బైబిలు ఉద్దేశ్యము
“దేవుడెందుకు నా బిడ్డను తీసుకున్నాడు?”
బిడ్డమరణం ఏ తల్లిదండ్రికైనా వేదనకరమే. అదెంత దుఃఖకరమంటే మామూలు మాటలు దాన్ని తుడిచివేయజాలవు. అయితే నీవు అలా బిడ్డను కోల్పోయి బాధననుభవించి యున్నట్లయితే, మరి దేవుడెందుకు నీ బిడ్డను తీసికొనిపోయెనని నీవు ఆశ్చర్యపడుతూ వుంటే అప్పుడు నీవింకను శోకమును పెంచే అపోహను నీలో దాచుకుంటున్నావన్నమాట. నీవు సత్యాన్ని తెలుసుకొనే అవసరమున్నది. దేవుడు నీ బిడ్డను తీసుకొని పోలేదు.
అయిననూ, అనేకులు దానికి భిన్నంగా నమ్ముచున్నారు. ఉదాహరణకు, ఓ స్త్రీ తెరిచివున్న శవపేటికలోనికి నిరాశతో తొంగి తదేకంగా చూచింది; అందులో కేన్సర్ వ్యాధినుండి నయం పొందలేక క్షీణించి, చిక్కి శల్యమై మరణించిన ఆమె 17 సంవత్సరముల కుమారుని శవం వున్నది. ఆమె ఒక సందర్శకునివైపు తిరిగి వణకుతూ ఇలా అన్నది: “దేవునికి పరలోకమందు తోమా తోడు కావలెనట.” ఆమె ఒక రోమన్ కెథోలిక్ మతస్థురాలు, సంవత్సరాల తరబడి చర్చీకి వెళ్తూ ఆమె నేర్చుకున్నదిదే. చాలా కాలంనుండి ప్రొటెస్టెంట్ వారు కూడా శిశుమరణములకు దేవునినే నిందిస్తున్నారు. ప్రఖ్యాతి గాంచిన ప్రొటెస్టెంట్ సంస్కరణకర్త జాన్ కాల్విన్ తన రెండునెలల మగ శిశువు చనిపోగా ఇలా విలపించాడు: “మా మగ శిశువు మరణం మూలంగా ప్రభువు నిశ్చయంగా బలమైన గాయం చేశాడు.”
యూదుల పురాణ కథ ప్రకారం ఒక రబ్బీ ఊర్లో లేనప్పుడు తన కవల మగపిల్లలు చనిపోయారు. ఆయన ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలేరని అడిగినప్పుడు ఆయన భార్య ఇలా అన్నది: “మీకు రెండు రత్నములు అరువిచ్చి నీదగ్గరున్నంతవరకు వాటిననుభవించవలెనని చెబితే, అరువిచ్చిన వ్యక్తి వాటిని మరల అడిగితే నీవు వాదించగలవా?” ఆయన అన్నాడు: “నిశ్చయంగా వాదించను!” అప్పుడామె చనిపోయిన అతని ఇద్దరు కుమారులను చూపించి, సహజదోరణిలో ఇలా అన్నది: “దేవుడు తన రత్నాలను తిరిగి కావాలన్నాడు.”
ఓదార్పుకరమైనది కాదు బైబిలు సంబంధించినది కాదు
ఇది వారి తల్లిదండ్రులకు గుండెకోత అవుతుందని తెలిసికూడా సృష్టికర్త పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేటంత కౄరుడా? లేదు, బైబిలు యొక్క దేవుడు అలా చేయడు; 1 యోహాను 4:8 ప్రకారం, “దేవుడు ప్రేమాస్వరూపి.” గమనించండి దేవుడు ప్రేమ కలిగి యున్నాడని గానీ దేవుడు ప్రేమిస్తున్నాడని గానీ చెప్పడంలేదు, అయితే దేవుడు ప్రేమై యున్నాడు అని అక్కడ చెబుతుంది. దేవుని ప్రేమ ఎంత మిక్కుటమైనది, ఎంత పవిత్రమైనది, ఎంత పరిపూర్ణమైనదంటే, అది ఆయన వ్యక్తిత్వమును క్రియలను ఎంత సంపూర్ణంగా లోతుకు చొచ్చుకొనిపోవునట్లు చేస్తుందంటే, ఆయనను ప్రేమ యొక్క మూర్తిమంతమేయని యుక్తంగా పిలువవచ్చును. ‘తనరత్నాలు తనకు తిరిగి కావలెను గనుక’ పసివారిని చంపే దేవుడు కాదాయన.
బదులుగా, దేవుడు పిల్లలను ఎంతో గాఢంగాను, నిస్వార్థముగాను ప్రేమిస్తున్నాడు. తన పరలోకపు తండ్రి వ్యక్తిత్వాన్ని ప్రతిమాటలోను క్రియలోను ప్రతిబింబించే యేసుక్రీస్తు పిల్లలయెడల అనురాగముతో కూడిన శ్రద్ధ కనబరచాడు. ఆయన ఒకసారి ఒక చిన్న వానివలె నిష్కపటులై, వినయస్థులై యుండవలెనని ఉపదేశించాడు. (మత్తయి 18:1-4; మార్కు 9:36) అనేక శతాబ్దములకు ముందే, తమ పిల్లలను ప్రశస్తమైనవారిగా చూసుకొని వారికి తగిన రీతిలో శిక్షణిస్తూ, బోధిస్తూ వారిని పరామర్శించవలెనని యెహోవా తన ప్రజలకుపదేశించాడు. (ద్వితీయోపదేశకాండము. 6:6, 7; కీర్తన 127:3-5) కుటుంబములు జీవితంలో ఐక్యమైయుండాలని ఆయన కోరుచున్నాడేగానీ మరణంలో విడిపోవలెనని ఆశించుటలేదు.
“మరైతే నా బిడ్డ ఎందుకు చనిపోయెను”?
దేవుడు సర్వశక్తిగలవాడు గనుక ఈలోకములో జరిగే ప్రతిదాన్ని, పిల్లల మరణముతో సహా అన్నింటిని ఆయన నడిపిస్తూవుంటాడని అనేకులు అనుకుంటారు. గానీ అలా జరగవలసిన అవసరంలేదు. యోబు తన పదిమంది కుమారులను ఒక్కసారే పోగొట్టుకున్నపుడు యెహోవా ఆయనకు మహావిపత్తును కలుగజేశాడని అనుకున్నాడు. బైబిలు మనకేమి తెలుపుతుందో ఆయనకు తెలియదు అనగా ఆ విషయంలో జరిగిన సంఘటనల వెనుక దేవుని శత్రువైన మానవాతీత వ్యక్తియగు సాతాను హస్తమున్నదని, సృష్టికర్త ఎడల ఆయనకున్న విశ్వాసమును విసర్జించుటకు ప్రయత్నిస్తున్నాడని ఎరుగడు.—యోబు 1:6-12
ఆలాగే, లోకములో సాతాను ప్రభావమెంత వరకున్నదో చాలమందికి అసలే తెలియదు. ఈ దుష్టవిధానము యొక్క పరిపాలకుడు సాతానే గానీ యెహోవా కాదని బైబిలు తెల్పుచున్నది. “లోకమంతయు దుష్టునియందున్నది” అని 1 యోహాను 5:19 తెల్పుతుంది. ఈలోకంలోని విషాద సంఘటనలన్నింటికి యెహోవాను నిందించరాదు. ఆయన నీ బిడ్డను తీసికొనిపోలేదు.
అంటే సాతాను నీ బిడ్డను తీసుకొనిపోయెనని దాని అర్థమా? లేదు, నిజంగా తీసుకొనిపోలేదు. అలనాడు ఏదెనులో మానవుడు దేవునికి ఎదురు తిరిగి తానే స్వయంగా సాతాను పరిపాలన క్రిందికి వచ్చాడు. ఆవిధంగా అతడు తనకును తన సంతానమునకును ఇచ్చిన ఆరోగ్యకరమైన నిత్యజీవ వరాన్ని పోగొట్టుకున్నాడు. (రోమీయులు 5:12) తత్ఫలితంగా, మనం దేవునినుండి దూరమైన లోకంలో జీవిస్తున్నాము. ఈలోకంలో మనం “అదృష్టవశముచేతనే కాలవశముచేతనే” అని బైబిలు పిలిచే వాటినెదుర్కోవలసి వుంటుంది, జీవితంలో అనుకోనివి, తరచూ దుఃఖకరమగు సంఘటనలు ఎదురైనపుడు వాటినెదుర్కోవాలి. (ప్రసంగి 9:11) సాతాను “లోకమును మోసపుచ్చు”చున్నాడు. (ప్రకటన 12:9) అతని ముఖ్యాశయమేమనగా ప్రజలను దేవునినుండి మళ్లించుటే. అలా అతడు దేవుని మీద అసహ్యమైన అబద్ధాలు చెబుతూవున్నాడు. అందులో ఒక అబద్ధమేమంటే దేవుడు పిల్లలను తమ తలిదండ్రులనుండి దూరం చేయడానికి మరణాన్ని మారణాయుధంగా వుపయోగించుకుంటున్నాడు అనేది.
“నా బిడ్డకేం నిరీక్షణ ఉన్నది?”
శోకతప్తులైన తల్లిదండ్రులు దేవున్ని నిందించే బదులు బైబిలు నందు దేవుడిచ్చే ఓదార్పును వెదకవలసిన అవసరమున్నది. చనిపోయిన తమ పిల్లలెక్కడున్నారు, వారి స్థితి ఏమిటి అనే విషయంలో అబద్ధమతం అనేకులను అయోమయంలో పడవేసింది. పరలోకం, నరకం, పాపవిమోచనలోకం, పితృలోకం—ఇటువంటి ఇతర గమ్యస్థానములు, గ్రహింపనలవికాని వాటినుండి భయంకరమగు వాటివరకు బోధింపబడుతున్నవి. అయితే, మృతులు నిద్రతో సరిగ్గా పోల్చదగిన సృహలేని స్థితిలో ఉన్నట్లు బైబిలు మనకు తెల్పుచున్నది. (ప్రసంగి 9:5, 10; యోహాను 11:11-14) అట్లు, తల్లిదండ్రులు వారి పిల్లలు గాఢనిద్రలో ఉన్నపుడు వారెలా విచారపడరో ఆలాగే మరణాంతరం వారి పిల్లల విషయంలో కూడ అంత విచారపడనవసరంలేదు. “సమాధులలో నున్నవారందరు” భూపరదైసులో నూతన జీవముకొరకు “బయటకు వచ్చే” ఒక కాలమును గూర్చి యేసు చెప్పాడు.—యోహాను 5:28, 29; లూకా 23:43.
నిజమే, ఆ ప్రకాశమానమైన నిరీక్షణ మరణశోకము నంతటిని తీసివేయదు. యేసు తానే తన మిత్రుడు లాజరు చనిపోగా బహుగా దుఃఖించాడు—తాను అతనిని పునరుత్థానునిగా చేయుటకు కొన్ని నిమిషాల ముందే అలా చేశాడు! గనుక మరణమే ఎల్లపుడు చివరిది కాదు. యేసు మరియు తన తండ్రియైన యెహోవా, ఇద్దరూ మరణమును అసహ్యించుకుంటారు. బైబిలు మరణమును “కడవరి శత్రువు” అని పిలుస్తూ అది “నశింపజేయబడు”నని తెల్పుచున్నది. (1 కొరింథీయులు 15:26) రాబోవు పరదైసులో, సాతాను పరిపాలన గతించినపుడు, మరణం శాశ్వతంగా తీసివేయబడుతుంది. దానికి బలైన అమాయకులు పునరుత్థానము ద్వారా పునరుజ్జీవం పొందెదరు. అప్పుడు, మరణమందు పొగొట్టుకొనిన తమ పిల్లలను తల్లిదండ్రులు తిరిగి కలుసుకున్నప్పుడు మనం తుదకు ఇలా చెప్పగలము, ‘మరణమా నీ ముల్లెక్కడ’?—హోషేయ 13:14. (g91 2/8)