రాజ్య ప్రచారకుల నివేదిక
“నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి”
యెహోవా ఆజ్ఞలలో ప్రతి ఒక్కదానికి విధేయులు కావాలని మోషే తన మరణానికి కొంచెం ముందు ఇశ్రాయేలు జనాంగానికి ఉపదేశించాడు. “మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపించవలెను. ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే” అని ఆయన అన్నాడు.—ద్వితీయోపదేశకాండము 32:46, 47.
వందలాది సంవత్సరాల తర్వాత, “యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి” అని కీర్తనల రచయిత చెప్పినప్పుడు, దేవుని బోధలన్నింటి ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పాడు. (కీర్తన 119:151) “దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట” యొక్క విలువను మొదటి శతాబ్దంలో యేసు తానుగా సూచించాడు. (మత్తయి 4:4) ‘ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది, అది ప్రయోజనకరమైనది’ అని అపొస్తలుడైన పౌలు దేవుని నడిపింపు క్రింద వ్రాశాడు.—2 తిమోతి 3:16.
స్పష్టంగా, తన వాక్యపు పుటల్లో మనకు అందించబడిన సందేశాన్నంతటికీ తన ఆరాధికులు గంభీరమైన శ్రద్ధనివ్వాలని యెహోవా దేవుడు అపేక్షిస్తున్నాడు. బైబిలులోని ఒక్క వాక్యభాగం కూడా విలువలేనిది కాదు. మారిషన్లోని ఈ క్రింది అనుభవం ద్వారా తెలుపబడినట్లు, యెహోవాసాక్షులు దేవుని వాక్యాన్ని అలాగే భావిస్తారు.
మిస్టర్ డి.——ఒక కుగ్రామంలో నివసించాడు, అక్కడ ఆయన కాపలావానిగా ఉండేవాడు. ఆయన చాలా కాలంగా దేవున్ని ఆరాధించే సరైన మార్గం కోసం యథార్థంగా వెదుకుతున్నాడు. రాత్రివేళ ఆయన కాపలా కాసే సమయంలో బైబిలు చదవనారంభించాడు. చివరికి ఆయన బైబిలును మొదట నుండి చివరి వరకు చదివేశాడు. తన హిందీ బైబిలులో అనేకసార్లు కనిపించే యెహోవా అనే పేరు దేవుని పేరు అని ఆయన తెలుసుకున్నాడు. ప్రకటన గ్రంథం చాలా ఆసక్తికరమైనదని ఆయన కనుగొన్నాడు.
బైబిలు అంతటినీ అనుసరించే ఏదైనా మతముందా అని ఆయన తనను తాను ప్రశ్నించుకున్నాడు. తనకు పరిచయమున్న మతస్థులు బైబిలులో తమకు అనుకూలమైన కొన్ని భాగాలను మాత్రమే అనుసరిస్తున్నారని ఆయన గమనించాడు. కొన్ని మతశాఖలు హెబ్రీ లేఖనాలను అంగీకరించి, క్రైస్తవ గ్రీకు లేఖనాలను తిరస్కరించాయి. మిగిలిన మతశాఖలు ఆచరణాత్మక విలువను కేవలం క్రైస్తవ గ్రీకు లేఖనాలకే ఆపాదిస్తూ హెబ్రీ లేఖనాలను వదిలిపెట్టాయి.
ఒకరోజు ఇద్దరు దంపతులు వర్షంలో తడిసిపోవడం చూసిన మిస్టర్ డి.——తన ఇంట్లో తలదాచుకోమని వారిని ఆహ్వానించాడు. వారు యెహోవాసాక్షులు. ప్రకటన—దాని ముగింపు సమీపించింది!a అనే పుస్తకాన్ని భార్య పట్టుకుని ఉంది. వెంటనే మిస్టర్ డి.——ఆ పుస్తకం కావాలని అడిగాడు. ప్రకటనలోని ప్రవచనాన్ని గూర్చిన సమాచారాన్ని గ్రహించడం ఆయనకు చాలా కష్టంగా ఉంటుందని ఆ సాక్షులు భావించి, దానికి బదులుగా మరొక పుస్తకాన్ని ఆయనకు ప్రతిపాదించారు. కాని మిస్టర్ డి.——తనకు ప్రకటన పుస్తకం కావాలని మొండిపట్టు పట్టాడు.
ఆయన తన ప్రతిని పొందినప్పుడు, ఆయన ఆ పుస్తకాన్ని త్వరగా చదివేశాడు. ఆ తర్వాత ఆయన యెహోవాసాక్షులతో బైబిలు పఠనాన్ని అంగీకరించాడు. యెహోవాసాక్షులు పూర్తి బైబిలును ఎంతో ఉన్నతంగా ఎంచుతారన్న వాస్తవంవల్ల ముగ్ధుడయ్యాడు. హెబ్రీ లేఖనాలను, గ్రీకు లేఖనాలను శ్రద్ధగా పఠించే యెహోవాసాక్షుల రాజ్య మందిరానికి క్రమంగా హాజరు కావడమారంభించాడు. ఆయన ఇప్పుడు ఒక రాజ్య ప్రచారకుడు మరియు క్రైస్తవ సంఘంలో బాప్తిస్మం పొందిన సభ్యుడు.
[అధస్సూచీలు]
a వాచ్టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.