రాజ్య ప్రచారకుల నివేదిక
“జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
ఈ సామెత కొరియాలో నిజమని నిరూపించబడింది. ఇప్పుడు అక్కడ 71,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉన్నారు. (సామెతలు 3:13) ఈ సేవకులలో 42 శాతం మంది పూర్తికాల సేవలోనున్నారనే విషయాన్ని ఊహించండి! నిజమైన జ్ఞానాన్ని సంపాదించువారు ఎక్కువ సంతోషాన్ని పొందగలరని క్రింద తెల్పబడిన అనుభవం చూపిస్తుంది.
పూసాన్లో ఒక స్త్రీ 16 సంవత్సరాలు క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలకు వెళ్ళింది. ఆమె లేఖన విరుద్ధమైన అనేక ఆచారాలను గమనించి, దేవుడు లేడేమోనని భావించడం మొదలు పెట్టింది. మరొకవైపు, దేవుని ఉనికిని నిరాకరించ లేకపోయింది, కావున నిజమైన చర్చీ ఉంటే అది చూపించమని దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. ఆ సమయంలో అకస్మాత్తుగా యెహోవాసాక్షులను గూర్చి తలంచింది, యెహోవాసాక్షులు త్రిత్వం, నరకాగ్ని, క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఇతర సిద్ధాంతాలను నమ్మడంలేదని చర్చి వారిని తృణీకరించి, యెహోవాసాక్షులతో కలవద్దని చర్చికి వెళ్ళేవారిని హెచ్చరించిన సంగతిని ఆమె గుర్తుచేసుకుంది. నిజమైన చర్చి వాళ్ళదేనా? తన పొరుగువారి సహాయంతో రాజ్యమందిరము ఎక్కడుందో తెలుసుకోగలిగింది. మరుసటి రోజే ఒక కూటానికి హాజరైంది.
ఆమె ఆ కూటంలోని క్రమబద్ధతను చూసి ఆశ్చర్యపోయింది. తన చర్చిలో ఉన్న మాదిరిగా అక్కడ పిచ్చిగా అరవడం, భావోద్రేకంతో పాడటం ఆమె చూడలేదు. తనతో బైబిలు పఠించడానికి ఇష్టపడుతున్న ఒక సాక్షితో ఆమె పరిచయం చేయబడింది, ఆమెకు చాలా ప్రశ్నలు ఉన్నందువల్ల మొదటి పఠనం చాలా గంటలు జరిగింది. రెండవ పఠనంలో తాను తన చర్చికి రాజీనామా ఇస్తానని, తను ఒక సాక్షి అవ్వాలని ప్రకటించింది. ఆమె ఆ సహోదరితో ఇక తనతో పఠించనక్కర్లేదని, తాను కూటములకు హాజరవ్వగలనని చెప్పింది. అయినను, కూటములకు హాజరగుటయేకాక, వ్యక్తిగత బైబిలు పఠనముయొక్క విలువ ఆమెకు తెలుపబడింది. ఆమె ఆ సలహాను అంగీకరించి, తన పఠనాలకు తన్ను తాను అన్వర్తించుకొని, తగిన సమయంలోనే బాప్తిస్మం పొందింది.
ఆమె ఇప్పుడు నిజమైన దేవుడైన యెహోవా జ్ఞానాన్ని సంపాదించి, దేవుని నూతన లోకంలో నిరంతరము జీవించే నిరీక్షణకల్గి సంతోషంగా ఉంది.
రిటైరైన జనరల్ సత్యం నేర్చుకున్నాడు
ఒక ఆర్మీ జనరల్ భార్య 1962లో బాప్తిస్మం పొందింది. ఆమె భర్త మొదట వ్యతిరేకించాడు, తర్వాత వ్యతిరేకించడం మానాడు. తర్వాత 28 సంవత్సరాల్లో మధ్యమధ్యలో అనేకమంది సహోదరులు అతనితో పఠించి, సత్యంయెడల అతనికి ఆసక్తి కల్గించాలని ప్రయత్నం చేశారు. అతడు కొన్ని కూటాలకు, సమావేశాలకు హాజరయ్యాడు, కాని సత్యాన్ని గంభీరంగా తీసుకోవడంలో వెనుకంజ వేసినవారిలో ఈయన ఒకడు. ఆయన 1990లో తన భార్యతో కలిసి జపాన్కు వెళ్ళి, అక్కడ జిల్లా సమావేశానికి హాజరయ్యాడు. ఆయన ఈ సందర్భంలో ప్రసంగాలను శ్రద్ధగా విన్నాడు.—ఇంతకు ముందు ఆయన అలా చేయలేదు. ధైర్యంగా అబద్ధ మతాన్ని వెల్లడించే ప్రసంగం విని విభ్రాంతినొందాడు. అయితే క్రైస్తవమత సామ్రాజ్యపు కపటతను చూచుటకు అది అతని కన్నులను తెరిచింది. తాను కొరియాలో చూసినట్లే, జపాన్లో కూడా దేవుని ప్రజల క్రమబద్ధతను, సంతోషాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. కొరియాకు తిరిగి వచ్చిన తర్వాత, బైబిలు గంభీరంగా పఠించనారంభించి చివరికి బాప్తిస్మం తీసుకున్నాడు.
బాప్తిస్మం తర్వాత అతడు ఏం చేయాలి? ఒక ప్రసిద్ధమైన టూరిస్ట్ హోటల్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఇచ్చి, తన భార్యతో కలిసి పూర్తికాల సేవచేస్తున్నాడు. పూర్తికాల సేవలో పాల్గొనడం ద్వారా 28 సంవత్సరాలు మాంద్యంగా ఉన్నందువల్ల జరిగిన నష్టాన్ని పరిహరించవచ్చని ఆయన భావిస్తున్నాడు.
“జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు” అనే సామెత తనకు కూడా అన్వర్తిస్తుందని ఇప్పుడాయన అర్థం చేసుకుంటున్నాడు!