ప్రపంచ పరిశీలన
వాటికన్ యొక్క “పరస్పర విరుద్ధత”
రోమ్లోని మతగురువులతో పోప్ యొక్క వార్షిక సమావేశంలో ఒక మతగురువు, “వాటికన్ ఇంకా ఎందుకు సిగరెట్లను అమ్ముతుంది, హోలీనెస్?” అని అడిగాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఈ వ్యాపారం, ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా ఆరోగ్యం మరియు మన మతగురువులకు సంబంధించిన కార్యాల పరిరక్షణ పక్షాన మీరు ఎడతెగక చేస్తున్న విజ్ఞాపనలకు విరుద్ధంగా ఉంది.” 76 ఏండ్ల వయస్సు గల యూగో మెసీనీ అనే మతగురువుకు, “పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం” అనే వివరణ కలిగియున్న పొగాకును మరియు సిగరెట్లను వాటికన్ అమ్ముతుంది అన్న వాస్తవం, పోప్ వర్తమానానికి “విరుద్ధ సాక్ష్యం” మరియు “పరస్పర విరుద్ధత” అని అనిపిస్తుంది. రోమ్లోని వార్తాపత్రిక, ఈల్ మెస్సాజేరోలో తెలియజేయబడిన దాని ప్రకారం పొగాకు విషయమై తన “మనస్సాక్షి నిర్మలంగా” ఉందని పోప్ ప్రత్యుత్తరమిచ్చాడు. అయినా ఆయన వాటికన్ సిగరెట్ల అమ్మకం గురించి వాటి పైవిచారణ చేసే అధికారితో మాట్లాడతానని వాగ్దానం చేశాడు.
తగ్గిన జననాల రేట్లు
తూర్పు ఐరోపాలోని చాలామంది దంపతులు తమ ఆర్ధిక, ఉద్యోగ అభద్రతా భావాలవలన పిల్లలను కలిగి ఉండడాన్ని వాయిదా వేస్తున్నారు. ఈ “అభద్రత జననాల రేటులో స్పష్టమైన తగ్గుదలకు నడపడమే కాకుండా వివాహ రేటు తగ్గడానికి, సంతాన నిరోధక శస్త్ర చికిత్సలలో పదింతలకంటే ఎక్కువ పెరుగుదలకు నడిపింది” అని ద న్యూయార్క్ టైమ్స్ తెలియజేస్తుంది. జనసంఖ్యా శాస్త్రజ్ఞుల ప్రకారం “యుద్ధం, తెగులు, కరువు కాలాల్లో తప్పించి అటువంటి త్వరిత తగ్గుదలలు ఎప్పుడూ గమనించబడలేదు” అని టైమ్స్ చేరుస్తుంది. అటువంటి ధోరణిని అడ్డగించడానికి, బెల్జియం, లక్సెంబర్గ్, హంగరి, పోలండ్, పోర్చుగల్ల ప్రభుత్వాలు, బిడ్డలను కలిగివుండడానికి ప్రోత్సాహకాలుగా కొంతకాలంపాటు వేతనాలు అందించాయి. ఈమధ్యనే జర్మనీ నందలి ఒక రాష్ట్రమైన బ్రాండెన్బర్గ్ ప్రభుత్వం క్రొత్తగా పుట్టిన ప్రతి శిశువుకు 650 డాలర్లు ఇవ్వడం మొదలు పెట్టింది.
ఆహార కొరతలు అపేక్షించబడ్డాయి
ఈజిప్ట్కు చెందిన ఒక అభివృద్ధి నిపుణుడు, ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు అయిన ఇస్మాయీల్ సెరిగిల్డీన్, “మారుతున్న సాంకేతిక నిపుణతపై అధిక పెట్టుబడి పెట్టకపోతే మాత్రం మనం కఠినమైన సమస్యలను ఎదుర్కొనవలసిందే” అని అన్నాడు. మూల ఆహార అవసరతల పెరుగుదలను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు—అది, జనాబా పెరుగుదల అతివేగంగా జరుగుతున్న ఆసియా, ఆఫ్రికా నందలి కొన్ని భాగాలలో ఇప్పటికే సరఫరాను మించిపోతున్న అవసరత. “పెరుగుదలను అరికట్టడానికి ఏ చర్య తీసుకొన్నా, తర్వాతి 20 సంవత్సరాలలో మనం ఇంకా 200 కోట్ల ప్రజలను కలిగివుంటాము, వారిలో 95 శాతంమంది అతి బీద దేశాల్లో ఉంటారు” అని ఆయన అన్నాడు. మూల పంట ఫలాల్లో అత్యధిక పెరుగుదల సాధించినా పర్యావరణ మరియు జీవశాస్త్ర పరిమితుల వలన అధికమైన ఫలాలు పొందడం ఎంతో కష్టసాధ్యమవుతుంది. చీడపురుగులదాడి, మొక్కల వ్యాధులు మరియు భూమి క్రమపతనం వలన కూడా దిగుబడులు దెబ్బతింటున్నాయి. వరల్డ్వాచ్ సంస్థ అంగీకరిస్తుంది. అది తన ప్రపంచ స్థితి 1995 నివేదికలో, “తగ్గుతున్న చేపల దిగుబడి, నానాటికి తగ్గుతున్న పక్షి జనాబా, జలపీఠం తగ్గిపోవడం, ఇంతవరకు నమోదుకాని స్థాయిలో వేడి కెరటాలు, సన్నగిల్లుతున్న ధాన్యపు నిల్వలలో, ప్రపంచం పర్యావరణ పరంగా భరింపశక్యంకాని ఆర్థిక మార్గంపై ఉన్నదని అనడానికి రుజువులను చూడవచ్చు, పేర్కొనడానికి ఇవి చాలా కొన్ని మాత్రమే” అని చెబుతుంది.
వయస్సు, ఆహారం
50 సంవత్సరాలు పైబడ్డ ప్రజలు మధ్యవయస్సులో పెరిగిన అధిక బరువు గురించి చింతించవలసిన అవసరం లేదని కొంతమంది పరిశోధకులు ఇప్పుడు చెబుతున్నట్లు, లండన్ యొక్క ది టైమ్స్ నివేదిస్తుంది. వినియోగదారుల సంఘం పత్రిక సంపాదకుడైన డేవిడ్ డికిన్సన్ ఇలా చెబుతున్నాడు: “ఎత్తు బరువుల నిష్పత్తి ఎక్కువున్న వారందరూ స్థూలకాయులే గనుక వారు సన్నబడాలి అన్న సలహా తప్పు. సన్నబడడం, ఎత్తు బరువుల నిష్పత్తిపై దాని ప్రభావంతో ఏమాత్రం సంబంధం లేకుండా మీ ఆరోగ్యాన్ని పాడు చేయగలదు. 50 పైబడ్డ చాలామంది ప్రజలు సన్నబడనవసరం లేదు.” పోషకాలు మరియు ఆహారనియమాలను గూర్చిన పండితుడైన టామ్ సాండర్స్ ఇలా విశదీకరిస్తున్నాడు. “స్థూలకాయానికి సంబంధించిన ఆరోగ్య అపాయాల గురించి తరచూ అతిశయోక్తిగా చెప్పబడుతుంది. అది మథుమేహం, కీళ్ళనొప్పుల అపాయాల్ని తప్పకుండా పెంచుతుంది, కానీ పుష్టిగా ఉండడం యొక్క ఆరోగ్య ప్రమాదాలు ఉపేక్షించదగ్గవే, అది స్త్రీలకు ప్రయోజనాల్ని కూడా ఇవ్వగలదు.” ఆరోగ్యశాఖకు చెందిన డా. మార్టిన్ వైజ్మన్ ఇలా సలహా ఇస్తున్నారు: “ఏ వయస్సులోనైనా అతిలావుగా లేక అతిసన్నగా ఉండకపోవడం ప్రాముఖ్యం. వివేకయుక్తంగా తినడం, చురుకుగా ఉండడం దీన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గం కానీ మన వయస్సు పైబడే కొద్దీ సన్నగా ఉండడం కంటే పుష్టిగా ఉండడమే మేలు.”
ఆ దంతాన్ని దాచివుంచండి!
ప్రమాదం వల్ల ఒకవేళ దంతం ఊడిపోతే దాన్ని అవతల పారవేయవద్దని యుసి బర్కిలి వెల్నెస్ లెటర్ సలహా ఇస్తుంది. “ఒకవేళ 30 నిముషాల లోపల దంతవైద్యుని దగ్గరకు వెళ్ళగలిగితే దాన్ని మరల నాటగలిగే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు పరిశోధన చూపిస్తుంది.” మీరేం చేయవలసి ఉంది? వీలైనంత మట్టుకు ప్రశాంతంగా ఉండండి. పంటి అగ్రభాగాన్ని పట్టుకొని నులివెచ్చని నీటిలో కడగండి—దానిని తోమవద్దు. మీ దంతవైద్యునికి ఫోను చేసి మీ గురించి చెప్పి, ఆయన వేరే విధంగా చెప్పకపోతే మాత్రమే పంటిని మృదువుగా దాని సందులోనికి ప్రవేశపెట్టండి. పంటిని దాని స్థానంలో పెట్టి ఒక శుభ్రమైన బట్ట లేక చేతిరుమాలుపై దృఢంగా 5 నిముషాలు నొక్కిపెట్టి తర్వాత మీరు దంతవైద్యున్ని చూసేంతవరకు తగుమాత్రమైన వత్తిడితో నొక్కిపెట్టి ఉంచండి. మీరు ఒకవేళ వెంటనే పంటిని పునఃప్రవేశపెట్టలేకపోతే దాన్ని మీ నోటిలోనే లాలాజలంలో తడిపి పట్టివుంచండి. పిల్లలు, వారు తమ పంటిని మ్రింగివేసేంత పసివారైతే దానిని ఒక ప్లాస్టిక్ సంచి లేక గిన్నెలో ఉంచి దానిని చిటికెడు ఉప్పు కలిపి ఉన్న పాలలో గాని నీటిలోగానీ ముంచివుంచండి. ఒకవేళ చాలా సమయం గడిచిపోయినా కూడా, దంతవైద్యుని దగ్గరకు వెళ్ళడం ఉత్తమం, ఏమి చేయాలన్నది ఆయననే నిర్ణయించనివ్వండి. “దంతాన్ని దాచి ఉంచడం నిశ్చయంగా ఆ కష్టానికి తగిన మూల్యమే” అని ఆ నివేదిక తెలియజేస్తుంది.
పోలియోపై పాక్షిక విజయం
సాధారణంగా పోలియో అని పిలువబడుతున్న పారాలిటిక్ పోలియోమైలైటిస్ వలన చరిత్రంతటిలో ఒక కోటికంటే ఎక్కువమంది మరణించారు లేక వికలాంగులయ్యారు. అది ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, రోమ్ల కాలానికి చెందిన చెక్కడాల్లో చిత్రించబడింది. ఎక్కువగా చిన్నపిల్లలను దెబ్బతీస్తూ అది పక్షవాతం లేక ఎస్ఫిక్సియేషన్ ద్వారా మరణాన్ని కలుగజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఒక శాఖ అయిన, పాన్ అమెరికా ఆరోగ్య సంస్థ ప్రకారం ఇప్పుడు పశ్చిమార్ధగోళంలో పోలియో నివారించబడింది. ఆఖరుగా నమోదు చేయబడిన కేసు 1991లో ఒక కాలు చచ్చుబడి చావు తప్పించుకున్న పెరూలోని ఒక శిశువు. అయినప్పటికినీ, 1977లో ప్రపంచవ్యాప్తంగా నివారించబడిన మశూచివలె కాకుండా పోలియో వైరస్ ఇంకా ఇతర ప్రాంతాలలో కనుగొనబడుతుంది, మరియు ఒకవేళ ప్రయాణం, వలసవెళ్ళడం ద్వారా అమెరికాలలో పునఃప్రవేశపెట్టబడగలదు. 1993వ సంవత్సరం కొరకైన ఆఖరి సంపూర్ణ నివేదిక 10,000 కన్నా తక్కువ కేసులు చూపించింది. పూర్తిగా జయించేంత వరకు ఆ వ్యాధికి విరుద్ధంగా ఇమ్యూనైజేషన్ కొనసాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సొట్టలు పడిన డబ్బాల్లోని ఆహారాన్ని కొనుగోలు చేయడం
“డబ్బు ఆదా చేయడానికి కిరాణా దుకాణదారులు ప్రమాదం కలిగించగలవని పడవేయవలసిన డబ్బాలను కొనడం లేక ఉంచడం చేస్తుండవచ్చు” అని విన్నిపెగ్ ఫ్రీ ప్రెస్ హెచ్చరిస్తుంది. “డబ్బాలపై అనేక సొట్టలు అంగీకారయోగ్యమైనవే కానీ కొన్ని మాత్రం కాదు, సాధారణంగా డబ్బాలు నింపే సమయంలో సురక్షితంగానే ఉంటాయి; ఆ తరువాతి దశల్లో నష్టం వాటిల్లుతుంది” అని నగర ఆరోగ్య శాఖకు చెందిన పీటర్ పరిస్ అన్నాడు. నగర ఆరోగ్య శాఖ ప్రకారం, పడవేయవలసినవాటి క్లుప్తమైన పట్టికలో వాటి అంచులలో తుప్పుపట్టిన డబ్బాలు, వాటి పైన మరియు చుట్టూరా సులభంగా తుడిచివేయలేని విధంగా తుప్పుపట్టి ఉన్న డబ్బాలు లేక వాటిని కదిలించినప్పుడు ద్రవమును పీల్చే శబ్దం వస్తున్న డబ్బాలు, అలాగే ఏదొక రీతిలో ఉబ్బిన లేక ఉబ్బెత్తుగా ఉన్న డబ్బాలు, కారుతున్న డబ్బాలు, చీటీ లేని లేక గడువు తీరిపోయిన చీటీగల డబ్బాలు చేర్చబడ్డాయి. వార్తాపత్రిక నివేదిక ఇలా హెచ్చరిస్తుంది: “ఒకసారి సీలు విడిపోతే, డబ్బాలు సాల్మనెల్లా మరియు స్టేఫిలోకోకస్ సూక్ష్మక్రిములకు అత్యంత అనువైన పోషణ స్థలాలు అవుతాయి. ఇవి అతిసారము, వాంతులు మరియు తిమ్మిర్లు కలుగజేయగలవు.”
ఆస్బెస్టాస్పై అప్రమత్తత కొనసాగుతుంది
భద్రతాధికారుల తప్పులెక్కల వలన బ్రిటన్లోని వేలాది నిర్మాణ పనివారు ఆస్బెస్టాస్ సంబంధ క్యాన్సర్ వల్ల మరణిస్తారని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తుంది. సంవత్సరాల క్రితం, 1960వ దశకంలో, ఆస్బెస్టాస్ నార ఆరోగ్యానికి హానికరం అని వైద్యనిపుణులు చెబుతున్నప్పుడు, గాలిలో ఈ నారయొక్క గాఢతను పరిమితం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కర్మాగార నియమాలు ప్రవేశపెట్టింది. అయితే అతి ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న ఉద్యోగులు, ఆస్బెస్టాస్ సంబంధిత ఉత్పత్తులతో అసురక్షితంగా పనిచేసే వడ్రంగివారు, ఎలక్ట్రీషియన్లు, ప్లమర్లు, గ్యాస్ ఫిట్టర్లు అని పరిశోధకులు ఇప్పుడు కనుగొంటున్నారు. ఒక రకమైన క్యాన్సరు విస్తరించడానికి 30 సంవత్సరాలు పడుతుంది గనుక పొరపాటు ఇటీవలనే వెలుగులోనికి వచ్చింది. ప్రస్తుతం ఏ నిర్మాణ పద్ధతులు లేక ఆస్బెస్టాస్ ఉత్పత్తులు మిక్కిలి ప్రమాదకరమైనవో తెలియదు. అందువలన బ్రిటన్లోని ఆరోగ్య, భద్రత కార్యనిర్వాహక విభాగం, నిర్మాణపు పనివారిని, ఏదైనా ఆస్బెస్టాస్ కలిగియున్న ఒక పదార్ధం కనుగొంటే ఎంతో మెలకువ ఉపయోగించాలని, మరియు ఆ సామాగ్రిని పరిశీలన చేసి తగినంత రక్షణను అందజేసే యజమానులకు వాటి గురించి తెలియజేయాలని కోరింది.
దీర్ఘకాలముండే యుద్ధ పరిణామాలు
మునుపటి యుగస్లేవియాలో యుద్ధంలో హతులైన వారిలో, తుపాకి గుళ్ళు, బాంబుల వలన మరణించిన, వికలాంగులైన వారి కన్నా ఇంకా ఎంతోమంది చేరివున్నారు. ఇటీవలి అధ్యయనం, “అగ్ని, విస్ఫోటనాలు, రసాయనిక క్షరణాలద్వారా వాతావరణంలోనికి విడుదలైన వందల కొలది టన్నుల విషపూరిత పదార్ధాలు గంభీరమైన ఆరోగ్య పరిణామాలను కలిగిస్తాయి” అని వెల్లడిస్తుందని ద మెడికల్ పోస్ట్ చెబుతుంది. ఈ రసాయనిక, విషపూరిత లోహాలు నదులను కలుషితం చేస్తున్నాయి, అంతేగాక భూగర్భజల సముదాయాల్ని కూడా అపరిశుద్ధం చేస్తుండవచ్చు. పోస్ట్ ప్రకారం, “వారి తలిదండ్రులు విషపూరిత పదార్ధాలతో అపరిశుద్ధమైన నీటిని త్రాగడం ఫలితంగా, పుట్టుకతోనే వికార రూపాలతో ఉండే పిల్లల సంఖ్యలో గమనార్హమైన పెరుగుదల ఉంటుందని” నిపుణులు హెచ్చరిస్తున్నారు.