రోమీయులు బహుశ్రేష్టమైన వార్తను పొందుట
పాపముతో నిండిన నరుడు దేవునిదృష్టిలో నీతిమంతుడై నిత్యజీవమును ఎట్లు పొందగలడు? ఈ ప్రశ్న మన సామాన్యశకము మొదటిశతాబ్దములో తీవ్రమైన తర్కములను లేవదీసెను? దానికి సమాధానము మీకు తెలియునా? మీకు తెలిసినను తెలియకపోయినను ఈ సమస్యనుగూర్చి బైబిలుపుస్తకమైన రోమీయులలో పౌలు చేసిన వివేకయుక్తమైన చర్చను మీరు చదువవలసియున్నారు. అట్లు చేయుటద్వారా విశ్వాసము, క్రియలు, నీతి, మరియు జీవమునకున్న సంబంధమును మీరు అర్థము చేసుకొను సహాయము మీకు లభించును.
పౌలు మరియు రోమీయులు
రోమీయుల పుస్తకము సా.శ. 56లో అపొస్తలుడైన పౌలుచే రోములోని క్రైస్తవులకు వ్రాయబడిన పత్రికయైయున్నది. ఆ పత్రికనెందుకు ఆయన వ్రాశాడు? సా.శ. 56 నాటికి పౌలు ఇంకను రోమును దర్శించకున్నను చాలామట్టుకు అక్కడయున్న చాలామంది క్రైస్తవులను ఆయన ఎరిగియున్నాడు. ఎందుకనగా వారిలో చాలామందిని ఆయన వారివారి పేర్లతో ప్రస్తావించెను. అంతేగాక అచ్చటయున్న తన క్రైస్తవ సహోదరులకు ప్రోత్సాహమునిచ్చుటకై ఆయన రోముకు వెళ్లుటకు ఎంతగానో యిష్టపడెను. ఇంకను స్పెయినుకు వెళ్లవలసియున్న మిషనరీ యాత్రలో రోమును తాను మధ్యలో ఆగుస్థలముగాను ఎంచుకున్నట్లు అగుపించుచున్నది.—రోమీయులు 1:11, 12; 15:22-24.
ఏమైనను, ఈ పత్రికను వ్రాయుటలో పౌలు ముఖ్య ఉద్దేశ్యము: మనుష్యులు జీవమునకు నడుపు నీతిని ఎట్లు పొందగలరను ప్రశ్నకు సమాధానమిచ్చుటైయున్నది. దీని సమాధానమే బహుశ్రేష్టమైన వార్తగా మారునదైయున్నది. నీతి విశ్వాసమూలముగా ఎంచబడును. పౌలు ఈవిధముగా వ్రాయుచు తన పత్రికకు ముఖ్యాంశమును చూపిస్తున్నాడు: “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి హెల్లేనీయునికి కూడ రక్షణ కలుగజేయుట దేవుని శక్తియైయున్నది. ఎందుకనిన—‘నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని’ వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.”—రోమీయులు 1:16, 17.
విశ్వాసము మరియు ధర్మశాస్త్రము
విశ్వాసముమూలముగా నీతి ఎంచబడుతుందని మొదటి శతాబ్దములో ప్రతి ఒక్కరు అంగీకరించలేదు. మాట్లాడగలిగిన కొందరు దానికి ఇంకను ఎక్కువ అవసరమను భావమును గట్టిగా కలిగియుండిరి. మోషేధర్మశాస్త్రమును యెహోవా ఇవ్వలేదా? దైవావేశపూరితమైన అట్టి ఏర్పాటుకు లోబడని ఎవరైనను నీతిమంతులెట్లు కాగలరు? (గలతీయులు 4:9-11, 21; 5:2ను చూడుము.) సా.శ. 49వ సంవత్సరమున ధర్మశాస్త్రమునకు హత్తుకొను విషయము యెరూషలేములోని గవర్నింగ్ బాడీ వలన చర్చించబడి, సువార్తను అంగీకరించిన అన్యులు సున్నతి పొందనవసరములేదనియు యూదా ధర్మశాస్త్రమునకు లోబడవలసిన అవసరములేదనియు తీర్మానము చేసిరి.—అ.కార్యములు 15:1, 2, 28, 29.
చరిత్రలో ఒక క్రొత్తదశకు మలిపిన ఆ తీర్మానమును బలపరచుచు దాదాపు 7 సంవత్సరముల తర్వాత రోమీయులకు పౌలు తన పత్రికను వ్రాసెను. వాస్తమునకు ఆయన ఇంకను ముందుకు వెళ్లుచున్నాడు. క్రైస్తవులైన అన్యజనులకు ధర్మశాస్త్రము అనవసరమైనదేకాక, దానికి విధేయులగుటపై ఆధారపడు యూదులును జీవమునకు నీతిమంతులుగా యెంచబడరు.
విశ్వాసముద్వారా నీతి
రోమీయులకు వ్రాసిన పుస్తకమును మీరు చదువుకొలది అనేక హెబ్రీలేఖనములను ఎత్తిచూపుటద్వారా తన వాక్యములను బలపరుస్తూ ఎంత జాగ్రత్తగా పౌలు ఆయన అంశమును తెలుపుచున్నాడో మీరు గమనింతురు. ప్రేరేపితమైన తన బోధను అంగీకరించుటకు కష్టముగా యెంచు యూదులతో మాట్లాడునప్పుడు ఆయన ఆప్యాయతను శ్రద్ధను చూపుచున్నాడు. (రోమీయులు 3:1, 2; 9:1-3) అయినప్పటికిని తన అంశమును ఆయన స్పష్టముగాను, వివాదరహితమైన తర్కముతోను అందించుచున్నాడు.
రోమీయులు 1 నుండి 4 అధ్యాయములలో ప్రతిఒక్కరు పాపముతో దోషులైయున్నారను సత్యముతో పౌలు ప్రారంభించుచున్నాడు. కావున మానవులు నీతిమంతులుగా తీర్చబడు ఒకే ఒక మార్గము విశ్వాసమూలముగానే. నిజమే, యూదులు మోషే ధర్మశాస్త్రమును అనుసరించుటద్వారా నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నించారు. అయితే తప్పిపోయారు. కావున పౌలు నిర్భయముగా ఇట్లనుచున్నాడు: “యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారు.” అందరికి ఆమోదయోగ్యముకాని ఈ సత్యమును ఆయన అనేక లేఖనములను ఎత్తిచూపుటద్వారా రుజువు చేయుచున్నాడు.—రోమీయులు 3:9.
“ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడని తీర్పుతీర్చబడడు” గనుక ఇక ఏ నిరీక్షణయున్నది? యేసు విమోచన బలి ఆధారముగా ఉచితమైన వరముగా దేవుడు మానవులను నీతిమంతులుగా తీర్చును. (రోమీయులు 3:20, 24) అయితే, దీనిని ఉపయోగించుకొనుటకు ఆ బలియందు వారు విశ్వాసముంచవలసియున్నారు. ఇట్లు విశ్వాసమూలంగా మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుదురను బోధ ఏదో క్రొత్తగాయున్నదా? ఏమాత్రము కాదు. చివరకు ధర్మశాస్త్రము నేర్పరచకముందే అబ్రాహాము విశ్వాసముద్వారా నీతిమంతునిగా యెంచబడెను.—రోమీయులు 4:3.
విశ్వాసముయొక్క ప్రాముఖ్యతను ధృవపరిచినవాడై 5వ అధ్యాయములో క్రైస్తవవిశ్వాసమునకు ఆధారమును పౌలు చర్చించుచున్నాడు. ఈయన యేసు. ఈయన నీతియుక్తవిధానము తనయందు విశ్వాసముంచువారిపైగల ఆదాము పాపప్రభావములను తీసివేయును. ఆవిధముగా, “ఒక్క పుణ్యకార్యమువలన” అనగా మోషే ధర్మశాస్త్రమునకు విధేయులగుటవలన కాక, “మనుష్యులందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.”—రోమీయులు 5:18.
ఆటంకములకు సమాధానమిచ్చుట
క్రైస్తవులు ధర్మశాస్త్రము క్రిందలేకున్నను, ముందుకువెళ్లి పాపములను చేస్తూ ఏవిధంగానైనను దేవుని మితిలేని కృపమూలంగా నీతిమంతులుగా తీర్చబడులాగున వారిని ఆటంకపరచునదేమి? ఈ అభ్యంతరమునకు పౌలు 6వ అధ్యాయములో సమాధానమిచ్చుచున్నాడు. క్రైస్తవులు తమ పాతపాపపువిధానము విషయములో మరణించియున్నారు. యేసునందలి వారి నూతన జీవితము వారిని తమ శరీరబలహీనతలకు వ్యతిరేకముగా పోరాడబద్దులనుగా చేయుచున్నది. “కాబట్టి. . .చావునకులోనైన మీశరీరమందు పాపమును రాజుగా ఏలనియ్యకుడి.”—రోమీయులు 6:12 NW.
అయితే కనీసము యూదులైన ఇంకను మోషే ధర్మశాస్త్రమునకు హత్తుకొనియుండవద్దా? 7వ అధ్యాయములో ఇలాకాదు అని పౌలు జాగ్రత్తగా వివరించుచున్నాడు. వివాహమైన స్త్రీ భర్త మరణించినప్పుడు ఆయన విధులకు బద్దురాలగుటనుండి ఎట్లు విడుదలపొందునో, ఆలాగే యేసుయొక్క మరణము విశ్వసించు యూదులను ధర్మశాస్త్రమునకు లోబడుటనుండి విడుదలచేసెను. పౌలు యిలా అనుచున్నాడు: “మీరును క్రీస్తు. . .శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి.”—రోమీయులు 7:4.
దీని భావము ధర్మశాస్త్రమందు కొంతతప్పిదమున్నదనియా? ఎంతమాత్రము కాదు. ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అసంపూర్ణులైన మానవులు ధర్మశాస్త్రమునకు విధేయులు కాలేకపోవుటయే సమస్యయైయున్నది. “ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను,” అని పౌలు వ్రాసెను. ఒక అసంపూర్ణుడైన మానవుడు దేవుని పరిపూర్ణమైన ధర్మశాస్త్రమును పాటించలేడు గనుక, దానివలన ఖండింపబడియున్నాడు. కావున “క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదని” యనుట ఎంతటి ఆశ్చర్యకరమైన సంగతి! అభిషక్త క్రైస్తవులు దేవునికుమారులుగా ఆత్మచేత దత్తత తీసికొనబడియున్నారు. శరీరముయొక్క అసంపూర్ణతలకు వ్యతిరేకముగా పోరాడుటకు యెహోవా ఆత్మవారికి సహాయముచేయును. “దేవునిచేత ఏర్పరచబడినవారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు.” (రోమీయులు 7:14; 8:1, 33) దేవుని ప్రేమనుండి వారిని ఏదియు వేరుచేయలేదు.
నీతి మరియు శరీరసంబంధమైన యూదులు
ఇక ఏ మాత్రము ధర్మశాస్త్రము అవసరములేనట్లయిన మరి ఇశ్రాయేలు జనాంగపు విషయమేమి? ఇశ్రాయేలీయుల పునరుద్ధరణను వాగ్ధానముచేయుచున్న లేఖనములన్నిటి విషయమేమి? ఈ ప్రశ్నలు రోమీయులు 9 నుండి 11 అధ్యాయములలో ప్రస్తావించబడినవి. హెబ్రీలేఖనములు కేవలము కొద్దిమంది ఇశ్రాయేలీయులు మాత్రమే రక్షింపబడుదురనియు దేవుడు తన దృష్టిని అన్యజనాంగములవైపు మరల్చుననియు ప్రవచించినవి. ఇందుకనుగుణ్యముగా ఇశ్రాయేలీయుల రక్షణనుగూర్చిన ప్రవచనములు శరీరసంబంధమైన ఇశ్రాయేలీయులవలనకాక విశ్వసించిన కొద్దిమంది శరీరసంబంధమైన ఇశ్రాయేలీయులతో ప్రారంభమునుకలిగి మంచిహృదయముగల అన్యులతో నిండిన క్రైస్తవసంఘముద్వారా నెరవేర్చబడియున్నవి.—రోమీయులు 10:19-21; 11:1, 5, 17-24.
నీతికి సంబంధించిన సూత్రములు
రోమీయులు 12 నుండి 15 అధ్యాయములలో తాము నీతిమంతులుగా తీర్చబడుటకు అభిషక్తక్రైస్తవులు జీవించవలసిన ఆచరణాత్మకమైన మార్గములను వివరించుచున్నాడు. ఉదాహరణకు: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీశరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. . .మీ మనస్సుమారి నూతన మగుటవలన రూపాంతరము పొందుడి,” అని చెప్పుచున్నాడు. (రోమీయులు 12:1, 2) మనము మంచికిగల శక్తియందు నమ్మికయుంచి కీడును ప్రతికీడుతో పోరాడకూడదు. అపొస్తలుడు ఈలాగు వ్రాసెను: “కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయించుము.”—రోమీయులు 12:21.
పౌలు దినములలో రోము రాజకీయశక్తికి కేంద్రస్థానముగా యుండెను. కావున వివేకముతో పౌలు క్రైస్తవులను ఇట్లు హెచ్చరించుచున్నాడు: “ప్రతివాడును పైఅధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.” (రోమీయులు 13:1) క్రైస్తవులు ఒకరితోనొకరు వ్యవహరించుతీరుకూడా తాము నీతికనుగుణ్యంగా జీవించుటలో భాగమైయున్నది. ఎందుకనగా, “ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. ఎదుటివాని ప్రేమించినవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు” అని పౌలు చెప్పుచున్నాడు.—రోమీయులు 13:8.
అంతేకాక, క్రైస్తవులు ఒకరి మనస్సాక్షిని మరొకరు తలంచువారైయుంటూ, తీర్పుతీర్చువారైయుండకూడదు. పౌలు గట్టిగా పురికొల్పునదేమనగా: “కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయువాటినే అనుసరింతము.” (రోమీయులు 14:19) క్రైస్తవజీవిత ప్రతి భాగమందును అన్వయించుకొనవలసిన ఎంతమంచి హెచ్చరిక! చివరకు 16వ అధ్యాయములో వ్యక్తిగత అభివందనములు మరియు ప్రోత్సాహము మరియు హెచ్చరికతో కూడిన చివరిమాటలతో పౌలు ముగించుచున్నాడు.
అభిషక్తులకు మరియు వేరేగొర్రెలకు
రోమాలో చర్చించబడిన అంశము మొదటి శతాబ్దములోనేకాక యిప్పటికిని ముఖ్యమైన శ్రద్ధనివ్వవలసినదైయున్నది. నీతి మరియు నిత్యజీవము యెహోవాసేవకులందరికి ముందుకు నడుపవలసినట్టి శ్రద్ధలైయున్నవి. వాస్తవమునకు రోమీయులకు వ్రాసిన పత్రిక అభిషక్తుల కొరకు వ్రాయబడియున్నది. అయితే ఈనాడు ఎక్కువమంది యెహోవాసాక్షులు భూనిరీక్షణను కలిగియుండి “గొప్పసమూహము” వారైయున్నారు. (ప్రకటన 7:9) అయినను, ఈ పత్రిక వీరికిని ప్రాముఖ్యమైన సమాచారమును కలిగియున్నది. ఏమిటది?
రోమీయుల పుస్తకము క్రైస్తవులు విశ్వాసముద్వారా నీతిమంతులుగా యెంచబడుదురని రుజువుచేయుచున్నది. అభిషక్తులకైతే ఇది, యేసుతోకూడా పరలోకరాజ్యములో సహపరిపాలకులగు దృష్టికి సంబంధమును కలిగియున్నది. ఏమైనను, గొప్పసమూహపు సభ్యులును పితరుడైన అబ్రాహామువలెనే ‘దేవునికి స్నేహితులుగా’ నీతిమంతులుగా యెంచబడుచున్నారు. (యాకోబు 2:21-23) వీరి నీతియు మహాశ్రమలలో రక్షింపబడుదుమను దృష్టితో, అభిషక్తుల విషయమందు మాదిరే యేసురక్తమందలి విశ్వాసముపై ఆధారపడియున్నది. (కీర్తన 37:11; యోహాను 10:16; ప్రకటన 7:9, 14) కావున రోమీయులలో పౌలుచూపుచున్న తర్కము వేరేగొర్రెలకును అలాగే అభిషక్తులకును గొప్పశ్రద్ధనిచ్చునదైయున్నది. మరియు మనము నీతిమంతులుగా యెంచబడునట్లు జీవించుటకు ఈ పుస్తకము యిచ్చు మంచి హెచ్చరిక క్రైస్తవులందరికి ముఖ్యము.
డాక్టర్లు న్యూటన్ మార్షల్ హాల్ మరియు ఇర్వింగ్ ఫ్రాన్సిస్ వుడ్లచే ఎడిట్ చేయబడిన ది బుక్ ఆఫ్ లైఫ్ యిట్లనుచున్నది: “తర్కన మరియు సిద్ధాంతపరమైన విషయములో [రోమీయులు] పౌలు ప్రేరేపిత బోధయందు అత్యున్నత స్థానమునకు చేరుచున్నది. అది మర్యాద, వివేకయుక్తమైనదేకాక అధికారపూర్వకముగాను ఉన్నది.. . .ఈ పత్రిక పఠనము ఒకరికి తమస్వంత ఐశ్వర్యమును, నిండైన ఫ్రతిఫలమును తెచ్చును.” ఆ పుస్తకమును మీకైమీరు చదివి “రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియైయున్న,” “సువార్త” యందు మీరును ఎందుకు ఆనందించకూడదు.—రోమీయులు 1:16. (w90 8/1)
[26వ పేజీలోని బాక్సు/చిత్రం]
“దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును [లౌకిక] లేదు.” దీని భావము వ్యక్తిగతంగా ప్రతి పరిపాలకుని దేవుడు నియమించునని కాదు. బదులుగా, లౌకిక పరిపాలకులు దేవుని అనుమతినిబట్టి ఉనికియందున్నారు. అనేకసందర్భములందు, మానవపరిపాలకులు దేవునిచే ముందుగానే చూడబడి ప్రవచింపబడియున్నారు. కావున “ఆవిధముగా వారు తమకు సంబంధించిన స్థానములలో దేవునివలన నియమింపబడియున్నారు.”—రోమీయులు 13:1.
[క్రెడిట్ లైను]
Museo della Civiltà Romana, Roma
[27వ పేజీలోని బాక్సు/చిత్రం]
క్రైస్తవులు యిలా చెప్పబడ్డారు: “ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుడి.” అనగా “శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ముందుగానే పథకము వేసుకొనుటద్వారా శరీర ఆశలను తమ జీవితములలో ముందుపెట్టుకొనకుండా” ఆత్మీయ శ్రద్ధలను ముందు పెట్టుటద్వారా యేసుక్రీస్తు అడుగుజాడలను సన్నిహితముగా అనుసరించవలెనని దీని భావము.—రోమీయులు 13:14.
[27వ పేజీలోని బాక్సు/చిత్రం]
రోమీయులకు పౌలు “పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి” అని చెప్పాడు. ఏమైనను ఇచ్చట పౌలు నూతనమైన క్రైస్తవ పద్ధతినో లేక మత ఆచారమునో ప్రవేశపెట్టడంలేదు. పౌలు దినములలో నుదుటిపైనగాని, పెదవులపైనగాని, లేక చేతిపైనగాని ముద్దుపెట్టుకొనుట వందనమునకు, ఆప్యాయతకు లేక గౌరవమునకు సూచనగా యుండెను. కావున, పౌలు కేవలము ఆ దినములలో అలవాటునందున్న పద్ధతినే సూచిస్తున్నాడు.—రోమీయులు 16:16.