విచారణలో ఉన్న పరిణామ సిద్ధాంతం
సమర్పిత పరిణామవాదులు, రసాయన ఉత్పత్తిని తిరిగి పూర్తిగా పరిశీలించాలని యిప్పుడు కేకలు వేస్తున్నారు
నేర విచారణలో మీరు ఓ న్యాయవేత్త అని మీరు ఊహించుకోండి. ప్రతివాది తన నిర్దోషత్వాన్ని ఒప్పుకుంటాడు, తన పక్షంగా సాక్ష్యమివ్వడానికి సాక్షులు ముందుకొస్తారు. అయితే, వారి సాక్ష్యం వింటున్నప్పుడు, ప్రతి సాక్షీ ఒకరితో ఒకరు ఏకీభవించడంలేదని మీరు గమనిస్తారు. తర్వాత, ప్రతివాద సాక్షులను తిరిగి సాక్ష్యమిచ్చే బోనులోకి పిలిచినప్పుడు, వాళ్ల కథలు మారిపోతాయి. ఓ న్యాయవేత్తగా, వాళ్ల సాక్ష్యానికి మీరు ప్రాధాన్యతనిస్తారా? నిందితుణ్ణి విడుదల చేయడానికి మీరు యిష్టపడతారా? కాకపోవచ్చు, ఎందుకంటే ప్రతివాది పక్షంగా యివ్వబడే సాక్ష్యంలోని ఏ పరస్పర విరుద్ధతలైనా అతని విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి.
పరిణామ సిద్ధాంత విషయం కూడా అంతే. కొందరు సాక్షులు పరిణామ సిద్ధాంత పక్షంగా వాదిస్తూ, జీవోద్భవాన్ని గూర్చిన వివిధ కథలను చెప్పడానికి ముందుకొచ్చారు. అయితే వారి సాక్ష్యాన్ని బాగా పరిశీలించినప్పుడు, అది నమ్మదగినదిగా నిరూపించబడిందా? ఆ సిద్ధాంతాన్ని ఘనపర్చేవారు, ఐక్యతతో మాట్లాడుతున్నారా?
పరస్పర విరుద్ధమైన సాక్ష్యాలు
జీవం ఎలా ప్రారంభమైంది? బహుశా మరే ప్రశ్న కూడా యింత ఆలోచనను రేకెత్తించి, అధిక తర్కాన్ని రేపివుండదు. అయినా, ఈ వివాదం కేవలం పరిణామానికీ సృష్టికి మధ్యనున్న పోటీ మాత్రమే కాదు; అధిక వివాదం పరిణామవాదుల మధ్యలోనే చెలరేగుతుంది. దాదాపు పూర్తిగా, పరిణామాన్ని గూర్చిన వివరాలన్నీ—అది ఎప్పుడు సంభవించింది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు లేక ఏది దాన్ని ప్రారంభించింది, దానికి ఎంత కాలం పట్టింది—అన్నీ తీవ్ర వివాదంలో ఉన్నాయి.
ఓ నులి వెచ్చని రసాయన “ద్రవంలో” జీవం ప్రారంభమైందని కొన్ని సంవత్సరాల పాటు పరిణామవాదులు చెప్పారు. సముద్రంలోని నురగ జీవాన్ని ఉద్భవింపజేసి ఉంటుందని కొందరిప్పుడు విశ్వసిస్తున్నారు. మరి కొందరు శాస్త్రజ్ఞులు, బహుశ సముద్ర మట్టంలోని వేడినీటి ఊటల నుండి జీవం ప్రారంభమైవుంటుందని చెబుతున్నారు. జీవులు, భూమి మీద రాలిన ఉల్కల వల్ల ప్రారంభమైయ్యాయని కొందరు మౌళిక సూత్రంగా వివరిస్తారు. లేక బహుశ, చిన్న గ్రహాలు భూమిని ఢీకొని దాని వాతావరణాన్ని మార్చివేసి, జీవం ఉద్భవించడానికి కారణం అయ్యుంటుందని కొందరు అంటున్నారు. “ఓ పెద్ద యినుప గ్రహం భూమిని ఢీకొంటే, ఆసక్తికరమైన విషయాలు జరిగే అవకాశముంది” అన్నాడు ఓ పరిశోధకుడు.
జీవం ఎలా ప్రారంభమైందన్న విషయాలను కూడా పునఃపరిశీలించడం జరుగుతుంది. “ఒకప్పుడు భావించినట్లుగా జీవం నెమ్మదిగల, అనుకూలమైన పరిస్థితుల్లో ఉద్భవించలేదు, గానీ అగ్ని పర్వత విస్ఫోటనాలవల్ల పీడించబడి, ఉల్కలూ చిన్న గ్రహాలు ఢీకొనడం వల్ల విరూపంగా తయారైన నరకస్థమైన నింగి క్రింద గల గ్రహంలో ప్రారంభమైందని,” టైమ్స్ పత్రిక సూచించింది. అలాంటి గందరగోళ పరిస్థితిలో జీవం పరిణమించాలంటే, ఈ ప్రక్రియ అంతా జరగడానికి యింతకుముందు ఊహించినదానికంటే తక్కువ సమయం పట్టివుంటుందని కొందరు శాస్త్రజ్ఞులు యిప్పుడు అంటున్నారు.
“దేవుడనే వాడు ఉంటే”—జీవం ప్రారంభం కావడానికి ఆయన ఏ పాత్ర నిర్వహించి ఉంటాడో అన్న విషయాలపై శాస్త్రజ్ఞులకు వేర్వేరు అభిప్రాయాలున్నాయి. సృష్టికర్త ప్రమేయం లేకుండా జీవం ప్రారంభమైందని కొందరంటున్నారు, మరి కొందరు, ఈ ప్రక్రియను దేవుడే ప్రారంభించి, తర్వాత జీవం వృద్ధి చెందడానికి పరిణామాన్ని అనుమతించాడని చెబుతున్నారు.
జీవం ప్రారంభమైన తర్వాత, పరిణామం ఎలా సంభవించింది? ఇక్కడ కూడా కథలు పొత్తులేకుండా ఉన్నాయి. ది ఆరిజన్ ఆఫ్ స్పిషీస్ ప్రచురించబడిన ఓ శతాబ్దం తర్వాత 1958లో పరిణామ వాదియైన సర్. జులియన్ హక్ల్సే యిలా పేర్కొన్నాడు: “డార్విన్ కనిపెట్టిన, ప్రకృతి సార్వత్రిక నియమమైన వరణము అనే పరిణామ సంబంధంగా జరిగిన ప్రముఖమైన మార్పుల్లో చివరకు ఏకైక కారణంగా దృఢంగా నిరూపించబడింది.” అయినప్పటికీ 24 సంవత్సరాల తర్వాత, మైకెల్ రూస్ అనే పరిణామవాది యిలా రాశారు: “పెరిగే సంఖ్యలోనున్న జీవశాస్త్రజ్ఞులు, . . . డార్విన్ సూత్రాలపై ఆధారపడిన ఏ పరిణామ సిద్ధాంతమైనా—ప్రత్యేకంగా, పరిణామ మార్పులకు ప్రకృతి వరణమే కీలకమని భావించే ఏ సిద్ధాంతమైనప్పటికీ—మోసపూరితంగా అపరిపూర్ణమైనదే.
టైమ్ పత్రిక, పరిణామ సిద్ధాంతానికి మద్దతిచ్చే “అనేక దృఢమైన వాస్తవాలున్నాయి” అని ఓ ప్రక్క చెబుతూనే, పరిణామమనేది, “కొదువైన రుజువులను ఎలా చేర్చాలనే విషయంలో అనేక లోపాలు విరుద్ధ సిద్ధాంతాలు” గల ఓ క్లిష్టమైన విషయమని సమ్మతిస్తోంది. ఈ కేసును యిక మూసివేయాలని సూచించే బదులు, సమర్పిత పరిణామ వాదులనేకులు రసాయన జీవోత్పత్తిని తిరిగి పూర్తిగా పరిశీలించాలని యిప్పుడు కేకలు వేస్తున్నారు.
అలా, పరిణామానికి సంబంధించిన ఈ విచారణ—ప్రత్యేకంగా పరిణామం ప్రకారం జీవం ప్రారంభమైనదనడానికి—అనుగుణ్యతగల సాక్ష్యాలపై ఆధారపడినది కాదు. పరిణామం పక్షంలో వాదించేవారు “సంవత్సరాలుగా ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను వృద్ధిచేసి విడిచిపెట్టారు అంతేకాకుండా విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఒక్క సిద్ధాంతంపై కూడా యింతవరకూ ఏ ఒక్క అంగీకారానికి రాలేకపోయారు” అని టి. హెచ్. జనాబి చెప్పారు.
ఆసక్తికరంగా, చార్ల్స్ డార్విన్ అలాంటి వివాదం చెలరేగుతుందని ముందే గ్రహించాడు. ది ఆరిజన్ ఆఫ్ స్పిషీస్ ప్రారంభంలో ఆయన యిలా రాశాడు: “తరచూ, నేను చేరుకున్న నిర్ణయాలకు పూర్తి విరుద్ధంగా నడిపిస్తూ ఈ పుస్తకంలో తరచూ వాస్తవాలను నిరూపించగల ఒక్క విషయం కూడా చర్చించబడలేదని నాకు బాగా తెలుసు.”
వాస్తవానికి, అలాంటి విరుద్ధమైన సాక్ష్యం, పరిణామ సిద్ధాంతపు వాస్తవికతపై ప్రశ్నలను రేపుతుంది.
పరిణామము మేధావుల ఎంపికా?
పరిణామ సిద్ధాంతం ప్రారంభమైనప్పటి నుండి, “అనేక మంది ప్రజలను మెప్పించింది, ఎందుకంటే ప్రత్యేక సృష్టి కంటే కూడా యిది మరింత వైజ్ఞానికంగా కనిపించింది” అని మైల్స్టోన్స్ ఆఫ్ హిస్టరీ అనే పుస్తకం చెబుతోంది.
అంతేకాకుండా, కొందరు పరిణామ సిద్ధాంతుల పిడివాద వ్యాఖ్యానాలు జడిపించగలవు. ఉదాహరణకు, ప్రత్యేక సృష్టి సిద్ధాంతము “గంభీర పరిశీలనకు తగదు” అని వైజ్ఞానికుడైన హెచ్. ఎస్. షెల్టన్ నొక్కి చెబుతున్నారు. జీవశాస్త్రవేత్తయైన రిచర్డ్ డ్యాకిన్స్ మూర్ఖంగా యిలా పేర్కొన్నాడు: “పరిణామాన్ని నమ్మనని చెప్పుకునే వ్యక్తి అజ్ఞాని, మూర్ఖుడు, అవివేకి.” అదే విధంగా, ప్రొఫెసర్ రెనె డ్యుబోస్ యిలా అంటున్నారు: “విశ్వంలోని ప్రతిదీ—నబోమండల గోళాల దగ్గిర నుండి మానవుల వరకూ—పరిణామ క్రమం ద్వారా వృద్ధి చెందాయనీ, అలా వృద్ధి చెందుతూనే ఉంటాయనీ జ్ఞానులైన ప్రజలు అంగీకరిస్తారు.”
ఈ వ్యాఖ్యానాలనుబట్టి చూస్తే యింగిత జ్ఞానం ఉన్న వారెవరైనా పరిణామ క్రమాన్ని వెంటనే అంగీకరిస్తారని అనిపిస్తుంది. ఎంతైనా, అలా చేస్తున్నాడంటే, అతను “మూర్ఖుడు” కాడుగానీ అతనికి “జ్ఞానోదయం కలిగింది” అని అర్థం. అయినప్పటికీ, పరిణామ సిద్ధాంత పక్షం వహించని ఎంతోమంది ఉన్నత విద్యనభ్యసించినవారు ఉన్నారు. “వ్యక్తిగత సందేహాలున్న వైజ్ఞానికులనేకులను నేను చూశాను, కొందరైతే, డార్విన్ సిద్ధాంతం వైజ్ఞానిక సిద్ధాంతం కానేకాదు అనే స్థితికి సహితం వచ్చారు,” అని ది నెక్ ఆఫ్ ది జిరాఫీ అనే తన పుస్తకంలో ఫ్రాన్సిస్ హిచ్చికింగ్ రాశారు.
ఎంతగానో పొగడబడిన బ్రిటీష్ వైజ్ఞానికుడైన చంద్ర విక్రమసింగ్ అదే దృక్పథాన్ని అంగీకరించాడు. “డార్విన్ పరిణామంలోని ఏ మూల సూత్రాలకూ ఏ రుజువూ లేదు,” అని ఆయన అన్నాడు. “పద్దెనిమిది వందల అరవైలో, లోకాన్ని ఆవరించింది సామాజిక శక్తే, నాటి నుండి విజ్ఞానానికి అది చెడు పరిణామాలను తెచ్చిందని నేననుకుంటున్నాను.”
పరిణామ వాదులు అందించిన వాదాన్ని టి. హెచ్. జనాబి, పరిశోధించాడు. “మనలను నమ్మించిన వాటికీ ఈ విషయాలకూ చాలా తేడా ఉన్నట్లు నేను కనుగొన్నాను” అని ఆయన అన్నారు “జీవోత్పత్తి వంటి సంక్లిష్టమైన సిద్ధాంతానికి మద్దతునిచ్చే రుజువులు చాలా తక్కువగానూ చాలా అసంపూర్ణంగానూ ఉన్నాయి.”
కనుక, పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించని వారిని “అజ్ఞానులనీ, మూర్ఖులనీ, అవివేకులనీ,” అలక్ష్యం చేయకూడదు. పరిణామాన్ని సవాలు చేసే అభిప్రాయాల విషయంలో, దృఢ పరిణామవాదియైన జార్జ్ గేలార్డ్ సింప్సన్ యిలా ఒప్పుకోవల్సి వచ్చింది: “ఈ అభిప్రాయాలను ఓ చిరునవ్వుతో పెరికివేయడమో లేక వారిని అపహసించడమో తప్పకుండా పొరపాటౌతుంది. పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించనివారు నాడు (నేడు కూడా) విస్తారమైన మేధావితనంగల విద్యార్థులే.”
అది విశ్వాసానికి సంబంధించింది
పరిణామమందు నమ్మకం వాస్తవాలపై ఆధారపడి ఉందనీ, సృష్టిపై నమ్మకం విశ్వాసంపై ఆధారపడి ఉందని కొందరు భావిస్తారు. ఏ మానవుడు దేవున్ని చూడలేదన్నది వాస్తవమే. (యోహాను 1:18; 2 కొరింథీయులు 5:7 పోల్చండి.) అయినా, ఈ విషయంలో పరిణామ సిద్ధాంతం గొప్పదేమి కాదు, ఎందుకంటే ఏ మానవులూ వాటిని ఎన్నడూ చూడలేదు లేక పునరావృతం చేయలేని సంఘటనలపై అది ఆధారపడి ఉంది.
ఉదాహరణకు, వైజ్ఞానికులు ఉత్పరివర్తనాలను—కనీసం ప్రయోజనకరమైన ఉత్పరివర్తనాలనైనా యింతవరకూ చూడలేదు; అయినప్పటికీ ఈ విధానం ద్వారానే కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయని వారి దృఢ నమ్మకం. వారు అకస్మిక జీవ జననాన్ని చూడలేదు; అయినా ఆ విధంగానే జీవం ప్రారంభమైందని వారు పదే పదే చెబుతుంటారు.
అలా రుజువు లేకపోవడమనేది పరిణామ సిద్ధాంతాన్ని “కేవలం ఒక ‘విశ్వాసం’” అని టి. హెచ్. జనాబి పిలిచేటట్లు చేసింది. భౌతిక విజ్ఞానవేత్తయైన ఫ్రెడ్ హోయిల్ దాన్ని, “డార్విన్ సువార్త” అని పిలుస్తున్నారు. డా. ఎవాన్ ష్యూట్ అంతకంటే దృఢంగా వ్యాఖ్యానించాడు. “హృదయపూర్వక పరిణామవాది కంటేకూడా సృష్టిని గూర్చి వాదించేవానికే వివరించాల్సిన మర్మం తక్కువగా ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది,” అని ఆయన అంటున్నాడు.
ఇతర నిపుణులు అంగీకరించారు. “మనిషి తత్వాన్ని గూర్చి నేను ఆలోచిస్తే, నులి వెచ్చని నీటిగుంటలో కరిగిన రసాయనాల నుండి మానవుడు ఉద్భవించడం, బైబిలు నందు చెప్పబడిన వృత్తాంతం కంటే అద్భుతంగా ఉంది.”
మరి, జీవం సృష్టించబడిందనే ఆలోచనను అనేకులు ఎందుకు తృణీకరిస్తారు?
[3వ పేజీలోని చిత్రం]
కొందరి పిడివాద వ్యాఖ్యానాలు ఒప్పించేవిగా ఉండగలవు