మానవులం మనమెవరం?
తామెవరమై ఉన్నామనే విషయంలో మానవులకు గుర్తింపు సమస్య ఉన్నట్టు కనబడుతోంది. పరిణామవేత్త రిచర్డ్ లీకే ఇలా పేర్కొంటున్నాడు: “శతాబ్దాలుగా తత్వవేత్తలు మానవత్వపు తీరుతెన్నుల్ని గురించీ, మానవ స్వభావపు తీరుతెన్నుల్ని గురించీ పరిశీలించారు. కానీ, మానవత్వపు నాణ్యత విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనమనేదేదీ లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.”
అయినా, కోపన్హేగన్ జూ దాని ప్రయిమేట్ హౌస్లో (పురాతనజీవుల గృహములో) ఒక ప్రదర్శన ద్వారా తన అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేసింది. 1997 బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ ఇలా వివరిస్తోంది: “నరవానరాలతో తమకున్న సన్నిహిత రక్తసంబంధాన్ని సందర్శకులకు గుర్తుచేయాలనే ఉద్దేశంతో ఒక డానిష్ జంట జూలోని తాత్కాలిక నివాసాలకు తరలివెళ్లింది.”
కొన్ని జంతువులకు మానవులతో అలాంటి సన్నిహిత రక్తసంబంధం ఉందనే అభిప్రాయానికి సంప్రదింపు గ్రంథాలు మద్దతునిస్తున్నాయి. ఉదాహరణకు, ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “నరవానరాలూ, లీమూర్లూ, కోతులూ, టార్సియర్లతోపాటూ మానవులు ప్రయిమేట్స్ అని పిలువబడే స్తన్య జీవుల శ్రేణికి చెందుతారు.”
అయినప్పటికీ, జంతువులకు ఉండని అనేక నిరుపమాన లక్షణాలు మానవులకు ఉన్నాయనేది వాస్తవిక విషయం. వీటిలో ప్రేమా, మనస్సాక్షీ, నైతికతా, ఆధ్యాత్మికతా, న్యాయమూ, దయా, చతురోక్తులూ, సృజనాత్మకతా, కాల విలువను తెలుసుకోవడమూ, వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవడమూ, సౌందర్యాన్ని గుర్తించడమూ, భవిష్యత్తు ఎడల శ్రద్ధా, తరతరాలుగా జ్ఞానాన్ని వృద్ధిచేసుకొనే సామర్థ్యమూ, మరణమే మన ఉనికికి ముగింపు కాదనే నిరీక్షణా చేరివున్నాయి.
ఈ లక్షణాల్ని జంతు లక్షణాలతో సమన్వయపర్చే ప్రయత్నంలో కొంతమంది పరిణామవాద మనోవిజ్ఞానశాస్త్రాన్ని సూచిస్తారు, దానిలో పరిణామవాదం, మనోశాస్త్రం, సామాజిక శాస్త్రం సమ్మిళితమై ఉన్నాయి. మానవ స్వభావం విషయంలో తలెత్తిన చిక్కుముడిని పరిణామవాద మనోవిజ్ఞానశాస్త్రం పరిష్కరించిందా?
జీవిత సంకల్పమేమిటి?
“పరిణామవాద మనోవిజ్ఞానశాస్త్రపు పూర్వానుమానం సరళమైనదే” అని పరిణామవేత్త రాబర్ట్ రైట్ అంటున్నాడు. “ఇతర అవయవాలవలే మానవ మనస్సు, తర్వాతి తరానికి జన్యుకణాల్ని (జీన్స్ని) అందించాలనే సంకల్పం కోసమే రూపొందించబడింది; అది కలుగజేసే ఆలోచనానుభూతులను ఈ పూర్వానుమానం ఆధారంగా బాగా అర్థంచేసుకోవచ్చు.” వేరే మాటల్లో చెప్పాలంటే, జీవితానికున్న సంకల్పం యావత్తు, మన జన్యుకణాలచే నిర్దేశించబడి మన మెదడు నిర్వర్తించే విధులలో ప్రతిబింబించబడినట్టుగా పిల్లల్ని కనడమే.
పరిణామవాద మనోవిజ్ఞానశాస్త్రం ప్రకారంగా “జన్యుసంబంధమైన పక్కా స్వార్థాన్ని కల్గివుండడమే మానవ స్వభావపు సారమైవుంది.” నైతిక జంతువు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “పురుషులు లెక్కలేనంతమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కల్గివుండాలని ప్రకృతి వరణము ‘కోరుతోంది.’” ఈ పరిణామవాద సిద్ధాంతం ప్రకారంగా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్త్రీలు అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం కూడా సహజమైనదిగానే పరిగణించబడుతోంది. తల్లిదండ్రులు చూపించే ప్రేమ సహితం, సంతాన మనుగడను కొనసాగింపచేయడానికి జన్యుకణాలు ప్రేరేపించే తంత్రంగానే పరిగణించబడుతోంది. అందుకే, మానవ కుటుంబం నిలిచి ఉండేలా చేయడంలో జన్యుసంబంధిత వారసత్వానికి ఉన్న ప్రాముఖ్యతను ఒక దృక్పథం నొక్కిచెబుతోంది.
ఇప్పుడు వచ్చే స్వయం సహాయక పుస్తకాల్లో కొన్ని ఈ పరిణామవాద మనోవిజ్ఞాన శాస్త్రపు క్రొత్త తరంగంపై ఆధారపడి ఉంటున్నాయి. వాటిలో ఒకటి, మానవ స్వభావం “చింపాంజీ స్వభావంకన్నా, గొరిల్లా స్వభావంకన్నా లేదా బబూన్ స్వభావంకన్నా ఎంతో భిన్నమైందేమీ కాదు” అని వర్ణిస్తోంది. అదింకా ఇలా చెబుతోంది: “పరిణామ సిద్ధాంతం విషయానికి వస్తే, . . . పునరుత్పాదకశక్తే ప్రాముఖ్యమైనది.”
మరో వైపున, పిల్లల్ని కనడంకన్నా మిన్నయైన సంకల్పం నిమిత్తం దేవుడు మానవుల్ని సృష్టించాడని బైబిలు బోధిస్తోంది. మనం దేవుని లక్షణాలను, మరి విశేషంగా ప్రేమా, న్యాయమూ, జ్ఞానమూ, శక్తి వంటి లక్షణాలను ప్రతిబింబించే సామర్థ్యంతో, ఆయన “స్వరూపమందు” సృష్టించబడ్డాం. వీటికి, ముందు ప్రస్తావించబడిన మానవులకున్న నిరుపమానమైన లక్షణాలను చేర్చండి, బైబిలు మానవుల్ని జంతువులకన్నా ఉన్నతమైన స్థానంలో ఎందుకు ఉంచుతుందనే విషయం స్పష్టమౌతుంది. వాస్తవానికి, దేవుడు మానవులను నిరంతరమూ జీవించాలనే కోరికతో మాత్రమే కాదుగానీ, తాను తీసుకొచ్చే నీతియుక్తమైన క్రొత్త లోకంలో ఆ కోరిక తీరడంవల్ల కలిగే ఆనందాన్ని పొందే సామర్థ్యంతో కూడా వారిని సృష్టించాడనే విషయాన్ని బైబిలు బయల్పరుస్తోంది.—ఆదికాండము 1:27, 28; కీర్తన 37:9-11, 29; ప్రసంగి 3:11; యోహాను 3:16; ప్రకటన 21:3, 4.
మన నమ్మకం ఎంతో తేడాను చూపిస్తుంది
మన ఆవిర్భావాన్ని గురించి మనమేం నమ్ముతామనేది మనం జీవించే విధానాన్ని ప్రభావితం చేయగలదు గనుక మనమెవరమై ఉన్నామనే దాన్ని గూర్చిన సరియైన అభిప్రాయాన్ని నిర్ధారించడమనేది ఎంతమాత్రమూ సిద్ధాంతపరమైన విషయం కాదు. చార్లెస్ డార్విన్ రచించిన జాతుల ఉత్పత్తి (ఆంగ్లం) అనే పుస్తకం 1859లో ప్రచురించబడిన తర్వాత అనేకమంది చేరుకున్న నిర్ధారణలను చరిత్రకారుడైన హెచ్. జి. వెల్స్ ఇలా పేర్కొన్నాడు:
“మానవుల్లో నైతికవిలువలు పూర్తిగా దిగజారిపోయాయి. . . . 1859 తరువాత నుండి పూర్తి అపనమ్మకం ఏర్పడింది. . . . మనుగడ కోసం సాగించిన పోరాటాన్నిబట్టే తాము ఆధిపత్యాన్ని సాధించామని పందొమ్మిదవ శతాబ్దాంతానికి చెందిన శక్తిమంతులైన ప్రజలు విశ్వసించారు. ఆ పోరాటంలో బలిష్టులూ, జిత్తులమారితనంగల వాళ్లూ బలహీనులనూ, ఇతరుల్ని విశ్వసించేవాళ్లనూ దోచుకుంటారు. . . . మనిషి, ఇండియాలోని వేటకుక్కవలే ఒక సామాజిక జంతువని వాళ్లు నిర్ణయించారు. . . . మానవజాతిలోని పెద్ద కుక్కలు పీడించి, లోబర్చుకోవడమనేది వారికి సమంజసంగా ఉన్నట్టు కనబడింది.”
మనం నిజంగా ఎవరమై ఉన్నామనే విషయాన్ని గురించి సరియైన అభిప్రాయానికి రావడం ప్రాముఖ్యమని స్పష్టమౌతోంది. అందుకే, ఒక పరిణామవేత్త ఇలా ప్రశ్నించాడు: “పాతకాలానికి చెందిన సరళమైన డార్విన్వాదమే . . . పాశ్చాత్య నాగరికత యొక్క నైతిక సామర్థ్యాన్ని బలహీనపర్చినట్లైతే, [పరిణామవాద మనోవిజ్ఞాన వాదపు] క్రొత్త వర్షన్ [అందరికీ] పూర్తిగా అవగతమైనప్పుడు ఇంకేం జరుగుతుంది?”
మన ఆవిర్భావాల్ని గురించి మనం ఏం నమ్ముతామనేది, జీవితాన్ని గూర్చిన, తప్పొప్పులను గూర్చిన మన ప్రాథమిక దృక్పథాల్ని ప్రభావితం చేస్తుంది గనుక, ఆ ప్రశ్నను మనం మరింత నిశితంగా పరిశీలించడం ప్రాముఖ్యం.
[4వ పేజీలోని చిత్రం]
చార్లెస్ డార్విన్ రచించిన జాతుల ఉత్పత్తి (ఆంగ్లం) అనే పుస్తకం 1859లో ప్రచురించబడిన తర్వాత అనేకమంది చేరుకున్న నిర్ధారణలను చరిత్రకారుడైన హెచ్. జి. వెల్స్ ఇలా పేర్కొన్నాడు: “మానవుల్లో నైతికవిలువలు పూర్తిగా దిగజారిపోయాయి. . . . 1859 తరువాత నుండి పూర్తి అపనమ్మకం ఏర్పడింది.”