బైబిలు ఉద్దేశము
మృతులు గౌరవించబడాలా?
“బాగా పాతుకు పోయిన ఒక భావన చాలామంది ప్రజలను వారు జంతు కళేబరంతో వ్యవహరించినట్లుగా కాక మానవ కళేబరాన్ని గౌరవించేలా వారిని పురికొల్పుతుంది.”—ఎన్సైక్లోపీడియా బ్రిటానికా.
అనేకమంది ప్రజలు మరణించిన తమ ప్రియమైన వారికి ఏదో ఒక రీతిలో గౌరవిస్తారు. వారు మరణించినవారి జీవిత వివరణలను వార్తా పత్రికలలో ప్రకటించడం ద్వారా, వారిని గూర్చి ప్రస్తుతించడం ద్వారా తమ మెప్పుదలను కనబరుస్తారు. కొన్ని దేశాల్లో మత పరమైన, సాంప్రదాయ పరమైన మతకర్మాచరణల్లో అంత్యక్రియలను ఘనంగా జరపడం సర్వసాధారణం. మరణించిన వారి కోసం రోజులు, వారాలు, లేదా నెలల పాటు కర్మకాండలు జరుపుతుంటారు. ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు మరణించినప్పుడు పాఠశాలలకు, విమానాశ్రయాలకు, వీధులకు, పట్టణాలకు వారి పేర్లను పెడతారు. స్మారక చిహ్నాలను నిర్మిస్తారు, ప్రసిద్ధి కెక్కిన వ్యక్తుల జ్ఞాపకార్థమై శెలవు దినాలను ఏర్పాటు చేస్తారు.
దేవుని వాక్య ప్రకారంగా చూస్తే, మరణించినవారు తమకు ఇవ్వబడే గౌరవాన్ని అందుకోలేని పూర్తిగా ఏమీ ఎరుగని స్థితిలో ఉన్నారు. (యోబు 14:10, 21; కీర్తన 49:17) ఎవరైతే తమను జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి జ్ఞాపకాల్లో మాత్రమే వారు ఉంటారు. బైబిలు ఇలా చెబుతుంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయతే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.” (ప్రసంగి 9:5) లేఖనాలు భవిష్యత్తుకు సంబంధించి పునరుత్థాన నిరీక్షణను ఇస్తున్నాయి. (యోహాను 5:28, 29; 11:25) కానీ, అప్పటివరకు మృతులు ఉనికిలో ఉండరు. వారు అక్షరార్థంగానే మట్టి అయిపోయి ఉంటారు.—ఆదికాండము 3:19; యోబు 34:15.
మృతుల పరిస్థితిని గూర్చిన బైబిలు స్పష్టమైన దృక్కోణాన్ని బట్టి చూస్తే, వారిని గౌరవించడం వల్ల ఏదైనా ఉద్దేశం నెరవేరుతుందా? తమ ప్రియమైన వారిని ఖననం చేసే విషయంలో అంత్యక్రియలు జరిపే విషయంలో క్రైస్తవులు సాంప్రదాయ ఆచారాలను అనుసరించాలా?
ఒక అబద్ధ నమ్మకంపై ఆధారపడిన మతకర్మాచరణలు
మృతులకు సంబంధించిన సాంప్రదాయ మత కర్మాచరణలలో అధికశాతం బైబిలుకు సంబంధించని మతబోధలు బాగా పాతుకుపోయాయి. కొన్ని మతాచారాల ఉద్దేశం ఏమిటంటే, “ప్రేతల బారి నుండి మరణించిన వ్యక్తులను రక్షించడం; కొన్నిసార్లు వారి వల్ల బ్రతికి ఉన్నవారు మృత్యువాత నుండి తప్పించుకోవడానికి, లేదా మృతులు తలపెట్టే హాని నుండి బ్రతికి ఉన్న వారిని కాపాడడమే”నని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పింది. మృతులు ఏదో అదృశ్య లోకంలో జీవిస్తారనే అబద్ధ మతకర్మాచరణలపై ఆధారపడిన ఇటువంటి ఆచారాలు బైబిలు సత్యాలకు విరుద్ధమైనవి.
అనేకమంది ప్రజలు మృతులను ఆరాధిస్తారు. అటువంటి ఆరాధనలో మరణించిన పూర్వీకులకు బలులను అర్పించడం, ప్రార్ధనలను జరపడం కూడా ఇమిడి ఉన్నాయి. కొందరు తాము చేసే అటువంటి ఆచార వ్యవహారాలను ఆరాధనగా భావించరు, బదులుగా, తమ పూజ్యభావాన్ని లేదా లోతైన గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నామనుకుంటారు. అయినప్పటికీ, మరణించిన పూర్వీకుల మీద భక్తిని చూపించడం, మతపరమైన ఆధారాలకు మద్దతునివ్వడం అనేవి బైబిలుకు విరుద్ధమైనది. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.”—లూకా 4:8.
సమతూక దృక్పథం
మరణించిన వారిమీద గౌరవాన్ని, మన్ననను చూపడం అన్నిసార్లూ అబద్ధమత బోధలతో ముడిపడి లేదు. ఉదాహరణకు, విశ్వసనీయుడైన రాజగు హిజ్కియా మరణానంతరం ఎలా గౌరవించబడ్డాడన్న దాని గురించి బైబిలు ఇలా తెలియజేస్తుంది. దేవుని ప్రజలు “దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తరక్రియలను ఘనముగా జరిగించిరి.” (2 దినవృత్తాంతములు 32:33) మరొక ఉదాహరణ యేసుక్రీస్తు. ఆయనను గూర్చి బైబిలిలా చెబుతుంది: ఆయన శిష్యులు “దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి.”—యోహాను 19:40.
మరణించినవారి దేహానికి, పాతిపెట్టడానికి సంబంధించిన ప్రత్యేక పద్ధతులను గూర్చి అనేక సందర్భాలను బైబిలు కల్గి ఉంది. ఈ ఆచారాలు పూర్వీకుల ఆరాధనకు సంబంధించినవి కావు, జీవిస్తున్నవారి జీవన విధానంపై మృతులు ప్రభావాన్ని చూపుతారనే తప్పుడు నమ్మకాలపై ఆధారపడినవీ కావు. బదులుగా, విలపించేవారు తాము ప్రేమిస్తున్న వారిపై తమకు గల ప్రగాఢ గౌరవాన్ని కనబరిచారు. సహజసిద్ధమైన మానవ భావోద్వేగాలపై ఆధారపడే ఇటువంటి గౌరవానికి బైబిలు అభ్యంతరాన్ని తెలపదు. అయితే, అంత్యక్రియల సమయంలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాన్ని, అమితావేశంతో అరవడాన్ని మాత్రం బైబిలు అనుమతించదు. మరొక వైపు ప్రియమైనవారు మరణించిన సందర్భంలో వారు వైరాగ్యం, నిర్వాణాలను చూపడాన్ని కూడా బైబిలు అనుమతించదు.
కనుక, యెహోవాసాక్షులు తమ ప్రియమైన వారి అంత్యక్రియలకు లేదా ఖననానికి హాజరైనప్పుడు మృతుల మీద తగిన గౌరవాన్ని, మన్ననను చూపుతారు. (ప్రసంగి 7:2) క్రైస్తవులు పువ్వులు, అంత్యక్రియలు, స్థానిక ఆచారాల విషయానికొచ్చేటప్పటికి జాగ్రత్తగా వ్యక్తిగత ఎంపిక చేసుకొని బైబిలు బోధలకు విరుద్ధమైన ఆచారాలను విడనాడుతారు. కాబట్టి, వివేచన, సమతుల్యత అవసరం. “ఒక కాలం నుండి మరొక కాలానికి మతకర్మాచరణల ప్రాముఖ్యత, విలువ మారుతూ ఉంటాయి, కాబట్టి ప్రస్తుత కాలంలో ఆచరిస్తున్న ఆచారాలు మొట్టమొదటి ఆచారాలకు పూర్తి భిన్నంగా ఉండవచ్చు, లేదా మొట్టమొదటి ఆచారాలతో ఎటువంటి సంబంధాన్ని కల్గి ఉండక పోవచ్చు” అని ఎన్సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ అండ్ ఎథిక్స్ వివరించింది.a
అమితంగా శ్లాఘించడం తప్పా?
శ్లాఘించే విషయంలో కూడా సమతుల్యతా సూత్రాన్ని అన్వయించాలి. అంత్యక్రియల సమయంలో యెహోవాసాక్షులు మరణమందు తన వారిని కోల్పోయిన వారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. (2 కొరింథీయులు 1:3-5) ప్రసంగ కార్యక్రమం ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువమంది ప్రసంగీకులతో ఉంటుంది. కానీ, మరణించిన వారిని శ్లాఘించడానికి ఆ సందర్భాన్ని ఒక పెద్ద ఉత్సవంలాగ మార్చడం తగనిది. బదులుగా ఈ అంత్యక్రియలు దేవుని అద్భుతమైన లక్షణాలను బట్టి, అలాగే, మనకు పునరుత్థాన నిరీక్షణను అనుగ్రహించిన ఆయన దయను బట్టి ఆయనను సన్నుతించే అవకాశాన్నివ్వాలి.
దీనర్థం మరణించినవారి మంచి లక్షణాలను అంత్యక్రియల సమయంలో గుర్తు చేసుకోవడం తప్పని కాదు. (2 సమూయేలు 1:17-27 పోల్చండి.) మరణించిన వ్యక్తి తాను మరణించేంత వరకు దేవుని మీద విశ్వాసం గలవానిగా ఉన్నట్లయితే, అతడు అనుసరించదగ్గ మంచిమాదిరిగా ఉంటాడు. (హెబ్రీయులు 6:12) దీనిని గూర్చి యోచించడం దేవుని సేవకులు యథార్థతను నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది. అంత్యక్రియల సమయంలో మృతులకు సంబంధించిన మంచి విషయాలను ఇతరులతో పంచుకోవడం మరణించిన వారి మీద గౌరవాన్ని పెంపొందిస్తాయి, అలాగే బ్రతికి ఉన్నవారికి ఉపశమనాన్ని అందిస్తాయి.
నిజ క్రైస్తవులు మృతులను ఆరాధించరు. బైబిలు సత్యాలకు విరుద్ధమైన ప్రఖ్యాతి గాంచిన అంత్యక్రియల్లో వారు పాల్గొనరు. మరొక వైపు మృతులు మట్టియై పోతారు కాబట్టి, ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలన్నీ ఉద్దేశం లేనివని, అనవసరమైనవనే అభిప్రాయాన్ని కూడా వారు నిరాకరిస్తారు. వారు విలపిస్తారు, తమ మృతులను గుర్తు చేసుకుంటారు. కానీ, మృతులు బాధనొందరు, వారికొక నిరీక్షణ ఉందన్న బైబిలు సత్యాలతో వారు తమ బాధను, విచారాన్ని నిమ్మళింప జేసుకుంటారు.
[అధస్సూచీలు]
a అక్టోబరు 15, 1991, కావలికోట, పేజీ 31 (ఆంగ్లం), ఇలా చెబుతుంది: “ఒక నిజ క్రైస్తవుడు, నేను అనుసరించే ఒక ఆచారం నేను లేఖనరహిత నమ్మకాల్ని, ఆచారాల్ని స్వీకరించినట్లు చూపిస్తుందా? ఇతరులకు లేఖనరహిత నమ్మకాలుగాను, ఆచారాలుగాను కన్పిస్తున్నాయా? దాని సమాధానం కాలం, నివసిస్తున్న ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ఆచారం వేలాది సంవత్సరాల క్రితం ఉండి ఉండవచ్చు. అది సుదూర ప్రాంతంలో ఇప్పుడు ఉండి ఉండవచ్చు. అయితే, మీరు దీనిని గూర్చి మీ సమయాన్ని హరించివేసేలా అన్వేషణ చేసే బదులు మిమ్మల్ని మీరిలా అడగండి: ‘నేను నివసించే ప్రాంతంలోని సాధారణ దృక్పథం ఏమిటి?’—1 కొరింథీయులు 10:25-29 పోల్చండి.”
[10వ పేజీలోని చిత్రం]
1632లో మరణించిన స్వీడన్ దేశపు రాజైన గస్టవ్ II గౌరవార్థమై జరిపిన అంత్యక్రియల ఊరేగింపు
[క్రెడిట్ లైను]
From the book Bildersaal deutscher Geschichte