పాఠకుల ప్రశ్నలు
మనం గొర్రెలు మేకలను గూర్చిన యేసు ఉపమానాన్ని పఠించి ఆనందించాము. 1995 అక్టోబరు 15 కావలికోట నందు అందించబడిన క్రొత్త అవగాహన దృష్ట్యా, నేడు యెహోవాసాక్షులు వేరుపరిచే పనిలో భాగం వహిస్తున్నారని మనం ఇప్పటికీ చెప్పవచ్చునా?
చెప్పవచ్చు. ‘తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును’ అని మత్తయి 25:31, 32 చెబుతుంది గనుక అనేకులు దాని గురించి ఆశ్చర్యచకితులయ్యారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మహాశ్రమ ప్రారంభమయ్యాక ఈ వచనాలు ఎందుకు అన్వయించబడతాయో 1995 అక్టోబరు 15 కావలికోట చూపించింది. యేసు తన మహిమతో తన దూతలతోపాటు వచ్చి, తన తీర్పు సింహాసనంపై ఆసీనుడౌతాడు. అప్పుడు, ఆయన ప్రజలను వేరుచేస్తాడు. ఏ భావంలో? ఆ సమయానికి ముందు ప్రజలు ఏమి చేశారు లేక ఏమి చేయలేదు అనేదాని ఆధారంగా ఆయన నిర్ణయాలు చేస్తాడు.
దీన్ని మనం ఒక కోర్టు కేసులో తీర్పుకు నడిపించే చట్టపరమైన వివిధ స్థాయిలతో పోల్చవచ్చు. కోర్టు తీర్పు తీర్చి, శిక్ష విధించడానికి ముందు కొంత కాలపరిమితిలో సాక్ష్యాధారం సమకూర్చబడుతుంది. ప్రస్తుతం జీవిస్తున్న ప్రజలు గొర్రెలుగా లేక మేకలుగా నిరూపించబడేందుకు సాక్ష్యాధారం చాలాకాలం నుండి సమకూర్చబడుతోంది. అది ఇంకా సమకూర్చబడుతూనే ఉంది. కాని యేసు తన సింహాసనంపై కూర్చున్నప్పుడు కేసు పూర్తిగా సిద్ధమౌతుంది. ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రజలు నిత్య నాశనానికో లేక నిత్యజీవానికో వేరుచేయబడతారు.
అయితే, మత్తయి 25:32 నందు ప్రస్తావించబడిన, ప్రజలను జీవానికో లేక మరణానికో వేరుచేసే పని ఇంకా భవిష్యత్తులో జరుగనైయుందన్న వాస్తవం యొక్క అర్థం దానికి ముందు వేరు చేసే లేక విభజించే పని జరగటం లేదని కాదు. బైబిలు మత్తయి 13వ అధ్యాయంలో దానికి ముందు జరిగే వేర్పరచే ఒక పనిని గురించి ప్రస్తావిస్తుంది. ఆసక్తికరంగా, అద్వితీయ సత్య దేవుని ఆరాధనలో ఐక్యమగుట (ఆంగ్లం) పుస్తకంలోని 179-80 పేజీల్లో “ప్రజల్ని వేరుపరచుట” అనే శీర్షిక క్రింద ఈ విషయాన్ని గురించి చర్చించడం జరిగింది.a ఆ పుస్తకమిలా చెబుతుంది: “యుగసమాప్తితో యేసు ముడిపెట్టిన విశేషమైన ఇతర సంఘటనలు కూడా ఉన్నాయి. వీటిలో “దుష్టుని సంబంధుల” నుండి “రాజ్య సంబంధులను” వేరుచేయుట ఒకటి. శత్రువు గురుగులు విత్తిన గోధుమ పొలాన్ని గూర్చి తన ఉపమానంలో యేసు దీనిని చెప్పాడు.”
యేసు మత్తయి 13:24-30 వచనాల్లో చెప్పిన మరియు 36-43 వచనాల్లో వివరించిన ఒక ఉపమానాన్ని ఆ పుస్తకం సూచిస్తుంది. 38వ వచనంలో మంచి గోధుమలు రాజ్య కుమారులను సూచిస్తాయని, అయితే గురుగులు దుష్టుని కుమారులను సూచిస్తాయని గమనించండి. ‘విధానాంతంలో’ అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో గురుగులు సేకరించబడతాయని 39 మరియు 40 వచనాలు చూపుతున్నాయి. అవి వేరు చేయబడి తుదకు కాల్చబడి, నాశనం చేయబడతాయి.
ఆ ఉపమానం (గొర్రెలు మరియు మేకలను గురించిన ఉపమానంలో యేసు యొక్క సహోదరులుగా పిలువబడిన) అభిషిక్త క్రైస్తవులను గురించి చెబుతుంది. అయినప్పటికీ, క్రైస్తవులమని చెప్పుకుంటూ తమనుతాము “దుష్టుని కుమారులనుగా” నిరూపించుకునే వారి నుండి అభిషిక్తులు వేర్పరచబడటంతో మన కాలంలో ఒక ప్రాముఖ్యమైన వేర్పరచే పని జరుగుతుందనే విషయం స్పష్టమౌతోంది.
ప్రజలు విభజించబడే లేక వేర్పరచబడే దానిని గురించిన ఇతర ఉదాహరణలను యేసు అందించాడు. నాశనానికి నడిపించే విశాల మార్గాన్ని గురించి ఆయన ఇలా చెప్పడాన్ని జ్ఞాపకం చేసుకోండి: “దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.” (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 7:13) అది తుది ఫలితాన్ని గురించిన వ్యాఖ్యానం మాత్రమే కాదు. జీవానికి నడిపే ఇరుకు మార్గాన్ని కనుగొనే కొద్దిమంది విషయంలో అది ఇప్పుడు వాస్తవమైనట్లుగానే, కొనసాగే అభివృద్ధిని గురించిన వ్యాఖ్యానమది. అపొస్తలులను బయటికి పంపిస్తున్నప్పుడు, యోగ్యులైన వారిని వారు కనుగొంటారని యేసు వారికి చెప్పాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇతరులు యోగ్యులైన వారు కాకపోవచ్చు, అలాంటి ప్రజల “మీద సాక్ష్యముగా ఉండుటకు” అపొస్తలులు తమ పాదధూళి దులిపివేయాలి. (లూకా 9:5) క్రైస్తవులు నేడు తమ బహిరంగ పరిచర్య కొనసాగిస్తుండగా అలాంటిదే జరుగుతుందనడం వాస్తవం కాదా? కొందరు చక్కగా ప్రతిస్పందిస్తారు, అయితే ఇతరులు మనం తీసుకెళ్తున్న దైవిక సందేశాన్ని నిరాకరిస్తారు.
గొర్రెలు మేకలను గూర్చి చర్చించిన కావలికోట శీర్షికలు ఇలా పేర్కొన్నాయి: “ఉపమానంలో వర్ణించబడిన తీర్పు సమీప భవిష్యత్తులో ఉండగా, ఇప్పుడు కూడా ప్రాముఖ్యమైనదొకటి జరుగుతోంది. ప్రజల్లో విభజన కలుగజేసే, జీవాన్ని రక్షించే వర్తమానాన్ని ప్రకటించడంలో క్రైస్తవులమైన మనము పాల్గొంటున్నాము. (మత్తయి 10:32-39).” తనను అనుసరిస్తే విభజన ఏర్పడుతుందని—తండ్రికి కుమారునికి, తల్లికి కుమార్తెకు విరోధమేర్పడుతుందని యేసు చెప్పడాన్ని మత్తయి 10వ అధ్యాయంలోని ఆ పాఠ్యభాగంలో మనం చదువుతాము.
తుదకు, రాజ్యవర్తమానాన్ని ప్రకటించే పనిలో క్రీస్తు అభిషిక్త సహోదరులు నాయకత్వం వహించారు. ప్రజలు దాన్ని విని అనుకూలంగానో ప్రతికూలంగానో ప్రతిస్పందించినప్పుడు వారు తమ గుర్తింపును తెలియజేసుకుంటున్నారు. మానవులమైన మనము మత్తయి 25వ అధ్యాయం అందజేస్తున్న భావంలో, “ఈ వ్యక్తి గొర్రె లేక ఆ వ్యక్తి మేక” అని చెప్పలేము. మనము చెప్పకూడదు. అయితే, మనం దేవుని వర్తమానాన్ని వినే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వడం ఇప్పుడు వారి స్థానం ఏమిటి, అంటే వారు ఎలాంటి వ్యక్తులూ, యేసు సహోదరులకు వారు ఎలా ప్రతిస్పందిస్తారు అనేది చూపించడానికి వారికి అవకాశాన్నిస్తుంది. కాబట్టి, కోర్టు కేసు కొరకు సిద్ధమయ్యే సాక్ష్యాధారంలా యేసు సహోదరులకు మద్దతు ఇచ్చేవారూ, వారికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించేవారూ అనే రెండు విభాగాలు మరింత స్పష్టమౌతున్నాయి. (మలాకీ 3:18) కావలికోట చూపించిన విధంగా, త్వరలోనే యేసు తన సింహాసనంపై ఆసీనుడై, ప్రజలను న్యాయబద్ధంగా వేరుచేసి, తుది నిర్ణయంగా జీవం కొరకో లేక నాశనం కొరకో తీర్పును ప్రకటిస్తాడు.
[అధస్సూచీలు]
a వాచ్టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ 1983లో ప్రచురించింది.