విభాగించబడిన చర్చి—అది నిలువగలదా?
“క్రీస్తును గూర్చిన రక్షణ సత్యం కల్గివున్నవారందరూ దృశ్యమైన చర్చికి చెందినవారే. క్రైస్తవమత సామ్రాజ్యపు విభాగాలు—ఈస్టర్న్ ఆర్థడాక్స్ మరియు వెస్టర్న్ మధ్యగానీ, రోమన్ కాథోలిక్ చర్చి, రిఫార్మేషన్ చర్చీల మధ్య గానీ ఉన్న విభాగాలు ఒక చర్చిలోని విభాగాలే.” (కిస్టియన్స్ ఇన్ కమ్యూనియన్) ఓ రచయిత క్రైస్తవత్వాన్ని అలా దృష్టిస్తున్నాడు—ఎంతో గొప్ప పరిధిలో చెదిరివున్న మతాలతో కూడిన ఒక కుటుంబంగా, అందరూ యేసుక్రీస్తులో ఏదో ఒక విధమైన విశ్వాసాన్ని కనబరుస్తారు.
అయినప్పటికీ, అది విరుద్ధమైన నమ్మకాలూ ప్రవర్తనా రీతులుగల విభాగించబడిన కుటుంబము. “ఆధునిక దిన క్రైస్తవత్వంలో . . . బస్సు ఎక్కేందుకు కావల్సిన ప్రమాణాలకంటే చర్చి సభ్యులయ్యేందుకే అల్పమైన ప్రమాణాలున్నాయి,” అని ఓ పరిశీలకుడు చెబుతున్నాడు. అయితే, దాని ఆత్మీయ స్థితిని మనం ఎలా కనిపెట్టాలి? బాసిల్ బట్లర్ అనే కాథోలిక్కు బిషప్ యిలా నిర్థారించాడు: “విభాగించబడిన క్రైస్తవత్వం నిజంగా ఎంతో అస్వస్థతగా ఉంది.” (ది చర్చి అండ్ యూనిటీ) అస్వస్థత ఎలా ప్రారంభమైంది? అది కోలుకునే ఆశలేమైనా ఉన్నాయా?
“పాప పురుషుడు”
అపొస్తలుడైన పౌలు అనైక్యత వృద్ధి చెందుతుందని హెచ్చరించాడు. క్రీస్తు ప్రత్యక్షత సమీపంలో ఉందని తలంచిన థెస్సలొనీకలోని క్రైస్తవులకు ఆయన యిలా రాశాడు: ‘మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెను. . . . మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము [యెహోవా దినము] రాదు.’—2 థెస్సలొనీకయులు 2:2, 3.
ఈ “పాప పురుషుడు” క్రైస్తవ సంఘంలోకి మత భ్రష్టతను, తిరుగుబాటును ప్రవేశపెట్టాడు. అతనెవరు? అతను ఒక మనిషి కాదు, బదులుగా, అతను క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకుల తరగతై ఉన్నాడు. ఈ తరగతి యేసు అపొస్తలులు మరణించిన తర్వాత వెంటనే, మతభ్రష్టత్వపు సంఘంపై తన్నుతాను ఉన్నతపర్చుకుని, చివరికి త్రిత్వం, మానవ ఆత్మ అమర్త్యతలవంటి అన్య మత సిద్ధాంతాలను బోధించడం ప్రారంభించింది. (అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 పేతురు 2:1-3) ఓ మరణకర అంటువ్యాధిలా, అనైక్యతకు నడిపించే దయ్యాల ప్రేరేపితమైన ఆలోచనలతో అది క్రైస్తవ సంఘమనబడే దానికి సోకింది.—గలతీయులు 5:7-10.
అపొస్తలుడైన పౌలు దినాల్లో అప్పటికే ఈ అంటువ్యాధి ప్రారంభమైంది. ఆయన యిలా రాశాడు: “ధర్మవిరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసివేయబడు వరకే అడ్డగించును.” (2 థెస్సలొనీకయులు 2:7) మతభ్రష్టత్వపు విషం పనిచేయకుండా అపొస్తలులు నిరోధకంగా పనిచేశారు. వారి ఐక్యపర్చే ప్రభావం తీసివేయబడినప్పుడు, అదుపులేని మతభ్రష్టత్వం కొరుకుడు పుండులా వ్యాపించింది.—1 తిమోతి 4:1-3; 2 తిమోతి 2:16-18.
ఈ “పాప పురుషుని” చర్యలు ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతున్నాయి. “లైంగిక మరియు వేదాంత వ్యధలోని చర్చి”పై యిటీవల వెలువడిన నివేదికలో, చర్చి అఫ్ ఇంగ్లాండ్కు చెందిన ప్రధాన గురువునకు తర్వాతి వ్యక్తి యిలా ఫిర్యాదు చేసినట్లుగా సూచించబడింది: “వివాహం వెలుపల లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని మత నాయకులను కోరిన ప్రతిపాదనలు తృణీకరించబడ్డాయి. సలింగసంయోగాన్ని అభ్యసించేవాళ్లు నియమించబడ్డారు. వారు మంచిని చెడుగా చెడును మంచిగా చేశారు.”—ది సన్డే టైమ్స్ మాగజైన్, లండన్, నవంబరు 22, 1992.
గోధుమలు, గురుగులు
నిజమైన క్రైస్తవత్వం తాత్కాలికంగా కనుమరుగౌతుందని యేసుక్రీస్తే బోధించాడు. క్రైస్తవ సంఘాన్ని కనుగొనడమనేది పొలంలో మంచి విత్తనాన్ని విత్తే ఒక వ్యక్తిని పోలి ఉంటుందని ఆయన చెప్పాడు. అయితే, “అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను” అని యేసు అన్నాడు. గురుగులను పెరికివేసే ప్రయత్నం చేయాలా అని తన సేవకులు తనను అడిగినప్పుడు పొలం యజమాని యిలా అన్నాడు: “వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.” గోధుమలూ గురుగులూ కలిసి ఉండడం ఎప్పటివరకు కొనసాగుతుంది? పొలం యజమాని యిలా అన్నాడు: “కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి.”—మత్తయి 13:25, 29, 30.
“కోతకాలము” వరకు లేక “యుగసమాప్తి” యొక్క అంత్యదినములలో జరిగే వేరుపర్చే సమయంవరకు నకిలీ క్రైస్తవులు నిజ క్రైస్తవులు ప్రక్కప్రక్కనే పెరిగారు. (మత్తయి 28:20) అపవాదియైన సాతాను, అవినీతికరమైన, విభాగించబడిన నకిలీ క్రైస్తవ సంఘాన్ని సృష్టించడానికి మత భ్రష్టులను ఉపయోగించుకున్నాడు. (మత్తయి 13:36-39) నిజమైన క్రైస్తవత్వాన్ని పోలిన సిగ్గుమాలిన నకిలీ క్రైస్తవత్వాన్ని వారు ఉత్పన్నంచేశారు. (2 కొరింథీయులు 11:3, 13-15; కొలొస్సయులు 2:8) శతాబ్దాలుగా చర్చి ముక్కలు ముక్కలవుతున్నకొలది, నిజ క్రైస్తవులను గుర్తించడం చాలా కష్టమైపోయింది.
కొత్త విభాగాలు
ఆధునిక దినాల్లో, “కొత్త విభాగాలు కనిపించాయి, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మశక్తివలన పొందిన స్వస్థతతో వ్యక్తిగత విశ్వాసం, అనుభవాలపైన ఎక్కువ శ్రద్ధ నిలుపుతుంది” అని ది టెస్టింగ్ ఆఫ్ ది చర్చస్—1932-1982 చెబుతోంది. ఆసక్తికరంగా, కొందరు తిరిగి జన్మించటం, పరిశుద్ధాత్మ వరాలను పొందే ఈ ఉద్యమాలను కొత్తగా ఏర్పడే చీలికలుగా కాకుండా, అవి ఆత్మీయంగా కోలుకోడానికి సూచనలని కొందరు భావిస్తున్నారు. ఉదాహరణకు, ఉత్తర ఐర్లాండ్, 1850లలో యిలాంటి పునరుద్ధరణను చూసింది. ఉన్నతమైన ఆశలు చిగురించాయి. “ప్రెస్బెటేరియన్లు, వెస్లీయన్లు, ఇండిపెండెట్ సేవకుల మధ్యగల . . . బ్రాతృత్వభావ ఐక్యత”ను గూర్చి, చెబుతూ, “పారవశ్యం, నిద్ర, దర్శనాలు, కలలూ అద్భుతాలను గూర్చి కొత్త నివేదికలు ప్రతిదినమూ” వస్తున్నాయని ఒక నివేదిక తెలియజేసింది.—రిలిజియస్ రివైవెల్స్.
చర్చిని పునరుద్ధరించడం కొరకు దేవుని ఆత్మ పనిచేస్తుందనడానికి నాటకీయమైన ఈ ప్రదర్శనలు ఒక రుజువుగా అనేకులు భావించారు. “అతి ఉన్నత భావంలో దేవుని చర్చి, ఈ ప్రాంతాలలో పునరుద్ధరించబడింది” అని ఓ పరిశీలకుడు చెప్పాడు. అయినప్పటికీ, ఈ ప్రత్యేక పునరుద్ధరణ, “అల్సటర్ ప్రాంతాల్లోని మత చరిత్రలోనే ఓ మహిమాన్విత, అసాధారణ శకమని” కొనియాడబడినప్పటికీ, అదే కానీ లేక ఏ యితర పునరుద్ధరణలు గానీ, ఆత్మీయ పునర్జన్మను పొందామని చెప్పుకునే వారి మధ్య మత ఐక్యతను ఉత్పన్నంచేయలేదు.
అయితే, అలాంటి వాళ్లు, అతి ముఖ్యమైన మరియు మూల విషయాల్లో తాము ఐక్యంగానే ఉన్నామని తర్కిస్తుంటారు. అయితే, మిగిలిన క్రైస్తవమత సామ్రాజ్యం కూడా యిదే తర్కాన్ని ఉపయోగిస్తోంది. “తమను విభాగించే విషయాలకన్నా వారిని ఐక్యపర్చే విషయాలు యిప్పటికి ఎక్కువ ప్రాముఖ్యమని” తమను తాము సమర్థించుకుంటున్నారు. (ది చర్చ్ ఆండ్ యూనిటి) క్రైస్తవమత సామ్రాజ్యం యిలా చెబుతోంది: “ఒకరితో ఒకరం, అలాగే యితర క్రైస్తవులందరితోనూ మేము కల్గివుండే ముఖ్యమైన ఐక్యత, క్రీస్తుయందు బాప్తిస్మం పొందడంలో వేరుపారి ఉంది.” (క్రిస్టియన్స్ యిన్ కమ్యూనియన్) అయితే, యేసునందు అందరూ విశ్వసిస్తున్నారు గనుక విభాగాలు ప్రాముఖ్యం కావని చెప్పడం, నీ గుండె దృఢంగా ఉన్నంతకాలం క్యాన్సర్ అంత గంభీరమైనదేంకాదని చెప్పినట్లుంటుంది.
వాస్తవమేమిటంటే, అలాంటి ఆధునిక మత ఉద్యమాలు, మరింత అయోమయాన్ని సృష్టించి, ఒప్పింపజేసుకునేలా బోధించే బోధకులు తమకొరకు మనుష్యులను పోగుచేసుకునేలా చేసి ఆత్మీయ అరాచకత్వాన్ని ఉత్పన్నం చేసింది. అనేకులను తప్పుదోవ పట్టించిన ఆత్మీయ నాయకుల్లో జిమ్ జోన్స్, డేవిడ్ కోరెష్ యిటీవలి ఉదాహరణలు. (మత్తయి 15:14) ఓ బాప్టిస్టు పరిచారకుడు కు క్లక్స్ క్లాన్ మత ఉద్యమంలో ప్రముఖ సభ్యుడు. అయినా తెల్లవారి ఔన్నత్యాన్ని చాటించాలని ఆయన ఉద్యమాన్ని మతపునరుద్ధణకు ముడిపెడుతూ, దానిలో పాలుపంచుకునేవారందరూ “శిలువపై మరణించినతని [యేసుక్రీస్తు] ధైర్యం పొంది, దైవిక నడిపింపు యొక్క శక్తిని పొందుతారు” అని అంటున్నాడు.
యేసు నామం పేరట చేసే అద్భుతాలు, శక్తివంతమైన పనులూ, సూచనలనబడే వంటి వాటి మాటేమిటి? కేవలం “ప్రభువా, ప్రభువా” అనడం ద్వారా మాత్రమే ఆయన అంగీకారాన్ని పొందలేము కానీ, దానికి బదులుగా ‘తన తండ్రి చిత్తము చేయువారు’ పొందుతారు అని యేసుక్రీస్తు చెప్పిన బలమైన హెచ్చరికను జ్ఞాపకముంచుకోండి. నేడు అనేకులకు ఆయన తండ్రియైన యెహోవా పేరు కూడా తెలియదు. ‘తన నామము పేరట దయ్యములను వెళ్లగొట్టి, తన పేరట అనేక అద్భుతములు చేసికూడా,’ “అక్రమము చేసేవారి”ని గూర్చి యేసు హెచ్చరించాడు.—మత్తయి 7:21-23.
“నా ప్రజలారా . . . దానిని విడిచి రండి”
వ్యాధిగ్రస్తమైన క్రైస్తవమత సామ్రాజ్య రోగం యొక్క భవిష్యత్ పరిణామము ఎలా ఉంటుందని నిరూపణయ్యింది? దాని స్థితి చాలా ఘోరంగా ఉంది. మరప్పుడు, “చర్చిలోని లోటుపాట్లను పట్టించుకొని కాలాన్ని వృధాచేయకుండా, చర్చిలో ప్రవేశించి, దానిలో ఉండి దాని ‘శుద్ధీకరణకు’ మన చేయూతనివ్వాలని” కోరే కాథోలిక్ బిషప్పైన బట్లర్ సలహాను మనం గైకొందామా? వద్దు! విభాగిత మోసకర క్రైస్తవమత సామ్రాజ్యం నిలువదు. (మార్కు 3:24, 25) మహా బబులోను అనే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంలో అది ఒక భాగము. (ప్రకటన 18:2, 3) ఈ రక్తాపరాధ మత విధానం దేవుని చేతుల్లో తిరుగులేని నాశనాన్ని ఎదుర్కొంటుంది.
యథార్థమైన క్రైస్తవులు ఈ కలుషితమైన మత సంస్థలోనే, దాని లోపలనే ఉండి దానిని పునరుద్ధరించమని బైబిలు సలహా యివ్వడంలేదు. బదులుగా అది యిలా ఉద్బోధిస్తోంది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.”—ప్రకటన 18:4, 5.
“దానిని విడిచి” ఎక్కడికి వెళ్లాలి? కోత కాలంలో, ప్రపంచవ్యాప్త ఐక్యత కొరకు మరోసారి నిజ క్రైస్తవులు సమకూర్చబడతారని యేసు వాగ్దానం చేశాడని జ్ఞాపకముంచుకోండి. ప్రవక్తయైన మీకా కూడా అలా సమకూర్చడాన్ని గూర్చి ఈ మాటల్లో చెప్పాడు: “గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును.” (మీకా 2:12) ఇది జరిగిందా?
అవును! యథార్థమైన క్రైస్తవులు యిప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐక్యపర్చబడిన సహోదరత్వంలోకి సమకూర్చబడుతున్నారు. వాళ్లెవరు? రాజ్య సువార్తను 231 దేశాల్లో ఐక్యంగా ప్రకటించే యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘమే వాళ్లు. వారు క్రైస్తవమత సామ్రాజ్యపు విభాగించే బోధలను తృణీకరించి, దేవుని వాక్య సత్యాన్ని బట్టి వారు ఆయనను ఆరాధించడానికి వెదుకుతున్నారు.—యోహాను 8:31, 32; 17:17.
వారితో మాట్లాడడానికి మీరు సాదరంగా ఆహ్వానించబడుతున్నారు. యెహోవాసాక్షులను గూర్చి మీరు ఎక్కువగా తెలుసుకోగోరుతున్నట్లైతే, స్థానికంగా గానీ లేక ఈ పత్రికలోని 2వ పేజీ నందలి సరైన చిరునామా ద్వారా గాని దయచేసి వారిని సంప్రదించండి.
[7వ పేజీలోని చిత్రం]
“దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు”