లూకా తప్పు వ్రాశాడా?
నజరేతులో పెరిగి నజరేయుడు అని పిలువబడిన యేసు ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేత్లెహేములో ఎలా పుట్టివుండగలడు? లూకా ఇలా వివరిస్తున్నాడు: “ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను; ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య; అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.”—లూకా 1:1; 2:1-3.
అనేకమంది విమర్శకులు ఈ మాటలు శుద్ధతప్పని అంటారు, అంతకన్నా ఘోరంగా అది లూకా అల్లిన కట్టుకథ అని దాడి చేస్తారు. ఈ ప్రజాసంఖ్య జరగడమూ, కురేనియు అధిపతిగా ఉండడమూ సా.శ. 6లో గానీ 7లో గానీ జరిగిందని వారు నిర్ద్వంద్వంగా చెబుతారు. వారు చెప్పేది వాస్తవమైతే, ఇది లూకా వృత్తాంతంపైన గంభీరమైన సందేహాల్ని రేకెత్తిస్తుంది, ఎందుకంటే యేసు సా.శ.పూ. 2లో పుట్టాడని సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. కానీ ఈ విమర్శకులు రెండు కీలకమైన విషయాల్ని విస్మరిస్తున్నారు. మొదటిది, ప్రజాసంఖ్యలు ఒకటికన్నా ఎక్కువే జరిగాయని లూకా గుర్తిస్తున్నాడు—ఆయన “మొదటి ప్రజాసంఖ్య” అని అన్నాడని గమనించండి. అటుతర్వాత జరిగిన మరొక ప్రజాసంఖ్యను గురించి ఆయనకు బాగానే తెలుసు. (అపొస్తలుల కార్యములు 5:37) సా.శ. 6లో జరిగిన ఈ తరువాతి ప్రజాసంఖ్య గురించే చరిత్రకారుడైన జోసీఫస్ వివరించాడు. రెండవదిగా, కురేనియు అధిపతిగా ఉన్నాడన్న విషయం, యేసు సా.శ.పూ. 2లో కాక సా.శ. 6 ప్రాంతంలో జన్మించాడన్న ముగింపుకు వచ్చేలా చేయదు. ఎందుకు? ఎందుకంటే ఆధారాల ప్రకారం కురేనియు ఆ హోదాలో రెండుసార్లు పనిచేశాడు. ఆయన మొదటిసారి అధిపతిగా ఉన్నది సా.శ.పూ. 2లోనని చాలామంది పండితులు అంగీకరిస్తారు.
ఇంకొందరు విమర్శకులు చెప్పేదేమిటంటే—మీకా 5:2లోని ప్రవచనం నెరవేరిందని చూపించడానికి లూకాయే ప్రజాసంఖ్యను కల్పించాడని అంటారు. తద్వారా యేసు బేత్లెహేములో జన్మించాడని చెప్పడానికి ఒక కారణాన్ని లూకా సృష్టించాడని వారంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం లూకా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు వ్రాసిన అబద్ధికునిగా చేస్తుంది, అటువంటి నిందను ఏ విమర్శకుడు కూడా ఒక సువార్తనూ అపొస్తలుల కార్యముల పుస్తకాన్నీ అతి జాగరూకతతో వ్రాసిన చరిత్రకారుడైన లూకాతో పొందిక చేయలేడు.
ఏ విమర్శకుడు కూడా వివరించలేనిది మరొకటి ఉంది: ఆ జనసంఖ్యే ఒక ప్రవచనాన్ని నెరవేర్చింది! సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో దానియేలు “ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని” లేపే ఒక పరిపాలకుని గురించి ప్రవచించాడు. ఇది ఔగుస్తుకూ, జనసంఖ్య వ్రాయమని ఆయన జారీచేసిన ఆజ్ఞకూ వర్తించిందా? అదే ప్రవచనం మెస్సీయాను గురించి, అంటే “సంధి చేసిన అధిపతి”ని గురించి ప్రవచిస్తూ ఈ పరిపాలకునికి బదులుగా వచ్చే మరో పరిపాలకుని పరిపాలనలో “నాశనమగును” అనీ ప్రవచించాడు. యేసు నిజంగానే ఔగుస్తు బదులుగా వచ్చిన తిబెరికైసరు ఏలుబడిలో ‘నాశనంచేయబడ్డాడు’ అంటే చంపబడ్డాడు.—దానియేలు 11:20-22.
[9వ పేజీలోని చిత్రం]
కైసరు ఔగుస్తు (సా.శ.పూ. 27-సా.శ. 14)
[క్రెడిట్ లైను]
Musée de Normandie, Caen, France
[9వ పేజీలోని చిత్రం]
తిబెరి కైసరు (సా.శ. 14-37)
[క్రెడిట్ లైను]
ఫోటో బ్రిటీష్ మ్యూజియంవారి సౌజన్యంతో తీసుకోబడింది