అసలెవరికైనా శ్రద్ధ ఉందా?
‘అణిచివేయబడుతున్నవారి కన్నీళ్లు’ కాలువలై ప్రవహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, లెక్కలేనన్ని “అన్యాయ క్రియల”కు గురైనవారు కార్చిన కన్నీళ్లే అవి. తరచూ, అలాంటి బాధితులు తమను “ఆదరించు దిక్కులే”దనీ—తమ గురించి అసలెవరికీ శ్రద్ధ లేదనీ అనుకుంటారు.—ప్రసంగి 4:1.
కన్నీళ్లు ఇలా కాలువలై ప్రవహిస్తున్నప్పటికీ, కొంతమంది తమ తోటిమానవుల బాధను చూసి ఎంతమాత్రం చలించరు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో దౌర్జన్యానికి గురై, దోచుకోబడి దారి ప్రక్కన కొనప్రాణంతో విడిచిపెట్టబడిన వ్యక్తి పట్ల యాజకుడూ, లేవీయుడూ వ్యవహరించినట్లుగానే, వాళ్లు కూడా ఇతరుల బాధను ఉద్దేశపూర్వకంగా అలక్ష్యం చేస్తారు. (లూకా 10:30-32) తమకూ తమ కుటుంబానికీ అంతా సవ్యంగా సాగిపోతున్నంతవరకూ, వాళ్లు ఇతరుల గురించి అసలు పట్టించుకోరు. ఒక విధంగా వాళ్లు, “ఎవరెలాపోతే నాకేం పట్టింది?” అంటారు.
దీనికి మనం ఆశ్చర్యపోకూడదు. “అంత్య దినములలో” అనేకుల్లో ‘అనురాగం’ కొరవడుతుందని అపొస్తలుడైన పౌలు ముందే తెలియజేశాడు. (2 తిమోతి 3:1, 3) వృద్ధి చెందిన నిర్లక్ష్య వైఖరుల గురించి ఒక పరిశీలకుడు తన ఆవేదనను వెల్లడించాడు. “ఇతరులకు ఇవ్వటం ఇతరుల కోసం ఏదైనా చేయటం అనే ఐరీష్ తత్వ సాంప్రదాయాల స్థానే ఇతరుల నుంచి పుచ్చుకోవటం, తమ కోసం తాము ఏదైనా చేసుకోవటం అనే క్రొత్త నియమావళి వచ్చింది” అని ఆయన అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా, దాదాపు ఇతరుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలు ఇతరుల నుంచి పుచ్చుకుంటారు, తమ కోసం తాము ఏదైనా చేసుకుంటారు.
శ్రద్ధ తీసుకునేవారి అవసరం
శ్రద్ధ తీసుకునేవారి అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు, జర్మనీకి చెందిన ఒంటరిగా జీవితాన్ని గడిపిన ఒక అభాగ్యుని గురించి ఆలోచించండి. “అతడు ఒక క్రిస్మస్ దినాన తన ఇంట్లో టీవీ చూస్తూ చూస్తూ అలాగే మరణించాడు, అయితే ఆయన మరణించాడన్న విషయాన్ని ఇతరులు గమనించింది కేవలం ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే.” తన జీవితంలోని దుఃఖకరమైన అనుభవాలను బట్టి విసిగిపోయిన, “విడాకులు తీసుకున్న, వికలాంగుడైన ఈ ఒంటరి వ్యక్తి” కనబడటం లేదన్న విషయాన్ని, అతని ఇంటి అద్దె కోసం బ్యాంకు నుండి అందుతున్న అతని డబ్బు అయిపోయే వరకు ఎవరూ గుర్తించనేలేదు. అతని గురించి అసలెవరూ పట్టించుకోనేలేదు.
శక్తివంతులైన, దురాశాపరులైన అధికారుల చేతుల్లో నలుగుతున్న నిస్సహాయుల గురించి కూడా ఆలోచించండి. ఒక ప్రాంతంలో, దాదాపు 2,00,000 మంది ప్రజల నుంచి (ఆ ప్రాంతపు జనాభాలో నాలుగోవంతు) వాళ్ల భూమిని దౌర్జన్యపూరితంగా లాక్కోవటంతో వాళ్లు “అణిచివేతకూ, కరువుకూ బలై మరణించారు.” నమ్మశక్యంకానంత పైశాచికత్వాన్ని కళ్ళారా చూసిన రువాండాలోని పిల్లల గురించి ఆలోచించండి. ఒక నివేదిక ఇలా తెలియజేసింది: “అనేకమైన దారుణ కృత్యాలను, అంటే హత్యలనూ, దెబ్బలాటలనూ, అత్యాచారాలు చేయటాన్నీ చూసిన, కొన్నిసార్లు ఇతర పిల్లలే అలాంటివి చేయటాన్ని చూసిన [ఒక దేశంలోని] పిల్లల శాతం కలవర పరిచేంతగా ఉంది.” అలాంటి అన్యాయాలకు బలైనవారు, “నా పట్ల అసలెవరికైనా శ్రద్ధ ఉందా?” అని కన్నీళ్లతో ఎందుకడుగుతారో మీరు అర్థం చేసుకోవచ్చు.
ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 130 కోట్లమంది, రోజుకు ఒక అమెరికా డాలరు కంటే తక్కువ డబ్బుతోనే జీవనం కొనసాగించాలి. అసలెవరికైనా శ్రద్ధవుందా అని వాళ్లు ఆలోచించడం తప్పించి వారికి వేరే గత్యంతరం లేదు. వేలాదిమంది శరణార్థులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు, వారి గురించి ది ఐరీష్ టైమ్స్లోని ఒక నివేదిక ఇలా చెప్తుంది: “వారు, హేయమైన శరణార్థి శిబిరాల్లో లేదా అతిథులను ఆదరించని దేశంలో నివసించాలా లేక యుద్ధం మూలంగా, జాతి విభజనల మూలంగా ఇప్పటికీ ముక్కచెక్కలైపోయున్న [లేక, చిన్నాభిన్నమైపోయిన] తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలా అనే మింగుడు పడని ఎంపిక చేసుకోవాల్సి ఉంది.” అదే నివేదికలో వణుకు పుట్టించే ఈ విధానం కూడా ఇవ్వబడింది: “కళ్లు మూసుకోండి, మూడు అంకెల వరకు లెక్కించండి, ఇప్పుడే ఒక పిల్లవాడు మరణించాడు. కుపోషణ మూలంగా లేక నివారింప సాధ్యమయ్యే వ్యాధి మూలంగా ఈ రోజు చనిపోయే 35,000 మందిలో ఆ పిల్లవాడు ఒకడన్నమాట.” చాలామంది ఆందోళనతోనూ, మనోవేదనతోనూ విలపిస్తున్నారంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు.—పోల్చండి, యోబు 7:11.
ఇదంతా ఇలా జరగాల్సిందేనా? నిజానికి, కేవలం శ్రద్ధ ఉండటమే గాక, బాధను నివారించి, ప్రజలు అనుభవించిన వేదననంతటినీ తీసివేయగల శక్తిగల వారెవరైనా ఉన్నారా?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover and page 32: Reuters/Nikola Solic/Archive Photos
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
A. Boulat/Sipa Press