బైబిలు ఉద్దేశము
ఏకాంతత విలువ
ఒకానొక సందర్భంలో, యేసు “ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు.” (మత్తయి 14:23, పరిశుద్ధ బైబల్) మరో సందర్భంలో, “ఉదయమైనప్పుడు, ఆయన బయలుదేరి నిర్జన స్థలానికి వెళ్ళాడు.” (లూకా 4:42, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) యేసుక్రీస్తు ఏకాంతంగా ఉండే గడియలను అప్పుడప్పుడు కనుగొనేవాడనీ, వాటిని విలువైనవిగా ఎంచేవాడనీ ఈ లేఖనాలు చూపిస్తున్నాయి.
యేసులాగే, ఏకాంతతను విలువైనదిగా ఎంచిన ఇతర పురుషుల ఉదాహరణలను బైబిలు ఇస్తుంది. కీర్తన రచయిత తన గొప్ప సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ధ్యానించినది మెలకువగా ఉన్న ఏకాంతపు రాత్రుల్లోనే. మరోసారి యేసు విషయాన్నే తీసుకుందాం. బాప్తిస్మమిచ్చే యోహాను మరణాన్ని గురించి విన్న వెంటనే ఆయన “నిర్జన ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు.”—మత్తయి 14:13, పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం; కీర్తన 63:4.
నేడు, అల్లకల్లోలముతో కూడిన ఆధునిక జీవనంలో, పరిస్థితుల మూలంగానైతేనేమి, ఎంపిక చేసుకోవడమైతేనేమి, ఏకాంతతకు అంత విలువ ఇవ్వడం లేదు. మీరు ఏకాంతంగా గడిపిన చివరి సమయమేదో మీకు గుర్తుందా? “నా జీవితంలో నేను ఎన్నడూ ఏకాంతంగా ఉండలేదు” అని ఒక వివాహిత యువతి చెప్పింది.
కానీ ఏకాంతత నిజంగా అవసరమా? అలాగైతే, నిశ్శబ్ద గడియలను ప్రయోజనకరంగా, ప్రతిఫలదాయకంగా ఎలా ఉపయోగించవచ్చు? ఏకాంతాన్ని అన్వేషించడంలో సమతుల్యత ఏ పాత్ర నిర్వహిస్తుంది?
ఏకాంతత—ఎలా ప్రయోజనకరమైనది?
ప్రాచీనకాలపు దైవజనుడైన ఇస్సాకు ‘సాయంకాలమున పొలములోకి వెళ్ళి’ ఏకాంతంగా గడిపేవాడు అని బైబిలు చెబుతుంది. ఎందుకు? ‘ధ్యానించడానికి’ వెళ్ళాడు అని అది చెబుతుంది. (ఆదికాండము 24:63) ఒక నిఘంటు ప్రకారం, ధ్యానించడం అంటే. “లోతుగానో సావధానంగానో తలపోయడం” అని అర్థం. అది “గంభీరంగా, ఎక్కువ సేపు అవధానముంచడాన్ని సూచిస్తుంది.” ఇస్సాకు విషయాన్నే తీసుకుంటే, బరువైన బాధ్యతను చేపట్టబోతున్న ఆయన అలా అవాంతరాల్లేకుండా ధ్యానం చేయడం ఆయన స్పష్టంగా ఆలోచించుకోగల్గేలా, తన ఆలోచనలను వ్యవస్థీకరించుకోగల్గేలా, ప్రాధాన్యతలను మదింపు చేసుకోగల్గేలా చేసింది.
‘ఏకాంతతను దాని హద్దుల్లో ఉంచితే, ఇతరులెవరూ దగ్గర్లో లేకపోవడం మన తలంపులను వ్యవస్థీకరించుకోవడాన్నీ, ఇంకా బాగా ఏకాగ్రతను నిలుపుకోవడాన్నీ సాధ్యం చేస్తుంది’ అని ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు అంటున్నారు. అది నూతనోత్తేజాన్ని కలిగిస్తుందనీ, బలపరుస్తుందనీ, ఆరోగ్యకరమైనదనీ అనేకులు స్థిరీకరిస్తారు.
ధ్యానం వలన కలిగే కోరదగిన ఫలితాల్లో అవగాహన, ప్రశాంతతో కూడిన ఆత్మసంయమనం, వివేచనతో కూడిన మాటలకు క్రియలకు దోహదపడే లక్షణాలు ఇమిడి ఉన్నాయి. అవి సామరస్యంగల మానవ సంబంధాలకు దోహదపడతాయి. ఉదాహరణకు, ధ్యానించడానికి నేర్చుకునే వ్యక్తి, ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా నేర్చుకుంటాడు. ఆయన తొందరపాటుతో మాట్లాడే బదులు, తన మాటల వల్ల రాగల ఫలితాలను మాట్లాడక ముందే పరిగణనలోకి తీసుకుంటాడు. “ఆతురపడి మాటలాడువాని చూచితివా?” అని ప్రేరేపిత బైబిలు రచయిత అడుగుతున్నాడు. “వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును” అని కూడా ఆయన అంటున్నాడు. (సామెతలు 29:20) అలా నాలుకను అనాలోచితంగా ఉపయోగించకుండా ఉండేందుకు విరుగుడు ఏమిటి? “నీతిమంతుడి హృదయం ఎలా జవాబివ్వాలా అని తలపోస్తుంది” అని బైబిలు చెబుతుంది.—సామెతలు 15:28, పరిశుద్ధ బైబిల్; పోల్చండి కీర్తన 49:3.
క్రైస్తవుడు ఆధ్యాత్మిక పరిపక్వతకు ఎదగడంలోని ముఖ్య కారకం ఏకాంతంలో మౌనంగా ధ్యానించడమే. “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ప్రస్తుత విషయానికి పొందికగా ఉన్నాయి.—1 తిమోతి 4:15.
దేవుడికి దగ్గరయ్యేందుకు ఏకాంతతను ఉపయోగించుకోండి
“ఏకాంతత అనేది దేవుడి దర్శన గది” అని ఒక ఆంగ్ల రచయిత అన్నాడు. కొన్నిసార్లు, యేసు తన తోటి మానవులకు దూరంగా వెళ్ళి, ఏకాంతంలో దేవుడి సాన్నిధ్యంలో గడపవలసిన అవసరముందని భావించాడు. “ఉదయం ఇంకా చీకటిగా వుండగానే ఆయన లేచి ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేస్తూ వున్నాడు” అని చెబుతున్న బైబిలు వివరణ దీనికి ఒక ఉదాహరణ.—మార్కు 1:35, పరిశుద్ద బైబిల్.
కీర్తనల్లో, దేవుడివైపుకు మరలి చేసే ధ్యానాన్ని గురించి పదే పదే పేర్కొనబడింది. యెహోవాతో మాట్లాడుతూ, ‘నిన్ను ధ్యానిస్తాను’ అని రాజైన దావీదు అన్నాడు. ఆసాపు మాటలు కూడా ఈ శైలిలోనే ఉన్నాయి. “నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును” అని ఆయన అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (కీర్తన 63:4; 77:12) అలా, దైవిక లక్షణాలు మరియు వ్యవహారాలను గురించి తలపోయడం మంచి ఫలితాలను తెస్తుంది. అది దేవుడి ఎడల ఒకరికున్న మెప్పుదలను అధికం చేసి అతడు ఆయనకు మరింత సన్నిహుతుడవ్వగల్గేలా చేస్తుంది.—యాకోబు 4:8.
మితత్వం అవసరం
నిజమే, ఏకాంతతను పాటించడంలోనూ మితత్వం ఉండాలి. ఏకాంతతను సందర్శించదగినదే అయినా అక్కడే ఉండిపోతే అపాయకరం కాగల స్థలంగా వర్ణించవచ్చు. ఒకరు అతిగా వేరై ఉండడమంటే, సహవసించడం, తలంపులను పరస్పరం తెలియజేసుకోవడం, ప్రేమను వ్యక్తీకరించుకోవడం వంటి మానవ ప్రాథమిక అవసరాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే. అంతేకాక, ఒకరు తనను తాను ఏకాకిగా చేసుకోవడాన్ని మూర్ఖత్వపు విత్తనాలూ, స్వార్థపు విత్తనాలూ పెరగగల ప్రాంతంతో పోల్చవచ్చు. ‘వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుస్తాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి’ అని బైబిలు సామెత హెచ్చరిస్తుంది. (సామెతలు 18:1) ఏకాంతతను అన్వేషించేటప్పుడు సమతుల్యత ఉండాలి. వేరై ఉండడంలోని ప్రమాదాల్ని మనం తప్పనిసరిగా గుర్తించాలి.
బైబిలు కాలాల్లోని యేసు మరియు మరితర ఆధ్యాత్మిక పురుషుల్లాగే, నేడు క్రైస్తవులు తమ ఏకాంత గడియలను విలువైనవిగా ఎంచుతారు. నిజమే, అనేక బాధ్యతలు బాధలూ ఉండడం వల్ల, ఏకాంతంలో ధ్యానించే సమయాన్నీ అవకాశాన్నీ కనుగొనడం సవాలు కాగలదు. అయితే, నిజంగా విలువైనవాటన్నింటి విషయాలకు మల్లే దీని కోసం కూడా మనం “అనువైన సమయాన్ని” కొనుక్కోవడం తప్పనిసరి. (ఎఫెసీయులు 5:15, 16, NW) అలా చేసినప్పుడు, మనం కూడా, కీర్తన రచయిత చెప్పినట్లే, “యెహోవా, . . . నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక” అని చెప్పగల్గుతాం.—కీర్తన 19:14.