క్రైస్తవులూ కులం
భారతదేశంలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
“కులవ్యవస్థ” అనే పదాన్ని మీరు విన్న వెంటనే మీకు ఏ విషయం జ్ఞాపకం వస్తుంది? బహుశ భారతదేశమూ, దానిలో ఎలాంటి కులమూ లేని కులభ్రష్టులైన వేలాదిమందీ మీకు జ్ఞాపకం వస్తుండవచ్చు. కులవ్యవస్థ హిందూ మతంలో ఒక భాగమైనప్పటికీ, తక్కువ కులాల వారిపైనా కులంలోనుండి వెలివేయబడిన వారిపైనా అది కలిగివున్న ప్రభావాన్ని నిర్మూలించేందుకు హిందూ సంఘ సంస్కర్తలు పోరాడారు. దీని దృష్ట్యా, క్రైస్తవులమని చెప్పుకునే చర్చీల్లో కూడా కుల వ్యవస్థను అవలంబిస్తున్నారని మీరు వింటే మీరెలా ప్రతిస్పందిస్తారు?
భారతదేశంలో కులవ్యవస్థ యొక్క సంభావ్య ప్రారంభం
ప్రజలను సాంఘిక క్రమంలో విభజించడం, మరి ఆ విభజనలో కొందరు తాము ఉన్నతులమని భావించడమన్నది భారతదేశానికే పరిమితం కాదు. ఖండాలన్నీ కూడా తరగతి విచక్షణను ఏదో ఒక రూపంలో అనుభవించాయి. భారతదేశంలోని కులవ్యవస్థను భిన్నమైనదానిగా చేసినది, దాదాపు 3,000 సంవత్సరాల పూర్వం, సాంఘికపరంగా అణచివేసే ఒక పద్ధతి మతంలోకి ప్రవేశపెట్టబడిందన్న వాస్తవమే.
కులవ్యవస్థ కచ్చితంగా ఎలా ప్రారంభమైందో తెలియకపోయినప్పటికీ, ఆధునిక పాకిస్తాన్లోని ప్రాచీన సింధు లోయ నాగరికతలో దీని వేర్లు ఉండవచ్చని కొన్ని అధికారిక మూలాలు చెబుతున్నాయి. అక్కడున్న తొలి వాస్తవ్యులు, “ఆర్యుల వలస” అని సాధారణంగా పిలువబడుతున్న దానిలో అంటే వాయవ్యం నుండి వచ్చిన జాతుల వారి చేత తర్వాత జయించబడ్డారని పురాతత్వశాస్త్రం సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే తన పుస్తకంలో, “మొదటి గొప్ప సాంస్కృతిక సంశ్లేషం మరియు విలీనత” అని జవహర్లాల్ నెహ్రూ పిలిచిన ఈ వలస ప్రయాణంనుండే “భారతీయ జాతులూ మరియు మూల భారతీయ సంస్కృతీ” పుట్టాయి. అయితే ఈ విలీనత జాతుల సమానతకు దారితీయలేదు.
ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా పేర్కొంటుంది: “(ధర్మం విషయమై హిందూ వ్రాతల్లో నిషేధించబడిన) కులాంతర మతాంతర వివాహాల మూలంగా ఏర్పడిన నాలుగు తరగతులు లేక వర్ణాలు ఉపవిభాగాలుగా విభాగించబడటం ద్వారా కులాలు వృద్ధి చెందేందుకు హిందువులు కారణమయ్యారు. అయితే, కుటుంబ ఆనుష్ఠానాచారాల, జాతుల భిన్నత్వాల, మరియు వృత్తుల తేడాలూ ప్రత్యేకతల మూలంగా కులాలు ఉత్పన్నమయ్యాయని ఆధునిక తత్త్వజ్ఞులు నమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. మామూలు వర్ణ వ్యవస్థ అనేది కేవలం ప్రయోగాత్మక మతపర సాంఘిక భావరూపమై ఉంటుందనీ మరియు హిందూ సమాజం 3,000 కులాలూ ఉపకులాలుగా ఎంతో సంక్లిష్టంగా విభజింపబడటమనేది ప్రాచీన సమయాల్లో కూడా ఉనికిలో ఉండి ఉంటుందనీ కూడా అనేకమంది ఆధునిక పండితులు భావిస్తున్నారు.”
కొంత కాలం వరకూ తరగతుల మధ్య వివాహాలు జరిగాయి, మరియు చర్మ ఛాయపై ఆధారపడిన పూర్వపు విభేదాలు అంతగా స్పష్టంగా లేకుండినవి. కులాన్ని నియంత్రిస్తున్న కట్టుదిట్టమైన నియమాలనేవి తర్వాత వచ్చిన మతపర మార్పులు, అవి వేదాలూ హిందూ మునియైన మనువు యొక్క స్మృతి (లేక క్రోడీకరణ)లో పేర్కొనబడ్డాయి. ఉన్నత కులాల వారు, తమను తక్కువ కులాల వారినుండి వేరుచేసే పవిత్రతతో జన్మించారని బ్రాహ్మణులు బోధించారు. వారికివ్వబడిన నీచమైన పనులు, వారు పూర్వ జన్మలో చేసిన చెడు క్రియలకు దేవుడు విధించిన శిక్షయనీ మరియు కుల వివక్షను త్యజించాలనే ఎలాంటి ప్రయత్నమైనా కూడా వారిని కులభ్రష్టులుగా చేస్తుందనే నమ్మకాన్ని బ్రాహ్మణులు శూద్రులకు లేక తక్కువ కులాల వారికి నూరిపోశారు. కులాంతర వివాహం చేసుకోవడం, సహపంక్తి భోజనం చేయడం, శూద్రులు ఉపయోగించే నీటి సరఫరాను ఉపయోగించడం లేక వారు పోయే దేవాలయంలోకి ప్రవేశించడం ఉన్నత కులానికి చెందిన వ్యక్తి తన కులాన్నే పోగొట్టుకునేందుకు దారితీయవచ్చు.
ఆధునిక వాతావరణంలో కులం
మరి 1947లో స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత, కులవిచక్షణను ఒక నేరంగా పరిగణించిన ఒక రాజ్యాంగాన్ని భారతదేశ సెక్యులర్ ప్రభుత్వం స్థాపించింది. తక్కువ కులాల హిందువులకు శతాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తూ, షెడ్యూల్డ్ కులాల మరియు జాతుల వారికి ప్రభుత్వ పోస్టులనూ, ఎంపిక చేయబడిన పోస్టులను అలాగే విద్యా సంస్థాపనల్లో సీట్లనూ రిజర్వు చేయడాన్ని క్రమబద్ధీకరించింది.a ఈ హిందూ గుంపుల కొరకు ఉపయోగించబడుతున్న ఒక పదం “దళితుడు” అంటే “అణచివేయబడిన, పీడించబడిన” అని అర్థం. అయితే ఇటీవలి వార్తాపత్రిక ముఖ్యశీర్షిక ఇలా పేర్కొన్నది: “దళిత క్రైస్తవులు రిజర్వేషన్ల [ఉద్యోగ మరియు విశ్వవిద్యాలయ కోటాల] కొరకు డిమాండు చేయడం.” ఇదెలా సంభవించింది?
తక్కువ కులాలకు చెందిన హిందువులకు ఇవ్వబడిన విస్తృత ప్రభుత్వ ప్రయోజనాలు, కులవ్యవస్థ మూలంగా వారు అన్యాయాలను అనుభవించారన్న వాస్తవంపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కులవ్యవస్థను ఆచరించని మతాలు ఈ ప్రయోజనాలు అపేక్షించలేరని తర్కించడం జరిగింది. అయితే, మేము కూడా తక్కువ కులాల వారిమి లేక అంటరానివారిమి, మతం మార్చుకున్న వారిమి గనుక, మేము హిందువుల నుండే కాకుండా మా ‘తోటి క్రైస్తవుల’ నుండి కూడా వివక్షకు గురవుతున్నామని దళిత క్రైస్తవులు చెప్పుకుంటారు. ఇది వాస్తవమా?
క్రైస్తవమత సామ్రాజ్య మిషనరీలు మరియు కులం
అనేకమంది హిందువులు, క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంటు వారైన పోర్చుగీస్, ఫ్రెంచి, మరియు బ్రిటీష్ మిషనరీల చేత వారు వలస వచ్చినప్పుడు మార్చబడ్డారు. అన్ని కులాలకు చెందిన వారూ నామకార్థ క్రైస్తవులయ్యారు, కొందరు ప్రచారకులు బ్రాహ్మణులను ఆకర్షించగా ఇతరులు అంటరానివారిని ఆకర్షించారు. కులవ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన నమ్మకంపై మిషనరీల బోధా మరియు ప్రవర్తనలు ఏ ప్రభావాన్ని చూపాయి?
భారతదేశంలో ఉన్న బ్రిటీష్వారిని గురించి మాట్లాడుతూ, చర్చీల్లో “భారతీయ సంఘస్థులు యూరప్ సంఘస్థులతో కూర్చునేందుకు అనుమతింపబడే వారు కాదని” నీరాద్ చౌదరి అనే రచయిత చెబుతున్నాడు. “తమ జాతి ఇతర జాతులకంటే ఉన్నతమైనదనే అభిప్రాయంతోనే బ్రిటీష్ పరిపాలన భారతదేశంలో కొనసాగింది, అది క్రైస్తవత్వం చేత మరుగుపర్చబడలేదు.” అదే విధమైన దృక్పథాన్ని చూపిస్తూ, తక్కువ కులాలకు చెందిన ప్రజలను మార్చడం “చర్చిలోకి చెత్తంతా జమచేయడం” వలె ఉందని అంటూ అమెరికాకు చెందిన బోర్డ్ ఆఫ్ ఫారిన్ మిషన్స్కు ఒక మిషనరీ 1894లో నివేదించాడు.
తొలి మిషనరీలు తమ జాతే ఉన్నతమైనదనే అభిప్రాయాన్ని కలిగివుండటం మరియు చర్చి బోధలతో బ్రాహ్మణుల బోధలు విలీనం కావడం, భారతదేశంలో క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు కులవ్యవస్థను బట్టబయలుగా ఆచరించేందుకు ముఖ్యంగా కారణమైందన్న విషయం స్పష్టమౌతుంది.
నేడు చర్చీల్లో కులం
క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియాను 1991లో సంభోదిస్తూ క్యాథలిక్ ఆర్చిబిషప్ జార్జ్ జర్ ఇలా చెప్పాడు: “షెడ్యూల్డ్ కులాలకు చెందిన, మతం మార్చుకున్న వారిని ఉన్నత కులాలకు చెందిన హిందువులేగాక ఉన్నత కులాలకు చెందిన క్రైస్తవులు కూడా తక్కువ కులాల వారిగా పరిగణిస్తున్నారు. . . . స్థానిక చర్చీల్లోనూ భూస్థాపనా స్థలాల్లోనూ వారికి వేర్వేరుగా స్థలాలు కేటాయించబడ్డాయి. కులాంతర వివాహాలు చేసుకునే వారిని అసహ్యించుకుంటున్నారు . . . మతగురువుల మధ్య కులతత్వం చాలా విపరీతంగా ఉంది.”
ఐక్య ప్రొటెస్టెంటు చర్చి అయిన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు బిషప్ అయిన ఎమ్. అజరయ్య, ది అన్క్రిస్టియన్ సైడ్ ఆఫ్ ది ఇండియన్ చర్చ్ అనే తన పుస్తకంలో ఇలా చెప్పాడు: “షెడ్యూల్డ్ కులాలకు చెందిన (దళిత) క్రైస్తవులు తమ తప్పేమీ లేనప్పటికీ, వారు తక్కువ కులాల వారికి జన్మించినందున వారు అనేక చర్చీల్లో తమ తోటి క్రైస్తవుల ద్వారా అణచివేయబడుతున్నారు, వారు అలా అన్యాయాన్ని అనుభవిస్తున్నారు, వారు రెండవ, మూడవ లేక నాల్గవ తరం క్రైస్తవులైనప్పటికీ వారలా అనుభవించవలసి వస్తోంది. అల్పసంఖ్యాకులైన ఉన్నత కులాల క్రైస్తవులు క్రైస్తవత్వ నమ్మకమూ ఆచరణల ద్వారా ఎంతమాత్రం ప్రభావితం చెందకుండా తరతరాలుగా అలా కుల వివక్షను చర్చిలో కొనసాగిస్తున్నారు.”
మండల్ కమీషన్ అని పిలువబడే, భారతదేశంలోని వెనుకబడిన తరగతుల వారి సమస్యలను గురించి ప్రభుత్వ నియమిత అన్వేషణా సంస్థ, కేరళలోని క్రైస్తవులమని చెప్పుకునే వారు కూడా “తమ కుల పూర్వరంగం ఆధారంగా విభిన్న జాతి సంబంధ గుంపులుగా విభజింపబడి ఉన్నారని తెలుసుకుంది. . . . తక్కువ కులాలకు చెందిన వారు మతం మార్చుకున్న తర్వాత కూడా, వారి ఎడల ఇంకా హరిజనులలాగే వ్యవహరించడం జరుగుతోందిb . . . అదే చర్చికి చెందిన సిరియన్ మరియు పులాయా సభ్యులు తమ మతాచారాలను వేరు వేరుగా వేర్వేరు కట్టడాల్లో జరుపుకుంటారు.”
ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 1996 నాటి వార్తా నివేదిక దళిత క్రైస్తవులను గురించి ఇలా చెప్పింది: “తమిళనాడులో వారు ఉన్నత కులాల వారినుండి ఆవాసితక్షేత్ర పరంగా విభాగించబడ్డారు. కేరళలో, వారు సాధారణంగా భూములులేని కూలీపని వారు, వారు సిరియన్ క్రైస్తవులవద్దా భూములున్న ఇతర ఉన్నత కులాల వారివద్దా పని చేస్తారు. దళితులూ సిరియన్ క్రైస్తవులూ సహపంక్తి భోజనాలు చేయడం లేక కులాంతర వివాహాలు చేసుకోవడమనే ప్రశ్నే లేదు. అనేక సందర్భాల్లో, దళితులు తమ సొంత చర్చీల్లో, అంటే ‘పులాయా చర్చి’ లేక ‘పరాయా చర్చి’ అని పిలువబడే వాటిలో ఆరాధన జరుపుకుంటారు.” ఇవి ఉపకులాల పేర్లు. “పరాయా” అనే పదానికున్న ఆంగ్లీకృత ఉచ్చారణ “పారియ.”
అసంతృప్తి ఎడల ప్రతిస్పందనలు
ఫేస్ [FACE] (ది ఫోరమ్ అగెనెస్ట్ క్రిస్టియన్ ఎక్స్ప్లాయిటేషన్) వంటి, చర్చి సభ్యులైన కార్యకర్తల గుంపులు, దళిత క్రైస్తవుల కొరకు ప్రభుత్వ ప్రయోజనాలను వెదుకుతున్నారు. మతం మార్చుకున్న క్రైస్తవుల కొరకు ఆర్థిక సహాయం లభించాలన్నదే వారి ముఖ్య ధ్యేయం. అయితే, ఇతరులు చర్చిలోపల వారి ఎడల ప్రవర్తిస్తున్న విధానాన్నిబట్టి చింత కలిగి ఉన్నారు. పోప్ జాన్ పాల్ IIకు వ్రాసిన ఒక లేఖలో, తాము “కులవ్యవస్థ నుండి విముక్తి పొందేందుకు క్రైస్తవత్వాన్ని హత్తుకున్నామనీ” అయితే తాము గ్రామ చర్చిలో ప్రవేశించేందుకూ లేక చర్చి సర్వీసులో పాల్పంచుకునేందుకూ అనుమతించబడటం లేదని అందులో సంతకం చేసిన దాదాపు 120 మంది పేర్కొన్నారు. వారు ఒక ఏకైక వీధిలో ఇళ్ళు నిర్మించుకునేందుకు బలవంతం చేయబడ్డారు, ఉన్నత కులాల క్రైస్తవులుగానీ ఇతర ప్రీస్టులుగానీ ఎన్నడూ అటుగా వెళ్ళలేదు! అదే విధంగా కలత చెందిన ఒక క్యాథలిక్ స్త్రీ ఇలా చెబుతుంది: “నా కొడుకు మంచి కాలేజీలో చదువుకోవాలన్నది నాకెంతో ప్రాముఖ్యం. అయితే వాణ్ణి తన తోటి [క్యాథలిక్] సహోదరులు తమ సమానునిగా అంగీకరించాలన్నది అంతకంటే ప్రాముఖ్యమైన విషయం.”
దళిత క్రైస్తవుల పరిస్థితిని బాగుపర్చాలని కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇతరులు సహనాన్ని కోల్పోతున్నారు. విశ్వ హిందూ పరిషత్ వంటి రాజకీయ పార్టీలు మతం మార్చుకున్న క్రైస్తవులను తిరిగి హిందూ గుంపులోకి తీసుకువచ్చేయాలని ప్రయత్నిస్తున్నాయి. 10,000 మంది ప్రజలు హాజరైన మరియు అందులో 600 కంటే ఎక్కువ “క్రైస్తవ” కుటుంబాలు హిందూ మతాన్ని తిరిగి హత్తుకున్న ఒక మతకర్మను గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది.
నిజమైన క్రైస్తవ మార్గం
చర్చి సంస్థలకు చెందిన మిషనరీలు, ప్రేమపై ఆధారపడిన క్రీస్తు బోధలను బోధించివుంటే, “బ్రాహ్మణ క్రైస్తవులూ” లేక “దళిత క్రైస్తవులు” లేక “పరాయా క్రైస్తవులు” అనే వారు ఉండేవారే కాదు. (మత్తయి 22:37-40) దళితులకు వేరే చర్చీలూ మరియు భోజనం చేసేవద్ద వేర్వేరు పంక్తులూ ఉండేవి కాదు. తరగతి వివక్షలను అన్నింటినీ అధిగమించి స్వేచ్ఛను ప్రసాదించే ఈ బైబిలు బోధ ఏమిటి?
“ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు . . . ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.”—ద్వితీయోపదేశకాండము 10:17.
“సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 1:10.
“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.”—యోహాను 13:35.
దేవుడు పూర్తి మానవజాతిని ఒక మనిషి నుండి చేశాడని బైబిలు బోధిస్తుంది. ఆ ఒక్క మనిషి నుండి వచ్చిన సంతానమంతా కూడా ‘దేవుడు మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు గనుక ఆయనను తడవులాడి కనుగొనాలి’ అని కూడా అది చెబుతుంది.—అపొస్తలుల కార్యములు 17:26, 27.
తొలి క్రైస్తవ సంఘంలోకి తరగతి విభేదాలు మెల్లిగా ప్రాకి వచ్చినప్పుడు, ప్రేరేపించబడిన రచయితయైన యాకోబు దాన్ని స్పష్టంగా ఖండించాడు. ఆయనిలా చెప్పాడు: “మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?” (యాకోబు 2:1-4) నిజ క్రైస్తవ బోధ ఏ విధమైన కులవ్యవస్థనూ అనుమతించదు.
నూతనలోక ఆలోచనావిధానం యొక్క అవసరత
అనేక వేర్వేరు మతాలనుండి వారు నేర్చుకున్న పూర్వపు నమ్మకాలూ ప్రవర్తనలను మార్చుకునేందుకు లక్షలాదిమంది యెహోవాసాక్షులు సుముఖంగా ఉన్నారు. తాము ఇతరులకంటే ఉన్నతులమనే లేక తాము ఇతరులకంటే తక్కువవారిమనే భావాలు, అవి వలస వచ్చిన వారు స్వాధీనం చేసుకున్నప్పుడు, జాతి, జాతి వెలి విధానం లేక కులవ్యవస్థలో వేరుపారినవైనప్పటికీ, అలాంటి భావాలను బైబిలు బోధలు వారి మనస్సుల్లోనుండీ హృదయాల్లోనుండీ తీసివేశాయి. (రోమీయులు 12:1, 2) ‘నీతి నివసించు క్రొత్త భూమి’ అని బైబిలు చెబుతున్న దాన్ని వారు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కష్టాలను అనుభవిస్తున్న భూమిపైనున్న వేలాదిమందికి అదెంతటి గొప్ప ఉత్తరాపేక్షనో కదా!—2 పేతురు 3:13.
[అధస్సూచీలు]
a హిందువుల్లోని తక్కువ కులాల వారిని, లేక కులభ్రష్టులను, అంటరానివారిని అంటే సాంఘికంగానూ ఆర్థికంగానూ లేమిననుభవించిన వారిని సంభోదించేందుకు “షెడ్యూల్డ్ కులాలు” అనేది అధికారిక పదం.
b తక్కువ కులాల వారికి ఎమ్. కే. గాంధీ పెట్టిన పేరు అది. అంటే విష్ణు దేవుని పేర్లలో ఒకటైన “హరికి చెందిన ప్రజలు” అని అర్థం.
[21వ పేజీలోని బ్లర్బ్]
‘దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.’
[19వ పేజీలోని బాక్సు/చిత్రం]
వివక్షను అనుభవించడం ఎలా ఉంటుంది?
నిజమే, క్రైస్తవులమని చెప్పుకునే వారే మిమ్మల్ని కులభ్రష్టులని అసహ్యించుకుంటే, అప్పుడెలా అనిపిస్తుంది? చెరామార్ లేక పులాయా అనే హిందూ తక్కువ కులం నుండి, “ఒక క్రైస్తవుని” పూర్వికులు మతమార్పిడి చేసుకున్నారు, కొన్ని సంవత్సరాల క్రితం తన సొంత రాష్ట్రమైన కేరళలో జరిగిన ఒక సంఘటనను ఆయనిలా వివరిస్తున్నాడు:
నేను ఒక వివాహ వేడుకకు ఆహ్వానించబడ్డాను, అక్కడున్న అతిథుల్లో అనేకమంది చర్చి సభ్యులు. వారు నన్ను రిసెప్షన్లో చూసినప్పుడు, అక్కడ చాలా అలజడి చెలరేగింది, మరి ఆర్థడాక్స్ సిరియన్ చర్చికి చెందిన వారు ఒక పులాయాన్తో సహపంక్తి భోజనం చేయరు గనుక నేను అక్కడనుండి వెళ్లిపోతేగానీ తాము రిసెప్షన్లో ఉండేది లేదని వారు చెప్పేశారు. పెళ్లికూతురు తండ్రి వారి దబాయింపులను వినిపించుకోకపోయేసరికి వారంతా కలిసి రిసెప్షన్నుండి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత, భోజనం వడ్డించారు. అయితే వడ్డించేవారు నేను భోంచేసిన అరిటాకు ఎత్తేసేందుకూ, నా బల్ల శుభ్రం చేసేందుకూ నిరాకరించారు.
దక్షిణ భారతదేశంలోని, కేవలం తక్కువ కులాల వారు మాత్రమే కూడుకునే ఒక చర్చి