అనారోగ్యాన్ని గురించిన మర్మం
ఓమాజీ అనే పాప అతిసార వ్యాధితో బాధపడుతోంది. వాళ్లమ్మ హావ నిర్జలీకరణ గురించి భయపడుతోంది; ఈ మధ్యనే, గ్రామంలోవున్న తన బంధువు దాని మూలంగానే తన కూతుర్ని కోల్పోయిందని ఆమె విన్నది. ఓమాజీ నాన్నమ్మకు, అంటే హావ అత్తగారికి ఓమాజీని భూతవైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాలనుంది. “దుష్టాత్మ బిడ్డను పీడిస్తోంది. దానికి రక్షణగా తాయెత్తు కట్టిద్దామంటే నీవు ఒప్పుకోలేదు, ఇప్పుడిక సమస్యలు మొదలౌతున్నాయి” అని ఆమె అంటుంది.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి సర్వసాధారణమైనదే. అనారోగ్యానికి నిక్షిప్తమైన కారణం దుష్టాత్మలేనని కోట్లాదిమంది నమ్ముతారు. అది నిజమేనా?
మర్మాన్ని సృష్టించటం
అదృశ్య ఆత్మలు అనారోగ్యానికి కారణమని మీరు వ్యక్తిగతంగా నమ్మకపోవచ్చు. వాస్తవానికి, అనేక రోగాలు వైరస్ల వల్ల, సూక్ష్మక్రిముల వల్ల వస్తాయని శాస్త్రవేత్తలు చూపిస్తుంటే, ఎవరైనా ఎందుకలా అనుకుంటారని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఈ సూక్ష్మమైన రోగక్రిముల గురించి మానవజాతికి ఎప్పటి నుండో ఏమీ తెలియదని గుర్తుంచుకోండి. ఆన్టొనీ ఫాన్ లివాన్హక్ 17వ శతాబ్దంలో మైక్రోస్కోప్ను వృద్ధి చేసిన తర్వాతనే సూక్ష్మజీవుల జగత్తు మానవ కంటికి గోచరమైంది. అప్పటికీ, 19వ శతాబ్దంలో లూయిస్ పాశ్చర్ కనుగొన్నవాటి మూలంగానే విజ్ఞానశాస్త్రం రోగక్రిములకూ రోగానికీ మధ్యనున్న సంబంధాన్ని అర్థం చేసుకోవటం మొదలెట్టింది.
మానవ చరిత్రలోని అధిక భాగానికి అనారోగ్యానికి కారణాలు తెలియవు గనుక, అనారోగ్యాలన్నిటికీ కారణం దుష్టాత్మలేనన్న సిద్ధాంతంతో సహా అనేక మూఢ నమ్మకాలు వృద్ధి చెందాయి. ఇది వృద్ధి చెంది ఉండటానికి గల ఒక మార్గాన్ని ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సూచిస్తుంది. పూర్వం వైద్యులు వివిధ రకాలైన వేర్లతోనూ, ఆకులతోనూ, ఇంకా తమకు అందుబాటులో ఉన్న వేటితోనైనా రోగులకు చికిత్స చేయడానికి ప్రయత్నించేవారని అది చెబుతుంది. కొన్నిసార్లు ఏదైనా పనిచేసేది. తర్వాత, వైద్యుడు చికిత్సా విధానానికి అనేకానేక మూఢనమ్మకాలతో కూడిన ఆచారవ్యవహారాలను జతచేసేవాడు, అవి నిజమైన చికిత్సను మరుగు చేసేసేందుకు పనిచేసేవి. అలా వైద్యుడు ప్రజలు తన సేవలను ఉపయోగించాల్సి వచ్చేలా చూసుకునేవాడు. ఆ విధంగా, వైద్యం మర్మం ముసుగులోకి వెళ్లిపోయింది, సహాయం కోసం ప్రజలు సహజాతీత శక్తివైపు చూసేలా ప్రోత్సహించబడ్డారు.
ఈ నాటు వైద్య విధానాలు అనేక దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. మరణించిన పూర్వీకుల ఆత్మల మూలంగా అనారోగ్యం కల్గుతుందని అనేకులంటారు. దేవుడు మనకు అనారోగ్యం కలిగిస్తాడనీ, అనారోగ్యం మనం చేసిన పాపాలకు శిక్షనీ ఇతరులంటారు. చివరికి విషయపరిజ్ఞానం ఉన్న ప్రజలు అనారోగ్యపు జీవశాస్త్ర నైజాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, వాళ్లు సహజాతీత ప్రభావాలకు భయపడుతూనే ఉంటారు.
మాంత్రికులు, నాటు వైద్యులు ప్రజలకున్న ఈ భయాన్ని స్వలాభానికి ఉపయోగించుకుంటారు. అయితే, మనం ఏమి విశ్వసించాలి? ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవటానికి సంబంధించి ఆత్మల నడిపింపును తీసుకోవటం సహాయకరంగా ఉంటుందా? బైబిలు ఏమి చెప్తుంది?