పాఠకుల ప్రశ్నలు
“రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు” అని హెబ్రీయులు 12:4 లో ఉన్న వ్యాఖ్యానము అర్థం ఏమిటి?
‘రక్తము కారునంతగా ఎదురించు’ అన్న మాట అక్షరార్థంగా ఒకరి రక్తం కారి, చనిపోయేంత తీవ్రస్థాయికి వెళ్ళడాన్ని సూచిస్తుంది.
కొందరు హీబ్రూ క్రైస్తవులు, తమ విశ్వాసం మూలంగా, అప్పటికే, “శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి”రని అపొస్తలుడైన పౌలుకు తెలుసు. (హెబ్రీయులు 10:32, 33) పౌలు అలా చెబుతున్నప్పుడు, గ్రీకు అథ్లెటిక్ పోటీల్లోని పోరాటాన్ని ఉపమాలంకారంగా ఉపయోగించాడనిపిస్తుంది. ఆ పోటీల్లో పరుగు పందెం, కుస్తీపోటీ, ముష్టియుద్ధం, డిస్కస్ త్రోయింగ్, జావెలిన్ త్రోయింగ్ కూడా ఇమిడివుండవచ్చు. అందుకే పౌలు, “మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” అని హెబ్రీయులు 12:1 లో తోటి క్రైస్తవులను ఉద్బోధించాడు. (ఇటాలిక్కులు మావి.)
మూడు వచనాల తర్వాత, హెబ్రీయులు 12:4 లో, పౌలు పరుగు పందెం బదులు ముష్టి యుద్ధమును ఉపమానంగా ఉపయోగిస్తున్నట్లున్నాడు. (ఇవి రెండూ, 1 కొరింథీయులు 9:26, 27 లో కనిపిస్తాయి.) ప్రాచీన కాలాల్లో ముష్టి యుద్ధం చేసేవారి పిడికిళ్ళూ, మణికట్లూ తోలు పట్టీలతో చుట్టబడేవి. ఆ పట్టీలు, “సీసంతో చేసిన, ఇనుముతో చేసిన లేక వేరే లోహంతో చేసిన గుబ్బ మేకులు” తగిలించబడి బరువుగా కూడా ఉండేవి. అవి “ముష్టి యుద్ధం చేసేవారికి తీవ్రంగా గాయాలు కలిగించేవి.” అలాంటి క్రూరమైన పోటీల్లో రక్తం కారేది, కొన్నిసార్లు మరణం కూడా సంభవించేది.
ఏది ఏమైనప్పటికీ, హింసను, క్రూరమైన అవమానాలను సహించి, “రక్తము కారునంతగా” అంటే చనిపోయే వరకూ కూడా సహించిన నమ్మకమైన దేవుని సేవకులను గురించిన ఉదాహరణలు హీబ్రూ క్రైస్తవులకు కావలసినన్ని ఉన్నాయి. పౌలు, ప్రాచీన కాలం నాటి నమ్మకమైనవారు అనుభవించిన వాటిపైకి అవధానం మళ్ళించినది ఏ సందర్భంలోనో గమనించండి:
వారు “రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు” ఉండిరి. పౌలు అలా అన్న తర్వాత, “ఆయన . . . అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు” అని అంటూ మన విశ్వాసమునకు కర్తయైన యేసును ఉన్నతపరిచాడు.—హెబ్రీయులు 11:37, 38; 12:1.
అవును, చాలా మంది, “రక్తము కారునంతగా” అంటే మరణం వరకూ ‘ఎదిరించారు.’ వారు ఎదిరించినదానిలో విశ్వాసలేమి అనే పాపానికి వ్యతిరేకమైన అంతరంగ పోరాటం కన్నా ఎక్కువే ఉంది. వాళ్ళు మరణం వరకూ తమ విశ్వాస్యతను కాపాడుకుంటూ క్రూరమైన బాహ్య హింసల మధ్య కూడా విశ్వాసంగా ఉన్నారు.
యెరూషలేము సంఘంలోని క్రొత్తవారు, బహుశా, గతకాలాల్లోని తీవ్ర హింస తగ్గుముఖం పట్టాక క్రైస్తవులైనందువల్ల, అలాంటి తీవ్రమైన పరీక్షలకు ఎన్నడూ గురి కాలేదు. (అపొస్తలుల కార్యములు 7:54-60; 12:1, 2; హెబ్రీయులు 13:7) అయినప్పటికీ, అంత తీవ్రము కాని పరీక్షలు కూడా వారిలో కొందరిని పోరాటం కొనసాగించకుండా నిరుత్సాహపరచాయి; ‘వారు అలసిపోతున్నారు, వారి ప్రాణములు విసిగిపోతున్నాయి.’ (హెబ్రీయులు 12:3) వారు ఎదిగి పరిణతి చెందడం అవసరం. అది, ఏమి ఎదురైనా, చివరికి తమ రక్తము చిందేంతగా తాము శారీరకంగా హింసించబడినా సహించగలిగే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుంది.—హెబ్రీయులు 6:1; 12:7-11.
ఆధునిక కాలాల్లోని చాలా మంది క్రైస్తవులు ‘రక్తము కారునంతగా ఎదిరించారు,’ అంటే తమ క్రైస్తవత్వం విషయంలో రాజీపడనందువల్ల, చివరికి చంపబడ్డారు. హెబ్రీయులు 12:4 లో పౌలు చెప్పిన మాటలు భీతిని కలిగించేవిగా ఉన్నట్లు భావించక, మనం దేవుని పట్ల విశ్వాసంగా ఉండడానికి, మనం ఎంత మేరకు వెళ్ళాలన్న విషయంలో మనం తీసుకున్న నిర్ణయానికి ఒక సూచనగా ఎంచగలము. పౌలు హెబ్రీయులకు వ్రాసిన అదే ఉత్తరంలో తర్వాత, “దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము” అని వ్రాశాడు.—హెబ్రీయులు 12:28.