిచయ ఉత్తరాన్ని మరియు బోలెడు వస్తు సంబంధమైన కానుకలను తీసుకువెళ్ళారు. పరిచారకురాలైన ఆ చిన్నది నమ్మిన దేవుని ప్రవక్తయందు దూడ ఆరాధికుడైన యెహోరాము రాజు విశ్వాసం చూపించలేదనడంలో ఆశ్చర్యం లేదు. బదులుగా, నయమాను కలహాన్ని రేపడానికి వచ్చాడని ఆయన అనుకున్నాడు. యెహోరాము అనుమానించిన విషయాన్ని దేవుని ప్రవక్తయైన ఎలీషా విన్నప్పుడు, ఆయన వెంటనే నయమానును తన గృహానికి పంపించమని రాజును అభ్యర్థిస్తూ సందేశాన్ని పంపించాడు.—2 రాజులు 5:6-8.
నయమాను ఎలీషా ఇంటిని చేరుకున్నప్పుడు ప్రవక్త పంపిన ఒక దూత వచ్చి, “నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని” అతనితో చెప్పెను. (2 రాజులు 5:9, 10) నయమాను రౌద్రుడయ్యాడు. అద్భుతమైన ఆడంబరపూర్ణమైన ప్రదర్శనను ఎదురు చూసిన అతడు, “దమస్కు నదులైన అబానాయను ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నింటికంటే శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా” అని ప్రశ్నించాడు. నయమాను మహా క్రోధముతో ఎలీషా ఇంటి నుండి వెనుదిరిగాడు. అయితే నయమాను పరిచారకులు అతనితో తర్కించినప్పుడు, చివరికి అతడు లొంగాడు. యొర్దాను నదిలో ఏడు సార్లు స్నానం చేసిన తరువాత, “అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.”—2 రాజులు 5:11-14.
నయమాను ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చి, ‘చిత్తగించుము; ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఇప్పుడు ఎరుగుదును’ అని అన్నాడు. “యెహోవాకు తప్ప దహనబలియైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను” అని నయమాను ప్రతిజ్ఞ చేశాడు.—2 రాజులు 5:15-17.
మనకు పాఠాలు
దాసియైన ఆ చిన్నది ధైర్యంగా మాట్లాడకపోతే ప్రవక్తయిన ఎలీషా దగ్గరకు నయమాను వెళ్ళకపోయేవాడు. నేడు, చాలామంది యౌవనస్థులు అదే విధంగా చేస్తున్నారు. వారు పాఠశాలలో దేవుని సేవించడానికి ఆసక్తిలేని పిల్లల మధ్య ఉండవచ్చు. అయినప్పటికి, వారు తాము విశ్వసించేదానిని గురించి ధైర్యంగా మాట్లాడుతారు. వారిలో కొందరు చాలా చిన్న వయస్సులో నుండే అలా చేయడం మొదలుపెడుతారు.
ఆస్ట్రేలియాలోని ఐదేండ్ల అలెక్సాండ్రా విషయమే తీసుకోండి. ఆమె పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు, ఆమె ఉపాధ్యాయునికి యెహోవాసాక్షుల విశ్వాసాలను గూర్చి వివరించేందుకు ఆమె తల్లి అప్పాయిన్ట్మెన్ట్ తీసుకుంది. కానీ అలెక్సాండ్రా తల్లి విస్మయం చెందింది. “మీ విశ్వాసాలు చాలా వరకు నాకు తెలుసు, అలాగే అలెక్సాండ్రా పాఠశాలలో ఏమేమి చేస్తుంది, ఏమేమి చేయదో నాకిప్పటికే తెలుసు” అని ఉపాధ్యాయుడు చెప్పాడు. ఆ పాఠశాలలో సాక్షుల పిల్లలు మరెవ్వరు లేరు కనుక అలెక్సాండ్రా తల్లి ఆశ్చర్యపోయింది. “అలెక్సాండ్రా మాకు అన్నీ చెప్పింది” అని ఉపాధ్యాయుడు వివరించాడు. అవును, ఈ చిన్న అమ్మాయి తన ఉపాధ్యాయునితో అప్పటికే నేర్పుగా చర్చించింది.
అలాంటి చిన్న పిల్లలు ధైర్యంగా మాట్లాడుతారు. అలా వారు “యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది” అని చెప్పే కీర్తన 148:12, 13కు అనుగుణ్యంగా ప్రవర్తిస్తారు.