ఒక భూవ్యాప్త పరిష్కారం—సాధ్యమేనా?
క్షయ (టీబీ) భూవ్యాప్త సమస్య కాబట్టి దానికి భూవ్యాప్త పరిష్కారం అవసరమని నిపుణులు అంగీకరిస్తారు. ఏ దేశమూ టీబీని ఒంటరిగా అదుపులో పెట్టలేదు, ఎందుకంటే కోట్లాదిమంది ప్రజలు ప్రతివారం తమ దేశాల సరిహద్దుల్ని దాటుతుంటారు.
టీబీ తాకిడి అత్యంత తీవ్రంగా ఉన్న బీద దేశాలకు ధనిక దేశాలు సహాయం చేయాల్సిన అవసరం ఉందనీ, అదే అంతర్జాతీయ సహకారం అనీ చాలామంది అభిప్రాయపడతారు. డా. అరాటా కోచి చెబుతున్నట్లుగా, “ధనిక దేశాల్లోనికి టీబీ వ్యాపించకముందే, తక్కువ అభివృద్ధిచెందిన దేశాలకు టీబీకి విరుద్ధంగా చేసే పోరాటంలో సహాయం చేయడం ధనిక దేశాలకే ప్రయోజనకరం.”
కానీ సంపన్న దేశాలు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతగల విషయాలు, సమస్యలు అని తాము భావించే వాటితో సతమతమవుతూ, బీద దేశాలకు సహాయం అందించడానికి వెంటనే ముందుకు రాలేదు. కొన్ని బీద దేశాలు ఆరోగ్య సంరక్షణని నిర్లక్ష్యం చేస్తూ, డబ్బుని ఆయుధాలపై ఖర్చుచేస్తుంటాయి. 1996 మధ్యభాగానికల్లా, ప్రపంచంలోని టీబీ రోగుల్లో కేవలం 10 శాతంమందికి మాత్రమే DOTS ప్రణాళిక ద్వారా చికిత్స జరుగుతుంది, ఈ మహామారిని అంతమొందించడానికి ఇది ఎంతమాత్రం సరిపోదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా చెబుతుంది: “టీబీ వ్యాధికి చికిత్స చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానము, చవకైన మందులు దశాబ్దాలుగా ఉంటూనేవున్నాయి. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సిందేమిటంటే, బలము అధికారము కనికరము ఉన్నవారు రంగంలోనికి దూకి ఈ మందుల్ని ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఉపయోగించేలా చేయడమే.”
రానున్న విజయం
బలమూ అధికారమూ ఉన్న మానవులు ఈ సమస్యని పరిష్కరిస్తారని మనం నమ్మకంతో ఎదురుచూడగలమా? ప్రేరేపిత బైబిలు కీర్తనల రచయిత ఇలా వ్రాశాడు: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.” మరైతే మనం ఎవరిని నమ్మగలము? ఆ లేఖనము ఇంకా ఇలా చెబుతుంది: “ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు.”—కీర్తన 146:3, 5, 6.
భూమికి రూపనిర్మాణం చేసినవానిగా, దానిని సృష్టించినవానిగా యెహోవా దేవునికి వ్యాధిని అంతం చేయడానికి కావాల్సిన శక్తీ జ్ఞానమూ ఈ రెండూ ఉన్నాయి. ఆయనకు కనికరము కొరవడిందా? యెహోవా తన ప్రేరేపిత ప్రవక్తద్వారా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను [నా ప్రజలను] కనికరింతు[ను].”—మలాకీ 3:17.
అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన దర్శనం గురించి బైబిలులోని ఆఖరి అధ్యాయం వర్ణిస్తుంది. ఆయన ‘నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయుచున్న జీవవృక్షాలను’ చూశాడు. సాదృశ్యమైన ఈ వృక్షాలూ, వాటికి కాసే ఫలాలూ, విధేయులైన మానవులు భూమిపైన నిరంతరము నివసించడాన్ని సాధ్యపరిచే దైవిక ఏర్పాట్లను సూచిస్తాయి.—ప్రకటన 22:2.
ముందుకు సాగుతూ యోహాను ఇంకా ఇలా వ్రాశాడు: “ఆ వృక్షము[ల]యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.” ఈ సాదృశ్యమైన ఆకులు మానవజాతిని అటు ఆధ్యాత్మికంగాను ఇటు శారీరకంగాను స్వస్థపర్చే దేవుని ఆశీర్వాదాలను సూచిస్తాయి. ఆ విధంగా దేవుని పరిపాలన క్రింద నీతియుక్తమైన నూతన లోకంలో టీబీ పూర్తిగాను నిరంతరంగాను జయించబడుతుందని మనం నిశ్చయతను కల్గివుండవచ్చు.—ప్రకటన 21:3, 4.
[8, 9వ పేజీలోని చిత్రం]
దేవుడు మానవజాతి కొరకు శాశ్వతమైన స్వస్థతను వాగ్దానం చేస్తున్నాడు