ప్రశ్నా భాగం
◼ ఉత్తరాల ద్వారా సాక్ష్యమిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎందుకు అవసరం?
ఉత్తరాల ద్వారా సాక్ష్యమివ్వడమనేది, సువార్తను అందజేసే విషయంలో కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ప్రభావవంతమైన పద్ధతి. అయితే ప్రపంచంలో ఇటీవల జరిగిన సంఘటనలు, అపరిచిత ఉత్తరాలను తెరవకుండా జాగ్రత్తపడేలా చేశాయి. గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చే కవర్లు లేదా పంపిస్తున్న వ్యక్తి చిరునామా లేని కవర్లు తరచూ అనుమానాస్పదమైనవిగా దృష్టించబడతాయి, ప్రత్యేకించి చేతివ్రాతతో ఉండి, ఎక్కువ కాగితాలతో కవర్లు లావుగా ఉంటే వాటిని తెరవడానికి సందేహిస్తారు. గృహస్థులు ఇలాంటి ఉత్తరాలను తెరవకుండానే పడేయవచ్చు. అలా జరగడాన్ని మనం ఎలా ఆపవచ్చు?
వీలైతే ఉత్తరాన్ని, కవరుపై చిరునామాను టైపు చేయాలి. కవరు మీద గృహస్థుడి పేరు వ్రాయాలి. “ఈ ఇంట్లో నివసిస్తున్నవారికి” అని వ్రాయకండి. అంతేకాకుండా ఎల్లప్పుడూ, మీ చిరునామాను ఇవ్వండి. మీ వ్యక్తిగత చిరునామాను ఇవ్వడం సబబుగా అనిపించనప్పుడు, మీ పేరును, రాజ్యమందిరం చిరునామాను ఇవ్వండి. పేరు లేకుండా ఉత్తరాలను పంపించకండి. బ్రాంచి కార్యాలయం చిరునామాను మాత్రం ఎన్నడూ ఉపయోగించకండి.—1996 నవంబరు మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నాభాగం చూడండి.
మరిన్ని సలహాలూ, ఒక నమూనా ఉత్తరమూ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి (ఆంగ్లం) అనే పుస్తకంలో, 71-3 పేజీలలో కనుగొనవచ్చు. ఈ మార్గనిర్దేశాలు, ఇతరులకు సువార్తను అందజేసేందుకు ఉత్తరాలను ప్రభావవంతంగా ఉపయోగించడానికి మనకు సహాయం చేస్తాయి.