ప్రపంచ పరిశీలన
పది లక్షల శాతం ద్రవ్యోల్భణం
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాలో డిశంబరు 1993లో ఆ దేశ ఫెడరల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ప్రకారం ద్రవోల్భణ రేటు పది లక్షల శాతానికి పెరిగింది. జీవన వ్యయం నవంబరు నెలలో కన్నా 2,839 రెట్లు ఎక్కువగా ఉండేది, అది ఆ సంవత్సర ఆరంభంలో కన్నా ఆరు లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా ఉండేది. తత్ఫలితంగా, ముద్రించబడిన నోట్లు విడుదలైన కొన్ని రోజుల్లోనే విలువ లేనివయ్యాయి. దానిని ఎదుర్కోడానికి, సెంట్రల్ బ్యాంక్ దినార్లోని సున్నాను తగ్గిస్తూ వచ్చింది. కేవలం మూడు నెలల్లోనే ఐదు లక్షల కోట్ల దినార్లు ఐదు దినార్లకు తగ్గాయి. (g94 7/22)
సురాపానానికి శస్త్రచికిత్స తర్వాతి యిబ్బందులకు గల సంబంధం
డెన్మార్క్ ప్రముఖ శస్త్ర వైద్యుడైన డా. ఫిన్ హార్ట్ అభిప్రాయం ప్రకారం, తక్కువ మద్యపానీయాలు పుచ్చుకొనేవారి కన్నా ప్రతి రోజు ఐదు గుక్కల మద్యం తాగే రోగులకే మూడు రెట్లు ఎక్కువగా శస్త్రచికిత్స తర్వాతి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. డానిష్ మెడికల్ అసోసియేషన్ పత్రిక యీ మధ్య నివేదించిన దాని ప్రకారం, మద్యాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అన్ని అవయవ వ్యవస్థలు విషపూరితమౌతాయి. అది రక్తస్రావాన్ని, గుండె, శ్వాసకోశ సంబంధమైన సమస్యలను అధికం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండాలని, ఎక్కువ రక్త మార్పిడులు చేయించుకోవాలని డాక్టర్లు సలహా యివ్వవలసి వస్తుంది. ప్రతిరోజు ఎక్కువ మోతాదులో మద్యం సేవించేవారి రోగనిరోధక శక్తి కోల్పోయే ప్రమాదముంది. అయినప్పటికీ, కొన్ని వారాలు తాగకుండా ఉన్న తర్వాత, రోగ నిరోధక శక్తి మెరుగుపడిందని పరిశోధనలు చూపించాయి. ఏ శస్త్రచికిత్సకు ముందైనా, రోగులు కొన్ని వారాలు మద్యం సేవించకుండా ఉండాలని డా. హార్ట్ సిఫారసు చేస్తున్నాడు. (g94 8/8)
నీటి కొరత ఎక్కువగా కనిపిస్తుంది
“మంచు, వర్షపాతం సాధారణంగా స్థిరంగా ఉంటాయి కనుక, మళ్ళీ ఊరే నీరు పరిమితంగా ఉంటుంది,” అని సైన్సు పత్రిక పేర్కొంటుంది. “ఈ 2025వ సంవత్సరంకెల్లా, నీటి కొరత గల దేశాల్లో నివసిస్తున్న ప్రజల సంఖ్య 300 కోట్లకు చేరుతుంది,” మరి యిప్పటికే, “2,000 సంవత్సరం నాటికే ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.” పోపులేషన్ కమిషన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, అనేక దేశాలు యిప్పటికే భూమిలోని నీటినంతా తోడేస్తున్నాయి, అనేక దేశాలు వాటి దీర్ఘకాలిక పద్ధతుల్లో నీటి ఊటగల వాటిని, లేనివాటిని వర్గీకరించడంలో విఫలమౌతున్నాయి. నీటి సరఫరాను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, జనాబా పెరుగుదల ఆ ప్రయత్నాలను నిరర్థకం చేసింది. (g94 7/22)
మరింత స్పష్టమగుట
కలవరపరచే అనేక అపజయాల తర్వాత, అమెరికా స్పేస్ ఏజన్సీ, నాసా, ఒక వైఫల్యాన్ని విజయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఏజెన్సీ 1990లో కక్ష్యలోనికి వదిలిన ది హబుల్ స్పేస్ టెలెస్కోప్లో ముఖ్యమైన అద్దానికి లోపం ఉండేది, ఆ అద్దం టెలిస్కోప్ను సరిగ్గా కేంద్రీకరించకుండా అడ్డగించింది. అయినప్పటికి, డిశంబరు 1993లో లోపం గల టెలిస్కోప్పై పాతబడిన అద్దాల స్థానంలో మంచి అద్దాలను అమర్చడంలో 30 గంటలు వ్యోమగాములు అంతరిక్షంలో గడిపారు. ఫలితాలేంటి? న్యూ సైంటిస్ట్ పత్రిక యిలా నివేదిస్తుంది: “హబుల్ మొదట్లో ఎదురుచూసినదాని కన్నా కొన్ని విషయాల్లో మిన్నగా పని చేస్తుంది.” న్యూస్వీక్ పత్రిక ప్రకారం, “చురుకైన హబుల్ చాలా చక్కగా పనిచేస్తుంది, అది 14,000 కిలోమీటర్ల దూరం నుండి మిణుగు పురుగును చూడగల శక్తిని కలిగి ఉంది.” ఇప్పుడు బాగు చేసిన స్కోప్ నుండి చిత్రాలను చూస్తూ, ఐరోపా స్పేస్ ఏజెన్సీలోని డుచో మాచెట్టో యిలా వివరించాడు: “నేను చూస్తున్నది ఎంతో అద్భుతంగా ఉంది.” (g94 8/8)
మానసిక అస్థిరతలు ప్రబలివుండుట
ది న్యూయార్క్ టైమ్స్ 1994 ఆరంభంలో యీ విధంగా నివేదించింది: “దాదాపు యిద్దరు అమెరికన్లలో ఒకరు, అంటే 48 శాతం మంది, తమ జీవితాల్లోని కొన్ని సందర్భాల్లో మానసిక అస్థిరత కలిగి ఉన్నారు.” ముఖాముఖిగా రోగ నిర్థారణ చేసేందుకు జరిపిన ఇంటర్వ్యూలను ఉపయోగిస్తూ, 8,000కన్నా ఎక్కువ మంది స్త్రీ, పురుషులపై ఒక సామాజికవేత్త నాయకత్వంలో జరిపిన అధ్యయనంలో, అతి సామాన్యమైన అస్థిరత ఏమంటే తీవ్ర నిరాశేనని; 17 శాతం మంది, తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో తీవ్ర నిరాశకు గురయ్యారని కనుగొన్నారు. పద్నాలుగు శాతం మంది కొన్ని సందర్భాల్లో మద్యానికి దాసులయ్యారు. అధ్యయనంలో ఆశ్చర్యం కలిగించిన సంగతేమంటే, 12 శాతం మంది శారీరకంగా పీడించబడినందువల్ల అస్థిరతకు లోనయ్యారని, అందులో సగంమంది “అత్యాచారానికి గురి కావడం వలన, లేక లైంగికంగా బాధించబడడం వలన” అలా జరిగిందని టైమ్స్ పత్రిక తెలిపింది. మానసిక అస్థిరతకు లోనయిన వారందరిలో నాలుగింట ఒక్కరు మాత్రమే డాక్టర్ల సహాయం పొందారు. అధ్యయనాన్ని నడిపిన సామాజికవేత్తయైన డా. రోనాల్డ్ సి. కెస్లర్ యీ విధంగా అంటున్నాడు: “మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మందిలో మానసిక అస్థిరత ఉందన్నది అశుభ వార్త. మీరు ఊహించగలిగేదానికన్నా ఎక్కువ మంది తమంతట తామే కోలుకుంటున్నారన్నది శుభవార్త.” (g94 8/8)
రష్యాలో పర్యావరణ విపత్తు
“రష్యా పర్యావరణ మంత్రి విక్టర్ డానిలో-డనిల్జాన్ రష్యాలోని 15 శాతం ఉపరితల ప్రాంతాన్ని పర్యావరణ విపత్తు గల ప్రాంతంగా ప్రకటించాడు,” అని జర్మన్ వార్తాపత్రికయైన ఫ్రాంక్ఫర్టర్ ఆల్జిమిన్ జైటంగ్ నివేదిస్తుంది. ఆ నివేదిక ప్రకారం రష్యాలోని సగం పొలాలు వ్యవసాయానికి ఉపయోగపడవు, లక్ష కన్నా ఎక్కువమంది ప్రజలు రేడియోధార్మిక శక్తి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జీవిస్తున్నారు. అంతేకాక, పదివేల కొలది ప్రజలు రసాయనిక ఆయుధాలను నిర్మించడానికి ఉపయోగించే కర్మాగారాల్లో విషబాధితులై చనిపోతున్నట్లు నివేదించబడింది. యూనియన్ ఫర్ కెమికల్ సేఫ్టీ అధ్యక్షుడైన లూఫ్ ఫ్యూడెరఫ్ యీ విధంగా అంటున్నాడు: “వైద్యపరమైన నియమం ప్రకారం రసాయన యుద్ధాలకొరకైన మన సిద్ధపాట్లు వినాశకరమైన ఫలితాలనిచ్చాయి.” (g947/22)
హింసాత్మక ప్రవృత్తిగల పిల్లలు
హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, చిత్రవధ మొదలైనవాటిని చేసే పిల్లలు అనేక దేశాల్లో ఉన్నారు, హింస, క్రూరత్వం పెరిగిపోతుంది. అమెరికాలో 18 ఏండ్ల లోపు వయస్సు గల హంతకుల సంఖ్య, గత ఐదు సంవత్సరాల్లో 85 శాతం పెరిగింది. చాలామంది నేరస్థులు కనబరచే అసహ్యకరమైన దృక్పథం అంతే కలవరాన్ని కలిగిస్తుంది. ఈ మార్పులకు కారణాలేంటి? “మన దుర్మార్గపు సమాజం, దాని దిగజారిన ప్రమాణాలతో హింసను అంగీకరించదగినదిగా చేసింది,” అని జర్మనీ వార్తా పత్రికయైన డేర్ స్పైగెల్ చెబుతుంది. “తప్పు, ఒప్పుల, మంచి, చెడుల సరైన ప్రమాణాలు . . . యిక ఏమాత్రం గుర్తించబడవు.” అది యిలా కూడా చెబుతుంది: “నేరస్థులైన యువకులు కూడా వీటికి గురవుతున్నారు. వారు ఎవరి మధ్య పెరుగుతున్నారో ఆ పెద్దలకు వారు ప్రతిబింబాలు. . . . హింసాత్మకంగా ప్రవర్తించే ప్రతి బిడ్డ నమ్మలేనంత ఎక్కువ హింసాత్మక క్రియలను చూస్తున్నాడు, మనస్సులో ఉంచుకుంటున్నాడు. టి.వి. ద్వారా, పిల్లలు “లోకమంతటా ఉన్న హింసను” చూస్తున్నారు. హత్య చేయడాన్ని, హింసాత్మకమైన చర్యలను ఘనపరచే హింసాత్మక వీడియోలు, కంప్యూటర్ ఆటలు, పాటలు వారిని ప్రభావితం చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించడానికి, తగాదాలను తీర్చడానికి హింస సరైన మార్గమన్నట్లు టి.వి. కార్యక్రమాలు చూపిస్తున్నాయి. “మనం అమానుష సమాజంగా తయారయ్యాం, మన పిల్లలు కూడా అలాగే అవుతున్నారు,” అని హాంబర్గ్ మనస్తత్వ ప్రొఫెసర్ అయిన స్టెఫాన్ స్మిత్చెన్ అంటున్నారు. (g94 7/22)
శిశువుతోపాటు నిద్రపోవడం
“మొదటి సంవత్సరం శిశువులను ఊయలలో వదిలిపెట్టకుండా తల్లుల పక్కన పడుకోబెట్టుకుంటే, ఆకస్మిక శిశు మరణాలను తగ్గించడమే కాక, మనం ఆరోగ్యవంతులైన, సంతోషభరితులైన పిల్లలను పెంచిన వారమౌతాము,” అని కాలిఫోర్నియాలోని పొమోటా కాలేజీ ప్రొఫెసర్ జేమ్స్ మ్యాక్కెన్నా అంటున్నారు. తల్లితో పడుకోవడం “రాత్రివేళ శిశువు శరీరధర్మం క్రమీకరించబడడానికి సహాయపడుతుంది,” అని ది దల్లాస్ మార్నింగ్ న్యూస్ నివేదిస్తుంది. బిడ్డ, తల్లి పక్కన పడుకున్నప్పుడు, బిడ్డ “ఊపిరి పీల్చుకునే తీరులోను, గుండె కొట్టుకునే వేగంలోను, నిద్రపోయే పద్ధతుల్లోను తల్లిని అనుకరిస్తుంది,” అని పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. తల్లి బిడ్డ ఎదురెదురుగా ఉంటారు కాబట్టి, శిశువు తనకు అవసరమైనప్పుడు సులభంగా పాలు తాగగలదు. “బిడ్డలు ఊయలలో ఒంటరిగా ఉండడం ఇంద్రియజ్ఞానాన్ని పోగొడుతుంది,” అని మిస్టర్ మ్యాక్కెన్నా అంటున్నారు. “ఇది నిర్ణాయకమైన బుద్ధివికాసం కలుగకుండా ఉండేందుకు ఆకస్మిక శిశు మరణానికి కారణమయ్యే పరిస్థితులకు ఎక్కువగా దారితీయగలదని మేము అనుకుంటున్నాము.” గణాంక వివరాలు చూపేదేమంటే, పిల్లలు అలవాటుగా తల్లితో పడుకొనే దేశాల్లో ఆకస్మిక శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. (g94 7/22)
కఫీన్ మరియు గర్భము
ఈ 1980లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, కఫీన్ అనే రసాయన పదార్థమున్న కాఫీని, టీని, కోకో, కోలా పానీయాలను తాగడం తగ్గించాలని గర్భిణీలకు సిఫారసు చేసింది. ముఖ్యంగా జంతువులపై చేసిన ప్రయోగాల ఆధారంగా యీ సిఫారసు చేయబడింది. అయినప్పటికీ, అప్పటి నుండి, గర్భిణీలపై చేసిన పరిశోధనలు, కఫీన్ ఉపయోగించడంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉందనే నిర్థారణకు దారితీశాయి. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యీ మధ్య నివేదించిందేమంటే, ప్రతిరోజు 300 మిల్లీ గ్రాములకన్నా ఎక్కువ కఫీన్ను (దాదాపు మూడు కప్పుల కాఫీ) తాగడం గర్భస్థ శిశువుకు హానికలిగించగలదని దాదాపు అన్ని అధ్యయనాలు తెలిపినప్పటికి, గర్భిణీలలో 75 శాతం మంది కఫీన్ ఉపయోగిస్తున్నారు. కొత్త అధ్యయనం యిచ్చే సలహా ఏమంటే, తక్కువ మోతాదులో అంటే, ప్రతి దినం 163 మిల్లీ గ్రాములు తాగడం కూడా కొందరు స్త్రీలలో గర్భస్రావం సంభవించే ప్రమాదానికి దారితీస్తుంది. అధ్యయన రచయితలు యీ విధంగా గుర్తించారు: “గర్భధారణ సమయంలో కఫీన్వున్న పానీయాలను తగ్గించమనడమే సరైన సిఫారసు.” (g94 8/8)
జీవశాస్త్ర సంబంధమైన ఒప్పందం చట్టమౌతుంది
జూన్ 1992లో బ్రెజిల్లోని 167 దేశాలు సంతకం చేసిన ఒక ఒప్పందం, యీ సంవత్సర ఆరంభంలో అంతర్జాతీయ చట్టమయ్యింది. జీవశాస్త్ర వైవిధ్యం అనే అంశంపై జరిగిన సమావేశంలో, జంతువులను, మొక్కలను జీవాణువులను వాటి సరిహద్దుల్లో, వాటి నివాసస్థలాల్లో సంరక్షించే మార్గాలను అన్వేషించవలసిన బాధ్యత, సంతకం చేసిన దేశాలపై పెట్టబడింది. అపాయంలోవున్న ప్రాణులను కాపాడడానికి, జీవవనరులను సరైన విధంగా ఉపయోగించడాన్ని, దాన్ని సంరక్షించవలసిన అవసరతను ప్రజలు గుర్తించడానికి చట్టాలను తయారు చేయవలసిన అవసరం సంతకం చేసిన దేశాలకు ఏర్పడింది. ప్రాణులు ఎక్కువ సంఖ్యలో అంతరించిపోతున్నాయని గ్రహించడాన్ని బట్టి, 2050వ సంవత్సరంనాటికెల్లా మిగిలిన జాతుల్లో సగం అప్రత్యక్షమౌతాయన్న భయాన్నిబట్టి యీ ఒప్పందం చేయవలసి వచ్చింది. ఈ ఒప్పందాన్ని అసలు ఎలా అమలుపరచాలో తీర్మానించేందుకు సంతకం చేసిన దేశాలు యీ సంవత్సరంలో మరోసారి కలుసుకోవాలి. (g94 7/22)