ప్రపంచ మహాధిపత్యములలో చివరిది
దాదాపు 1900 సంవత్సరాల క్రితం బైబిలులోని ప్రకటన గ్రంథం వ్రాయబడినపుడు ఐదుగురు “రాజులు” లేక ప్రపంచ ఆధిపత్యములు అప్పటికే పరిపాలించినవని ఆ పుస్తకం తెలిపింది. అవేవనగా, ఐగుప్తు స్సీరియా, బబులోను, మాదీయులు-పారశీకులు మరియు గ్రీకు రాజ్యాలు, ఆరవదైన రోమా సామ్రాజ్యం, అప్పటికి ఆధికారంలోనే వుంది, గానీ ఏడవది ఇంకారాలేదు. (ప్రక. 17:10) ఆ ఏడవ ప్రపంచ ఆధిపత్యమేమిటి? అదెట్లు అధికారంలోనికి వచ్చింది? దాని తర్వాత ఏది వస్తుంది? ఈ ముఖ్యమైన ప్రశ్నలన్నింటికీ ఇచ్చే సమాధానములే యీ శీర్షిక యొక్క మూలాంశము.
గత 2500 సంవత్సరాల కాలమందలి ప్రపంచ చరిత్రలోని అధికభాగం, లోక ప్రసిద్ధి చెంది అత్యంత విరివిగా పంచి పెట్టబడిన ఓ గ్రంథం ముందుగనే తెలియజేసింది. అయిననూ బైబిలు అనే ఆ గ్రంథాన్ని కల్గియున్న ఏ కొద్ది మందికో దానిలోని అద్భుతమైన సమాచారాన్ని గూర్చి తెలుసు.
ఉదాహరణకు, యేసు పుట్టుకకు 500 సంవత్సరాల ముందే ప్రవక్త దానియేలు తన కాలము నుండి ప్రపంచ ఆధిపత్యాలు జంతువులకు పోల్చబడినవని ఆయన కివ్వబడిన దైవ ప్రేరిత దర్శనములో చూచి వ్రాశాడు. ప్రతి జంతువు, ప్రపంచాధిపత్యం నిర్వహించిన రాజ్యం యొక్క లక్షణాలను ప్రతిబింబించినట్లు గమనించాడు. బలమైన రోమా సామ్రాజ్యం “ఘోరమును భయంకరమునగు” ఓ పెద్ద జంతువుగా వర్ణించబడింది. దానియేలు చెప్పునదేమనగా “అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది, దానికి పదికొమ్ములుండెను.”—దాని 7:2-7.
‘చిన్న కొమ్ము’
అనతికాలములోనే యీ రోమా సామ్రాజ్యం బహుగా విస్తరించి బ్రిటీష్ ద్వీపాలనుండి ఐరోపా అంతటను, మధ్యధరా ప్రాంతాలకును, బబులోను నుండి పర్షియాగల్ఫ్ వరకు వ్యాపించింది. ఈ మహాసామ్రాజ్యం చివరకు చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది—దానియేలు చూచినట్లు “పదికొమ్ములు” అయింది.a అప్పుడు దానియేలు “ఒక చిన్న కొమ్ము వాటి మధ్యనలేచెను, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినట్లు” చూశాడు. (దాని. 7:8) దాని భావమేమిటి? దానియేలునకు ఇలా తెలుపబడింది: “ఆ పదికొమ్ములు ఆ రాజ్యమునుండి (రోమా) పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.” (దాని. 7:24) ఆ ‘చిన్నకొమ్ము’ ఎవరు మరి ఆ పడద్రోయబడిన ముగ్గురు రాజులెవరు?
రోమాసామ్రాజ్యములోని వాయవ్యదిశలో ఓ ద్వీపం దీర్ఘకాలికంగా ప్రపంచ రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తూ వచ్చింది. ఓ చరిత్రకారుడిట్లు వివరించాడు: “16వ శతాబ్దిలో ఇంగ్లాండు లోకాధిపత్యమందు రెండవస్థానాన్ని మాత్రమే ఆక్రమించింది. దానికున్న ధనం నెదర్లాండ్తో పోల్చితే అతిస్వల్పమే. దాని జనాభా ఫ్రాన్స్ దేశం కంటె ఎంతో తక్కువ. దాని సైనికబలం (నౌకాదళముతోసహా) స్పెయిన్ కంటె అల్పమైనది.” అయినప్పటికిని ఇంగ్లాండ్ నౌకాదళాన్ని పెంచుకొని, స్పెయిన్ దేశమును వలసదేశముగా మార్చి, ధనాగారములున్న నౌకలను ముట్టడించి, వశపరచుకొనుటకై తన దొంగ ఓడలను, యుద్ధనౌకలను పంపింది.
మూడు కొమ్ములు
1588లో స్పెయిన్ రాజైన 2వ ఫిలిప్, బాధించే ఇంగ్లీషు వారి మీదికి స్పానిష్ నౌకాదళాలను పంపెను. 24,000 మంది కంటె అధికంగా పురుషులున్న ఆ 130 నౌకలు ఇంగ్లీష్ జలసంధిని దాటి వెళ్లెనుగానీ, చివరకు అవి అట్లాంటిక్ సముద్రపు తుఫాను బీభత్సానికి గురైనవి. మోడరన్ యూరప్ టు 1870 అనే పుస్తకంలో చరిత్రకారుడైన కార్ల్టన్ హేస్ వ్రాస్తూ యీ సంఘటన “స్పెయిన్ నుండి ఇంగ్లాండు వరకు తమ నౌకాబలాన్ని చూపుటకే ఇలా జరిగిందని” తెలియజేశాడు.
17వ శతాబ్దిలో డచ్ దేశం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాణిజ్యరంగాన్ని, నౌకాబలాన్ని పెంపొందించుకున్నది. వారి నౌకలు సముద్రముపై తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించి, చుట్టున్న పొరుగుదేశాలకు వాటి వ్యాపారలాభాలను రుణాలుగా పెంచుకుంటూ వస్తున్న కారణంగా ఇంగ్లాండు కూడా ఇతర రంగాలలో నిలదొక్కుకోగలిగింది. పిదప 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారు ఫ్రెంచి వారితో రెండు సుదూర దేశాలైన ఉత్తర అమెరికా, ఇండియాలలో యుద్ధానికి తలపడ్డారు. ఆ కారణంగానే 1763 సంవత్సరంలో ఫ్రెంచి ఓడంబడిక జరిగింది. దాన్ని గూర్చి విలియం. బి. వాల్కాక్స్, స్టార్ ఆఫ్ ఎంపైర్—ఎస్టడీ ఆఫ్ బ్రిటన్ యాజ్ ఎ వల్డ్పవర్ అనే తన పుస్తకమందు ఆ సంధి ఇరుదేశాలమధ్య సయోధ్య అన్నట్లు పైకి కనబడినప్పటికిని “బ్రిటన్ ఐరోపా వెలుపల తన యూరోప్ దేశ ఆధిపత్యాన్ని ఓ క్రొత్త మహా ప్రపంచ శక్తిగా రూపొందించుటకే అటువంటి ఒడంబడికను చేసుకున్నవి” అని వ్రాశాడు.
ఇతర చరిత్రకారులు ఈ వాస్తవాన్ని అంగీకరిస్తు ఇలా వ్రాశారు: “రెండు శతాబ్దములుగా గ్రేట్ బ్రిటన్ స్పానిష్, డచ్, ఫ్రెంచ్ దేశాలతో యుద్ధం చేయుచున్ వుండి 1763 సంవత్సరం నాటికి ప్రపంచములో కెల్ల అతి పెద్ద వాణిజ్య, వలస రాజ్యముగా తయారైంది.” (మోడరన్ యూరప్ టు 1870) “కొంత బలాన్ని పుంజుకొని విస్తరించిన రోమా సామ్రాజ్యము వలెనే, బ్రిటీష్ సామ్రాజ్యం కూడ 1763 సంవత్సరంలో ప్రపంచాధిపత్యంగా పురోగమించింది.” “ఆ శతాబ్దపు మధ్య జరిగిన యుద్ధాలలో జయఢంకా మ్రోగించి అదొక గొప్ప బలమైన సామ్రాజ్యముగా—అత్యంత ద్వేషింపబడిన—ప్రపంచాధిపత్యంగా పైకి వచ్చింది. (జెమ్స్ యల్. స్టోక్స్బరి వ్రాసిన నేవి అండ్ ఎంపైర్) అవును యీ ‘చిన్న కొమ్ము’ బైబిలునందు తెలుపబడిన ఏడవ ప్రపంచాధిపత్యంగా దిగినది.
బ్రిటీష్ వారు నైలునది మొదలు జాంబెజినది వరకు ఆక్రమిస్తువచ్చారు. వారు ఎగవ బర్మా, ఉత్తర బోర్నియా మరియు పసిఫిక్ సముద్ర ద్వీపములవరకు వ్యాపించారు. అంతేగాక, కెనాడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు ఉత్తర అమెరికా తీరప్రాంతాలను ఆక్రమించుకుని వాటిలో స్థిరపడ్డారు. జేమ్స్ మోరిస్ టాక్స్ బ్రిటానికా అను పుస్తకంలో “రోమా సామ్రాజ్యం దాని పరిమితి కల్గివుండేదని” అన్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యం మాత్రం దిశదిశలా వ్యాపించింది. అది, భూమిలోని నాల్గవ భాగాన్ని ఆక్రమిస్తూ, అంతకంటె అధిక భాగం జనాభాను పాలిస్తు మానవ చరిత్రలోనే మహాగొప్ప సామ్రాజ్యముగా తయారైంది. రవి ఆస్తమించని సామ్రాజ్యమని కీర్తి గడించినది.
ద్వందాధిపత్యము
ప్రకటన గ్రంథములో యీ ఏడవ ప్రపంచాధిపత్యము, “గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములను” కల్గివున్నట్లు వర్ణించబడినది. (ప్రక. 13:11) రెండు కొమ్ములెందుకు? ఎందుకనగా బ్రిటిష్ సామ్రాజ్యం క్రొత్తగా ఏర్పడిన అమెరికా దేశం ఒకే భాషా, సూత్రాలు, సిద్ధాంతాల ప్రాతిపదిక మీద రెండును కలిసికట్టుగా పరిపాలించనైయుండెను. అనేకరంగాలలో, యీ రెండు దేశాలు ఇంగ్లీషు భాష మాట్లాడే ద్వంద ప్రపంచాధిపత్యముగా తయారైనవి.
స్టార్ ఆఫ్ ఎంపైర్ నందు విలియం బి. విల్కాక్స్ తెల్పినదేమనగా “19వ శతాబ్దిలో బ్రిటిష్ తన యుద్ధ నౌకలద్వారా అమెరికాను, ఇతర దేశాలతో పొత్తు పెట్టుకోకుండ చేసింది” అతడింకను ఇట్లున్నాడు: “ఓ శతాబ్దం వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏ సైనిక నావిక బలం లేకుండగనే (అంతర్యుద్ధంనకు తప్ప) ఓ గొప్ప ఆధిపత్యంగా తయారు చేయబడినది.” “ఇతర ఐరోపా దేశాల తాకిడిని తట్టుకొనుటకై దానికి బ్రిటిష్ రాయల్ నౌకాదళ సహాయం వలన అమెరికా అట్లు ప్రత్యేకంగా ఉండగల్గినది.” అటు పిదప అమెరికా కూడ గొప్ప సైనిక శక్తిగా రూపొందినది.
2వ ప్రపంచయుద్ధగాలులు, ఉత్తర అమెరికాలో తెచ్చిన మార్పుల సమయంలో అనగా 1944 జూన్ 6న, బ్రిటన్, అమెరికాలు కలిసికట్టుగా నిర్వహించిన పాత్ర మరువరాని ఘట్టం. ఆ రోజు బ్రిటిష్, అమెరికా మిత్రదేశాలు కలిసి 1,56,000 మంది సైన్యముతో ఐరోపాను చుట్టిముట్టినవి. అమెరికా దేశపు జనరల్ ఐసన్ హోవర్, బ్రిటిష్ ఫీల్డ్ మార్షల్ మౌంట్గొమెరి ఆధ్వర్యాన ఆ గొప్ప సైన్యం కదం ద్రొక్కింది. అంతేగాక అణుబాంబులు ప్రయోగించి జపానుమీద చేసిన యుద్ధం కూడ బ్రిటిష్ అమెరికా దేశ విజ్ఞాన శాస్త్రజ్ఞుల ద్వంద ప్రయత్నాల ఫలితమే.
1986 మే 6 లాస్ ఏంజిలస్ టైమ్స్ దిన పత్రిక తెల్పినట్లు, శాంతి బప్పందాల కాలములో కూడ బ్రిటన్ అమెరికాలు “అంతరంగిక, అణుయుద్ధ ప్రక్రియలలో తలమునకలై ఉన్నవి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దేశాలు కూడా తర్వాత వీటితో చేరిపోయినవి. ఆంతరంగిక వ్యవహారాలను గూఢాచారి కలాపములను సహితం నిర్వహించుటకు భూగోళాన్ని పంచుకొని, ఆ విధంగానే చేయుటకై పరస్పరం ఒప్పుకున్నవి.” ఈ దినపత్రిక తెల్పినదేమనగా వాటి సఖ్యత అంత సులభంకాక పోయిననూ వాటి దూరం కంటె వాటి సన్నిహితత్వమే గమనించదగిన విషయం.”
బ్రిటన్ వలసదేశాలనేకములు స్వాతంత్రం పొంది కామన్ వెల్త్లో చేరిపోయినవి. సామ్రాజ్యము సమసిపోయినట్లున్నను ఆంగ్లో-అమెరికన్ ప్రపంచశక్తి ఇంకను వున్నది. కాని శతాబ్దములుగా పాలించిన రోమా సామ్రాజ్యముతో పోల్చితే, ఇది “కొద్దికాలము” మాత్రమే నిలుస్తుంది.—ప్రక. 17:10.
క్రొత్త ప్రపంచ పరిపాలన
ఈ మహా ప్రపంచాధిపత్యాలను గూర్చి దానియేలు చెప్పిన ప్రవచనం 2500 సంవత్సరాలుగా అనగా సా.శ.పూ. 500 సంవత్సరాల పూర్వమునుండి మనకాలమందలి ఏడవ ప్రపంచాధిపత్యము వరకును వాస్తవమని రుజువయింది. అందుచేత మనం మిగిలిన ప్రవచనమునందు నమ్మకం కల్గియుండగలం. ఆశ్చర్యకరమగు విషయమేమనగా ఏ ఇతర మానవ ప్రపంచాధిపత్యాలను గూర్చి కూడ ఆ ప్రవచనం ప్రస్తావించుటలేదు! ప్రకటన గ్రంథం కూడ ఏడింటిని గూర్చి మాత్రమే తెల్పినది.b మరి తర్వాత ఏం జరుగుతుంది?
ప్రపంచ ఆధిపత్యాలను గూర్చి తెలిపిన దానియేలు 7వ అధ్యాయము అంతకంటె ఆశ్చర్యంగొలిపే విషయాన్ని—భూపరిపాలనా విధానములో వచ్చే గొప్ప మార్పును గూర్చి తెల్పుచున్నది! విఫలమౌతున్న మానవ రాజ్యాలు అంతమై వాటి స్థానంలో పరలోక పరిపాలన వస్తుంది.
దానియేలుకు కల్గిన దర్శనమందు ఆయనకు “మహావృద్ధుడగు” యెహోవాదేవుని మహిమగల సింహాసనాన్ని చూచే భాగ్యం కల్గింది. ఆ మహావృద్ధుని ఎదుటికి “మనుష్యకుమారుని పోలిన ఒకడు”—పునరుత్థానుడైన యేసుక్రీస్తుc—తీసికొని రాబడెను. దానియేలు ఇట్లనెను: “సకల జనములును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదెన్నటికిని తొలగిపోదు, ఆయన రాజ్యము (విఫలమౌచున్న మానవ రాజ్యములవలె కాకుండ) ఎప్పుడును లయముకాదు.—దానియేలు 7:9, 10, 13, 14.
ఇదే ప్రపంచాధిపత్యాలను గూర్చి దానియేలునకివ్వబడిన ముందు ప్రవచనమిట్లు తెల్పుచున్నది: “ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దాని కెన్నటికిని నాశనము కలుగదు. . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని (మానవ) నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. . . . “కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది.”—దానియేలు 2:44, 45.
దేవుని ప్రభుత్వమగు యీ రాజ్యము కొరకే యేసు ఇట్లు ప్రార్థించవలెనని మనకు నేర్పించాడు. ఆయనిట్లనెను: “కాబట్టి మీరీలాగు ప్రార్ధన చేయుడి—పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక; నీ రాజ్యము వచ్చునుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.”—మత్తయి 6:9, 10.
ఆ రాజ్యంక్రింద భూనివాసులెంత ఆనందిస్తారో! అది మానవ స్వార్ధప్రియ క్రియలకు బదులుగా దేవుని నీతిన్యాయాలను మానవ ఆసంపూర్ణతా పద్ధతులకు బదులు దేవుని ఉన్నత ప్రమాణములను తెచ్చిపెట్టే గొప్పమార్పైవుండును. ఆ రాజ్య నిర్వాహణను గూర్చి బైబిలు తెలియజేయు విషయమే యీ భాగాలలోని రాబోవు అంశము.
[అధస్సూచీలు]
a బలమైన ఆయుధంగా వాడబడే యీ కొమ్ము బైబిలులో తరచు రాజులను రాజవంశాలను సూచించినట్లు వాడబడింది.—ద్వితీ 33:17; జెకర్యా 1:18, 21; ప్రక. 17:3, 12.
b ప్రకటన 17:11లో “క్రూరమృగము” అనగా ఏడుగురిలో ఒకడైయుండి ఎనిమిదవ రాజుగా వచ్చునని తెల్పింది. ఏడవ ఆధిపత్యము ఉనికిలోవున్నప్పుడు వచ్చు యీ ఎనిమిదవ ఆధిపత్యాన్ని గూర్చి తర్వాత శీర్షికలో చర్చించబడను.
c సువార్తలలో “మనుష్యకుమారుడు” అనే మాట సుమారు 80 సార్లు కనబడుతుంది. మరి అన్ని చోట్లను అది యేసుక్రీస్తును సూచిస్తుంది.—మత్తయి 26:63, 64 చూడండి.
[32వ పేజీలోని చిత్రాలు]
1944 సంవత్సరం జూన్ 6న ఐరోపా మీద చేసిన ద్వందాధికార దాడి, ఆంగ్లో-అమెరికా సహకారానికి ఓ మచ్చుతునక
[క్రెడిట్ లైను]
U.S. Coast Guard photo