ఇండియాలోని కోతవిషయమై ఆనందించుట
యఫ్. ఇ. స్కిన్నర్ చెప్పినట్లుగా
నాకు నమ్ముటకు చేతకావటంలేదు—పది భాషలలో జరిగిన 21 సమావేశములలో దైవికన్యాయమునుగూర్చి నేర్చుకొనుటకు 15,000 మంది హాజరై, న్యాయమునకు మహాదేవుడైన యెహోవాయెడల తమకుగల ప్రేమకు గుర్తుగా 545 మంది బాప్తిస్మము పొందారు! ఇండియాలోని 9,000 మంది యెహోవాసాక్షులకు యిది 1989వ సంవత్సరమునకు ఒక ఉన్నతాంశము. కాని, నాకు మాత్రము అది ప్రత్యేకముగా ఆనందించుటకు కారణము. ఎందుకు? మొదట నేను 1926 జూలైలో ఇండియా భూమిపై కాలుపెట్టినప్పుడు యిట్టి గొప్పసంగతులను ఏమాత్రము ఊహించలేదు. దేశము మొత్తము మీద రాజ్యవర్తమానపు ప్రచారకులప్పుడు 70మందికంటే తక్కువగాయుండిరి. దాదాపు 64 సంవత్సరముల క్రితము నేను నా తోటిపనివాడు ఎటువంటి నియామకమును పొందితిమి!
ఇండియాకు నేను ఎలా వచ్చాను
1926 మేలో ఇంగ్లాండునందలి లండన్లో జరిగిన పెద్దసమావేశమునకు హాజరై వెంటనే షీఫీల్డ్లోని మాయింటికి తిరిగివచ్చాను. కొద్దిదినములైన తరువాత ప్రాంతీయపరిచర్యనుండి యింటికి వచ్చాక టెలిగ్రాము వేచియున్నది. దానిలో “జడ్జి రూథర్ఫర్డ్ మిమ్ములను కలవాలనుకుంటున్నాడు” అని ఉంది.
వాచ్టవర్ సొసైటి రెండవ అధ్యక్షుడైన సహోదరుడు రూథర్ ఫర్డ్ ఇటీవల జరిగిన సమావేశమునకు న్యూయార్కునుండి వచ్చి యింకా లండన్లోనే ఉన్నాడు. మరుసటి ఉదయము లండన్కు తిరిగివెళ్లు రైల్లో కూర్చొని “ఇది ఎందుకైయుంటుందని” ఆలోచిస్తూ ఉన్నాను. బ్రాంచి ఆఫీసులో సహోదరుడు రూథర్ఫర్డ్ దగ్గరకు తీసుకెళ్లగా “ప్రపంచములో ఫలాన ప్రాంతములోనే నీవు పనిచేయాలనుకుంటున్నావా?” అని అడిగాడు.
అందుకు “లేదు” అని అన్నాను.
“ఇండియాకు వెళ్లుటను ఎలా యిష్టపడుతావు?”
వెంటనే తడబడకుండా “నన్నెప్పుడెళ్ల మంటావు” అని సమాధానమిచ్చాను? ఆ విధముగా నేను జార్జి రైట్ మూడువారాల తరువాత ఇండియాకు వచ్చు ఓడలో ప్రవేశించాము. అప్పటికి 31 సంవత్సరములు గల నాకు హృదయమందేగాని మనస్సునందేగాని నాజీవితముతో ఏమి చెయ్యాలను వేరే ప్రశ్నేలేదు.
జీవితమార్గమును నిర్ణయించుకొనుట
మొదటిప్రపంచయుద్ధము 1918లో ముగిసేవరకు అప్పటికే బ్రిటీషుసైన్యములో 4 సంవత్సరములు పూర్తిచేశాను. ఫొటోగ్రఫీ, మరియు రేడియోప్రసారమందు ఆసక్తికలిగి యుండేవాన్ని. మంచి వ్యాపార అవకాశములు నాముందున్నవి. వివాహమునుగూర్చియు తలంచుచున్నాను. అయితే, అదేసమయములో నా జీవిత యావత్ ముఖ్యోద్దేశ్యమును మార్చు విషయముల గ్రహింపుకు అప్పుడే వచ్చుచున్నాను.
నా తండ్రి స్టడీస్ ఇన్ ది స్క్రిప్చ్ర్స్ సెట్ను తీసుకొనియున్నాడు. ఒక కల్పోచర్—ఆకాలమందు పయినీర్లకు ఉపయోగించిన పేరు—మా కుటుంబముతో పఠించుట ప్రారంభించినది. ఆ స్త్రీ ఒక పాఠశాల ఉపాధ్యాయిని. కొంతకాలానికి నావయస్సువారైన కొంతమందిమి ప్రతిశనివారము ఒక కప్పు టీ మరియు బైబిల్ పఠనముకొరకు ఆమె యింటికి వెళ్లుచుంటిమి. ఆమె పదేపదే మమ్ములను మీరు యెహోవాకు అందుబాటులోయుంచుకొని “ఎప్పుడును, ఒక అసైన్మెంట్ను తిరస్కరించకుడి” అని చెప్పుచుండేది. మరియు ఆమె, నన్ను అవివాహితునిగానే యుండమని కూడా ప్రోత్సహించినది.
కొంతకాలము నేను ఏమిచేయాలను దానిని గూర్చి పోరాటము సలిపితిని. చివరకు మత్తయి 19:21లో ధనికుడైన యౌవన పాలకునికి యేసు చెప్పిన మాటలు నాకు సహాయముచేసినవి. అవేమనగా: “నీవు పరిపూర్ణుడగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చినన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.” నేను బలంగా పనిచేయుచున్న పనికి నా రాజీనామాను అందజేసి మూడునెలలో కల్పోచర్నైతిని. ఇది మరియు అవివాహితునిగానే నుండవలెనను నా తీర్మానము ఆ తదుపరి నాలుగు సంవత్సరములకు ప్రశస్తమైన ఇండియా అసైన్మెంటుకు నన్ను అర్హున్ని చేసినవి.
బహువిస్తారమైన క్రొత్త ప్రాంతము
జార్జి రైట్ మరియు నేను ఇండియాలోనేగాక బర్మా (ఇప్పుడు మ్యాన్మార్) మరియు సిలోన్ (ఇప్పుడు శ్రీలంక) ఆ తరువాత కలుపబడిన పర్షియా (ఇప్పుడు ఇరాన్) మరియు ఆఫ్ఘనిస్తాన్ నందలి రాజ్యప్రకటనపనిని పర్యవేక్షించునట్లు నియమింపబడితిమి. ఇండియాయొక్క ప్రాంతము సంయుక్త రాష్ట్రములకంటె కొంచెము తక్కువగాయుండును. అయితే జనసంఖ్యమాత్రము దానికంటె ఎన్నోరెట్లు ఎక్కువ. అది పలువిధములైన ఆహారములు, ఆచారములు, భాషలతో భిన్నమైన మతనమ్మకములుగల ప్రజలగు—హిందువులు, ముస్లీములు, పార్సీలు, జైనులు, బౌద్ధులు అలాగే కేథలిక్కులు మరియు ప్రొటెస్టెంటులు గల భూమి.
హిందూదేశములో 1905లో ప్రారంభమైన ఈ ప్రకటనపని, వాచ్టవర్సొసైటి మొదటి అధ్యక్షుడైన చార్లెన్ టి. రస్సల్ 1912లో ఇండియాను దర్శించుటతో ఉరవడియైనది. ఆసక్తిగల యౌవనుడైన బైబిల్ విద్యార్థియగు ఎ. జె. జోసఫ్తో రస్సల్ వ్యక్తిగతముగా మాట్లాడుట యెడతెగక జరుగు ప్రకటన కార్యమునకు శాశ్వత ఏర్పాటు జరుగబడులాగున నడిపినది. జోసఫ్ తనస్వంత భాషయగు మళయాలములోనికి బైబిల్ లిటరేచర్ను తర్జుమాచేసి ఎక్కువగా దక్షిణ ఇండియాలో ఎంతోదూరము ప్రయాణముచేస్తు విస్తారముగా ప్రసంగించెను. ఈనాడు ఆ ప్రాంతములో ఇండియాలోని జనాబాలో 3 శాతము మంది యున్నను ప్రచారకులలో సగముమంది మళయాలము మాట్లాడు ఆ ప్రాంతమందే నివసిస్తున్నారు. ఇంతకు క్రితము ట్రావన్కూర్, మరియు కొచ్చిన్ అయిన ఈ ప్రాంతము 1956లో కేరళ రాష్ట్రముగా అయినది.
నేను జార్జిరైట్ బాంబే ఆఫీసుపనిని ఒకరికొకరము మార్చుకొంటు దూరప్రాంతములకు ప్రకటన యాత్రకు వెళ్లేవారము. ఇండియా రైలుమార్గములను, గుర్రము, మరియు ఎద్దులబండ్లను పూర్తిగా ఉపయోగించుకున్నాము. ఆ తరువాత ఒక కారును ఉపయోగించాము. ఆ కాలములో కేవలము లిటరేచర్ను అందిస్తూ సమూహపఠనమునకై కూటముల స్థలమునకు ఆహ్వానించే తలంపుమాత్రమే యుండేది. మేము మా అవధానమును ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడు నామకార్థ క్రైస్తవులపై కేంద్రీకరించితిమి.
మొదట నాకు వాచ్టవర్ చందాదారులందరి పేర్లు, అడ్రసులు యివ్వబడినవి. చాలావరకు వీరందరు రైల్వేవారు లేక టెలిగ్రాఫ్వారు. నిజమైన ఆసక్తియున్నదేమో కనుగొనుటకు వారిలోయున్న ప్రతి ఒక్కరిని కలిసితిని. అనేక సంవత్సరములు జనవరినెలలో ఉత్తర ఇండియాలోని పంజాబ్కు వెళ్లి, లాహోరు నుండి కరాచి వరకు ప్రయాణించేవాన్ని. చాలమంది ప్రజలు బైబిలుయెడల అయిష్టము కలిగియుందురు గనుక నామకార్థ క్రైస్తవులు ఉన్న గ్రామాలు చాలా తక్కువగాయుండేవి. అవియు ఒకదానికొకటి చాలా దూరంలోయుండేవి.
ఒక సహోదరుడు తర్జుమాచేయువానిగా నాతోపాటు వచ్చేవాడు. మేము ప్రజలయొద్దనే తింటూ, వారితోనే వుండేవాళ్లము. గ్రామస్తులు ఎండిపోయిన మట్టితో నిర్మింపబడిన యిండ్లలో జీవించేవారు. పైకప్పులు కర్రతో లేక తాటాకుతో వేయబడినవి. తరచు వ్యవసాయదారులు రెండునుండి మూడు అడుగుల పొడవుగల కొనతో యుండు గొట్టముద్వారా పొగత్రాగుతూ మధ్య త్రాళ్లతో అల్లబడియుండు నాలుగుకాల్ల చెక్కమంచముపై, కూర్చొనియుండి మేము వారికి బైబిలు సత్యములను వివరించుకొలది ఒకలేఖనమునుండి మరొక లేఖనమును త్రిప్పుచుండేవాళ్లు. సంవత్సరములో ఎక్కువభాగము వర్షములేకుండాయుండును కావున ఆరుబయట కూటములను జరుపుకొనుట ప్రయోజనకరముగా యుండేది. చాలామంది యూరోపియన్లు అట్టి కూటములకు హాజరగుటను అగౌరవముగా దృష్టించువారైయుండగా భారతీయులు మాత్రము ఎక్కడైనా హాజరయ్యేవారు.
లిటరేచర్ను సాధ్యమైనన్ని భాషలలో ప్రచురించుటకు మేము ప్రయత్నించాము. కన్నడభాషలో వరల్డ్ డిస్ట్రెస్ అను చిన్నపుస్తకము ప్రత్యేక విజయమును సాధించినది. ఒక కన్నడ మతపత్రిక మన శీర్షికలను తనపత్రికకు అందించునట్లు మమ్ములను కోరునట్లు అది నడిపించినది. కొంతకాలము ప్రతి పదునైదు రోజులకు సీరియల్గా డెలివరన్స్ పుస్తకమును అందించాము.
1926 నుండి 1938 మధ్య సంవత్సరములందు ఉత్సాహవంతమైన పయినీర్లద్వారా ఎంతో ఎక్కువ ప్రకటనపని జరుగబడినది. వేలాదిమైళ్లు ప్రయాణముచేసి ఎంతో పెద్దమొత్తములో సాహిత్యములను అందించాము. కాని అభివృద్ధిమాత్రము తగుమాత్రముగానే యుండెను. 1938వ సంవత్సరమునకు ఇండియా యంతట చెదరియున్న 24 సంఘములలో కేవలము 18 మంది పయినీర్లు, 273మంది ప్రచారకులు మాత్రమే యుండిరి.
రెండవప్రపంచ యుద్ధకాలములో
1939లో రెండవ ప్రపంచయుద్ధము ప్రారంభమైనను, మేము ప్రకటన పనితో కొనసాగితిమి. వాస్తవమునకు 1940 సంవత్సరపు తొలిభాగములో వీధిసాక్ష్యము పరిచయము చేయబడినది. అయితే స్థానిక అలవాటులనుబట్టి ఎంతో గుర్తింపు దాయకమైన ఆపనిలో ఇండియాలోని సహోదరీలును భాగము వహించిరి. ఆ పనిలో భాగము వహించమని అడిగిన ఒక సహోదరితో ఒక బైబిలు విద్యార్థిని యిలా అన్నది: “నేను భారత స్త్రీని. వీధిలో ఒక పురుషునితో మాట్లాడుచున్నట్లు చూడబడిన మా పొరుగువారిలో నేను చాలా అగౌరవముగా యెంచబడుదును. నా బంధువైనను వీధిలో కనపడినప్పుడు నేను మాట్లాడలేను.” అయినను ఇండియాలోని మన క్రైస్తవసహోదరీలు మాత్రము ఆసక్తితో బహిరంగముగా ప్రకటించు పరిచారకులైరి.
ఆ తొలి సంవత్సరములలో సమావేశములును ఏర్పాటుచేయబడినవి. ఉదయకాలమందు దారిలో కనిపించేవారికి, అచ్చటి నివాసులకు బహిరంగకూటములనుగూర్చి చెప్పుకుంటూ కొన్నిమైళ్లదూరము వెళ్లేవారము. వీటిలో ఒకదానికి 300 మందికిపైగా హాజరయ్యారు కార్యక్రమములు వెదురు మరియు తాటి మట్టలతో వేయబడిన కప్పుక్రింద జరిగినవి. చాలాకొద్దిమందికే టైమ్పీస్లు ఉండేవి గనుక ప్రారంభసమయమును చెప్పుట అంత ప్రయోజనకరముగా యుండేదికాదు. వారి వారి యిష్టప్రకారము బుద్ధి పుట్టినపుడు వచ్చేవారు. తగినంతమంది వచ్చినతరువాత కూటములు ప్రారంభమయ్యేవి. అటుయిటు తిరుగుకుంటూ వచ్చేవారు మీటింగ్ జరుగుతుండగా వచ్చేవారు.
కార్యక్రమము రాత్రి 10 గంటలవరకు జరుగుతుండేది. ఆ తరువాత యింటికి వెళ్లటానికి అనేకమంది మైళ్లదూరము వెళ్లవలసివచ్చేది. మంచివెన్నెల రాత్రియైతే చల్లగా బాగుంటుంది. అలా వెన్నెల లేకున్న తాటాకు కొమ్మలను దివీటీమాదిరి మెలిచేవారు. దాన్ని అంటించినప్పుడు వెలుతురు ఎరుపుగాయుండేది. వెలుతురు యింకా ఎక్కువకావాలనుకుంటే ఆదివిటీని గాలిలో ఎత్తుగా పెట్టి మంటలు వచ్చేలాగున పట్టుకొందురు. అది దారి కనపడులాగున కావలసినంత వెలుతురునిచ్చేది.
ఈ సమయములో సొసైటి సాహిత్యమును ఇండియాకు మరియు సిలోన్కు దిగుమతి చేసికొనుటపై ప్రభుత్వము నిషేధించినది. ట్రావన్కూర్లోయున్న మాచిన్న ప్రింటింగ్ప్రెస్ మూసివేయబడుటతో పాటు కేంద్రప్రభుత్వము మా సాహిత్యపు ముద్రణను నిషేధిస్తూ ఆజ్ఞను జారీచేసినది. తరువాత 1944లో, వైద్యుడైన ఒక సహోదరుడు వైస్రాయ్ కేబినెట్లో మంత్రిగాయున్న సర్ శ్రీవాత్సవగారితో ఈ నిషేధమునుగూర్చి ప్రస్తావించిరి.
“సరే భయపడవద్దు,” మిస్టర్ జెన్కిన్స్ (మన పనియెడల అయిష్టతతోయున్న మినిస్టర్) త్వరలో రిటైర్ కాబోతున్నాడు, అతనిస్థానములో తనకు మంచి స్నేహితుడు వస్తున్నాడని వివరించాడు. “మిస్టర్ స్కిన్నర్ను రమ్మనమను నేను సర్ ఫ్రాన్సిస్ మూడితో పరిచయము చేస్తాను” అని చెప్పాడు. ఈయన జెన్కిన్స్ స్థానములో వచ్చేవాడు. చివరకు నన్నుపిలిచారు. మిస్టర్ మూడితో నేను మాట్లాడాను. డిశంబరు 9, 1944లో నిషేధము అధికారపూర్వకముగా తీసివేయబడినది.
సంతోషించుటకు కారణములు
మొట్ట మొదటిగా 1947లో గిలియడ్ శిక్షణపొందిన మిషనరీలు ఇండియాకు వచ్చినపుడు గొప్పసంతోషమునకు అదికారణమాయెను. వారి రాక ఇండియాచరిత్రలో మంచి సమయములో జరగటం సంభవించినది. ఎందుకనగా ఆ సంవత్సరము ఆగస్టు 15న, బ్రిటీషు పరిపాలననుండి స్వాతంత్ర్యము లభించినది. దేశము హిందూ ఇండియాగా, ముస్లీమ్ పాకిస్తాన్గా విడిపోవుట జరిగి రక్తపాతమయమైన వధలు జరిగెను. ఇట్లున్నను ఇద్దరు గిలియడ్ పట్టభద్రులు పాకిస్తాన్కు పంపబడిరి. అది ఆగస్టు 14న స్వాతంత్ర్యదేశమైనది. త్వరలో ఇండియాలోనే 10 మంది మిషనరీలు పనిచేయుట జరిగి ఆ తదుపరి సంవత్సరములో అనేకులు వచ్చారు.
సంస్థాపరమైన మార్పులు చేయబడినప్పుడు నా హృదయమునకు ఎక్కువ సంతోషము కలిగినది. 1955లో సర్క్యూట్ పనిప్రారంభమై, గిలియడ్ పట్టభద్రుడైన డిక్కాట్రిల్ మొట్టమొదటి సర్క్యూట్ ఓవర్సీర్గా నియమింపబడెను. ఆయన 1988లో మరణించునంతవరకు నమ్మకముగా సేవించెను. తరువాత 1960లో క్రమమైన జిల్లాకాపరి ఏర్పాటు చేయబడినది. ఇది సర్క్యూట్లకు ఎంతో సహాయపడినది. 1966 తరువాత దేశములోనికి యితరదేశ మిషనరీలు ఎవరును అనుమతించబడలేదు. త్వరలో స్పెషల్ పయినీర్ల పని ప్రారంభించబడి, అర్హులైన ఇండియన్ పయినీర్లు ఇండియాలోని అనేక ప్రాంతములకు పంపబడ్డారు. ఈనాడు దాదాపు 300 మంది ఈ పనిలో యున్నారు. చివరకు 1958 వరకు మేము రాజ్యప్రచారకులలో 1,000ని చేరుకోలేదు. ఆ తరవాత వేగము పుంజుకొన్నది. ఇప్పుడు 9,000లకు పైగా ప్రచారకులను కలిగియున్నాము. ఇంకను మా 1989 మెమోరియల్కు వచ్చిన 24,144 హాజరు అనేకమంది ఆసక్తిగలవారు ఇంకను సహాయముకొరకు వెదకుచున్నారని చూపుతున్నది. ఇప్పుడు శ్రీలంక ప్రత్యేక బ్రాంచిగా తయారయినది. 1944లో వారు ఇద్దరు ప్రచారకులనుండి దేశములో పోరాటమున్నను ఈనాడు వారు 1,000మందికి పెరిగారని చూచుట ఎంత సంతోషముగా యున్నది.
ప్రచారకులలో అభివృద్ధి అనినప్పుడు మా బ్రాంచిలోను అభివృద్ధియనియే దాని భావము. బహు సందడిగాయుండు బొంబాయిలో 52 సంవత్సరములున్న తరువాత మాహెడ్క్వార్టర్స్ను దగ్గరలోని పట్టణమైన లోనవ్లాకు మేము మార్చితిమి. ఎంతో సున్నితమైన మెప్స్ కంప్యూటర్స్ను అనేక ఇండియన్ భాషలలో సాహిత్యమును ముద్రించుటకు పెద్ద రెండురంగుల ముద్రణాయంత్రములను కలిగియుంటామని నేనెన్నడు ఊహించలేదు. ఈనాడు వాచ్టవర్ 9 భాషలలోను, యితరసాహిత్యములను 20 విభిన్న భాషలలోను ఉత్పత్తి చేయుచున్నాము.
మేమిద్దరమున్న బ్రాంచి ఆఫీసు దినములు గతించాయని చెప్పనవసరము లేదనుకుంటాను. ఇప్పుడు 60 మందికంటె ఎక్కువమంది సభ్యులముగల బేతేలు కుటుంబమును కలిగియున్నాము. 95 సంవత్సరముల వయస్సులో బ్రాంచి ఆఫీసులో పూర్తికాలసేవలోయుంటూ ఇండియాబ్రాంచి కమిటీలో ఒక సభ్యునిగాయుంటూ సేవచేయుటకు ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ అంత్యదినములలో కోతపనిని చూచుటయందు ప్రత్యేకముగా పులకరించిపోయాను. నిజముగా అది ఆనందించవలసిన విషయము. (w90 1/1)
[29వ పేజీలోని చిత్రం]