రాజ్య ప్రచారకుల నివేదిక
“ప్రతిదినమున సంతవీధిలో”
అపొస్తలుడైన పౌలు రాజ్య వర్తమానాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నాడు. యోగ్యులైన వారిని వెదికిపట్టుకునేందుకు, ఆయన “సమాజమందిరములలో యూదులతోను, . . . ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.”—అపొస్తలుల కార్యములు 17:17.
అలాంటి ఆసక్తి సా.శ. మొదటి శతాబ్దం నుండి యెహోవా సత్యారాధకుల గుర్తింపు చిహ్నమై ఉంది. (మత్తయి 28:19, 20) నేడు, యెహోవాసాక్షులు సత్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని యథార్థహృదయులు పొందేందుకు వారికి ఆసక్తితో సహాయం చేస్తూ అనేక విధాలైన పద్ధతులను ఉపయోగిస్తారు. (1 తిమోతి 2:3, 4) ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఈ అనుభవం ఇదే విషయాన్ని తెలియజేస్తుంది.
సిడ్నీలోని ఒక రైల్వే స్టేషన్ ప్రక్కన ఒక చిన్న బైబిలు సాహిత్యాల డిస్ప్లేను సిద్ధంచేయడంలో సిడ్, హెరాల్డ్లు ప్రతి వారంలో ఐదు రోజులు వంతులు తీసుకుంటారు. వాళ్లు దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ఈ విధంగా ఇప్పటికి ఐదు సంవత్సరాలుగా పంచుతున్నారు. 95 సంవత్సరాల సిడ్ ఇలా వివరిస్తున్నాడు: “నాకు 87 సంవత్సరాలు వచ్చేసరికి నేను కారు నడపలేకపోయాను. అది నాకు ఎంతో నిరాశను కలిగించింది, ఎందుకంటే నాకు బహిరంగ సాక్ష్యమివ్వడం చాలా ఇష్టం. ఒక రోజు, కటూంబాలోని ఈకో పాయింట్ అనే ఒక పేరొందిన పర్యాటక స్థలంలో, ఒక చిత్రకారుడు ప్రకృతి దృశ్యాల వర్ణచిత్రాలను అమ్మడం నేను చూశాను. నేను పెయింటింగ్లను చాలా పరిశీలించి చూసి, ‘నా బ్యాగులో అంతకంటే చక్కని పెయింటింగ్లు ఉన్నాయి, అదీ చాలా తక్కువ ధరకు’ అని నేను అనుకున్నాను! కాబట్టి ఒక చిన్న డిస్ప్లే స్టాండు చేసి, ఒక పేరొందిన ప్రాంతంలో దాన్ని పెట్టి, యెహోవాసాక్షులు పంపిణీ చేస్తున్న అందమైన చిత్రాలుగల బైబిలు సాహిత్యాన్ని వచ్చే పోయే వాళ్లకు ఇవ్వాలని నేను తీర్మానించుకున్నాను.
“నాలుగు సంవత్సరాల మునుపు, నేను స్టాండ్ను సిడ్నీకి మార్చాను, హెరాల్డ్ నాతో వచ్చి కలిశాడు. మేము స్టాండ్ను సిద్ధంచేయడంలోనూ, స్థానిక సంఘాలతో కలిసి పని చేయడంలోనూ వంతులు తీసుకుంటాం. ఇప్పుడు 83 సంవత్సరాలున్న హెరాల్డ్ ఇలా చెబుతున్నాడు: “సోమవారం నుండి శుక్రవారం వరకూ చాలా తక్కువమంది ప్రజలు ఇళ్లల్లో ఉంటారు. కాబట్టి ఈ విధంగా రాజ్యవర్తమానాన్ని అందించడం ప్రజలు ఎక్కడ ఉన్నారో మనం అక్కడ ఉండేలా చేస్తుంది. సహజంగానే, మాకు మంచి ఫలితాలు వస్తున్నాయి. మా సాహిత్య పంపకం ఈ దేశంలో చాలా గమనార్హంగా ఉంది.”
“గత సంవత్సరాల్లో మేము నాలుగు లేక ఐదు వేర్వేరు స్థలాల్లో స్టాండు పెట్టినప్పటికీ, ప్రజలకు మేము త్వరలోనే పరిచయం అయిపోయాము” అని సిడ్ చెబుతున్నాడు. “కొంతమంది ప్రజలు సాహిత్యాల కోసం మా వద్దకు వస్తారు. ఇతరులు తమ ప్రశ్నలకు జవాబులు కావాలని వస్తారు. మరి కొందరు కొద్ది నిమిషాలు మాట్లాడేందుకు వస్తారు. నాకు పునర్దర్శనాలు లభించేది ఈ విధంగానే” అని అంటూ ఆయన ముసిముసి నవ్వులు నవ్వాడు.
“చాలామందికి బైబిలులో నిజంగానే ఆసక్తి ఉంది” అని హెరాల్డ్ జత చేస్తున్నాడు. “మా దగ్గర తీసుకున్న సాహిత్యాల కారణంగాను, వారు అడిగిన ప్రశ్నలకు మేము బైబిలు నుండి జవాబులు చెప్పగలిగినందుకుగాను ఒక్క నెలలోనే నలుగురు వ్యక్తులు సాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించారు. ఆ విధమైన అనుభవాలు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి.”
సిడ్, హెరాల్డ్ల వలె—మరి అపొస్తలుడైన పౌలు వలె—యెహోవాసాక్షులు ఎక్కడున్నా వారు తమ ప్రాముఖ్యమైన వర్తమానాన్ని వ్యాప్తి చేసేందుకు వీలైన ప్రతి సాధనాన్నీ ఉపయోగిస్తారు. అలా, “సువార్త . . . లోకమందంతటను ప్రకటింప”బడటంలో కొనసాగుతోంది.—మత్తయి 24:14.