దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి
1 ఆత్మీయులు చనిపోవడమనేది చాలా బాధాకరమైన విషయం, ప్రత్యేకంగా రాజ్యనిరీక్షణ లేనివారికి అది మరింత బాధాకరమైనది. (1 థెస్స. 4:13) ‘ప్రజలు ఎందుకు చనిపోతారు? చనిపోయాక వారికేమౌతుంది? నేను ఎప్పటికైనా వారిని తిరిగి చూస్తానా?’ అని చాలామంది అడుగుతుంటారు. బంధువు లేదా స్నేహితుడు చనిపోయినందుకు దుఃఖిస్తున్నవారిని మనం క్షేత్రసేవలో కలిస్తే ఎలా ఓదార్చవచ్చో కొన్ని సలహాలు ఇక్కడివ్వబడ్డాయి.—యెష. 61:2.
2 ఇంటింటి పరిచర్యలో: కొన్ని రోజుల క్రితమే వాళ్ళింట్లో ఎవరో చనిపోయారని గృహస్థులు మనకు చెప్పారనుకుందాం. తలుపు దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏడుస్తున్నట్లు, దుఃఖిస్తున్నట్లు కనిపించారా? వాళ్ళింటినిండా దుఃఖిస్తున్న బంధువులున్నారా? అలాంటి పరిస్థితుల్లో ఎక్కువసేపు సాక్ష్యమివ్వకుండా ఉంటే మంచిది. (ప్రసం. 3:1, 7) మన సానుభూతిని తెలిపి, వారికి ఇష్టమైతే తగిన కరపత్రాన్ని గానీ, పత్రికను గానీ, బ్రోషుర్ని గానీ ఇచ్చి వచ్చెయ్యవచ్చు. ఆ తర్వాత ఆ గృహస్థులకు అనువైన సమయంలో తిరిగి వెళ్ళి బైబిలు నుండి ఓదార్పుకరమైన విషయాలను చెప్పవచ్చు.
3 కొన్నిసార్లు, మొదటిసారి కలిసినప్పుడే కాస్త ఎక్కువసేపు మాట్లాడవచ్చని మనకు అనిపించవచ్చు. వారికున్న తప్పుడు అభిప్రాయాలను ఖండించడానికి అది సమయం కాకపోయినప్పటికీ, గృహస్థులు అంగీకరిస్తే పునరుత్థానం గురించి బైబిల్లోని వాగ్దానాల్ని వారికి చదివి వినిపించవచ్చు. (యోహా. 5:28, 29) లేదా చనిపోయినవారి స్థితి గురించి బైబిలు ఏమి చెబుతుందో వారికి వివరించవచ్చు. (ప్రసం. 9:5, 10) పునరుత్థానానికి సంబంధించిన ఒక బైబిలు వృత్తాంతాన్ని చెప్పడం వారికి ఓదార్పునివ్వవచ్చు. (యోహా. 11:39-44) యెహోవాపై నిరీక్షణతో విశ్వసనీయుడైన యోబు చెప్పిన మాటలను చూపించడం ఓదార్పుకరంగా ఉండవచ్చు. (యోబు 14:14, 15) అక్కడినుండి వచ్చేసేముందు, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషుర్నిగానీ, తగిన కరపత్రాన్నిగానీ ఇవ్వవచ్చు. లేదా మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఇవ్వవచ్చు. ఆ పుస్తకంలోని 6వ అధ్యాయంలోవున్న సమాచారాన్ని చూపించి మళ్ళీ వచ్చినప్పుడు చర్చిస్తామని చెప్పవచ్చు.
4 ఇతర సందర్భాల్లో: రాజ్యమందిరంలో అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంటే సాక్షేతరులు వచ్చే అవకాశముందా? ఒకవేళ వస్తే వారికి ఓదార్పునిచ్చే ప్రచురణలు ఇవ్వవచ్చు. స్మశానవాటికల్లో ఉంటూ అక్కడ పనిచేసేవారెవరికైనా కొన్ని ప్రచురణలు ఇవ్వవచ్చు. వారిలో కొంతమంది దుఃఖిస్తున్న కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి తగిన ప్రచురణలను తమతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. కొన్నిసార్లు, వార్తాపత్రికల్లో చనిపోయినవారిని గురించిన ప్రకటనలు వచ్చినప్పుడు, ఆ కుటుంబ సభ్యులకు సంక్షిప్తంగా ఓదార్పుకరమైన ఉత్తరాలు వ్రాసే అవకాశం ఉంది. తన భార్య చనిపోయినప్పుడు అలాంటి ఉత్తరంతోపాటు కొన్ని కరపత్రాలను అందుకున్న ఒక వ్యక్తి ఆయన కూతురు, ఆ ప్రచారకుని ఇంటికి వెళ్లి, “ఈ ఉత్తరం వ్రాసింది మీరేనా?” అని అడిగి, “బైబిలు గురించి నాకింకా నేర్చుకోవాలని ఉంది” అన్నాడు. ఆయన, ఆయన కూతురు బైబిలు అధ్యయనానికి అంగీకరించి సంఘ కూటాలకు హాజరవడం ప్రారంభించారు.
5 ప్రసంగి 7:2 ఇలా చెబుతోంది: “విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు.” ఆనందంగా ఉన్నవారికన్నా ప్రలాపిస్తున్నవారు సాధారణంగా దేవుని వాక్యాన్ని వినడానికి సుముఖంగా ఉంటారు. తమ ప్రియమైనవారిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చే అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి.
[అధ్యయన ప్రశ్నలు]
1. దుఃఖిస్తున్నవారికి ఓదార్పు ఎందుకు అవసరం?
2. వాళ్ళింట్లో ఎవరైనా చనిపోయారని గృహస్థుడు చెప్పినప్పుడు మనం అక్కడ ఎక్కువసేపు సాక్ష్యమివ్వవచ్చా?
3. పరిస్థితులు అనుకూలిస్తే దుఃఖిస్తున్నవారికి ఏ లేఖనాలు చూపించవచ్చు?
4. మనం ఏ ఇతర సందర్భాల్లో ఓదార్పునివ్వవచ్చు?
5. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చే అవకాశాలను వినియోగించుకోవడానికి మనమెందుకు సిద్ధంగా ఉండాలి?