మసరెటిక్ మూలపాఠం అంటే ఏమిటి?
మీరు ఏ భాషలో బైబిలును చదివినప్పటికీ, హెబ్రీ లేఖనాలు అంటే “పాత నిబంధన” ఉన్న మసరెటిక్ మూలపాఠం నుండే దానిలోని కొంత భాగం నేరుగాగానీ లేక మరో విధంలోగానీ అనువదించబడి ఉంటుంది. అసలు, మసరిటిక్ మూలపాఠాలు చాలా ఉన్నాయి. కనుక దేన్ని ఎన్నుకోవడం జరిగింది, మరియు ఎందుకు? వాస్తవానికి, మసరెటిక్ మూలపాఠం అంటే ఏమిటి, మరి అది నమ్మదగినదేనని మనకు ఎలా తెలుసు?
యెహోవా వాక్యం
సా.శ.పూ. 1513 నందు బైబిలు రచన సీనాయి పర్వతంపై ప్రారంభమైంది. నిర్గమకాండము 24:3, 4 మనకు ఇలా చెబుతోంది: ‘మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు—యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసెను.’
హెబ్రీ లేఖనాలను వ్రాసేందుకు వెయ్యి సంవత్సరాలు కంటె ఎక్కువ కాలం పట్టింది, అంటే సా.శ.పూ. 1513 నుండి సా.శ.పూ. 443 వరకు. వ్రాసినవారు దేవుని వల్ల ప్రేరేపించబడినవారు కనుక, తన సమాచారం నమ్మకంగా భద్రపర్చేందుకు విషయాలను ఆయన నడిపిస్తాడనడం సమంజసంగా ఉంటుంది. (2 సమూయేలు 23:2; యెషయా 40:8) అయితే, ప్రతులను తయారు చేసేటప్పుడు ఒక్క పొల్లుపోకుండా యెహోవా మానవ పొరపాట్లన్నింటినీ తీసివేస్తాడని దాని భావమా?
అప్రమాణికతకు ద్వారం తెరచుకుంది
దేవుని వాక్యం ఎడల లోతైన గౌరవంగల వ్యక్తులే ఒక తరం తర్వాత మరో తరంవారు ప్రతులను వ్రాసినప్పటికీ, ఆ వ్రాతప్రతుల్లో కొన్ని మానవ పొరపాట్లు చొరబడ్డాయి. బైబిలు రచయితలు ప్రేరేపించబడ్డారు కానీ ప్రతులను వ్రాసిన వారు ప్రేరేపించబడలేదు.
సా.శ.పూ. 537 నందు బబులోను చెరలోనుండి తిరిగి వచ్చిన తర్వాత, బబులోనునందు నేర్చుకున్న చదరపు ఆకారంలో ఉన్న క్రొత్త వ్రాత విధానాన్ని యూదులు స్వీకరించారు. ఈ ప్రాముఖ్యమైన మార్పు దానితో ముడివడివున్న దాని స్వాభావిక సమస్యను తెచ్చింది—అదేంటంటే ఒకేలా కనిపించే అక్షరాలను ఒకదాన్ని మరొకటని పొరబడడం. చదువరి సందర్భానుసారంగా అర్థం చేసుకున్నదాన్నిబట్టి హల్లులను చేర్చుకుని చదివే హెబ్రీ భాషన్నది అచ్చులపై ఆధారపడినది కనుక, ఓ అచ్చులో కొంత తేడా ఓ పదం భావాన్ని సులభంగా మారుస్తుంది. అయితే, అనేక సందర్భాల్లో, అలాంటి తప్పులను కనుక్కొని సరిచేయడం జరిగింది.
బబులోను నాశనమైపోయిన తర్వాత అనేకమంది యూదులు ఇశ్రాయేలుకు తిరిగి రాలేదు. ఆ విధంగా, మధ్య ప్రాశ్చము మరియు ఐరోపానందంటిలోనూ సమాజ మందిరాలు యూదా సమాజాల ఆత్మీయ కేంద్రాలయ్యాయి.a ప్రతి సమాజ మందిరానికీ లేఖనాల గ్రంథపు చుట్టలు కావాలి. ప్రతులు విస్తరిస్తున్న కొలది, లేఖికులు చేసే తప్పులు పెరుగుతూ వచ్చాయి.
ద్వారాన్ని మూసే ప్రయత్నాలు
సా.శ. మొదటి శతాబ్దం ప్రారంభంలో, ఇతర హెబ్రీ లేఖనాల గ్రంథపు చుట్టలను సరిచేసేందుకు నమూనా మూలపాఠాన్ని స్థిరపర్చేందుకు యెరూషలేములోని శాస్త్రులు ప్రయత్నించారు. అయినప్పటికీ, ఇది అసలు మూల పాఠ్యభాగమని మరియు ఇది లేఖికులు చేసిన తప్పులున్న వ్రాతప్రతులని వాటి మధ్య తేడాను చూపించేందుకు ఒక నిర్దిష్టమైన విధానం లేదు. సా.శ. రెండవ శతాబ్దంనుండి, అప్పటికి అది అధికారికంగా ఆమోదించబడకపోయినప్పటికీ, హెబ్రీ లేఖనాల అచ్చు మూలపాఠాలు ఓ మోస్తరుగా ప్రమాణీకరించబడ్డాయని అనిపిస్తుంది. టాల్ముండ్ నందు (సా.శ. రెండు మరియు ఆరవ శతాబ్దం మధ్య కాలంలో వ్రాయబడింది) కనిపించే హెబ్రీ లేఖనాలు, ఆ తర్వాత మసరెటిక్ మూలపాఠంగా పేరుగాంచిన మూలానికి తరచూ వేరైన దాన్ని సూచించింది.
“పారంపర్యం” అన్నదాని హెబ్రీ పదం మసరా లేక మసరెత్. సా.శ. ఆరవ శతాబ్దానికల్లా, హెబ్రీ లేఖనాలను ప్రామాణికంగా కాపీ చేసే పారంపర్యాన్ని కాపాడిన వారు మసరెట్లు అయ్యారు. వారు చేసిన ప్రతులు మసరెటిక్ ప్రతులుగా సూచించబడేవి. వారి పని మరియు వారు తయారు చేసిన పాఠ్యభాగాలను గూర్చి ప్రత్యేకమైన విషయమేమిటి?
హెబ్రీ భాష సజీవమైన భాషగానూ జాతీయ భాషగాను ఉండకుండా మరుగునపడిపోయింది మరి అనేకమంది యూదులు దాన్ని మాట్లాడడం మానేశారు. కనుక, అచ్చులతో ఉన్న బైబిలు గ్రంథభాగాన్ని గూర్చిన సరైన అవగాహన అపాయంలో పడింది. దాన్ని కాపాడేందుకు మసరెట్లు చుక్కలు మరియు డాష్లు లేక పాయింట్ల ద్వారా సూచించబడే అచ్చుల విధానాన్నొకదాన్ని తయారుచేశారు. వీటిని హల్లుల పై భాగాన మరియు క్రింది భాగాన పెట్టడం జరిగేది. మసరెట్లు అటు ఉచ్చారణ విధానంగానూ మరియు మరింత కచ్చితమైన ఉచ్చారణను ఎలా చేయాలో చూపించే విధానంగానూ పనిచేసేందుకు ఓ క్లిష్టమైన పద్ధతిని తయారు చేశారు.
ముందు తరాల శాస్త్రులు మూల పాఠాన్ని మార్చారనో లేక తప్పుగా ఎక్కించారనో మసరెటిక్ భావించినట్లైతే, దాన్ని మార్చే బదులు, ప్రక్క మార్జిన్లలో వాటిని వ్రాశారు. వారు అసాధారణమైన పద కూర్పులను మరియు చేర్పులను, అంతేకాకుండ ఓ పుస్తకంలో లేక హెబ్రీ లేఖనాలంతటిలోనూ అవి ఎన్నిసార్లు కనిపిస్తాయో అన్నదాన్ని గూర్చి కూడా వారు అక్కడ వ్రాశారు. ఇతరవాటితో పరిశీలనను జరిపేటప్పుడు లేఖికులకు సహాయపడడానికి అదనపు వ్యాఖ్యానాలను కూడా అందించారు. ఈ సమాచారాన్ని ఎంతో క్లుప్తంగా వ్రాసివుంచేందుకు, సంక్షిప్త “కోడ్ల” విధానం అభివృద్ధి చేయడం జరిగింది. లేఖనాలపై వ్యాఖ్యానాలను గూర్చి ప్రక్క మార్జిన్లలో వ్రాయబడినవాటిని పైన క్రింది మార్జిన్లలో ఓ చిన్న లేఖన పదసూచిక ఇవ్వబడింది.
గలిలయ సముద్రం ప్రక్కన ఉన్న టైబీరియస్నందలి మసరెటెస్లు ఎంతో ప్రఖ్యాతిగాంచిన విధానాన్ని వృద్ధిచేశారు. సా.శ. తొమ్మిది మరియు పదవ శతాబ్దములోని బెన్ అషేర్ మరియు బెన్ నఫ్తాలీ కుటుంబాలు, బహుశ కారాయిట్లు ప్రత్యేకంగా ప్రాముఖ్యతనొందారు.b ఈ పాఠశాల ఉచ్చారణ పద్ధతులు మరియు వ్రాతల మధ్య తేడాలున్నప్పటికీ, పూర్తి హెబ్రీ లేఖనాలందు పది కంటే తక్కువ ప్రాంతాల్లో వాటి మూలపాఠ అచ్చుల్లో మాత్రమే తేడా కనిపిస్తుంది.
బెన్ అషేర్ మరియు బెన్ నఫ్తాలీల రెండు పాఠశాలలూ తమ కాలంలోని లిఖిత పాండిత్యానికి ఎంతో సహాయాన్ని అందించారు. బైన్ అషెర్ పాఠ్యభాగాన్ని మైమోనిడెస్ (12వ శతాబ్దానికి చెందిన ప్రభావంగల టాల్ముడ్ విద్వాంసుడు) మెచ్చుకున్న తర్వాత, ఇతరులు దానికి పూర్తి ప్రాముఖ్యతనిచ్చారు. ఎంత మేరకు వెళ్ళారంటే, బెన్ నఫ్తాలీ వ్రాత ప్రతి నేడు ఎక్కడా కనిపించదు. మిగిలినవన్నీ రెండు పాఠశాలల మధ్యనున్న తేడాల చిట్టా మాత్రమే. పరిహాసాస్పదముగా చెప్పాలంటే, మైమోనిడెస్ వ్యాఖ్యానాలు, పేరాల మధ్యనున్న స్థలం వంటి రూపురేఖలకు సంబంధించినవే గానీ, సరైన అనువాదానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన విషయాలు కాదు.
“శుద్ధమైన” మసరెటిక్ మూలపాఠాన్ని మనం కనుగొనగలమా?
నేడు అందుబాటులో ఉన్న ఏ కోడెక్స్ “శుద్ధమైన” బెన్ అషేర్ టెక్స్ట్ ఏది అన్న విషయంలో వేదాంతుల మధ్య ఎంతో వివాదం ఉంది, అది “నిజమైన” మసరెటిక్ మూలపాఠాన్ని అందిస్తుందన్నట్లుగా ఉంది. నిజానికి, ఒక్క “శుద్ధమైన” అధికారిక మసరెటిక్ ఎన్నడూ లేదు. బదులుగా, ఒకటి మరొకదానితో కాస్త భిన్నంగా ఉంటూ అనేక మసరెటిక్ మూలపాఠాలుండేవి. ప్రస్తుతమున్న కోడెక్స్లన్ని కూడా వేరేవాటితో, అటు బెన్ అషెర్ మరియు బెన్ నఫ్తాలీ మూలపాఠాలతో కలపబడినవే.
హెబ్రీ లేఖనాలను అనువదించే ఏ అనువాదకుడైన తాను చేయవల్సిన పని ఎంతో ఉంది. అతను హెబ్రీ మూలపాఠాన్ని మాత్రమే కాకుండ, మూల పాఠంలో మార్పులు జరిగినచోట లేక లేఖికులుగానీ, ఇతరులుగానీ చేసిన పొరపాట్లలను సహితం అతను తెలుసుకుని ఉండాలి. వివిధ మసరెటిక్ మూల పాఠాల ఆధారంగా ఉన్నప్పటికీ, బహుశ హల్లుల పాఠ్యభాగపు మరింత పురాతన మరియు సరైన అనువాదాలు గల నమ్మదగిన ఇతర మూలాలను అతను పరిశీలించాల్సి ఉంటుంది.
ద టెక్స్ట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అనే తన పుస్తకంలోని ఉపోద్ఘాతంలో ఎర్నస్ట్ వ్యూర్ల్వైన్ ఇలా వివరిస్తున్నాడు: “ఒక కష్టతరమైన పాఠ్యభాగము తారసిల్లినప్పుడు, కొన్నిసార్లు హెబ్రీ మూలపాఠాన్ని, కొన్నిసార్లు సెప్టుజిన్ట్ను మరియు మరితర సమయాల్లో అరమిక్ టార్గమ్ వంటి ఏవేవో వివిధ అనువాదాలను సమకూర్చి, తేలికైన పరిష్కారాన్ని అందించే దాన్ని ఎన్నుకోలేము. మూలపాఠ సూచనలన్నీ కూడా నమ్మదగినవి కావు. ప్రతిదానికి దాని విశేషలక్షణం, దానిదైన చరిత్ర ఉంటాయి. మనం సరిపోని లేక తప్పుడు పరిష్కారాలను నివారించాలని నిరీక్షిస్తున్నట్లైతే మనం వీటిని గూర్చి బాగా తెలుసుకుని ఉండాలి.”
యెహోవా తన వాక్యాన్ని కాపాడాడని నమ్మేందుకు మనకు పూర్తి ఆధారం ఉంది. శతాబ్దాలుగా అనేకమంది యథార్థమైన వ్యక్తుల సమిష్టి కృషి వల్ల, బైబిలు సమాచారపు వాస్తవాంశము, దానిలోని విషయము మరియు వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అచ్చులోనేగానీ లేక పదంలోనేగానీ చేసిన చిన్న మార్పులు లేఖనాలను గూర్చిన మన అవగాహనను ప్రభావితం చేయలేదు. ఇప్పుడు, ప్రాముఖ్యమైన ప్రశ్నేమిటంటే, మనం దేవుని వాక్యమైన బైబిలు ప్రకారంగా జీవించగలమా?
[అధస్సూచీలు]
a అలక్సాండ్రియా, ఈజిప్ట్, వంటివాటిలో ఉన్నటువంటి యూదా సమాజంవారిలా, ఇశ్రాయేలుకు వెలుపల ఉన్న అనేకమంది యూదులు ఇక ఎంత మాత్రమూ హెబ్రీని ధారాళంగా చదివేవారు కాదు కనుక, బైబిలును ప్రాంతీయ భాషలోకి అనువదించాల్సిన అవసరతను గుర్తించారు. ఈ అవసరాన్ని పూరించేందుకు సా.శ.పూ. మూడవ శతాబ్దంలో గ్రీకు సెప్టుజిన్ట్ వర్షన్ తయారుచేయబడింది. ఈ అనువాదం మూలపాఠ విమర్శకు తర్వాత ఎంతో ప్రాముఖ్యమైన మూలమౌతుంది.
b సుమారు సా.శ. 760 కాలంలో, లేఖనాలకు కచ్చితంగా హత్తుకుని ఉండాలని కారాయిట్లు అనే యూదా గుంపు నొక్కి తెలిపింది. రబ్బీల అధికారాన్ని, “నోటిమాట సూత్రాలను” మరియు టాల్మండ్ను తృణీకరించడంవల్ల, క్రమంగా బైబిలు మూల పాఠాన్ని వారు సంరక్షించేందుకు వారికి ఎంతో గొప్ప కారణం ఉంది. ఈ గుంపులోని కొన్ని మసరెటిక్ కుటుంబాలు నిపుణతగల మసరెటిక్ లేఖికులయ్యారు.
[26వ పేజీలోని చిత్రం]
అలపో కోడెక్స్ నందు మసరెటిక్స్ మూలపాఠం ఉంది
[క్రెడిట్ లైను]
Bibelmuseum, Münster