పిల్లలకొక ఉజ్వల భవిష్యత్తు
పిల్లల ప్రపంచ సమావేశములో, అనేక మంది లోక నాయకులు భవిష్యత్తును గూర్చి ధైర్యంగా మాట్లాడారు. వారు పిల్లలకు “ఒక క్రొత్త యుగమును” గూర్చి, “పిల్లల అవసరతల కొరకు సరిక్రొత్త సమర్పణను” ప్రవచించారు. వారు “‘ఒక సరిక్రొత్త సంఘీ భావమును,’ గూర్చియు పిల్లలకు సహాయం చేయుటకు ‘ఏకమై, దృఢనిశ్చయముగల ఒక ప్రపంచ సమ్మేళనానికి ఊపిరిపోయుటను’” గూర్చి మాట్లాడారు.
అవి ఘనమైన మాటలే. అయితే ఈ గురులను సాధించుటకు దేశాలు ఎంతవరకు వెళ్లగలవో చూడాలి. అయితే గమనించదగినదేమనగా, ఆ సమావేశమైన అయిదు నెలల లోపునే, ప్రపంచ దేశములు పర్శియన్ గల్ఫ్లో పోరాడాయి. ఆ యుద్ధము అత్యధిక వ్యయంతోకూడిన యుద్ధాలలో ఒకటి—6,100 కోట్ల డాలర్లు—మరియు పర్యావరణం వినాశనకారి అయ్యింది. దాని కారణంగా ఇరాక్ మరియు కువాయిట్లలోని వందలవేల ప్రజలు తరలించబడ్డారు. ఆహారకొరత వలన, నిలువ నీడలేక, పౌష్ఠిక ఆహారములేక, మరియు రోగమువలన వేలాది మంది—ఒక సమయంలో ప్రతిరోజు వందమంది—చనిపోయారు. అందులో 10కి 8 మంది స్త్రీలు, పిల్లలే వున్నారు.
శ్రమలు ప్రవచించబడ్డాయి
ప్రపంచములోని పిల్లలను పీడిస్తున్న సమస్యలు షుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడ్డాయని బైబిలు విద్యార్థులకు తెలుసు. ఈ “అంత్యదినములను” గూర్చి బైబిలు ప్రవచించింది:
▫ “అక్కడక్కడ . . . తెగుళ్లు . . . తటస్థించును.”—లూకా 21:11.
▫ “అక్కడక్కడ కరువులును . . . కలుగును.”—మత్తయి 24:7.
▫ “[మనుష్యులు] భూమిని నశింపజేయు[దురు]”.—ప్రకటన 11:18.
▫ “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.”—మార్కు 13:8.
▫ “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, . . . అనురాగరహితులు.”—2 తిమోతి 3:1-3.
మానవజాతి యొక్క సమస్యలను పరిష్కరించుటలో తగినంత ప్రగతి సాధించామని తలంచి లోక నాయకులు: “భయమేమి లేదు నెమ్మదిగా ఉన్నది” అని ప్రకటింతురని కూడా బైబిలు ప్రవచించింది.—1 థెస్సలొనీకయులు 5:3.
ఒక ఉజ్వల భవిష్యత్తు
అయితే ఆ ప్రకటన, వాస్తవానికి దేవుడు మానవజాతి కార్యకలాపాల్లో జోక్యం చేసుకొనే సమయాన్ని గుర్తుచేస్తుంది. తన పరలోక రాజ్యము ద్వారా, దేవుడు ప్రస్తుత విధానమును తీసివేస్తాడు, మరియు నిజమైన శాంతి భద్రతలుగల తన నూతన లోకమును పిల్లలకొరకును, పెద్దలకొరకును ప్రవేశపెడతాడు.—సామెతలు 2:21, 22; దానియేలు 2:44; మత్తయి 6:10.
దేవుని రాజ్యము యొక్క మహత్వపూర్ణమైన ఏర్పాటులో, “నా దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) కుపోషణ గతించిన సంగతైయుండును: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును.” (కీర్తన 72:16) ఇక యుద్ధం కూడా ఉండదు, ఎందుకనగా బైబిలిట్లు వాగ్దానము చేస్తుంది. “[యెహోవాయే] భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:9.
మరి ఇంతవరకు పోషకాహార లోపం, రోగం, మరియు ఇతర కారణములవలన చనిపోయిన పిల్లలందరి—మరి ఇతరుల—సంగతేమిటి? దేవుని ప్రేరేపిత వాక్యము: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవుచున్నదని” తెల్పుచున్నది.—అపొ. కార్యములు 24:15.
యేసుక్రీస్తు భూమి మీద ఉన్నపుడు, దేవుని నూతన లోకమునకు పునరుత్థానము పొందబోవు వారిలో చిన్నవారుకూడా ఉంటారని ఆయన ప్రదర్శించాడు. ఉదాహరణకు, 12 సంవత్సరముల ఓ అమ్మాయి చనిపోయినప్పుడు, “అందరును ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండిరి.” అప్పుడు యేసు, ఆ అమ్మాయి చేయి పట్టుకొని, “చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను” అని ఆ చరిత్రాత్మక సంఘటనలో వర్ణించబడింది. ఆమె తలిదండ్రులు ఎలా ప్రతిస్పందించారు? బైబిలు ఇలా నివేదిస్తుంది: “ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి.”—లూకా 8:40-42, 49-56: మార్కు 5:42.
మరొక సందర్భములో, యేసు ఒక విధవరాలి ఏకైక కుమారుడు చనిపోగా అంత్యక్రియలు జరుపవెళ్లుచున్న గుంపును కలుసుకున్నాడు. యేసు “దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన ‘చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానగా’ ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.” అప్పుడు దగ్గరలో ఉన్నవారందరు “దేవుని మహిమపరచిరి.”—లూకా 7:11-16.
ఆవిధంగా, దేవుని రాజ్య ప్రభుత్వములోని నీతియుక్తమైన పరిపాలనలో, పునరుత్థానము పొందిన వారితో సహా పిల్లలు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తును కలిగియుందురు. నీతి సమాధానములతో నిండిన లోకములో పిల్లలు జీవించగలరు, మరియు అదెంత అందమైన, భద్రతగల, సంపన్నమైన లోకమంటే యేసు సరైన రీతిగా దానిని “పరదైసు” అని పిలిచాడు.—లూకా 23:43. (g92 12/8)
[9వ పేజీలోని చిత్రం]
దేవుని నూతన లోకంలో పిల్లలు భద్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు