ఆయన హృదయం కదిలిపోయింది
గ్లోరియా ఆడమ్ ఇలా వ్రాస్తోంది, “మేము 13 మంది పిల్లలము, నలుగురు అబ్బాయిలు, తొమ్మిదిమంది అమ్మాయిలు. అది 1984. నాన్న మెక్సికోకు తిరిగి వచ్చి, తాను అమెరికాలో పనిచేస్తూ అక్కడ ఉన్నప్పుడు, మేమంతా యెహోవా సాక్షులతో ఇక్కడ బైబిలు పఠించడం ప్రారంభించామని ఆయన తెలుసుకున్నాడు. అది ఆయనకు ఎంత మాత్రం నచ్చలేదు, ఆయన మమ్మల్ని వ్యతిరేకించడం ప్రారంభించాడు. ఒక్కోరోజూ గడుస్తూ ఉంటే ఆయన హృదయం కఠినమౌతున్నట్లు అనిపించేది.
“మా నాన్నంటే మాకెంతో ప్రేమ, మేము పొందుతున్న జీవదాయక జ్ఞానం నుండి ఆయన కూడా ప్రయోజనం పొందాలని మేము కోరుకునేవాళ్లం. యెహోవా సంకల్పాల గురించి నాన్నతో మాట్లాడేందుకు మాకు మార్గాన్ని తెరవమని వేడుకుంటూ మేము ప్రతిరోజు యెహోవాకు ఎడతెగక ప్రార్థన చేసేవాళ్లం. యెహోవా మా విన్నపాన్ని విన్నాడు గనుకే, నాన్న ప్రతి రాత్రి టీవీ చూస్తూ కూర్చునే గదిలో మేము ప్రతి సాయంకాలం సమకూడేందుకు కావలసిన ధైర్యాన్ని యెహోవా మాకిచ్చాడు. అమ్మాయిలమైన మేమూ, మా అమ్మా దినవచనాన్ని చదవడానికి అక్కడ సమకూడేవాళ్లం.
“అమ్మ చర్చను నిర్వహించేది, వ్యాఖ్యానాలను చదివిన తర్వాత, ప్రార్థన చేయడానికి మేము వంతులు తీసుకునేవాళ్లం. ఐదేళ్ల మా చిన్న చెల్లి మారీ ప్రార్థన చేసేటప్పుడు, ఆమె ఎడతెగక ఇలా వేడుకునేది: ‘యెహోవా, మా నాన్న కూడా నీ సాక్షి అయ్యేలా దయచేసి ఆయన హృదయాన్ని మెత్తబర్చు.’ నాన్న టీవీ వాల్యూమ్ను ఎక్కువ చేసేవాడు కాబట్టి ఆయన వినడం లేదనిపించేది. అయితే, సమయం గడుస్తుండగా, ఆయన వాల్యూమ్ తగ్గించడం మొదలు పెట్టాడు, చివరికి ఒక రాత్రి ఆయన టీవీ ఆఫ్ చేసేశాడు.
“ఆ సాయంత్రం మా వాడుక ప్రకారం, లేఖనం చదవడం ఎవరి వంతు అని అమ్మ అడిగింది. మాకు అమితాశ్చర్యం కలిగేలా, ‘నా వంతు’ అని నాన్న అన్నాడు. మేము ఆశ్చర్యచకితులమయ్యాము, కాని ఏమీ అనలేదు. అమ్మ అడ్డు చెప్పనూ లేదు, ఏమీ ప్రశ్నించనూ లేదు, కాని ప్రతిదినము లేఖనములను పరిశీలించుట పుస్తకాన్ని ఆయన చేతికిచ్చింది. ఆయన బైబిలు లేఖన చర్చను నిర్వహించిన తర్వాత, ప్రార్థన చేయడం ఎవరి వంతని అమ్మ అడిగింది. ‘నా వంతు’ అని నాన్న అన్నాడు.
“ఆశ్చర్యంతో మాకు నోటమాట రాలేదు. ప్రార్థన మధ్యలో మేము ఇక కన్నీళ్లు ఆపుకోలేకపోయాము. నాన్న కూడా ఏడవటం మొదలెట్టాడు, తను యెహోవాను నిందించినందుకు తనను క్షమించమని ఆయన్ను వేడుకున్నాడు. మమ్మల్ని వ్యతిరేకించినందుకు క్షమించమని అమ్మను కూడా అడిగాడు.
“అలా 1986లో నాన్న వ్యతిరేకత ఆగిపోయింది. 1990లో మా కుటుంబం అమెరికా నందలి టెక్సాస్కు తరలి వెళ్లింది. కొంత కాలానికి, నాన్న తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, మేము ఏడుమందిమి అక్కచెల్లెళ్ళము చేసినట్లుగానే ఆయన నీటి బాప్తిస్మం తీసుకున్నాడు. 1997 ఏప్రిల్లో, నాన్న క్రైస్తవ పెద్దగా నియమించబడ్డాడు. ఈనాటికీ, ఒక కుటుంబంగా దినవచనాన్ని పరిశీలించడం మాకెంతో ప్రాముఖ్యమైన విషయం, యెహోవాకు ప్రార్థన చేయడం మా కుటుంబ జీవితానికి పునాది.”
[31వ పేజీలోని చిత్రం]
1. మెక్సికోలో పయినీరింగు చేస్తున్న నలుగురు కుమార్తెలు. మారీ ముందు ఉంది
2. తమ పిల్లల్లో కొందరితో క్వేనీట మరియు ఈసాక్ ఆడమ్. గ్లోరియా కుడివైపున చివర ఉంది