రాజ్య ప్రచారకుల నివేదిక
నమీబియాలో దైవపరిపాలనా విస్తరణ
దేవుని రాజ్య సువార్త మొట్టమొదటిసారిగా 1920ల చివరిభాగంలో నమీబియాకు చేరింది. అప్పట్నుంచి వందలాదిమంది యథార్థహృదయులు దేవుని రక్షణ సందేశానికి ప్రతిస్పందించారు. ఈ క్రింది అనుభవాలు యెహోవా తన మందలోకి యిష్టవస్తువులను ఎలా సమకూరుస్తున్నాడో చూపిస్తాయి.—హగ్గయి 2:7.
◻ ఈశాన్య నమీబియాలో నివసిస్తున్న పౌలస్ అనే ఒక రైతు దాని రాజధానియైన విండ్హుక్ నగరానికి వచ్చినప్పుడు మొదటిసారిగా యెహోవాసాక్షులు ఆయన్ని కలుసుకున్నారు. పౌలస్కు తాను సత్యాన్ని కనుగొన్నానని వెంటనే అనిపించింది. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని తీసుకుని ఆయన తన ఇంటికి తిరిగి వెళ్లాడు. తర్వాత, రాజ్యమందిరం ఉన్న, సమీపంలోని రూండూ పట్టణంలోని సాక్షులను కలుసుకుని తన ఇంటికి రమ్మని విజ్ఞప్తి చేశాడు.
అయితే, దూరం మరీ ఎక్కువ అవటంవల్ల యెహోవాసాక్షులు వచ్చి పౌలస్తో వారపు బైబిలు పఠనం నిర్వహించలేకపోయారు. పౌలస్ నిరుత్సాహపడకుండా బైబిలును స్వంతంగా పఠనం చేసుకోవటం ప్రారంభించాడు. అంతేగాక, ఆయన తాను తెలుసుకుంటున్న వాటిని ఉత్సాహంగా ఇతరులకు చెప్పటం ప్రారంభించాడు. కొంతకాలానికి ఒక బైబిలు పఠన గుంపు ఏర్పడింది. యెహోవాసాక్షుల అసెంబ్లీ రూండూలో జరుగబోతుందని ఆ చిన్నగుంపు రేడియోలో విన్నప్పుడు, దానికి హాజరవడానికి వారందరూ తమకున్న అల్పమైన ఆదాయాల్లోంచి డబ్బును పోగుచేసుకుని ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు.
మొట్టమొదటిసారిగా యెహోవాసాక్షులతో సహవసించటం వారికి ఎంత ఉత్తేజవంతమైన అనుభవమో కదా! ఈ గుంపులోవున్న వారిని క్రమంగా దర్శించేందుకు అర్హులైన సహోదరులను వెంటనే ఏర్పాటు చేయడమైనది. ఈరోజు, పౌలస్ ఉంటున్న గ్రామంలో ఆరుగురు ప్రచారకులున్నారు.
◻ యెహోవాసాక్షులను గూర్చి ఎవరో చెడుగా మాట్లాడటాన్ని విన్నప్పుడు దేవుని పేరు గురించి యోహన్నాకు ఆసక్తి కల్గింది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటుంది: “యెహోవా అనే పేరు నేను విన్న మొదటిసారే అది నా మనస్సులో చెరగని ముద్ర వేసింది, యెహోవా ఎవరా అని ఆలోచించడం మొదలుపెట్టాను. నేను మా ఆయన నమీబియా తీరాన ఉన్న వాల్విస్ బే పట్టణానికి సమీపంలో నివసిస్తున్నాము. ఒకసారి మేము ఆ పట్టణానికి వెళ్లాము, అక్కడ కొంతమంది సాక్షులు వీధిలో కావలికోట పత్రికను పంచిపెట్టడాన్ని చూశాను. నేను ఒక పత్రిక తీసుకుని, నాకు చాలా బైబిలు ప్రశ్నలు ఉన్నందువల్ల బైబిలు పఠనం కావాలని అడిగాను. వారి వాహనం చెడిపోయినందువల్ల వాళ్లు రాలేమని చెప్పినప్పుడు నేను ఏడ్చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి మా వారు చనిపోవటంతో నేను కేట్మన్స్హూప్లో నివసించటానికి వెళ్లాను. ఆ ప్రాంతంలో పనిచేయటానికి ఒక ప్రత్యేక పయినీరు (పూర్తికాల పరిచారకుడు) నియమించబడ్డాడు, ఆయన దగ్గర నుండి నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని తీసుకున్నాను. నేను మొదట్లోనే అది సత్యమని తెలుసుకున్నాను.
“ఆ తర్వాత ప్రచారపు పనిలో పాల్గొనేందుకు నన్ను ఆహ్వానించారు, కానీ మనుష్యుల భయం నన్ను ఆవహించింది. ఇంటి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు, ప్రీచింగ్ చేయమనేకంటే నన్ను చనిపోయేందుకు అనుమతించమని యెహోవాకు ప్రార్థించాను. వీధి సాక్ష్యమివ్వడంలో నేను మొదటిసారి పాల్గొన్నప్పుడు ఎవరికీ కనబడకుండా ఉండేలా ఒక చిన్న సందులో, దాక్కున్నట్టుగా నిలబడ్డాను. చివరికి, నేను కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ ప్రక్కగా వెళ్తున్న ఒకరికి ఒక పత్రిక అందించాను, తర్వాతే గొంతుపెగల్చుకొని కొంత మాట్లాడగల్గాను. ఆ రోజు, యెహోవా సహాయంతో నేను నా బైబిలు ఆధారిత నిరీక్షణను అనేకమందితో పంచుకున్నాను.
“నేడు, 12 యేండ్ల తర్వాత, వస్తుపరంగా సమృద్ధి లేకపోయినా, నేను పయినీరు సేవాధిక్యతను విలువైనదిగా ఎంచుతూ రాజ్య సత్యాన్ని ఇతరులతో పంచుకోవటం ద్వారా అపారమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాను.”