ప్రపంచ పరిశీలన
అక్షరాస్యత మరియు ఆరోగ్యం
యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) ఉదాహరించిన గణాంకశాస్త్ర వివరణ ప్రకారం, ఎక్కువ స్థాయిలోని అక్షరాస్యత దీర్ఘాయుష్షుకు తోడ్పడవచ్చు. “చదవడం, వ్రాయడం నేర్చుకున్న ప్రజలు పారిశుద్ధ్య ఆరోగ్య విషయాల్లో మరింత శ్రద్ధగలవారై ఉంటారు; వారు అంత విధిని విశ్వసించేవారిగా ఉండరు, రోగం వచ్చినప్పుడు వైద్యుని దగ్గరకు వెళ్ళడానికి సుముఖత చూపుతారు” అని యునెస్కో సోర్సెస్ అనే పత్రిక చెబుతుంది. అయితే, అక్షరాస్యత అనేది జీవితాయుష్షును పెంచే కారకాంశాల్లో ఒకటి మాత్రమే. “వైద్య చికిత్స అందుబాటులో ఉండడమూ, కుటుంబ ఆర్థిక పరిస్థితులూ మరియు సామాజిక వాతావరణం” అనేవి కూడా అతి కీలకమైన పాత్రలను నిర్వహిస్తాయి.
విలువలేని శిఖరాగ్ర సమావేశం
ఐక్యరాజ్య సమితి స్పాన్సర్ చేసిన “సామాజిక అభివృద్ధి కొరకైన ప్రపంచ శిఖరాగ్ర సమావేశం” అనే పేరు గల సమావేశానికి హాజరవ్వడానికి ప్రపంచమంతటి నుండి దాదాపు 20,000 మంది ప్రతినిధులు మార్చి 6-12, 1995లో డెన్మార్క్లోని కోపెన్హాగెన్లో కలుసుకున్నారు. అక్కడ సమావేశమౌతున్న వాళ్ళ లక్ష్యమేమిటి? అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, అలీనతను అంతం చేసే మార్గాలను చర్చించాలన్నదే. అయితే, నిధులు లేవనే పెద్ద అవరోధాన్ని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పేదరికంతో బాధపడుతున్న అనేక దేశాలు సంపన్న దేశాలకు ఎంత ఎక్కువగా రుణపడి ఉన్నాయంటే, అవి కనీసం వాటి వడ్డీని కూడా చెల్లించలేకపోతున్నాయి. అతిథేయ దేశమైన డెన్మార్క్ అతి పేద దేశాల ఋణాలను రద్దు చేయడంలోని తమ మాదిరిని సంపన్న దేశాలు అనుకరించాలని ప్రతిపాదించింది. అయితే ఒక సమస్య ఉంది: అనేక పేద దేశాలు మారణాయుధాలను కొనుక్కోవడం కొరకే అప్పులు చేయవలసి వచ్చింది. కనుక, ఐక్యరాజ్య సమితి సలహాదారుడు వివరించినట్లు, ఋణాన్ని రద్దుచేస్తే, వారు ఆ అవకాశాన్ని, మరిన్ని తుపాకులను కొనడానికే ఉపయోగిస్తారు.
తదనుభూతిని నేర్చుకోవడం
పిల్లలయందు తదనుభూతిని గూర్చి అధ్యయనం చేసే పరిశోధకులు ఇతరుల భావాల్ని వివేచించే సామర్థ్యం నేర్చుకోవడం ద్వారానే వస్తుందని ప్రతిపాదించారు. న్యూయార్క్ టైమ్స్లో ఎత్తి వ్రాయబడినట్లుగా మన్హట్టాన్లోని కన్సస్ రాష్ట్ర విశ్వవిద్యాలయంనందు ప్రొఫెసరైన డా. మార్క్ ఎ. బార్నెట్ “సరిగా వ్యవహరించబడని పిల్లలు ఇతర పిల్లల దురవస్థను చూసి తదనుభూతితో ప్రతిస్పందించరనే విషయం కన్పించిందని, వాళ్లు దురవస్థలో ఉన్న పిల్లవాడిని చూసి, ఏమీ చేయకపోవచ్చని లేక వారు దగ్గరకెళ్లి కేరింతలు కొట్టి, ఆ పిల్లవాడిని త్రోసివేస్తారని,” చెబుతున్నాడు. మరోవైపున, “భావోద్రేక అవసరతలు పరిరక్షించబడిన ఓ పిల్లవాడు ఇతరుల భావోద్రేకాలకు ఎంతగానో ప్రతిస్పందిస్తాడని,” కూడా ఆయన తెలియజేశాడు. అయితే, భావోద్రేక భద్రతను ఇవ్వడంతోపాటూ తదనుభూతిని ఎలా కలిగి ఉండాలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సి ఉంది. డా. బార్నెట్ చెబుతున్నట్లుగా తదనుభూతిగల తల్లిదండ్రులు సాధారణంగా తదనుభూతిగల పిల్లల్ని పెంచుతారు.
నత్తల దాడి
ఆరు సంవత్సరాల క్రితం, బ్రతికున్న దక్షిణ అమెరికా సువర్ణ నత్తలను వియత్నామ్కు ఆహార పదార్థంగా దిగుమతి చేయక ముందు, అవి తప్పించుకున్నట్లయితే పెద్ద సమస్యలను సృష్టించవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. శాస్త్రజ్ఞులు చెప్పింది నిజమని కాలం నిరూపించినట్లుంది. కొన్ని నత్తలు తప్పించుకున్నాయి, మరి అవి వెంటనే బియ్యం తినాలన్న పిచ్చి ఇష్టాన్ని కనబరచాయి. అప్పుడు ప్రభుత్వం నత్తలను నిరోధించింది, కానీ అనేక చిన్న సంస్థలు వాటిని ఎలాగోలా పెంచి, వాటిని ఆహార పదార్థంగా అమ్మడంలో కొనసాగాయి. అధికారిక వియత్నామ్ న్యూస్ ప్రకారం, వీటిలో ఎనిమిది చిన్ని ప్రాణులు కలిసి ఒక రోజులో ఒక చదరపు మీటరు ప్రాంతంలోని వరి ధాన్యాన్ని తినివేయగలవు అని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిస్తుంది! ఈ నత్తలు ఇప్పటికే 77,000 ఎకరాల చేనును తినివేశాయి, దేశంలో అధిక వరి ఉత్పాదనగల ప్రాంతాల్లో కూడా అవి వ్యాపిస్తున్నాయని నివేదించబడుతుంది. ఆడ నత్త ఒక సంవత్సరంలో దాదాపు నాలుగు కోట్ల గ్రుడ్లను పెట్టగలదు.
చైనా జనాబా 120 కోట్లకు చేరుకుంటుంది
ఈ సంవత్సర ఆరంభంలో చైనా జనాబా 120 కోట్లకు చేరుకుంది అని చైనా టుడే నివేదించింది. 1970లలో కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రవేశ పెట్టకపోయినట్లయితే, జనాబా తొమ్మిది సంవత్సరాల క్రితమే ఈ పరిమాణానికి చేరుకునేది. అయితే, ప్రస్తుత పెరుగుదల చొప్పున, తరువాయి శతాబ్దారంభంకల్లా చైనా జనాబా 130 కోట్లకు చేరుకుంటుంది. భౌగోళికంగా ప్రపంచంలోని పెద్ద దేశాల్లో చైనా ఒకటి అయినప్పటికీ, ధాన్యం, మాంసం మరియు గ్రుడ్ల తలసరి ఉత్పాదన, ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లోని దాని కన్నా తక్కువే. అంతేకాక, కాలుష్యం మరియు అధిక జనసాంద్రతల వల్ల వ్యవసాయం చేసుకునే భూమొత్తం తగ్గుతోందని చైనా టుడే చెబుతుంది.
భవిష్యత్తును గూర్చి నిరాశావాదంగల యౌవనస్థులు
సాధారణంగా ఆస్ట్రేలియా “అదృష్టంగల దేశం” అని పిలువబడుతుంది, కానీ నేడు ఆస్ట్రేలియాలోని యౌవనస్థుల పెరుగుతున్న జనాబా ఈ భావనతో ఏకీభవించకపోవచ్చు. 15 నుండి 19 ఏండ్ల వయస్సులోని యౌవనస్థులను గూర్చి చేసిన అధ్యయనాన్ని గురించి, వారికి “ఆస్ట్రేలియా యొక్క ఆర్థిక భవిష్యత్తును గూర్చి ‘భయానకమైన’ భావన” ఉన్నట్లుగా కనుగొనబడిందని ది ఆస్ట్రేలియన్ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. రాష్ట్ర పాఠశాలల్లో, కాథోలిక్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిది, పది, పదకొండు తరగతులు చదువుకునే విద్యార్థులు ఇంటర్వ్యూ చేయబడ్డారు. “ఆ నివేదిక ప్రకారం, 15 మరియు 16 ఏండ్లున్న ప్రస్తుత తరం “సమాజం మరింత హింసాత్మకమౌతుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంటుంది అని నమ్ముతూ భవిష్యత్తు కొరకు ఆతురుతతో ఎదురు చూడకుండా ఉంటోందని అన్వేషణా ఫలితాలు ‘తేటతెల్లంగా’ చెబుతున్నాయి” అని వార్తాపత్రిక తెలియజేస్తుంది. ఇప్పటి నుండి మరో పది సంవత్సరాల తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందని అడిగినప్పుడు “జవాబిచ్చిన వారిలో ఎక్కువ మంది క్షీణించిపోతున్న ఆర్థిక వ్యవస్థను మరియు వ్యక్తులకు తమ ఆర్థిక స్థితిపై అదుపు తగ్గిపోయే సమాజాన్ని పేర్కొన్నారు.”
“జ్ఞాపకశక్తి” ఉన్న మొక్కలు
దాడి చేయబడినప్పుడు, చాలా మొక్కలు తమపై దాడి చేసేవాటిని ఎదుర్కోవడానికి రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. మళ్ళీ దాడి చేయబడితే మరింత వేగంలో త్రిప్పిగొట్టే విషపదార్థాలను ఉత్పత్తి చేయనారంభించగల్గేలా కొన్ని మొక్కలు దాడి చేయబడిన విషయాన్ని “జ్ఞాపకం” ఉంచుకుంటాయని కూడా న్యూ సైంటిస్ట్ అనే పత్రిక నివేదిస్తుంది. పొగాకును తినే గొంగళి పురుగు జాస్మోనిక్ ఆసిడ్ ఉత్పన్నానికి కారణమౌతుంది, అది వేర్ల వరకు ప్రయాణం చేస్తుంది. ఇది, పొగాకును తినే పురుగు ఇష్టపడని నికోటిన్ ఉత్పత్తి ఆరంభించేట్లు చేస్తుంది, ఆ నికోటిన్ ఆకులకు తిరిగి చేరుకుంటుంది. ఒకసారి ఆసిడ్ అంటిన మొక్కల వేర్లు, మరో దాడిని ఎదుర్కోవడానికి వెంటనే ప్రతిస్పందించాయి. “మొక్కలకు నిజంగా జ్ఞాపకశక్తి ఉందని ఇది చెబుతుంది” అని బఫెల్లో నందలి స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లోని ఇయాన్ బాల్డ్వన్ చెబుతున్నాడు.
వెన్ను నొప్పిని ఎదుర్కోవడం
కెనడాలోని ద మెడికల్ పోస్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 90 శాతం మంది ప్రజల్లో తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి వెన్ను క్రింది భాగంలో నొప్పి కలగడం అనేది “మానవులను బాధించే సాధారణ పరిస్థితి.” అయితే, ఎక్కువ కేసుల్లో ఖరీదైన వైద్య చికిత్స అవసరం కాకపోవచ్చు. “అకస్మాత్తుగా, లేదా తీవ్రంగా మంట కలిగించే వెన్ను నొప్పిగల (సాధారణంగా శారీరకంగా పని చేసిన తరువాత వచ్చేది) 90 శాతం కేసుల్లో వెన్నుపైని కండరాల్లో తీవ్రమైన ఈడుపులు (స్పేజమ్స్) మాత్రమే ఉంటాయి, రెండు మూడు రోజులు పడక మీద విశ్రాంతి తీసుకున్న తరువాత ఉపశమనం కలుగుతుంది” అని డా. గార్త్ రస్సెల్ అనే ఆర్తోపెడిస్ట్ చెబుతున్నాడు. “తేలికైన వ్యాయామాలను చేసి, మీ దినచర్యను పునఃప్రారంభించండి” అని డా. రస్సెల్ తరువాత సిఫారసు చేస్తున్నాడు.
బాధ కలిగించే వైరస్లు
ఆరోగ్య అధికారులు అమెరికాలోని అంటువ్యాధులను గూర్చి చింతిస్తున్నారు. యు.ఎస్.న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టులోని ఒక శీర్షిక ప్రకారం, “అంటురోగాలు మరియు పాత వ్యాధులు ఉద్ధృతమౌతున్నాయి.” ఎందుకని? మానవులు వ్యాధులకు గురి కావడానికి గల కారకాంశాలు అధికమౌతున్నాయి అని స్విస్ వార్తాపత్రికయైన న్యూ జర్కర్ సేటంగ్ వివరిస్తుంది. రోగ ప్రతిరోధక శక్తిలేని జనాబాలోకి వ్యాధులు ప్రవేశపెట్టబడడానికి కారణమయ్యే అంతర్జాతీయ ప్రయాణాలు అధికంకావడం కూడా కారకాంశాల్లో చేరి ఉన్నాయి. అంతేకాక, అట్లాంటా, జార్జియా నందలి సి.డి.సి.లోని (సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్) “ప్రజలను భయపెట్టేది సాధారణ సూక్ష్మజీవులే, రోగ నిరోధక మందులు వాటిని ఒకసారి అంతమొందించాయి, అయినప్పటికీ అవి క్రొత్త, మరింత శక్తివంతమైన మందులను కూడా ఓడించడం మొదలు పెట్టాయి” అని యు.ఎస్.న్యూస్ పేర్కొంటోంది.
క్రొత్త జాతులు
బ్రిటీష్ మరియు బ్రెజిల్ వృక్షశాస్త్రజ్ఞులు క్రొత్త మొక్క జాతులను పరిశోధిస్తూ ఈశాన్య బ్రెజిల్లోని ఒకే ఒక పర్వతంలో 20 సంవత్సరాలకు పైగా అన్వేషణలను జరుపుతున్నారు. క్రితం తెలియని విస్మయం కలిగించే 131 జాతులు ఇంతవరకు కేవలం 171 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే పెరుగుతున్నట్లు వారు కనుగొన్నారు. ఫోల్యా డీ సావోపాలో అనే వార్తాపత్రిక పిలుస్తున్నట్లు ఈ “ఏదెను తోట” బ్రెజిల్ రాష్ట్రమైన బాహియాలో 1,960 మీటర్ల ఎత్తులోని పికో దాస్ అల్మాస్లో పెరుగుతుంది. ఈ మొక్కలన్నీ నిజంగా క్రొత్తగా కనుగొనబడినవేనని నిశ్చయపర్చుకోవడానికి వృక్షశాస్త్రజ్ఞులు దాదాపు 3,500 శుష్కవృక్షశాలలు పరిశీలించారు, అది నిజమేనని తేలింది. “ఇరవైయవ శతాబ్దాంతంలో ఇంతెక్కువ మొక్కలను కనుగొనడం ఆసక్తికరమైన విషయం” అని ఇంగ్లాండ్లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్లోని సైమన్ మాయో ఈ వార్తాపత్రికతో చెప్పాడు.