యుద్ధాలు, దాడుల సెగ వల్ల ప్రపంచం విలవిల
“రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుండి దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 200 కోట్ల జనాభా, అంటే ప్రతీ నలుగురిలో కనీసం ఒకరు దాడులు జరిగే ప్రాంతంలో నివసిస్తున్నారు.”
యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ-జనరల్ అమీనా జే. మొహమ్మద్, జనవరి 26, 2023.
ప్రశాంతంగా ఉన్న దేశాల్లో సైతం ఉన్నట్టుండి యుద్ధాలు, దాడులు జరగవచ్చు. ఒక దేశంలో యుద్ధం భగ్గుమంటే వేరే దేశాలకు కూడా ఆ సెగ తగులుతుంది. యుద్ధం ముగిసిపోయినా, దాని దెబ్బ నుండి తేరుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఉదాహరణకు . . .
ఆహార కొరతలు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) సంస్థ ప్రకారం “ఆకలి బాధకు ముఖ్య కారణం యుద్ధాలే. ఆకలితో అలమటించే వాళ్లలో 70 శాతం మంది యుద్ధాలు, దాడులు జరుగుతున్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.”
శారీరక, మానసిక సమస్యలు. ఏ క్షణంలో యుద్ధం విరుచుకుపడుతుందో అనే ఆలోచన ప్రజల్లో ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది. యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో జీవించే ప్రజలకు శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయి. పైగా, అక్కడున్న వాళ్లకు వైద్య సహాయం దొరకడం కూడా గగనమే.
వలస వెళ్లాల్సిరావడం. యునైటెడ్ నేషన్స్ హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR) ప్రకారం 2023 సెప్టెంబరు కల్లా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 40 లక్షలకు పైగా జనాభా తమ ఇళ్లను వదిలి వలస వెళ్లారు. యుద్ధాలు, దాడులు జరగడం వల్ల ప్రజలు తమ ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని పారిపోతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు. యుద్ధం వల్ల ప్రజలు తరచూ ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉదాహరణకు, ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రజలకు విద్య, వైద్య సహాయం కూడా సరిగ్గా అందదు. ఎందుకంటే వాటికోసం పెట్టాల్సిన ఖర్చంతా ప్రభుత్వం తీసుకెళ్లి సైన్యం కోసం, ఆయుధాల కోసం ఖర్చు పెడుతుంది. అలాగే యుద్ధం ముగిశాక, దానివల్ల జరిగిన నష్టాన్ని పూరించాలంటే తడిసి మోపెడవుతుంది.
వాతావరణం కలుషితమవ్వడం. భూమి ఇచ్చే వనరుల మీదే మనిషి ఆధారపడి బ్రతుకుతాడు. కాబట్టి, వాటిని పాడు చేసినప్పుడు ప్రజలు చాలా నష్టపోతారు. కలుషితమైన నీరు, గాలి, నేల వల్ల పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు, భూమిలో దాచిపెట్టిన మందుపాతరల వల్ల యుద్ధం ముగిశాక కూడా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉండవచ్చు.
యుద్ధం అంటే వినాశనం, విధ్వంసం, తీరని నష్టం.