ప్రపంచ పరిశీలన
“తెలియని గ్రహం”
అమెజోన్ వర్షపాత అడవుల్లో ఇంతకు ముందు తెలియని మూడు జాతుల కోతులు రెండు సంవత్సరాల్లోనే కనుగొనబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సరాసరి మూడు క్రొత్త జాతుల పక్షులు కనుగొనబడుతున్నాయి. పనామాలోని 19 వృక్షాల అధ్యయనాలలో దాదాపు 1,200 జాతుల కుమ్మరిపురుగులు కనుగొనబడ్డాయి, వాటిలో 80 శాతం ఇంతకు ముందు తెలియనివి. యునెస్కో సోర్సెస్ అనే పత్రిక చెప్పేదేమంటే, “అనేక రకాల జీవులు ఇప్పటికీ మనకు తెలియవు.” ఉదాహరణకు, “దక్షిణ అమెరికా యందలి మంచి నీటి చేపల్లో 40 శాతం వర్గీకరించబడవలసి ఉన్నట్లుగా అంచనా వేయబడింది. . . . మరి విస్తృతంగా అన్వేషించని సముద్రపు అడుగుభాగాన మనమేమి కనుగొంటాం?” ఇంకా కనుగొనబడవలసి ఉన్న బాక్టీరియా, ఫంగి, నిమటోడులనే పరాన్నజీవులు, సాలీడు వంటి కీటకాలు, క్రిములు, వృక్షజాతులు వంటి అనేక రకాల చిన్న ప్రాణులను గూర్చి నీవు ఆలోచించేటప్పుడు సమస్య మరింత తీవ్రమౌతుంది. “ఉదాహరణకు ఉష్ణమండల ప్రాంతంలోని ఒక గ్రాము సారవంతమైన మట్టిలో తొమ్మిది కోట్ల బాక్టీరియాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి.” భూమిమీది వివిధ జాతుల సంఖ్య “20 కోట్ల వరకు” ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారని యునెస్కో సోర్సెస్ చెబుతుంది. విస్తృతమైన అన్వేషణ జరుగుతున్నప్పటికీ, భూమి “తెలియని గ్రహంగా” మిగిలిపోతుంది. (g95 5/22)
అమెరికాలో ముఖ్య హంతకులు
అమెరికాలో మరణాలకు ముఖ్య కారణాలేమిటి? ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోషియేషన్లో ఇటీవల ప్రచురించబడిన అధ్యయనం, ఒక సంవత్సరంలో సంభవించిన మరణాలకు దోహదపడిన బాహ్యమైన లేదా వంశపారంపర్యానికి సంబంధించని కారణాలను గూర్చి అన్వేషించింది. గణాంకవివరాల కొరకు విస్తృత సర్వే జరిగిన తర్వాత, 1990లో అమెరికానందు 21,48,000 మరణాల్లో 4,00,000 మంది పొగాకు వలన; 3,00,000 మంది ఆహార వ్యాయామ అలవాట్లవలన; 1,00,000 మంది అధికంగా మద్యం సేవించడం వలన; 90,000 మంది సూక్ష్మజీవులవలన; 60,000 మంది ఆహారం లేదా నీటిలోని మాలిన్యాలు లేక కాలుష్యాలవల్ల కలిగే విషకారకాల వల్ల; 35,000 మంది ప్రేలుళ్ళ వలన; 30,000 మంది లైంగిక అవినీతి వల్ల; 25,000 మంది మోటారు వాహన ప్రమాదాలవల్ల; 20,000 మంది చట్టవిరుద్ధ మాదకద్రవ్యాలను ఉపయోగించడం వల్ల మరణించారని ఆ అధ్యయనం నిర్ధారణకు వచ్చింది. మొత్తం మీద ఆ అధ్యయనం కనుగొన్నదేమిటంటే, ఒక సంవత్సరంలో కలిగే మరణాల్లో సగం బాహ్య కారకాంశాల వల్లనే జరుగుతున్నాయి. (g95 6/8)
20వ శతాబ్దపు ముందుచూపు
గత శతాబ్దంలో జీవించిన ఎవరైనా, ఆధునిక కాలంలోని వాహనాలు, పెద్ద రవాణాసౌకర్యాలు, ఎలక్ట్రానిక్ సంగీతం, ఫాక్స్ యంత్రాలు వంటివి క్రొత్తగా వృద్ధిచెందుతాయని ఊహించగల్గారా? ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ అండ్ 20,000 లీగ్స్ అండర్ ది సీ వంటి రచనలకు ఖ్యాతి గాంచిన ఫ్రెంచ్ నవలా రచయిత జూల్స్ వెర్న్ 1863లో ఇలాంటి క్రొత్త వస్తువులను గూర్చి ముందే చెప్పాడు, అందులో అనేకం క్రితం ప్రచురించని పారిస్ ఇన్ ది ట్వెంటీత్ సెంచురీ అనే నవలలో ఉన్నాయి. అది అసంభవమని, నమ్మశక్యంకానిదని వెర్న్ ప్రకాశకుడు తృణీకరించినప్పటికీ, ఇటీవల కనుగొనబడిన ఆ పుస్తకం ఆశ్చర్యం కలిగించే విధంగా మెరుగుపర్చబడిన ఆయుధాలు, ఎలక్ట్రిక్ చెయర్, కాలుష్యము, రోడ్డుమీది రద్దీతో సహా మన 20వ శతాబ్దపు జీవితాన్ని సరిగ్గా వర్ణిస్తుంది. ప్రాచీన సంగీత సాధనల్లోను సంస్కృతిలోను ఆసక్తిని కోల్పోయి, సమస్యలతో సతమతమౌతున్న జనాబాను వాణిజ్యానికి దాసియై, సాంకేతికవిద్యకు బానిసైన సమాజాన్ని వెర్న్ ముందుగా తెలుసుకున్నాడు. పారిస్ ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రైబ్యూన్ ఈ విధంగా చెప్పింది. “ఆధునిక సాంకేతిక విద్యయొక్క అభివృద్ధిని గూర్చి మాత్రమే కాక, కొన్ని భయంకరమైన పర్యవసానాలను కూడా ఆయన ముందుగానే వివేచించాడు.” (g95 5/22)
ఉప్పులో అయొడిన్
ఆహారంలో అయొడిన్ తక్కువవ్వడం వలన కనీసం 60 కోట్లమంది ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఐక్యరాజ్య సమితి బాలల నిధి అంచనావేస్తుంది. అలా ఆరోగ్యం దెబ్బతిన్నవారికి ఒక్కో సంవత్సరం జన్మించనైవున్న 1,00,000 మంది శిశువులు వికలాంగులుగా (థైరాయిడ్ తీవ్రంగా కొరవడడం వలన శారీరక మానసిక ఎదుగుదల లేనివారిగా) జన్మించడానికి, మరో 5 కోట్ల మంది పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలను కుంటుపరచడానికి ఈ కొరత కారణమౌతుందని నమ్మబడుతుంది. అంటే అయొడిన్ కొరత కణితికి, థైరోయిడ్ గ్రంథి వాపుకు కూడా కారణమౌతుంది. అయొడిన్ కొరతను తీర్చడం సులభం, చౌక—అయొడిన్ ఉప్పును ఉపయోగించాలి అంతే. ప్రపంచమంతటా 1995వ సంవత్సరంలో ఉప్పు సరఫరా అంతటినీ అయొడైజ్ చేయాలని, 2000 సంవత్సరం నాటికి అయొడిన్ కొరత వలన కలిగే వ్యాధులను నివారించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. (g95 6/8)
రక్తాన్ని ఎక్కించడం వలన అపాయాలు
“కెనడా రక్త సరఫరాను ఇప్పటి నుండి వెయ్యి సంవత్సరాల వరకు పరిశోధించవచ్చు, కాని, రక్తాన్ని ఎక్కించడం వలన వచ్చే అపాయాలు అప్పటికీ ఉంటాయి,” అని ది టొరంటో స్టార్ నివేదించింది. కెనడాలోని రక్త సరఫరా సురక్షితత్వాన్ని గూర్చి పరిశీలించే వ్యక్తుల (కమీషన్) ఎదుట సాక్ష్యమిస్తూ, సెంట్ మైకెల్ ఆసుపత్రిలోని డా. విలియమ్ నోబుల్ ఈ విధంగా చెప్పాడు: “అవి (ఆ అపాయాలు) ఉన్నాయి, అవి ఎల్లప్పుడూ ఉంటాయి.” రక్తాన్ని ఎక్కించడంవల్ల కలిగే అపాయాల్లో “దానం ఇవ్వబడిన రక్తం వల్ల అనేక అపాయాలున్నాయి అంటే, అలెర్జిక్ రియాక్షన్ మొదలుకొని ఎయిడ్స్ సోకేంతటి” అపాయాలు ఇమిడి ఉన్నాయని స్టార్ చెబుతుంది. రక్తాన్ని ఎక్కించడంలో నిపుణులైనవారు చెప్పేదేమంటే, నేడు అనేకమంది రోగులు రక్తం ఎక్కించుకోవడం వలన ఎయిడ్స్ సోకుతుందేమోనని భయపడుతున్నారు. డా. నోబుల్ ఈ విధంగా చెబుతున్నారు: “‘నేను రక్తాన్ని ఎక్కించాలా వద్దా?’ అని మేము మాట్లాడుకోని రోజంటూ ఉండదు.” (g95 5/22)
ఎలుగుబంటి శరీర భాగాలు
“కెనడా నుండి నల్ల ఎలుగుబంటి శరీర భాగాలను దొంగ రవాణా చేయడం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారం కన్నా లాభదాయకమైనది,” అని ది టొరంటో స్టార్ చెబుతుంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, తాయ్వాన్, హాంగ్కాంగ్ వంటి ఆసియాలోని సంపన్న దేశాల్లో పారంపర్యంగా చికిత్సచేసే వైద్యులు నల్ల ఎలుగుబంటి పిత్తాశయాన్ని, మరియు పంజాను చాలా ఎక్కువగా కొంటారు. “పిత్తరసం, పశువులు లేదా పందుల పిత్తరసంతో ‘కలుప’బడినప్పుడు (పలుచన చేయబడినప్పుడు) ఆసియాలో నల్లని ఎలుగుబంటి యొక్క ఒక కిలోగ్రాం మూత్రాశయానికి ‘బజారు వెల’ (చివరికి వినియోగదారుని చేతికి వచ్చేటప్పటి వెల) పది లక్షల (అమెరికా) డాలర్లని కాలిఫోర్నియా కార్యనిర్వహణాధికారి అంచనా వేశారు,” అని స్టార్ చెప్పింది. “దీనితో పోల్చిచూస్తే, మెట్రో టొరొంటోలోని కొక్కెయిన్ యొక్క బజారు వెల కిలోగ్రాముకు 1,00,000 డాలర్లుగా ఎంచబడుతుంది.” వరల్డ్ వైల్డ్ ఫండ్/కెనడాలోని అపాయంలో ఉన్న ప్రాణుల నిపుణురాలు కార్లో సేయింట్ లారన్ ఈ విధంగా చెబుతుంది: “ఇది చాలా పెద్ద వ్యాపారం.” ఎలుగుబంట్ల శరీర భాగాల గిరాకీ ఇంకా పెరుగుతూనే ఉంటుందనే భయముంది. ఎలుగుబంట్లు ఇప్పటికే ఆసియాలో చాలావరకు రూపుమాపబడ్డాయి. (g95 5/22)
అపాయంలో ఉన్న బ్రెజిల్నందలి ప్రాణులు
“మరే దేశంలో కన్నా, మూడు రెట్లు ఎక్కువ ఉష్ణమండల అడవులున్న బ్రెజిల్, జీవుల వైవిధ్యంలో ప్రపంచంలో అగ్రగణ్యమైనది. మరి ఈ ప్రాంతంలోనే జీవించే అనేక రకాలైన సస్థన జీవులు, 460 జాతులు ఇప్పటికీ ఉన్నాయి,” అని ఒ ఎస్టాడో డి ఎస్. పౌలొ వార్తా పత్రిక చెబుతుంది. ఏ సస్థన జీవి ఇంతమట్టుకు పూర్తిగా అంతరించకపోయినప్పటికీ, “బ్రెజిల్లో మాత్రమే నివసించే కుచ్చుతోక గల కోతి జాతుల”లా ”బ్రెజిల్లోని సస్థన జీవుల్లోని 12 శాతం అపాయంలో ఉన్నాయి.” ఇలా అపాయంలో ఉన్న కొన్ని జాతులు “ఏవైనా జోక్యం చేసుకుంటే అవి అంతరించిపోవడానికి కారణమయ్యేటటువంటి కట్టుబాట్లు గల నివాసస్థలాల్లో జీవిస్తాయి.” ఆ వార్తాపత్రిక ప్రకారం, అడవిలో 50 సంవత్సరాలుగా ఒక జీవి కనిపించకుండా పోతే, అది అంతరించిపోయిందని పరిగణించబడుతుంది. (g95 5/22)
ఈ గ్రహంపై ప్రజలు
యు.ఎన్.ఎఫ్.పి.ఎ. (యునైటెడ్ నేషన్స్ పోపులేషన్ ఫండ్) వేసిన లెక్కల ప్రకారం, ఈ గ్రహం మీద జనాబా 1994 మధ్యభాగానికల్లా 566 కోట్లకు చేరుకుందని అంచనా వేయబడింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జరుగుతున్న పెరుగుదలతో పాటు అది 1998లో 600 కోట్ల వరకు పెరుగుతుందని, 2025వ సంవత్సరానికి 850 కోట్లకు, 2050వ సంవత్సరం నాటికి 1,000 కోట్లకు చేరుకుంటుందని ప్రణాళికలు అంచనా వేస్తున్నాయి. ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం పెరుగుదల రేటు 2.9 శాతం, అది ప్రపంచంలో అతి వేగంగా పెరుగుతున్న ప్రాంతం. అతి తక్కువ పెరుగుదల ఐరోపాలోనే—0.3 శాతం. యు.ఎన్.ఎఫ్.పి.ఎ. కూడా ఇలా చెబుతుంది, ఈ శతాబ్దాంతంలో, అంటే ఇప్పటి నుండి ఐదు సంవత్సరాల్లోగా ప్రపంచంలోని సగం జనాబా పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. నేటి 125 పట్టణాలను పోల్చి చూస్తే, అప్పటికెల్లా అభివృద్ధిచెందుతున్న దేశాల్లో 300 పట్టణాల్లో జనాబా పది లక్షలకన్నా ఎక్కువగా ఉంటుంది. (g95 5/22)
ఆకుపచ్చని పెద్ద గోడ
శతాబ్దాల క్రితం, దాడిచేస్తున్న మొంగోల్ సైన్యాలను వెళ్ళగొట్టడంలో కొంతవరకు మాత్రమే సఫలత పొందిన పెద్ద చైనా గోడ చివరికి తనదైన గుర్తింపును పొందింది. సైన్స్ న్యూస్ ప్రకారం, 1950వ పడి నుండి గోడ ప్రక్కగుండా వరుసగా పెద్ద వృక్షాలు నాటబడ్డాయి. ఆకుపచ్చని పెద్ద గోడయని పిలువబడుతున్నట్లుగా, దీనిలో దాదాపు 30 కోట్ల వృక్షాలున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే: గోబీ ఎడారి మరియు ఇతర బీడువారిన ప్రాంతాల్లో నుండి చైనాలోనికి మళ్ళే గాలిదుమ్ము తుఫానును ఆపడమే. ఫలితాలేంటి? బెయిజింగ్ పట్టణం 1950వ పడిలో ప్రతి వసంతంలోను 10 నుండి 20 గాలిదుమ్ము తుఫానులచే ముట్టడించబడింది, ప్రతి నెల 30 నుండి 90 గంటలపాటు అరమైలు కన్నా తక్కువ దూరం వరకు అంతా మసకబారుతుంది. అయితే 1970వ పడి అయ్యేసరికి తుఫానుల సంఖ్య ప్రతి వసంతంలో ఐదు కన్నా తక్కువవుతూ ప్రతి నెల పది గంటల కన్నా తక్కువే మసకబారుతుంది. వాతావరణ రసాయన శాస్త్రజ్ఞుడు ఈ విధంగా చెప్పాడని సైన్సు న్యూస్ చెబుతుంది, ఈ పెద్ద వన ప్రాంతం “20వ శతాబ్దపు వాతావరణాన్ని మెరుగుపర్చే బలమైన కార్యక్రమాల్లో ఒకటయ్యే సాధ్యత ఉంది.” (g95 6/8)