ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—ఇండియా
ఇండియా! ఈ విశాలమైన ఉపఖండం ఈ గ్రహంపైనున్న ప్రతి ఆరుగురు మనుష్యుల్లో ఒకరికి గృహం. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్లయితే, విభిన్న ప్రజలుగల ఈ దేశంలో 1,000 కంటే ఎక్కువ భాషలు, ప్రాంతీయ భాషలు వాడుకలో ఉన్నాయి. ప్రజలలో ఎక్కువమంది అంటే 83 శాతంమంది హైందవులు, 11 శాతంమంది ముస్లిమ్లు, మిగిలినవారు సిక్కులు, బౌద్ధులు, జైనులు, నామకార్థ క్రైస్తవులు.
ఇండియాలో ఇటీవలి సంవత్సరాల్లో యెహోవాసాక్షులు విశేషమైన సఫలత సాధిస్తున్నారు. అన్ని విధాలైన ఒత్తిళ్లు, వ్యతిరేకత ఉన్నప్పటికీ వారు యెహోవా రాజ్యం పక్షంగా దృఢమైన స్థానాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్న గొర్రెవంటి ప్రజలను కనుగొన్నారు.
ఉదాహరణకు, సాంప్రదాయబద్ధమైన హిందూ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి పోలియో మూలంగా బాల్యం నుండి అంగవికలురాలయ్యింది. ఆమె అనుభవించిన బాధ ఆమె దేవుని గురించి, జీవితపు సంకల్పం గురించి ఆలోచించేలా చేసింది. సమాధానం కొరకు ఆమె అనేక మతాలను పరిశీలించింది కాని ఓదార్పు పొందలేక పోయింది. ఫలితంగా ఆమె మతంలో విశ్వాసాన్ని కోల్పోయింది కాని దేవుని ఎడల ఆమెకు విశ్వాసముంది.
ఈ సమయంలో ఇద్దరు సాక్షులు తమ ఇంటింటి పరిచర్యలో ఈ అమ్మాయిని కలిశారు. “వాళ్లు ప్రకటన 21:4 చదవడం నేను విన్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్నాను” అని ఆమె గుర్తుచేసుకుంటోంది. ఆమె వాచ్టవర్ సంస్థ ప్రచురణలు అనేకం తీసుకుని తన తల్లి వ్యతిరేకిస్తున్నప్పటికీ గృహ బైబిలు పఠనానికి అంగీకరించింది. ఆ అమ్మాయి తన జీవితంలో అనేక మార్పులు చేసుకుని, బంధువుల నుండి వచ్చిన వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కొని, బాప్తిస్మం పొందిన సాక్షి అయ్యింది. ఆమె ఇలా చెబుతుంది: “నేను ఎంతో అభివృద్ధి సాధించాను, అది ఎంతో కష్టతరమైనది. కాని యెహోవా దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉండి, నాకు గొప్ప సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు.”
పాఠశాలయందు పవిత్రారాధన కొరకు దృఢనిశ్చయత
మిగతా తరగతి అంతటితో పాటు ఒక కాథోలిక్ చర్చికి వెళ్లమని ఒక యౌవనస్థురాలైన సహోదరీని ఆమె ఉపాధ్యాయురాలు కోరింది. తాను ఒక యెహోవాసాక్షినని, యెహోవానుతప్ప ఎవరినీ లేక దేనిని ఆరాధించనని చెబుతూ ఆ సహోదరి మర్యాదపూర్వకంగా నిరాకరించింది. మిగతా అందరూ చర్చికి వెళ్తున్నారు గనుక తను కూడా వెళ్లవలసిందేనని ఉపాధ్యాయురాలు చెప్పింది. కాని సహోదరి దృఢంగా నిలబడి, చర్చికి వెళ్లేవారు యెహోవాను ఆరాధించరు గనుక, తాను అక్కడ హాజరు కాకూడదని తనకు తెలుసని చెప్పింది.
ఆ బాలిక దృఢ నిశ్చయతను బట్టి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉపాధ్యాయురాలు ఇష్టపడింది. కాబట్టి మరునాడు ఆ సహోదరి యెహోవా ఆరాధనను గూర్చిన శీర్షికగల కావలికోట ఆమెకిచ్చింది. తాను చదివిన దాన్ని బట్టి ప్రభావితురాలైన ఆ ఉపాధ్యాయురాలు పాఠశాలలోని మతసంబంధమైన కార్యకలాపాలన్నిటి నుండి ఆమెకు మినహాయింపునిచ్చింది. ఆ సహోదరి ఆమెకు మరియు ఇతర ఉపాధ్యాయులకు పది పత్రికలు అందజేయగలిగింది.
రక్తాన్ని గూర్చిన దేవుని ఆజ్ఞకు లోబడినందుకు ప్రతిఫలం లభించింది
ఇటీవల కేరళ రాష్ట్రంలోని కొన్ని భాగాల్లో ఒక వైరల్ జ్వరం అంటువ్యాధిలా వ్యాపించింది. ఈ వ్యాధి మూత్రపిండాలను పూర్తిగా పాడుచేసి, డయాలసిస్ చేయవలసిన అవసరమేర్పడేలా చేస్తుంది. రక్తమార్పిడులు సాధారణంగా చేయబడతాయి. ఒక నగరంలో 14 మంది ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఈ రోగులలో ఒకరు సాక్షి, స్థానిక సంఘంలో పెద్ద. అందుబాటులోవున్న ఏకైక చికిత్స రక్తమార్పిడేనని ఆయనకు చెప్పబడింది. పెద్ద తన లేఖనాధార నమ్మకాలను వివరించి, స్థిరంగా రక్తాన్ని నిరాకరించాడు. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఎంతో వాదన జరిగిన తర్వాత, ఆయన రక్త మార్పిడిని నిరాకరిస్తున్నాడు గనుక ఆయన చనిపోవచ్చని వైద్యులు చెప్పారు.
మిగతా 13 మంది రోగులు రక్తం ఎక్కించుకున్నారు. దుఃఖకరంగా, కొద్ది రోజుల్లోనే వారందరూ మరణించారు. తప్పించుకొని బ్రతికింది సహోదరుడు మాత్రమే! ఆసుపత్రి అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు. సంఘ సభ్యులు క్రమంగా దర్శించడం వైద్య సిబ్బందిని ఎంతో ప్రభావితం చేసింది. సహోదరుడు ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వైద్యులకు కృతజ్ఞతలు తెలుపడానికి వెళ్లాడు, కాని వారిలా అన్నారు: “మాకెందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు? మీ దేవుడైన యెహోవాకు కృతజ్ఞతలు తెలుపండి. మిమ్మల్ని కాపాడింది ఆయనే. దయచేసి మా కొరకు కూడా మీ దేవుడైన యెహోవాను ప్రార్థించండి.”
[24వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1994 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 14,271
నిష్పత్తి: 1 సాక్షికి 65,266
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 38,192
సగటు పయినీర్ ప్రచారకులు: 1,780
సగటు బైబిలు పఠనాలు: 12,453
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 1,312
సంఘాల సంఖ్య: 410
బ్రాంచి కార్యాలయం: లొనావ్లా
[25వ పేజీలోని చిత్రం]
బ్రాంచి కార్యాలయం, లొనావ్లా
[25వ పేజీలోని చిత్రం]
“నిత్యసువార్త” అనే సమావేశ సందర్భంగా 1963లో సాక్ష్యమివ్వడం
[25వ పేజీలోని చిత్రం]
ఢిల్లీలో ఎర్రకోట వెలుపల ఒక విక్రయదారునికి ప్రకటించడం