నిజమైన క్రైస్తవులు మరియు యుద్ధం
యేసు తన శిష్యులకు యిలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.” (యోహాను 13:34) నిజమైన క్రైస్తవులు అటువంటి ప్రేమను ఒకరిపట్ల ఒకరు కనపరచుకుంటూ, అదే సమయంలో యుద్ధంలో పాల్గొని, ఒకరినొకరు చంపుకొనగలరా?
అపొస్తలుడైన పౌలు అడిగిన ప్రశ్నను కూడా పరిశీలించండి: “క్రీస్తు విభజింపబడి ఉన్నాడా?” (1 కొరింథీయులు 1:13, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, కాథోలిక్ ఎడిషన్) మిమ్మల్ని మీరిలా అడగండి: ‘ఒకే మతంలోని సభ్యులు ఒకరినొకరు చంపుకోడం వలన వచ్చే విభజన కంటే అధికమైన విభజన మరేదైనా ఉండగలదా?’
నిజంగా, తొలి క్రైస్తవులు యుద్ధం చేయలేదన్న విషయాన్ని తెలుసుకోడంవలన మనం ఆశ్చర్యపడనవసరం లేదు. హేస్టింగ్స్ యొక్క ప్రఖ్యాతిగాంచిన ఎన్సైక్లోపేడియా ఆఫ్ రిలీజన్ అండ్ ఎతిక్స్ యిలా పేర్కొన్నది: “యుద్ధమనేది సంస్థీకరించబడిన దుష్టత్వమని, దానితో చర్చికి, క్రీస్తు అనుచరులకు ఎటువంటి సంబంధం కూడా ఉండకూడదన్న అభిప్రాయం తొలి చర్చిలో విస్తృతంగా ఉండేది.”
తొలి క్రైస్తవులు, ఒకరినొకరు ప్రేమించాలన్న యేసు ఆజ్ఞ అనుసారంగా జీవించారు. జర్మనీకి చెందిన తత్వవేత్త అయిన పీటర్ మిన్హాల్ట్ యిలా వివరించాడు: “క్రైస్తవులు సైనికులవ్వవచ్చా లేదా, అలాగే వారు క్రైస్తవులు అయినప్పుడు సైన్యంనుండి విరమించుకోవాలా అనే ప్రశ్నను గురించి కొత్త నిబంధన ఏమీ చెప్పకపోయినా, పాత చర్చి యీ విషయంలో దృఢమైన నిశ్చయాన్ని తీసుకుంది. క్రైస్తవుడిగా అలాగే సైనికుడిగా ఉండడం, పరస్పర విరుద్ధమైనదిగా పరిగణించబడింది.” “పాత చర్చి” వంటి నిశ్చయాన్ని ఈనాడు ఎవరైనా కల్గివున్నారా?
ఈనాడు నిజమైన క్రైస్తవులెవరైనా ఉన్నారా?
ఎన్సైక్లోపేడియా కెనడియానా యిలా చెబుతుంది: “యెహోవాసాక్షుల పనేమంటే, మన శకానికి చెందిన మొదటి, రెండవ శతాబ్దాలలో, యేసు మరియు ఆయన శిష్యులు అవలంబించిన ఆదిమ క్రైస్తవత్వాన్ని పునరుద్ధరించి, పునఃస్థాపించడమే. . . . అందరూ సహోదరులే.”
అది వాస్తవంగా ఎలా అన్వయింపబడుతుంది? “యుద్ధ సమయంలో యెహోవాసాక్షులు కచ్చితమైన తమ తటస్థవైఖరిని కాపాడుకుంటారని,” ఆష్ట్రేలియన్ ఎన్సైక్లోపేడియా పేర్కొంటుంది. వారు వ్యక్తులుగా ఈ స్థానాన్ని కలిగి ఉండదల్చినా, వారు జీవిస్తున్న ప్రభుత్వాల కార్యకలాపాలతో జోక్యం చేసుకోరు. కాబట్టి వారు హిట్లర్ యుద్ధానికి మద్దతునివ్వలేదు, అందుకని వారిలో ఎవరిపైన కూడా న్యూరంబర్గ్ విచారణ సమయాల్లో యుద్ధ ఖైదీలన్న అభియోగం మోపబడలేదు.
నాజీ గుంపు యొక్క విదేశీ వ్యవహారాల శాఖ అధిపతి అయిన జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ రోసెన్బర్గ్ తప్పిదస్థునిగా తీర్పు తీర్చబడి ఉరితీయబడ్డాడు. యెహోవాసాక్షులను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెట్టే నాజీల పథకాన్ని సమర్థిస్తూ, రోసెన్బర్గ్ తన విచారణ సమయంలో యిలా తెలియజేశాడు: “కొలంబస్ [ఒహాయో] నుండి వచ్చిన ఒక చర్చి వార్తాపత్రికను ఒక అమెరికా గురువు ఎంతో దయతో నాకు నా గదిలో యిచ్చాడు. యుద్ధ సమయంలో అమెరికా కూడా యెహోవాసాక్షులను నిర్బంధించిందని, 1945 వరకు వారిలో 11,000 మంది యింకా క్యాంపులోనే ఉంచబడ్డారని దానినుండి నేను తెలుసుకున్నాను.” రాజకీయ వివాదాల్లో పక్షం వహించకుండా ఉండి, యెహోవాసాక్షులు కచ్చితంగా తటస్థంగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధంలో లేక వేరే యితర యుద్ధాల్లో వారు ఏ ఒక్కరి రక్తాన్ని కూడా చిందించలేదు.
హంగేరీలో, నవంబరు 4, 1992నాటి రింగ్ పత్రికలో ఒక రచయిత యెహోవాసాక్షులను గురించి యిలా చెప్పాడు: “ఎవరినైనా చంపడానికి బదులు వారు తామే చావడానికి యిష్టపడతారు. తుదకు కేవలం యెహోవాసాక్షులు మాత్రమే భూమిపై జీవిస్తే, అప్పుడు యుద్ధాలు ఎంతమాత్రం చెలరేగవని నేను కచ్చితంగా భావిస్తున్నాను.” రాజనీతిశాస్త్రపు విద్వాంసుడైన రియో ఎమ్. క్రిస్టెన్సన్, ఒక యథార్థమైన క్రైస్తవుడు యుద్ధంలో పాల్గొనవచ్చా అని ది క్రిస్టెన్ సెంచరీ అనే పత్రికలో చర్చించాడు, తుదకు ఆయనిలా ముగించాడు:
“యేసు తన శత్రువులపై చేతి బాంబులను విసరడం, మషీన్ గన్నులను ఉపయోగించడం, ఫ్లేమ్త్రోవర్ను ఉపయోగించడం, అణు బాంబులను వేయడం లేక వేలాదిమంది తల్లులను, పిల్లలను చంపగల లేక వికలాంగులను చేయగల ఒక ఐసిబిఎమ్ను ప్రారంభించడాన్ని ఎవరైనా ఊహించగలరా? ఆ ప్రశ్న ఎంత అసమంజసమైనదంటే దానికి జవాబు చెప్పవలసిన అవసరమే లేదు. యేసు అలా చేయకుండా ఉండి, తన వ్యక్తిత్వానికి తగినట్లుగా ఉంటే, మనమెలా దాన్ని చేసి, ఆయన యెడల యథార్థంగా ఉండగలము?” ఇది వాస్తవంగా ఆలోచింపజేసే ప్రశ్నయే.
అయినా, ప్రపంచ మతాలు యుద్ధాల్లో పాల్గొంటూనే ఉన్నాయి. కాథోలిక్లు కాథోలిక్లను చంపుతూనే ఉన్నారు, యితర మతాలకు చెందిన వారు తమ విశ్వాసానికి చెందిన వారిని లేక యితర చర్చికి సంబంధించిన వ్యక్తులను చంపుతారు. ప్రక్క పేజీలోని వాస్తవమైన కథ తెలియజేస్తున్నట్లు, యేసుక్రీస్తు బోధలను అనుసరించాలంటే దృఢ నిశ్చయత, ధైర్యం అవసరము.
[7వ పేజీలోని చిత్రం]
యేసు యుద్ధంలో మషీన్ గన్నును ఉపయోగించడాన్ని ఎవరైనా ఊహించగలరా?
[క్రెడిట్ లైను]
U.S. National Archives photo