ప్రపంచ పరిశీలన
అంటు రోగం తిరిగి ప్రబలుతున్నది
“అంటు రోగాలవల్ల కలిగే ప్రమాదం ఇంకా పోలేదు. ఇంకా అధికమౌతోంది,” అని యు.ఎస్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విడుదల చేసిన నివేదిక గురించి యేల్ విశ్వవిద్యాలయం యొక్క రాబర్ట్ షోప్ అన్నాడు. “పరిస్థితిని అదుపు చేయడానికి మనం సిద్ధపడకపోతే హెచ్.ఐ.వి మహమ్మారి వ్యాధి లేక 1918-1919లో వచ్చిన ఇన్ఫ్లూఎన్జా వ్యాధివంటి కొత్త సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది.” ఇప్పటికే నాలుగు వ్యాధులు “ఆకస్మికంగా ప్రత్యక్షమై, చాలా దుఃఖాన్ని, మరణాలను కలుగిస్తున్నాయి,” అని నివేదికను సిద్ధపరచిన సమితిలో షోప్ సహాధ్యక్షుడు జాషువా లెడర్బర్గ్ అన్నాడు. అవి వ్యాధినిరోధక మందులకు కూడా నయం కాని క్షయ, ఎయిడ్స్, లైమ్ వ్యాధి, మరియు స్ట్రెప్టోకొక్కల్ అంటు వ్యాధి ప్రాణాంతక క్రొత్త రోగాలే. గత మూడు దశాబ్దాలలో చాలా మందులు, వ్యాధి నిరోధక మందులు కనుగొనబడినా, సూక్ష్మజీవులు వాటిని ఎదుర్కొనడానికి చాలా మార్గాలను కనుగొన్నాయి. ఉదాహరణకు, సూక్ష్మక్రిములు, రోగనిరోధక మందులకు తట్టుకోవడానికి అణువులతో సహా జన్యు పదార్ధాన్ని మార్చుకొనగలవు. పర్యవసానంగా, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, శిశుసంరక్షణా శాలలు, ఇల్లులేని వాళ్ల రక్షిత శిబిరాలు, మందులకు కూడా మానని అంటు వ్యాధులకు పుట్టిల్లయ్యాయి. ఎక్కువైపోతున్న అంతర్జాతీయ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఈ “సూపర్క్రిమిని” విస్తరింపజేస్తూంది. న్యూ యార్క్స్ ఆల్బ్ర్ట్ ఐన్స్టయిన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన బారీ బ్లుమ్ ఇలా అంటున్నాడు: “అంటువ్యాధుల విషయంలో గమనిస్తే, మనం ఏ ప్రాంతానికీ దూరంగా లేము, సంబంధం లేని మనిషే లేడు.” (g93 3/22)
అట్టడుగున జీవించడం
భారతదేశంలోని మూషార్లు “ఎప్పుడూ కూడా” సమాజంలోని “అట్టడుగు జాతివారేనని” ఇండియా టుడే ఈ మధ్యే చెప్పింది. అంటరాని వారని పిలువబడే యీ ప్రజలు చాలా మట్టుకు బీహార్ రాష్ట్రంలో 30 లక్షల వరకూ ఉన్నారు. ఒక 60 ఏళ్ల మూషార్ ప్రకారం, చాలా మందికి, “పూర్తి భోజనం అంటే ఏమిటో తెలియదు.” గ్రామీణ ప్రాంతంలో ఆహారం కొరకు వెదకుతూ, పొగపెట్టి ఎలుకలను వాటి రంధ్రాల్లో నుంచి బైటకు తరిమి, వాటిని చంపి, వేపి, తింటున్న మూషార్ జాతి పిల్లల గుంపును ఇండియా టుడే వివరంగా వర్ణిస్తుంది. ప్రాంతీయ భాషలో “మూషార్” అంటే “ఎలుకలను పట్టేవాడు” అని అర్థమని పత్రిక వివరిస్తుంది.
యౌవనులలో సాతాను ఆరాధన
సాతాను ప్రభావం దక్షిణాఫ్రికా, జొహనస్బర్గ్లోని పాఠశాలల్లో బాగా ప్రఖ్యాతి గాంచుతోంది. ది స్టార్ వార్తాపత్రిక ప్రకారం, సాతాను ఆరాధనవల్ల ప్రభావితులైన చాలామంది విద్యార్థులను తాను బాగు చేశానని ఒక మనస్తత్వ శాస్త్రవేత్త చెప్తుంది. మాదక ద్రవ్యాలు తీసుకుని, లైంగిక దుర్నీతిని అభ్యసించి, ఇతరులను లేక తమను తాము హింసించుకోవడాన్ని బట్టి ఆనందిస్తూ నగర పరిసరాల్లోని ప్రజల గురించి ఆ రోగులు చెప్పారు. అలా కాకుండా, “ఆ పిల్లలు చాలా మర్యాదపూర్వకంగా కనిపిస్తున్నారని” ఆవిడ చెప్పింది. సాతానుకు సంబంధించిన గుంపులు దేశవ్యాప్తంగా ఉన్నాయని పోలీసులకు తెలుసని ఒక పోలీసు అధికారి ది స్టార్ పత్రికకు చెప్పారు. సాతాను క్రియలు చట్ట విరుద్ధమైనవి కాదు, కాని సాతాను ఆచారాలకు సంబంధించి చేసే నేరాలను పోలీసులు ఓ కంటకనిపెడుతునే వున్నారు. ఒక 38 ఏళ్ల స్త్రీని హత్య చేసినందుకు ఓ యుక్త వయస్కురాలిని, ఆమె ప్రియున్ని వారు ఈ మధ్యే అరెస్టు చేశారు. వారిద్దరు కూడా సాతాను క్రియలతో సంబంధం కలిగి ఉండిరి, మరియు దయ్యాల ప్రభావం క్రిందనే తామా హత్య చేశామని వారు పోలీసులకు చెప్పారు.
హరిత గృహ ప్రభావం వల్ల కలిగే తుఫానులు
ఈ మధ్యే వచ్చిన తీవ్రమైన తుఫానులు హరిత గృహ ప్రభావం వల్ల, మానవ కాలుష్యం మూలంగా వాతావరణం వేడెక్కడంవల్ల సంభవించి వుండవచ్చని చాలామంది శాస్త్రజ్ఞులు చింతిస్తున్నారు. న్యూస్వీక్ పత్రిక ప్రకారం, మామూలు వాతావరణంలో కొద్ది డిగ్రీలు ఎక్కువైనా అటువంటి తుఫాన్లను తీవ్రతరం చేసి వాటిని ఉత్పత్తి చేసే సముద్రాల వైశాల్యాన్ని పెంచుతాయి. తుఫాన్ల తీవ్రతను కొలిచే 5-పాయింట్ల కొలతలో 5గా ఎంచబడి 1992లో వచ్చిన తుఫాను ఆండ్రూ వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చు తుఫానని ఒకప్పుడు పిలువబడి వుండవచ్చు. ఎందుకంటే అటువంటి వినాశకరమైన తుఫాన్లు అంత అరుదుగానే వస్తాయి. కాని 1989లో వచ్చిన తుఫాను హ్యూగో 4గా ఎంచబడింది, 1988లో వచ్చిన గిల్బర్ట్ కూడా 5గా ఎంచబడింది. “ఆండ్రూను చూడండి; హరిత గృహ ప్రపంచం అలానే ఉంటుందేమో” అంటున్న చాలామంది శాస్త్రజ్ఞుల చింతను గూర్చి న్యూస్వీక్ సంక్షిప్తంగా తెల్పుతుంది. (g93 3/22)
దానం ఎవరి కొరకు?
ప్రతి సంవత్సరం ధర్మాదాయ సంస్థలు సేకరిస్తున్న డబ్బంతా ఏమౌతుంది? దాన్ని నడుపుతున్న వారికి అందులో చాలా ఎక్కువ భాగం దక్కుతుంది. ఒక పరిశోధన ప్రకారం, అమెరికాలో ఉన్న 100 అతి పెద్ద ధర్మాదాయ సంస్థల్లో, మూడోవంతు కంటే ఎక్కువ సంస్థల్లోని ప్రధాన కార్యనిర్వాహకులే జీతాలు, ఉపకార వేతనాల పేరుతో ప్రతిఒక్కరు 2,00,000 డాలర్లకు పైగా దోచుకున్నారు. అందుకే ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రైబ్యూన్ ఇలా నివేదిస్తూంది. ఆ కార్యనిర్వాహకులలో ముగ్గురు 5,00,000 డాలర్లు సంపాదించారు. ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా చూడక పోవడం, విపరీతంగా ఖర్చు పెట్టినందుకు ఒక సంస్థ నిర్వాహకున్ని తీసివేయడంతో ఈ పరిశోధన మొదలైంది. అతను సంవత్సరానికి 3,90,000 డాలర్లు ఆర్జించేవాడు. అతని తరువాత వచ్చిన వ్యక్తి “కేవలం” 1,95,000 డాలర్లే సంపాదిస్తున్నాడు.
విడాకులు మనల్ని విడదీసేంత వరకు
పందొమ్మిది వందల తొంభై ఒకటిలో 1,30,000 వివాహాలు జర్మనీలోని విడాకుల కోర్టులో అంతమయ్యాయని అల్జెమినా జైటంగ్ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. వైవాహిక చీలికలు ఎంత మామూలు అయ్యాయంటే, “మీ విడాకుల సందర్భంగా శుభాకాంక్షలు” లేక “మీ జీవితంలో అతి మంచి రోజులలో మొదటి దానికి స్వాగతం” అనే నినాదాలతో కూడిన విడాకుల సానుభూతి కార్డులు అత్యధికమయ్యాయి. జర్మనీలో వివాహం చేసుకుంటున్న దంపతుల్లో 10 శాతం మంది వివాహానికి ముందే విడాకులకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటే ఎవరు ఏది తీసుకోవాలి—ఇల్లా, సామానులా, అని నిర్ణయిస్తూ వాళ్లు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇంత మంది విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? “వివాహమైన కొద్ది సంవత్సరాలకే, తమ భర్తలు తమపై చాలా తక్కువ ఆసక్తి చూపిస్తున్నారని 80 శాతం స్త్రీలు ఫిర్యాదు చేస్తున్నారు. . . . వివాహమైన ఆరేళ్ల తరువాత కూడా వారు రోజుకు ఒకరితో ఒకరు కేవలం తొమ్మిది నిమిషాలే మాట్లాడుకునే వారని 5,000 మంది దంపతులపై జరిపిన పరిశోధన నొక్కిచెప్పిందని” అల్జెమినా జైటంగ్ వ్యాఖ్యానించింది.
క్రమశిక్షణ పాటించనందుకు తల్లిదండ్రులు పన్ను కడుతున్నారు
తమ పిల్లలు చేసిన నేరానికై రుసుము చెల్లించాలని టోక్యో, జపాన్లోని ఒక కోర్టు మోటర్సైకిల్ గుంపులోని ముగ్గురు యౌవనస్థుల తలిదండ్రులను ఆదేశించింది. ఆ మగపిల్లలు తమ వాహనాల చప్పుడు విషయమై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కొట్టి, అనేకసార్లు కడుపులో తన్నారు. ఆ వ్యక్తి ఒక నెల తరువాత చనిపోయాడు. “ఈ కుర్రాళ్లు చేసిన నేరం వారు జీవిస్తున్న జీవిత విధానానికి గురుతు, వారు మాటి మాటికి పాఠశాల మానేసి, మద్యం, పొగ త్రాగుతూ మోటర్ వాహనాలను నడిపే వారని,” జడ్జీ చెప్పినట్టు మైనీచీ డేలీ న్యూస్ తెల్పింది. “తమ కొడుకులు జీవిస్తున్న జీవిత విధానం గురించి పూర్తిగా తెలిసినా, ఆ ముఠా సభ్యుల తలిదండ్రులు వారిని క్రమశిక్షణలో పెట్టలేదు,” అని ఆయన అన్నాడు. అంతేకాకుండా మరణించిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా 8,30,00,000 ఎన్లు (ఇంచుమించు 7,00,000, అమెరికన్ డాలర్లు) చెల్లించమని తల్లిదండ్రులకు ఆజ్ఞాపించాడు. (g93 4/8)
మతనాయకుల విడాకుల సంఖ్య పెరుగుతోంది
“జర్మనీలోని మూడు వివాహాలలో ఒకటి విడాకులతో అంతమౌతుందని,” ది జర్మన్ ట్రైబ్యూన్ చెప్తోంది. అదే విధంగా, “చాలా మంది ప్రొటెస్టెంటు మతనాయకుల వివాహాలు విఫలమౌతున్నాయి.” మరి “స్త్రీ పురుష మతనాయకులలో విడాకుల సంఖ్య, జనాబా సంఖ్యంత ఎక్కువగా ఉందని” హెసీ మరియు నసావూలోని ప్రొటెస్టెంట్ చర్చి ప్రెసిడెంట్ యొక్క డిప్యూటీ అయిన హాన్స్-మార్టిన్ హోయిజేల్ ఒప్పుకుంటున్నాడు. వివాహం విడదీయని బంధంగా ఉండాలని చర్చీ బోధిస్తుంటే “చర్చీ సభ్యుల మధ్య సహితం, నిజానికది వేరుగా ఉంది. మత నాయకుల విడాకుల విషయంలో వ్యక్తిగత, క్రైస్తవ ప్రవర్తన, చర్చి బోధ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని” ట్రైబ్యూన్ చెప్తుంది. కొన్ని మినహాయింపులతో, “విడాకులు తీసుకున్న మతనాయకుడు తన పదవిలో ఉండి తన పూర్వపు స్థానంలో ఉండవచ్చు లేక వేరేచోట ఉండవచ్చును.”
పశుపాలనలో సరిగమలు
జపానులోని పాల ఉత్పత్తిదారులు మసకమసకగా వుండే కొండల మీద చెదరిన ఆవులను రప్పించడానికి తక్కువ సమయాన్ని తీసుకునే ఉపయోగకరమైన పద్ధతి కొరకు వెదకుతూవుండిరి. సంగీతంతో ఆవులను మందగా సమకూర్చవచ్చేమో చూడడానికిగానూ, వాళ్లు ఒక పరిశోధనను నిర్వహించారు. 13 రోజులవరకు ఒక్కోసారి 3 నిమిషాల చొప్పున రోజుకు రెండు నుండి నాలుగుసార్లు, 16 ఆవులకు హారు నో ఒగోవా (వసంత కాలంలో సెలయేళ్లు) అనే రాగాన్ని వినిపించారు. దాని వెంటనే, వాటికి తమ ప్రియమైన ఆహారాన్ని ఇచ్చారు. శీతాకాలంలో ఆవులు ఈనినప్పుడు కొంత అంతరాయం తరువాత, “శిక్షణ” ఇవ్వబడిన ఆవులను పదింటిని వాటి తొమ్మిది దూడలను మేతకు పంపారు. అదే రాగాన్ని తిరిగి వినిపించారు. “రెండు నిమిషాలలో మొత్తం మందంతా వచ్చేసింది, అవి నాలుగు నెలల పూర్వం విన్న సంగీతం వాటిని ఒక దగ్గరికి చేర్చిందని” అషాఘీ ఈవినింగ్ న్యూస్ నివేదించింది.
సరిగ్గా దాచబడిన వైద్య రహస్యం
డానిష్ వైద్య సౌభ్రాతృత్వంవారు సరిగ్గా దాచి ఉంచిన రహస్యాన్ని, ప్రొఫెసర్ మరియు సలహాదారిణి అయిన మార్గరేటా మైకెల్సెన్ వెల్లడి చేసింది. రోగులలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను పరీక్షిస్తున్నప్పుడు ఒక బిడ్డకు తండ్రి అని చెప్పబడిన వ్యక్తి వర్ణగ్రాహకాల లోపం వల్ల ఆ బిడ్డ యొక్క అసలు తండ్రికాడని వైద్య బృందం క్రమంగా కనుగొన్నది. జుడౌస్కే జైటంగ్ వార్తా పత్రిక ప్రకారం డెన్మార్క్లోని 5 నుండి 8 శాతం తండ్రులు తమ పిల్లలకు అసలు తండ్రులు కారు. దీన్ని బట్టి సంవత్సరానికి పుట్టే 60,000 శిశువులలో 3,000 వైవాహిక విశ్వాసఘాతుకం కారణంగా జన్మించారు. అయితే, కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని ఆ పురుషులకు ఈ విషయాన్ని గూర్చి చెప్పబడలేదు.
శరీర ఉష్ణోగ్రతలో మార్పు
శతాబ్దంపైగా, మానవ శరీరపు మామూలు ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడుగా అంగీకరించబడింది, 25,000 మంది పెద్ద వయస్కుల శరీరాల ఉష్ణోగ్రతను పది లక్షలసార్లు కొలువగా తేలిన ఫలితాన్ని కార్ల్ వండర్లిక్ 1868లో ప్రచురించాడు. ఉష్ణోగ్రతను కొలవడానికి ఆ కాలంనాటి ఉష్ణమానులకు 15 లేక 20 నిమిషాలు పట్టేది, పైగా వాటిని అదే స్థలంలో అంటే చంకక్రిందనే ఉంచి ఉష్ణోగ్రతను చూడాల్సి వచ్చేది కాబట్టి, అది గొప్ప పనే. అయితే, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఫిలిప్స్ ఎ. మాకోవియాక్, లెక్కను మార్చాల్సి ఉంటుందని అన్నాడు, ఆయన పరిశోధనలు చూపుతున్నట్లు 37 డిగ్రీల సెంటీగ్రేడు “పూర్తిగా మామూలు ఉష్ణోగ్రత కాదు, వివిధ సమయాల్లో కొలవబడిన సగటు ఉష్ణోగ్రత కాదు, అది మధ్యస్త ఉష్ణోగ్రత కాదు, లేక తరచూ కొలవబడే ఉష్ణోగ్రత కూడా కాదు.” వాస్తవానికి, అది 700 సార్లువేసిన కొలతల్లో 8 శాతం కొలతలకే సంబంధించినది. మాములు శరీర ఉష్ణోగ్రత, 36.8 డిగ్రీల సెంటీగ్రేడు మాత్రమే వుండాలని ఆయన అంటున్నాడు. (g93 3/22)