మన వాతావరణానికి హాని కలిగినప్పుడు
ఎడ్గార్ మిచ్చల్ 1971లో అపొల్లో 14లో చంద్రుని దగ్గరకు వెళ్తుండగా భూమిని చూస్తూ యీ విధంగా అన్నాడు: “అది తళతళమెరిసే నీలి ధవళ వర్ణపు ఆభరణంలా ఉంది.” అయితే నేడు ఒక వ్యక్తి అంతరిక్షం నుండి ఏమి చూస్తాడు?
ప్రత్యేక కళ్ళజోడు భూమిపైని వాతావరణంలోని అదృశ్యమైన వాయువులను చూడడానికి అతన్ని అనుమతించి ఉంటే అతడు ఎంతో భిన్నమైన దానిని చూసి ఉండేవాడు. ఇండియా టుడే పత్రికలో రాజ్ చెంగప్ప యిలా వ్రాశాడు: “కాపుదలనిచ్చే ఓజోన్ కవచంలో, అంటార్కిటికా మరియు ఉత్తర అమెరికా ప్రాంతాల్లో కనిపించే భయానకమైన రంధ్రాలను చూసి ఉండేవాడు. తళతళమెరిసే నీలి ధవళ వర్ణపు ఆభరణానికి బదులుగా మసకగా ఉండే సుళ్ళు తిరుగుతున్న కార్బన్ మరియు సల్ఫర్ డైయాక్సైడ్ల మేఘాలతో నింపబడి, ప్రకాశహీనంగా, మురికిగా ఉన్న భూమిని చూసి ఉండేవాడు.”
మన పై వాతావరణంలోని కాపుదలనిచ్చే ఓజోన్ పొరలో రంధ్రాలను చేసినదేమిటి? వాతావరణాన్ని మలినపర్చే పదార్థాలు అమితం కావడం నిజంగా అంత అపాయకరమా?
ఓజోన్ ఎలా నాశనమౌతుంది
అరవై సంవత్సరాల కంటే ముందు, విషపూరితమైన, దుర్గంధాన్నిచ్చే యితర తాపహారులకు బదులుగా సురక్షితమైన తాపహారిని కనుగొన్నట్లు శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఈ క్రొత్త రసాయనంలో ఒక కార్బన్, రెండు క్లోరిన్, రెండు ఫ్లోరిన్ అణువులుగల అతిచిన్న కణాలు చేర్చబడ్డాయి (CCL2F2). దీనిని, మానవ నిర్మితమైన అలాంటి రసాయనాలను క్లోరోఫ్లోరోకార్బన్లు (CFCలు) అంటారు.
CFCల ఉత్పత్తి, 1970ల తొలి భాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బారీ పరిశ్రమగా పెరిగిపోయింది. రెఫ్రిజిరేటర్లలోనే కాక, ఏరోసల్ స్ప్రే క్యాన్లలోను, ఎయిర్ కండీషనర్లలోను, పారిశుద్ధ్య వస్తువులలోను, ప్లాస్టిక్ డబ్బాలలోను, ప్లాస్టిక్ఫోమ్ ఉత్పత్తుల్లోను అవి ఉపయోగించబడ్డాయి.
అయితే, 1974 సెప్టెంబరులో ష్రూడ్ రోలాండ్ మరియు మోర్యో మోలీన అనే యిద్దరు శాస్త్రజ్ఞులు, CFCలు క్రమంగా స్ట్రాటొస్ఫియర్కు వెళ్ళి తుదకు వాటి క్లోరిన్ను విడుదల చేస్తాయి అని వివరించారు. ప్రతి ఒక్క క్లోరిన్ అణువు వేల కొలది ఓజోన్ మాలిక్యూలను ధ్వంసం చేస్తుందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అయితే ఓజోన్ పై వాతావరణమంతటిలోను సమానంగా నాశనమయ్యే బదులు ధ్రువాల్లోనే ఎక్కువగా నాశనమౌతుంది.
గత 1979 నుండి, ప్రతి వసంతంలోను అంటార్కిటికా పైని ఓజోన్ ఎక్కువ పరిమాణంలో అంతరించి, మళ్ళీ వచ్చింది. ఈ విధంగా ఋతువుల ప్రకారం ఓజోన్ తగ్గిపోవడాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. అంతేకాక, ఇటీవల సంవత్సరాల్లో యీ రంధ్రం మరింత పెద్దదవుతూ ఎక్కువ కాలం నిలిచిపోతుంది. రికార్డు ప్రకారం ఓజోన్ రంధ్ర పరిమాణం—ఉత్తర అమెరికా పరిమాణం కన్నా పెద్దదని గత 1992లోని ఉపగ్రహ లెక్కలు బయల్పర్చాయి. ఇంక దానిలో ఓజోన్ ఏమీ మిగుల లేదు. బెలూన్ లెక్కలు 60 శాతం కన్నా ఎక్కువ తరుగుదలను బయల్పరచాయి, అది యింతకు ముందు రికార్డు అయినవాటికన్నా తక్కువ.
అదే సమయంలో, భూమియొక్క యితర భాగాల్లోని పై వాతావరణంలో కూడా ఓజోన్ పరిమాణం తగ్గుతూ ఉంది. “ఇటీవల లెక్కలు చూపించేదేమంటే . . . ఉత్తర ఐరోపా, రష్యా, కెనడాల వరకు వ్యాపించి ఉన్న 50 డిగ్రీల ఉత్తర అక్షాంశరేఖకు, 60 డిగ్రీల ఉత్తర అక్షాంశరేఖకు మధ్యలోని ఓజోన్ సాంద్రత 1992లో అసాధారణంగా తక్కువ పరిమాణాల్లో ఉండేది. ఓజోన్ సాంద్రత సగటు పరిమాణం కన్నా 12 శాతం తక్కువగా ఉండేది, అది 35 సంవత్సరాల్లో ఎడతెగక చేసిన పరిశీలనలో తేలిన ఏ లెక్కకన్నా తక్కువ అని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తుంది.”
సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రిక చెప్పేదేమంటే “అతి భయంకరమైన ప్రవచనాలు కూడా క్లోరోఫ్లోరోకార్బన్ల వలన కలిగిన ఓజోన్ తరుగుదలను గూర్చి తక్కువ అంచనా వేశాయని యిప్పుడు చూపబడ్డాయి. . . . అయితే ఆ సమయంలో ప్రభుత్వాల్లోని, పరిశ్రమల్లోని పలుకుబడిగల కంఠస్వరాలు అసంపూర్ణ విజ్ఞానశాస్త్ర రుజువుల ఆధారమంటూ శాసనాలను శక్తివంతంగా ఎదిరించాయి.”
ఒక అంచనా ప్రకారం ఇప్పటికే రెండు కోట్ల CFCలు వాతావరణంలోనికి వదిలిపెట్టబడ్డాయి. CFCలు స్ట్రాటొస్ఫియర్లోనికి ప్రవేశించడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి, లక్షల టన్నులు యిప్పటికీ అక్కడికి చేరుకోలేదు. అవి పైవాతావరణంలో నాశనాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ, ఓజోన్ను నాశనం చేసే క్లోరిన్కు CFCలు మాత్రమే మూలం కాదు. “ఒక్కో రాకెట్ను వదిలిన ప్రతిసారి ఓజోన్ పొరలో దాదాపు 75 టన్నుల క్లోరిన్ నిక్షేపించబడిందని నాసా అంచనా వేస్తుంది,” అని పాప్యులర్ సైన్స్ అనే పత్రిక నివేదిస్తుంది.
పర్యవసానాలేమిటి?
పైవాతావరణంలో ఓజోన్ తరుగుదల వలన కలిగే పర్యవసానాలను గూర్చి పూర్తిగా అర్థంకాలేదు. అయితే, ఒకటి మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది, ఏమంటే భూమికి చేరే హానికరమైన యు.వి. (అతినీలలోహిత) కిరణాల పరిమాణం ఎక్కువవుతుంది, దాని ఫలితంగా చర్మ క్యాన్సర్ ఎక్కువ మందికి వస్తుంది. “గత దశాబ్దంలో ఉత్తరార్థగోళాన్ని దెబ్బతీసిన హానికరమైన యు.వి. కిరణాలతో సాంవత్సరిక మోతాదు 5 శాతం పెరిగింది,” అని ఎర్త్ అనే పత్రిక నివేదిస్తుంది.
కేవలం 1 శాతం యు.వి. పెరుగుదల చర్మ క్యాన్సర్ 2 నుండి 3 శాతం వరకు పెరగడానికి కారణమౌతుందని అంచనా వేయబడింది. గెట్అవే అనే ఆఫ్రికా పత్రిక యీ విధంగా చెబుతుంది: “దక్షిణాఫ్రికాలో ప్రతి సంవత్సరం 8,000 మందికి క్రొత్తగా చర్మ క్యాన్సర్ వస్తుంది . . . మనకు ఓజోన్ కాపుదల చాలా తక్కువ పరిమాణంలో ఉంది, చర్మ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంది (ఈ సంబంధం యాధృచ్చికం కాదు).”
కొన్ని సంవత్సరాల క్రితం, రోలాండ్ మరియు మోలినా అనే శాస్త్రవేత్తలు, పై వాతావరణంలోని ఓజోన్ నాశనం వల్ల చర్మ క్యాన్సర్ అధికమౌతుందని ముందే సూచించారు. అమెరికాలో ఏరోసిల్లో CFCలను ఉపయోగించడాన్ని వెంటనే నిషేధించాలని వారు సిఫారసు చేశారు. అపాయాన్ని గ్రహించి, జనవరి 1996నాటికి CFCల ఉత్పత్తిని నిలిపివేయడానికి అనేక దేశాలు ఒప్పుకున్నాయి. అయితే ఇంతలోనే, CFCలను ఉపయోగిస్తూ ఉండడం భూమిపై మనుగడకు ఆపాయకరంగా ఉంటుంది.
అంటార్కిటికా మీదుగానున్న ఓజోన్ తరుగుదల “ముందుగా అనుమానించినదానికన్నా సముద్రంలో ఎక్కువ లోతుకు అతినీలలోహిత కిరణాలు చొచ్చుకుపోడానికి అనుమతించింది. . . . ఇది ఆహారశృంఖలకు ఆధారమగు ఏకకణ జీవుల ఉత్పాదనలో గొప్ప తగ్గుదలకు కారణమయ్యింది” అని అవర్ లివింగ్ వర్ల్డ్ నివేదిక చెబుతుంది. యు.వి. కిరణాలు ఎక్కువ కావడం అనేక పంటలు పండడాన్ని తగ్గిస్తూ, ప్రపంచవ్యాప్త ఆహార సరఫరాను కష్టతరం చేస్తుందని కూడా ప్రయోగాలు చూపిస్తున్నాయి.
నిజంగా, CFCల ఉపయోగం హానికరమయ్యే సాధ్యత ఉంది. ఇప్పటికీ, మన వాతావరణం మలినపర్చే యితర అనేక పదార్థాలవలన ముట్టడి చేయబడుతుంది. అల్ప పరిమాణంలో ఉంటే భూమిపై మనుగడకు ఎంతో ఆవశ్యకంగా ఉండే వాతావరణ వాయువు అందులో ఒకటి.
కాలుష్య ప్రభావము
పందొమ్మిదవ శతాబ్ద మధ్య కాలంలో, వాతావరణంలోనికి మానవులు బొగ్గుపులుసు వాయువును అధికంగా పంపిస్తూ, బొగ్గును, గ్యాస్ను, చమురును అధికంగా కాల్చనారంభించారు. ఆ సమయంలో, వాతావరణంలోని యీ అల్పవాయువు ప్రతి పది లక్షల్లో 285 వంతులు ఉండేది. కాని, మానవులు శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించడం వలన ప్రతి పది లక్షల్లో 350 వంతుల కన్నా ఎక్కువ బొగ్గుపులుసు వాయువు చేరుకుంది. వాతావరణంలో వేడిని వదిలిపెట్టే యీ వాయువులు అధికంగా ఉండడం వలన కలిగిన పర్యవసానమేమి?
బొగ్గుపులుసు వాయువు పరిమాణం పెరగడం భూమిపై ఉష్ణోగ్రత పెరగడానికి కారణమయ్యిందని అనేకులు నమ్ముతున్నారు. అయినను, ఇటీవల కాలాల్లో సూర్యుని అస్థిరత వలన—సూర్యుడు ఎక్కువ వేడిని ప్రసరించడం వలన ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరిగిందని ఇతర పరిశోధకులు అంటున్నారు.
కారణమేదైనా, 19వ శతాబ్ద మధ్యకాలం మొదలుకొని ఉన్న లెక్కల్లో 1980వ దశాబ్దంలో ఎక్కువ వేడివుంది. “ఈ వైఖరి యీ దశాబ్దం వరకు కొనసాగింది, 140 సంవత్సరాల రికార్డులో 1990 అత్యధిక ఉష్టోగ్రత గల సంవత్సరం, 1991 ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న మూడవ సంవత్సరం, 1992 ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న పదవ సంవత్సరం,” అని ది స్టార్ అనే దక్షిణాఫ్రికా వార్తాపత్రిక నివేదిస్తుంది. పినాటుబో పర్వతం 1991లో ప్రేలినప్పుడు వాతావరణంలోనికి చిమ్మబడిన దుమ్ము మూలంగా గత రెండు సంవత్సరాలుగా ఉష్ణోగ్రతలో కొంత తగ్గుదల ఉంది.
భూమిపై ఉష్ణోగ్రత పెరగడం వలన కలిగే బావి ప్రభావాలను గూర్చి గంభీరంగా చర్చించబడుతుంది. ఇప్పటికే వాతావరణాన్ని ముందుగా తెలుసుకోవడమనే కష్టమైన పనిని భౌగోళిక ఉష్ణోగ్రత మరింత కష్టతరం చేస్తుందన్నది కచ్చితము. “భౌగోళిక ఉష్ణోగ్రత వాతావరణాన్ని మారుస్తూ ఉండడం వలన” తప్పుడు లెక్కలు “ఎక్కువయ్యే సాధ్యత ఉంది” అని న్యూ సైంటిస్ట్ పత్రిక గమనించింది.
అనేక ఇన్సూరెన్సు కంపెనీలవారు భౌగోళిక ఉష్ణోగ్రత తమ పాలసీలను లాభం లేనివాటిగా చేస్తుందని భయపడుతున్నారు. ది ఎకానమిస్ట్ యీ విధంగా ఒప్పుకుంటుంది, “[ఒక్కో] అపాయం ఎదురవుతున్న కొలది, తిరిగి ఇన్సూరెన్సు చేసే కంపెనీలవారు తాము ప్రకృతి వైపరీత్యాలకు గురికావడాన్ని తగ్గించుకుంటున్నారు. మరికొందరు మార్కెట్టును మానివేయడాన్ని గూర్చి మాట్లాడుతున్నారు. . . . వారు అనిశ్చితత్వానికి భయపడుతున్నారు.”
నమోదు చేయబడిన వాటన్నిటిలోకెల్లా అధిక ఉష్ణోగ్రత గల 1990వ సంవత్సరంలో ఆర్కిటిక్ మంచు పొరలోని ఎక్కువ భాగం అనుకోనంత ఎక్కువగా కరిగిపోయింది. దీని ఫలితంగా ఒక్క నెలలోనే వందల కొలది ధ్రువ ఎలుగుబంట్లు రాంగ్లాండ్ దీవిలోకి పలాయనం చేస్తున్నాయి. “భౌగోళిక ఉష్ణోగ్రత వలన యిలాంటి పరిస్థితులు . . . ఎడతెగక ఏర్పడుతూనే ఉంటాయి,” అని బిబిసి వైల్డ్లైఫ్ అనే పత్రిక హెచ్చరిస్తుంది.
“ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరగడం వల్ల అంటార్కిటికా నుండి మంచుకొండలు కరిగి, దక్షిణ అట్లాంటిక్లో ఓడలకు ప్రమాదం కలిగిస్తున్నాయని వాతావరణ నిపుణులు నిందిస్తున్నట్లు,” ఆఫ్రికా వార్తా పత్రిక 1992లో నివేదించింది. ఎర్త్, జనవరి 1993వ సంచిక ప్రకారం దక్షిణ కాలిఫోర్నియా తీరంలోని సముద్ర మట్టం క్రమంగా పెరిగిపోవడమే, నీరు వేడి కావడానికి కొంత కారణము.
దురదృష్టవశాత్తు, మానవులు భయానకమైన పరిమాణంలో విష వాయువులను వాతావరణంలోనికి విడుదల చేస్తూ ఉన్నారు. “ఎన్విరోన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ 1989లో వేసిన అంచనా ప్రకారం అమెరికాలో ప్రతి సంవత్సరం 9,00,000 టన్నుల కన్నా ఎక్కువ విష రసాయనాలు పంపు చేయబడుతున్నాయి,” అని ది ఎర్త్ రిపోర్ట్ 3 చెబుతుంది. ఈ సంఖ్య తక్కువ అంచనాగా పరిగణించబడుతుంది, ఎందుకంటే, యీ లెక్కలో లక్షలకొలది మోటారు వాహనాల నుండి వచ్చే పొగను చేర్చలేదు.
అనేక ఇతర పారిశ్రామిక దేశాలనుండి కూడా వాతావరణ కాలుష్యాన్ని గూర్చిన భీతినిగొలిపే నివేదికలు వస్తున్నాయి. ముఖ్యంగా, తూర్పు ఐరోపా దేశాల్లో కమ్యూనిష్టు పరిపాలించిన దశాబ్దాల్లో, నియంత్రణ లేకుండా పోయిన వాయు కాలుష్యాన్ని గూర్చిన ఇటీవల ప్రకటనలు భయానకంగా ఉన్నాయి.
బొగ్గుపులుసు వాయువును గ్రహించి, ఆమ్లజనిని విడుదల చేసే భూమిపైనున్న వృక్షాలు కూడా విషవాయువుకు గురవుతున్నాయి. న్యూ సైంటిస్ట్ యీ విధంగా నివేదించింది: “జర్మనీలో వృక్షాలు ఎక్కువగా అనారోగ్యానికి గురౌతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి . . . అభిప్రాయం ప్రకారం, అడవుల అనారోగ్యానికి వాయు కాలుష్యమనేది ఒక ముఖ్య కారణంగా కొనసాగుతుంది.”
దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్వాల్ హైవెల్డ్ పరిస్థితి యిలాగే ఉంది. ఇప్పుడు “తూర్పు ట్రాన్స్వాల్లో ఆమ్ల వర్షం వలన కలిగే నాశనాన్ని గూర్చిన మొదటి సూచన కనిపిస్తుంది, అక్కడ ఆరోగ్యంగా ముదురు పచ్చగా ఉండే పైన్ తీగెలు అనారోగ్యంతో బూడిద రంగులో మచ్చలుగలవిగా మారుతున్నాయి” అని బ్యాక్ టు ఎర్త్ అనే తన పుస్తకంలో జేమ్స్ క్లార్క్ నివేదిస్తున్నారు.
ఇలాంటి నివేదికలు ప్రపంచ నలుమూలల నుండి వస్తున్నాయి. ఒక్క దేశం కూడా మినహాయించబడలేదు. ఆకాశము ఎత్తున ఉన్న పొగగొట్టాలతో పారిశ్రామిక దేశాలు తమ కాలుష్యాన్ని పొరుగుదేశాలకు పంపుతున్నాయి. పేరాశగల పారిశ్రామిక అభివృద్ధితో కూడిన మానవ చరిత్ర నిరీక్షణనివ్వడం లేదు.
అయినప్పటికీ, ఆశించడానికి ఆధారముంది. మన అమూల్యమైన వాతావరణం నాశనం నుండి కాపాడబడుతుందని మనం నమ్మకం కలిగివుండవచ్చు. ఇది ఎలా నెరవేరుతుందో తరువాతి శీర్షికనుండి తెలుసుకోండి.
[7వ పేజీలోని చిత్రం]
పైవాతావరణంలోని ఓజోన్ నాశనం, చర్మ క్యాన్సర్ ఎక్కువకావడానికి కారణమయ్యింది
[9వ పేజీలోని చిత్రం]
ఇలాంటి కాలుష్యం వలన కలిగిన పర్యవసానాలేవి?